Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హాంకాంగ్లో ప్రజల భద్రత, రక్షణకు ఉద్దేశించిన జాతీయ భద్రతా చట్టాన్ని చైనా అత్యున్నత విధాన నిర్ణాయక సంస్థ జాతీయ పీపుల్స్ కాంగ్రెస్ గురువారం ఆమోదించింది. ఈ చట్టంపై హాంకాంగ్ ప్రత్యేక పాలనా ప్రాంతం (హెచ్కె ఎస్ఎఆర్), బయట దేశాలు విభిన్న రీతుల్లో స్పందించాయి. హాంకాంగ్లో నిరసనలను లోపల నుంచి, బయట నుంచి ఎగదోస్తున్న శక్తులు ఒంటి కాలితో లేస్తున్నాయి. దీనిని ఆసరా చేసుకుని చైనాకు వ్యతిరేకంగా అసత్యాలను, అర్థ సత్యాలను ప్రచారంలో పెడుతున్నాయి. చైనా తీసుకొచ్చిన జాతీయ భద్రతాచట్టం హాంకాంగ్ స్వేచ్ఛను హరిస్తుందని, అంతర్జాతీయ వాణిజ్య కేంద్రంగా ఉన్న హాంకాంగ్ ప్రతిపత్తి ఇంకెంతో కాలం ఉండదని, హాంకాంగ్పై చైనా ఉక్కు పిడికిలి బిగిస్తున్నదని ఇలా రకరకాలుగా ప్రచార దాడి ప్రారంభించాయి. వాణిజ్యంలో హాంకాంగ్కు ఇస్తున్న ప్రత్యేక హోదాను ఉపసంహరించు కుంటామని అమెరికా విదేశాంగశాఖ మంత్రి మైక్ పాంపియో బెదిరించారు. 'హాంకాంగ్ భద్రతకు సంబంధించిన చట్టాన్ని రాష్ట్ర స్థాయిలో తీసుకురావచ్చు కదా? ఇది హాంకాంగ్ స్వయం ప్రతిపత్తిని దెబ్బతీయదా?' అని విమర్శించినవారు ఉన్నారు. ఈ అంశాల్లోకి వెళ్లడానికి ముందు హాంకాంగ్ నేపథ్యం గురించి కొంచెం తెలుసుకుందాం.
చైనాలో అంతర్భాగం హాంకాంగ్
చైనా వేరు, హాంకాంగ్ వేరు కాదు. చైనా నుంచి విడదీయరాని అంతర్భాగం హాంకాంగ్. నల్లమందు యుద్ధాల్లో విజయం సాధించిన బ్రిటన్ హాంకాంగ్ను తన వలస కాలనీ కింద మార్చుకుంది. 1841 నుంచి 1997 వరకు మధ్యలో నాలుగేండ్లు మినహా ఈ ప్రాంతంపై బ్రిటన్ పాలనే సాగింది. 1842లో తొలి నల్లమందు యుద్ధంలో ఓడిపోయిన ఖింగ్ వంశ పాలకులు బ్రిటన్తో కుదుర్చుకున్న నాంజింగ్ ఒప్పందం ప్రకారం హాంకాంగ్ దీవిని బ్రిటిష్ సామ్రాజ్యవాదుల వలస కాలనీగా మారింది. 1860లో రెండో నల్లమందు యుద్ధం తరువాత బ్రిటన్ మరో రెండు ప్రాంతాలను ఆక్రమించుకుంది. 1898లో ఈ కొత్త ప్రాంతాలను 99ఏండ్ల పాటు లీజుకు హక్కు సంపాదించుకుంది. రెండో ప్రపంచ యుద్ధ సమయంలో జపాన్ హాంకాంగ్ను ఆక్రమించుకుని నాలుగేండ్లపాటు (1941-45) తన పెత్తనం చలాయించింది. అయితే ఆ యుద్ధం ముగింపుదశలో చైనా, బ్రిటన్ సేనలు కలసి జపాన్ను ఓడించి హాంకాంగ్ను తిరిగి స్వాధీనం చేసుకున్నాయి. 1984లో అప్పటి బ్రిటిష్ ప్రధాని మార్గరెట్ థాచర్ సంతకం చేసిన సినో-బ్రిటన్ ఒప్పందం ప్రకారం 99ఏండ్ల లీజు పూర్తవగానే హాంకాంగ్ను చైనాకు అప్పగించాలి. ఆ ప్రకారమే 1997 జులై1న హాంకాంగ్ చైనాలో తిరిగి విలీనమైంది. ఆ సందర్భంగా హాంకాంగ్ బేసిక్ లాను గుర్తిస్తూ దానికి ప్రత్యేక పాలనా ప్రాంత హోదా చైనా కల్పించింది. మకావు దీవుల విషయంలో వర్తింపజేసిన 'ఒక దేశం రెండు వ్యవస్థలు' సిద్ధాంతాన్ని హాంకాంగ్కూ వర్తింపజేసింది. చైనా పరిపాలనలో హాంకాంగ్ మరింత అభివృద్ధి చెందింది. అత్యున్నత ప్రపంచ ఆర్థిక, వాణిజ్య కేంద్రాల్లో ఒకటిగా ఎదిగింది. అయితే ఆ అభివృద్ధిని, అక్కడ ఉత్పత్తి అవుతున్న సంపదను చూసి కన్నుకుట్టిన కొన్ని శక్తులు హంకాంగ్లో అలజడులు సృష్టించాడానికి ప్రయత్నించారు. స్థానికంగా ఉన్న యువకు లను చైనాకు వ్యతిరేకంగా రెచ్చగొట్టారు. ప్రజాస్వామ్యవాదుల పేరుతో వీరంతా ఉద్యమాలు చేస్తున్నామంటూ అరాచకం సృష్టించారు. హంకాంగ్ ప్రాధమిక ప్రయోజనా లను దెబ్బ కొట్టేందుకు ప్రయత్నించారు. గత ఏడాది వరుసగా ఏడు నెలల హాంకాంగ్ నగరంలో అలర్లు, లూటీలకు యథేచ్ఛగా పాల్పడ్డారు. ప్రజాస్వామ్యం ముసుగులో మొదలైన ఈ ఉద్యమం ప్రత్యేక హాంకాంగ్ దేశం కావాలనే దాకా వెళ్లింది. ఈ ఆందోళనల వెనుక విదేశీ శక్తులు ఉన్నాయని, వారి ప్రయోజనాల కోసమే వేర్పాటువాద డిమాండ్ను తీసుకువస్తున్నారని గ్రహించింది. ఈ విచ్ఛిన్నకర శక్తుల నుంచి హాంకాంగ్ను కాపాడుకునేందుకే జాతీయ భద్రతా చట్టాన్ని తెచ్చినట్లు చైనా ప్రభుత్వం అంటోంది. అయితే ఈ చట్టంతో హాంకాంగ్ ప్రజల స్వేచ్ఛకు ఎటువంటి భంగం వాటిల్లదని చెబుతోంది. 'ఒక దేశం-రెండు వ్యవస్థలు' సిద్ధాంతానికి వచ్చిన నష్టమేమీ లేదని చైనా చెబుతోంది. హాంకాంగ్ అంతర్జాతీయ ఆర్ధిక, వాణిజ్య నగరంగా ఎదగడంలో కీలక పాత్ర పోషించిన సమ న్యాయం, స్వతంత్ర న్యాయ వ్యవస్థ, అవినీతికి అస్కారం లేని పౌరసేవలు, పత్రికా స్వాతంత్య్రం, భావప్రకటనా స్వేచ్ఛ, సమాచార మార్పిడి, పెట్టుబడుల స్వేచ్ఛ, స్వేచ్చయుత మార్కెట్, స్వేచ్ఛాయుత వ్యక్తుల కదలికలో ఎటువంటి మార్పు లేదని, జాతీయ భద్రతా చట్టంతో వీటికి ఎటువంటి ఆటంకం కలగదని చైనా హామీ ఇస్తోంది.
జాతీయ భద్రతా చట్టం ఎందుకు..?
ఏదేశమైనా తన అంతర్గత భద్రత పట్ల చాలా జాగ్రత్తగా ఉంటుంది. తమ వ్యవస్ధలను కూల్చేందుకు, ప్రజా జీవనాన్ని చెదర గొట్టేందుకు, దేశాన్ని విడదీసేందుకు ఎవరు ప్రయత్నించినా అందుకు ఏ దేశమూ అంగీకరించదు. ఇటువంటి ప్రయత్నాలకు వ్యతిరేకంగా అనేక దేశాలు భద్రతా చట్టాలను తీసుకొచ్చాయి. బ్రిటన్, అమెరికా సైతం అటువంటి చట్టాలను తీసుకొచ్చాయి. ప్రపంచంలోనే మొట్టమొదటిసారిగా అమెరికా ప్రభుత్వం 1947లో జాతీయ భద్రతా చట్టాన్ని తీసుకొచ్చింది. ఈ చట్టం ద్వారా ఏర్పడ్డ జాతీయ భద్రతా మండలి ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైనదిగా చెబుతారు. అమెరికా ప్రభుత్వం 9/11 దాడుల తర్వాత దేశభక్తి చట్టంతో సహా అనేక చట్టాలను తీసుకొచ్చింది. ఇవన్నీ ప్రజలపై మరింత నిఘాను ఉంచేందుకు ఉద్దేశించినవే. చైనా ఎవరినో అణచివేయడానికో, పెత్తనం చలాయించేందుకో ఈ చట్టం తేలేదు. దేశ సార్వభౌమత్వాన్ని, భద్రతను కాపాడు కోవడానికే ఈ చట్టాన్ని తెచ్చింది. చైనాలో అంతర్భాగమైన హాంకాంగ్ ప్రజల స్వేచ్ఛకు రక్షణ కల్పిస్తూనే వేర్పాటువాద, ఆరాచక శక్తుల ఆట కట్టించేందుకు ఈ చట్టం అవసరమని భావించింది. హాంకాంగ్ బేసిక్ లా లోని ఆర్టికల్ 23కి అనుగుణంగా హెచ్కెఎస్ఎఆర్ అసెంబ్లీ ద్వారానే ఈ భద్రతా చట్టం తేవాలని అనుకున్నా అక్కడి చైనా వ్యతిరేక శక్తులు హింసాత్మక ఆందోళనలకు దిగడం, బయట నుంచి చైనా వ్యతిరేకశక్తుల జోక్యం పెరుగుతుండడంతో జాతీయ పీపుల్స్ కాంగ్రెస్ ఈ చట్టాన్ని అనివార్యంగా తీసుకు రావాల్సి వచ్చింది. ఈ చట్టం 'బేసిక్ లా'ను ఏ విధంగాను సవరించడం కానీ, దాని విలువను తగ్గించడం కానీ చేయదని చైనా స్పష్టం చేసింది.
చైనాకు హాంకాంగ్ ప్రజల మద్దతు
ప్రతిపక్షం ప్రజాస్వామ్యం పేరుతో విధ్వంసం సృష్టించి చైనా పట్ల వ్యతిరేకత పెంచాలని చూసినా, అంతర్జాతీయ మీడియాలో ఓ సెక్షన్ విద్వేష ప్రచారం చేసినా హాంకాంగ్ ప్రజలు, వాణిజ్యవేత్తలు మాత్రం చైనా వైపే ఉన్నారు. హాంకాంగ్ నగర సీఈవో క్యారీ లామ్ ఈ చట్టాన్ని స్వాగతించారు. ఈ చట్టంతో హాంకాంగ్ ప్రజల స్వేచ్ఛా, స్వాతంత్రాలకు ఏమాత్రం నష్టం కలగదని ప్రకటించారు. హాంకాంగ్ ప్రజలు ఈ చట్టం తమ భద్రతకు పూచీ పడుతుందన్న ఆశాభావం వ్యక్తం చేశారు. వీరి అభిప్రాయాలకు అనుగుణంగానే హాంకాంగ్ వ్యాపార, రియల్ ఎస్టేట్ రంగాలు స్పందించాయి. బిల్లు ప్రతిపాదించిన నాటినుంచి గతవారం రోజులుగా స్టాక్ మార్కెట్లో ఎటువంటి ప్రతికూల ప్రభావంలేదు. ఈ చట్టం తేస్తే హాంకాంగ్ నుంచి వెళ్లిపోతామని ఇంతవరకు ఒక్క కంపెనీ కూడా ప్రకటించలేదు. పైగా ఈ చట్టం భరోసా ఇవ్వడంతో సింగపూర్ నుంచి తమ ఆఫీసును హాంకాంగ్కు మారుస్తున్నట్లు ఎంఎస్సిఐ అనే కార్పొరేట్ సంస్థ వెల్లడిచింది. జాతీయ భద్రతా చట్టంతో అంతర్జాతీయ వాణిజ్య, ఆర్థిక రాజధానిగా హాంకాంగ్ మరింత పరిఢవిల్లుతుందని చైనా భావిస్తోంది.
గమిడి శ్రీనివాస్
సెల్:9701330013