Authorization
Mon Jan 19, 2015 06:51 pm
మన ప్రధాని నరేంద్రమోడీగారేమో చైనా మన భూభాగాన్ని అక్రమించలేదు, పోస్టులను స్వాధీనం చేసుకోలేదు అని అఖిలపక్ష సమావేశంలో అధికారికంగా చెబుతారు. మరోవైపు ఆయన తెగకు చెందిన వారు ప్రస్తుతం దేశంలో పెద్ద ఎత్తున చైనా వ్యతిరేకతను రెచ్చగొట్టేందుకు పూనుకున్నారు, దానిలో భాగంగానే చైనా వస్తు బహిష్కరణ పిలుపులతో కాషాయ దళాలు ఒక నాటకాన్ని ప్రారంభించాయి. రెండు దేశాల సరిహద్దు భద్రతా దళాల మధ్య జరిగిన విచారకర ఘర్షణలో మన వారు 20మంది మరణించినట్లు అధికారికంగా ప్రకటించారు. చైనా తమ వారు ఎందరు మరణించిందీ చెప్పకపోయినా మన బీజేపీనేత, మాజీ సైనిక అధికారి 45మంది చైనీయులను మన వారు చంపినట్లు చెబుతున్నారు. దాన్ని నమ్ముతున్న వారే ఎక్కువ మందిని మనమే చంపినా చైనా వ్యతిరేకతతో ఊగిపోతున్నారు.
ఏ దేశంలో అయినా పాలకులే మనోభావాలను రెచ్చగొట్టి ముందుకు తెచ్చినపుడు దానికి మీడియా మసాలా కూడా తోడైతే రెచ్చిపోవటం సహజం. రేటింగ్లు పెంచుకొనేందుకు అలా చేస్తాయని మనకు తెలిసిందే. ఉద్రేకాలు బాగా ఉన్నప్పుడు మంచి చెడ్డల విచక్షణ ఉండదు కాబట్టి అది తప్పా ఒప్పా అన్నది పక్కన పెడదాం. ఈ పిలుపులు ఇస్తున్నవారు, దానికి అనుగుణ్యంగా వీధుల్లో దృశ్యాలను సృష్టిస్తున్నవారిలో అసలు నిజాయితీ, విశ్వసనీయత ఎంత?
ఢిల్లీ-మీరట్ ఆర్ఆర్టీఎస్ (మెట్రో రైల్) పధకంలో కొంత మేరకు భూగర్భమార్గాన్ని నిర్మించేందుకు షాంఘై టన్నెల్ ఇంజనీరింగ్ కంపెనీ(ఎస్టిఇసి)కి కేంద్ర ప్రభుత్వ టెండర్ దక్కింది. దాన్ని రద్దు చేయాలని ఆర్ఎస్ఎస్ సంస్థ స్వదేశీ జాగరణ మంచ్ (ఎస్జెఎం) ఆందోళనకు దిగింది. ఆ టెండర్ను పిలిచేటప్పుడు, అర్హతలను కోరినపుడు, తెరిచినప్పుడు అభ్యంతరం వ్యక్తం చేయని వారు ఇప్పుడు వీరంగానికి దిగటం ఏమిటి? ఆర్ఎస్ఎస్ కుటుంబ సభ్యుడైన నరేంద్రమోడీ మిగతా కుటుంబ సభ్యుల అభిప్రాయాలను తీసుకోరా? క్రమశిక్షణకు మారు పేరు, పద్ధతిగా ఉంటాం అని చెప్పుకొనే వారు అంతా అయిపోయాక ఆందోళనకు దిగటం ఏమిటి?
ఆసియన్ అభివృద్ధి బ్యాంకు(ఏడీబీ) నుంచి అప్పు తీసుకొని కేంద్ర ప్రభుత్వం మెట్రో రైలు మార్గాన్ని నిర్మిస్తున్నది. నిబంధనలు అవకాశం ఇచ్చిన మేరకు టెండర్లలో మూడు విదేశీ, రెండు స్వదేశీ కంపెనీలు పోటీ పడ్డాయి. 2019 నవంబరులో టెండర్లు పిలిచి ఈ ఏడాది మార్చి 16న తెరిచారు. చైనా కంపెనీ రూ.1,126.9 కోట్లకు చేస్తామని పేర్కొనగా మన ఎల్ అండ్ టి కంపెనీ రూ.1,170 కోట్లతో రెండవదిగా నిలిచింది. ఈ టెండర్ను లాంఛనంగా ఖరారు చేయాల్సి ఉంది. ఈలోగా సరిహద్దు వివాదం చెలరేగింది. జూన్15న గాల్వాన్లోయ సరిహద్దు ఘర్షణల తరువాత స్వదేశీ జాగరణ్ మంచ్ ఆందోళనకు దిగి ఆ టెండర్ను రద్దు చేయమంది. ఇప్పుడు తమ కాషాయ దళాన్ని సంతృప్తి పరచేందుకు కేంద్రం ఈ టెండరును రద్దు చేస్తుందా? సరిహద్దువివాదం సద్దు మణిగిన తరువాత గుట్టుచప్పుడు కాకుండా మోడీ సర్కార్ చైనా కంపెనీకి అప్పగిస్తుందా?
ప్రభుత్వ రంగ సంస్ధ బీఎన్ఎన్ఎల్ వ్యవస్ధను మెరుగుపరచేందుకు రూ.8,640 కోట్ల టెండర్లో చైనా కంపెనీలు పాల్గొనకుండా చూసేందుకు మార్పులు చేస్తామని టెలికమ్యూనికేషన్స్ శాఖ ప్రకటించింది. దీని వెనుక వేరే శక్తుల హస్తం ఉందా? ఎందుకంటే ప్రపంచం 5జి ఫోన్లకు మారేందుకు, 6జి ఫోన్ల అభివృద్దికి పరుగులు పెడుతున్నది. ప్రయివేటు జియో, ఎయిర్టెల్ వంటి వారికి మార్కెట్ను అప్పగించేందుకు మన బీఎస్ఎన్ఎల్, ఎంటిఎన్లను ఇంకా 3జీలోనే ఉంచి దెబ్బతీశారు. ఇప్పుడు 4జీ కూడా లేకుండా చేసేందుకు చైనా పేరుతో దెబ్బతీస్తున్నారా అన్న అనుమానం వస్తోంది. దీంతో ఉన్న కనెక్షన్లు కూడా పోతాయి. ఆర్థిక, బ్యాంకింగ్, రక్షణ, టెలికామ్ రంగాలలో పీపీఈ మార్గంలో వచ్చే పెట్టుబడులలో చైనా కంపెనీల నుంచి వచ్చే వాటిని అడ్డుకోవాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించినట్టు వార్తలు వచ్చాయి.
అలాంటి ఆలోచన గాల్వాన్ ఘటనకు ముందే ఎందుకు లేదు? మిగతా దేశాల నుంచి పెట్టుబడులు ముద్దు - చైనా పెట్టుబడులు వద్దు అంటున్నారని భావిద్దాం! చైనాకు పోయే లాభాలు అమెరికా, బ్రిటన్ వంటి దేశాలకు పోతాయి. కమ్యూనిస్టు వ్యతిరేక పిచ్చివారిని సంతృప్తి పరచటం తప్ప దీని వలన మన దేశానికి ఒరిగేదేమిటి? చైనా కంపెనీలు అనేక దేశాలలో స్థాపించిన అనుబంధ లేదా సోదర కంపెనీల ద్వారా పలు దేశాల్లో పెట్టుబడులు పెడు తున్నాయి, వాటిని కూడా అడ్డుకుంటారా?
2014వరకు మన దేశంలో చైనా పెట్టుబడులు కేవలం 160కోట్ల డాలర్లు మాత్రమే. ఇప్పటి వరకు ప్రకటించిన పెట్టుబడులు, వచ్చినవి మొత్తం 2,600కోట్ల డాలర్లు, మరో 1500కోట్ల డాలర్లను వివిధ పధకాలలో పెట్టుబడులుగా పెడతామని చైనా సంస్థలు వాగ్దానం చేశాయి. ఇవిగాక ప్రభుత్వ నివేదికల్లో చైనా నుంచి వచ్చిన పెట్టుబడుల జాబితాలో చేరనివి ఇంకా చాలా ఉన్నాయి. ఇప్పుడు ఈ పెట్టుబడులన్నింటికీ నష్టపరిహారం ఇచ్చి రద్దు చేస్తారా? పరిహారం ఎవరు చెల్లిస్తారు? పరిహారమేమీ లేకుండా నెత్తిన చెంగేసుకొని పొమ్మంటే పోవటానికి చైనా అంత బలహీనంగా ఉందా? మనం చేసుకున్న ఎగుమతి ఒప్పందాలను చైనా రద్దు చేయకుండా ఉంటుందా?
చైనా వస్తువులు మన దేశంలో విస్తరించటానికి కచ్చితంగా కమ్యూనిస్టులైతే కారణం కాదు. ఉదాహరణకు ఢిల్లీ సాదర్ బజార్లో దాదాపు 40వేల మంది రిటైల్ వర్తకులు చైనా వస్తువులను అమ్ముతున్నారు. అక్కడ అమ్మేవారు చెప్పేది ఒక్కటే, చైనా ధరలకు భారతీయ తయారీ వస్తువులను సరఫరా చేయండి చైనా వస్తువులను నిలిపివేస్తాం అంటుంటే, తాము కూడా కొనటం మానేస్తామని వినియోగదారులు అంటున్నారు. పాలకులు లేదా చైనా వస్తు బహిష్కరణవాదులు అందుకు సిద్దమేనా? ఎంతసేపూ నిరసనకారులు ఎలక్ట్రానిక్ వస్తువులను ధ్వంసం చేయటం చూపుతున్నారు. చైనా ముడివస్తువులతో మన దేశంలో తయారు చేస్తున్న ఔషధాల మాటేమిటి? వాటిని కూడా రోడ్ల మీద పోస్తారా? జబ్బు చేస్తే జనం దిక్కులేని చావు చావాలా? అంతే కాదు, చైనా రసాయనాలతో ఔషధాలను తయారు చేసి మనం ఇతర దేశాలకు ఎగుమతి చేస్తున్నాం. మరి ఆ ఎగుమతులు నిలిచిపోవాలని సంఘీయులు కోరుకుంటున్నారా?
మన ఆర్థిక వ్యవస్థ మొత్తాన్ని చైనా వస్తువులు దెబ్బతీస్తున్నాయంటూ బహిష్కరణ పిలుపు ఇస్తున్నారు. చైనా ప్రాణం మనం దిగుమతులనే చిలకలో ఉందని, వస్తువుల దిగుమతులను ఆపివేస్తే చైనా ప్రాణం పోతుందని చెబుతున్నారు. దీనిలో వాస్తవం ఎంత? 2019లో మనం చైనా నుంచి దిగుమతి చేసుకున్నది కేవలం 13.7శాతమే. వాటితోనే మన ఆర్థిక వ్యవస్థ నాశనం అవుతుందా? చైనా ఎగుమతుల్లో మన వాటా రెండు- మూడుశాతం మధ్యనే అన్నది తెలుసా? ఆమేరకు దిగుమతులు ఆపివేస్తేనే చైనా దెబ్బతింటుందా? అదే నిజమైతే మోడీ ఏం చేస్తున్నట్టు?
చౌకగా వస్తున్న చైనా వస్తువుల కొనుగోలుతో మన వినియోగదారులు లబ్దిపొందారే తప్ప నష్టపోలేదు. చైనావి లేకపోతే అధిక ధరలకు ఇతర దేశాల వస్తువులను కొని జేబులు గుల్ల చేసుకోవాల్సి వచ్చేది. మిగతా దేశాల ధరలతో పోలిస్తే చైనా టెలికాం పరికరాల ధరలు 20శాతం తక్కువ. ప్రభుత్వ రంగ సంస్ధలైన బీఎస్ఎన్ఎల్ చైనా వ్యతిరేకులను సంతృప్తి పరచేందుకు చైనాను రంగం నుంచి తప్పించేందుకు పూనుకుంది అంటే అర్థం ఏమిటి? అంత మొత్తం ఎక్కువకు ఇతర దేశాల నుంచి కొనుగోలు చేస్తుందనే కదా! ప్రయివేటు కంపెనీలు కూడా అదే పని చేస్తాయా? ప్రభుత్వం వాటికి అలాంటి షరతు విధించి అమలు జరపగలదా ?
చైనా వస్తువుల మీద లేదా కమ్యూనిస్టు చైనా మీద ఒక సంఘపరివార్ కార్యకర్తగా నరేంద్రమోడీకి ప్రేమ, అభిమానం ఉంటాయని ఎవరూ అనుకోరు. అమెరికా-చైనా మధ్య జరుగుతున్న వాణిజ్య పోరులో లాభపడాలన్నది మన దేశ వాణిజ్య, పారిశ్రామిక సంస్ధల ఆశ, ఎత్తుగడ. ప్రతి దేశం వాణిజ్యాన్ని ఒక ఆయుధంగా వాడుకొంటుంది. ఆ విషయంలో ఎవరైనా ఒకటే. ఆడలేక మద్దెల ఓడు లేదా ఈ రోజు మంగళవారం కాబట్టి సరిపోయింది అన్నట్టుగా ప్రపంచ వాణిజ్య సంస్ధ నిబంధనల పేరుతో కాలక్షేపం చేస్తున్నారు. మనకు నష్టదాయకం అనుకుంటే డబ్ల్యూటీఓ నుంచి బయటకు వచ్చేయటమే.
సెల్: 8331013288
ఎం. కోటేశ్వరరావు