Authorization
Mon Jan 19, 2015 06:51 pm
మధ్యతరగతి వేతన జీవుల బతుకులు ఈ కరోనా కాలంలో వారు ఉహించలేని విధంగా దిగజారినాయి. వారు ఇప్పుడు మానసిక ఉద్వేగానికి గురవుతున్నారు. వారి జీవితాలు కారోనాకు ముందు కరోనా తర్వాత అని గీత గీసుకొని నెమరు వేసుకొని చరిత్ర రాసుకొనేటట్టు ఉన్నాయి.
నెలనెలా కొంతమొత్తంలో వేతనం అందుతున్నప్పుడు చాలామంది భవిష్యత్ అవసరాలను దష్టిలో పెట్టుకోకుండా విచ్చలవిడిగా ఖర్చు చేస్తూ పట్టణ వాతావరణంలో జల్సాలు చేస్తూ గడిపారు. అప్పుడు వీరికి ప్రభుత్వపాలనతో కాని, వారు వాడుతున్న వస్తువుల నాణ్యతా ప్రమాణాలను కానీ వాటి ధరలలో పెరుగుదలను కానీ పట్టించుకొనే ప్రయత్నం చేసేవారు కాదు. ప్రశ్నించటానికి కూడా మాకు సమయంలేదన్నట్టుగా వ్యవహరించేవారు.
వారి పిల్లలు చదువుతున్న పాఠశాలలో ఫీజులు పెరుగుతున్నా వారికేమీ పట్టనట్టు వ్యవహరిచేవాళ్ళు. కొంతమంది చైతన్యవంతులు ప్రశ్నిస్తుంటే పనిలేని వాళ్లే ఇలా బజారున పడి గొడవలు చేస్తారని విమర్శించే వాళ్ళు. పరిసరాలను కానీ ప్రక్కవాళ్లను కానీ ఏమాత్రం పట్టించుకోకుండా వారి కుటుంబమే ప్రపంచమని భావించేవారు.
రోజువారీ వార్తలను టీవీలో చూడడం కానీ, రోజువారీ పేపర్లో వార్తలను పరిశీలించటం కానీ చేయరు, ఈ కార్యక్రమాలు వారికి పనికిమాలిన విషయాలు. సినిమాలు, రియాటీషోలు, డైలీ సీరియళ్లు మొదలైన వాటితో కాలక్షేపం చేసేవారు. చివరికి ఎలక్షన్ రోజులలో సెలవిచ్చి ఓటువేయమంటే ఆ రోజును కూడా సినిమా చూడటానికో, షికారు చేయటానికో ఉపయోగించుకుంటారు. ఓటు వేయటం వారి ప్రాధమిక బాధ్యతని కూడా మర్చిపోయేవారు.
వారికొచ్చే వేతనాన్ని మరచి, తాహతకుమించి అప్పులు చేసి నెలవారి కిస్తీలు కట్టలేక సతమతమౌతుంటే ఈ కరోనా వారి జీవితంలో మరో బండనేసింది. మార్చి నుంచి ఆగస్టు వరకు మారిటోరియం అను తాత్కాలిక మహమ్మారి ఉపశమనం కలిగించినా అది సెప్టెంబర్ నుంచి విజంభించి ప్రాణాంతకంగా మారుతుంది. ఈ నిజం తెలిసిన కొంతమందికి ఇప్పటి నుండే నిద్ర పట్టటంలేదు. వీరిలో చాలా మంది ఇప్పుడు సామాజిక నిద్రనుండి హఠాత్తుగా లేచారు. ఇప్పుడు జ్ఞాన గుళికలను మింగి పరిసరాలన్నీ కలుషితమైనాయి, ప్రభుత్వాలన్నీ బాధ్యతా రహితంగా ఉన్నాయి అని వాపోతున్నారు. ఒకప్పుడు ఎవరినైతే బజారున పడ్డ పనిలేని వాళ్ళు అని అన్నారో, వాళ్లే వీరిచుట్టాలైనారు. ఇప్పుడు వీరు స్కూలులో పెరిగిన ఫీజులు గురించి, పెరుగుతున్న ధరల గురించి, వేతనాలివ్వని వారి వారి యజమానుల గురించి, ఆధునిక మాధ్యమాలలో అలుపు సొలుపు లేకుండా నినాదాలిస్తున్నారు. ఇంకొక మెట్టు పైకెళ్లి నోటికొచ్చినట్టు ప్రభుత్వాలను, పాలకులను దూషిస్తున్నారు.
మన మధ్యతరగతి వేతన జీవిలో కరోనా మహమ్మారి తెచ్చిన మార్పు చాలా బాగుంది. కానీ రాబోయే కాలంలో వారి వారి ఆర్థిక పరిస్థితిలను అవగాహన చేసుకొని సంయమనంతో జీవితాన్ని తీర్చిదిద్దుకొంటే మంచిదే. రాబోయే కాలంలో భయంకరమైన ఆర్థిక కష్టాలను ఎదుర్కొంటానికి తమను తాము సన్నద్దం చేసుకోవాలి. అలా కానట్టయితే మానసిక వత్తిడిని ఎదుర్కోవాల్సి వస్తుంది. అది కుటుంబాలను కబళించివేస్తుంది.
ఎందుకంటే కరోనా కాలంలో మన ప్రభుత్వాల వైఖరిని చూస్తే మధ్య తరగతి వేతన జీవికి అవి ఎలాంటి ప్రాధాన్యత ఇవ్వవని, మనల్ని వారు ప్రభుత్వంలో భాగంగా చూడరని స్పష్టమయి పోయింది. దీనికి ప్రభుత్వాల ఏర్పాటులో (ఓటుకు దూరంగా ఉంటాం కాబట్టి) మన భాధ్యత లేని వ్యవహారశైలి కూడా కారణమే. రాజకీయ నాయకులెప్పుడూ వారి ఓటు బ్యాంకును మాత్రమే కాపాడుకుంటారు. కాబట్టే వారి వాగ్దానాలు, చేసే సహాయం ఎక్కువ శాతం ధనికులను, పారిశ్రామిక వేత్తలను అప్పుడప్పుడూ కొంతమేరకు పేదలను ఉద్దేశించి మాత్రమే ఉంటాయి. కాబట్టి మన మధ్యతరగతి జీవితాలకు కర్త, కర్మ, క్రియ మనమే అని ఇకనైనా గ్రహించాలి.
- పి. సురేష్బాబు
seshupallapati@gmail.com