Authorization
Mon Jan 19, 2015 06:51 pm
సాధారణ పరిస్థితులలో ఈపాటికి బడులు తెరిచి పాఠాలు ప్రారంభమయ్యేవి. కానీ ఈసారి కరోనా లాక్డౌన్ నేపథ్యంలో విద్యాలయాలన్నీ మూతపడ్డాయి. పదో తరగతి, ఇంటర్నీడియట్ పరీక్షలు రద్దయ్యాయి. తిరిగి స్కూళ్లు ఎప్పుడు తెరుస్తారో తెలియదు. ఆగస్టులో తెరుస్తామంటున్నారు. కానీ కరోనా విస్తరిస్తున్న నేపథ్యంలో సాధ్యమా? అన్న ప్రశ్న అందరిలోనూ తలెత్తుతోంది. అక్టోబర్ వరకు సెలవులు పొడిగించవచ్చన్న సూచనలూ వినిపిస్తున్నాయి. ఈ స్థితిలో ఒక విద్యా సంవత్సరం నష్టపోవాల్సిందేనా అన్న సందేహాలూ మొదలయ్యాయి. తల్లిదండ్రుల్లో డోలాయమానస్థితి కనిపిస్తోంది. విద్యాసంవత్సరం నష్టపోకూడదన్న భావన ఒక వైపు, స్కూళ్లు తెరిస్తే పిల్లలు ఎక్కడ కరోనా బారిన పడతోరోనన్న ఆందోళన మరో వైపు పీడిస్తున్నది. విద్యావేత్తలు, మేధావుల్లో స్కూళ్లు తెరవడంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. పనిలో పనిగా ప్రయివేటు విద్యా సంస్థలు తమ వ్యాపారాన్ని పెంచుకునేందుకు ఈ పరిస్థితిని మెట్లుగా మలచు కుంటున్నాయి. ఇప్పటికే ఆన్లైన్ పాఠాలు మొదలు పెట్టాయి. ఎల్కేజీ నుండే డిజిటల్ పాఠాలు ఆరంభించాయి. ఫీజులు కూడా దండిగానే వసూలు చేస్తున్నాయి.
ప్రభుత్వ పాఠశాలల పిల్లలకు దూరదర్శన్లో పాఠాలు వినమని చెప్తున్నారు. వారానికి రెండు రోజులు షిఫ్టుల వారీ స్కూళ్లలో టీచర్లు వచ్చి పిల్లలకు అనుమానాలు తీరుస్తారు. ఇప్పటికే నాలుగు మాసాల నుంచి చదువులు ఆగిపోయాయి. నేర్చుకున్నదీ మర్చిపోయి ఉంటారు. ఈ స్థితిలో డిజిటల్ పాఠాలు ఎంత వరకు ఆ నష్టాన్ని పూడుస్తాయి. ప్రత్యేకించి మన రాష్ట్రంలో ఇంగ్లీషు మీడియంకు పరివర్తనా దశలో డిజిటల్ పాఠాలంటే విద్యార్థుల పాలిట శాపంగా మారుతుంది. ముసాయిదా విద్యావిధానం 2019 సిఫార్సు చేసినట్టుగా కేంద్ర ప్రభుత్వం డిజిటల్ విద్యను ఒక విధానంగా ప్రోత్సహించాలని నిర్ణయించుకున్న స్థితిలో ఇది పిల్లల్లో డిజిటల్ డివైడ్ వంటి సరికొత్త విభజనకు దారి తీస్తుందనడంలో సందేహం లేదు.
ఆన్లైన్ లేదా డిజిటల్ పాఠశాల ఫార్మల్ విద్యకు ప్రత్యామ్నాయం కాదు. అది సహాయక పాత్ర మాత్రమే పోషిస్తుంది. అన్లైన్ ద్వారా టీచర్లతో పిల్లలకు ప్రత్యక్ష అనుబంధం దెబ్బతింటుంది. ఇప్పటికే పిల్లలు టీచర్ల సబంధాలు అంతంతమాత్రంగా ఉన్నాయి. ప్రయివేటు స్కూళ్లలో అయితే ఏ టీచరు ఏ రోజు ఉంటారో కూడా తెలియదు. వస్తారు చెప్తారు వెళతారు అన్నట్టుగా ఉంటాయాసంబంధాలు. యాజమాన్యాలకు ఫీజులు, ర్యాంకులు తప్ప విద్యార్థి మేధో, మానసిక వికాసంతో సంబంధం ఉండదు. ఆటలుండవు. పాటలుండవు. అపార్ట్మెంట్లలో ఇరుకు గదులలో మార్కులు, గ్రేడుల కోసం కుస్తీ పట్టడం మాత్రమే నేర్పిస్తారు. ఇప్పుడు ఇండ్ల దగ్గర నుండే చదువులు నేర్చుకోవాలి. వారు చెప్పుకుంటూ పోతారు. వీరు వింటున్నారో లేదో తెలియదు. హౌం వర్కు ఇస్తే ఆన్లైన్లోనే చేస్తారు. ఆన్లైన్లోనే దిద్దుతారు. ఇక ఎలాంటి ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీ ఉండదు. దాని వల్ల పిల్లల మానసిక ఆరోగ్యాలూ దెబ్బతింటాయని శాస్త్రవేత్తలు చెప్తున్నారు. కానీ యాజమాన్యాలకు స్కూలు నిర్వహణ ఖర్చు తగ్గుతుంది. టీచర్లకూ తక్కువ వేతనాలిచ్చి ఇండ్ల దగ్గర నుండే పాఠాలు చెప్పిస్తారు. ఇది కరోనా లాక్డౌన్ వరకే తాత్కాలికంగానైతే పెద్దగా ఆందోళన పడాల్సిన అవసరం లేదు. కానీ ఇదే ఒక విధానంగా మారితే? అదే అసలు సమస్య.
విద్యారంగంలోకి ప్రయివేటు పెట్టుబడులే కాదు విదేశీ పెట్టుబడులు కూడా వస్తున్నాయి. కరోనాకు ముందు నుండే ఆన్లైన్ టుటోరియల్స్, క్లాస్రూమ్సు వంటి ప్రోగ్రాంలు ప్రవేశించాయి. బైజు, ఎడ్యుకాంప్, ఎడ్యుకార్ట్ వంటి సంస్థలు పెద్ద ఎత్తున పెట్టుబడులు పెట్టి ఆన్లైన్ ట్యూషన్సుకు పిల్లలను ఆకర్షిస్తున్నాయి. వీటికి ఫీజులూ భారీగానే వసూలు చేస్తున్నాయి. వీటినే చట్టబద్దం చేయడానికి ప్రభుత్వం ప్రయత్నిస్తున్నది. దీన్నే ఈలెర్నింగ్ బిజినెస్ అంటున్నారు. 2022 నాటికి దేశంలో ఈ-విద్యావ్యాపారం 18బిలియన్ డాలర్లకు (అంటే లక్ష25వేల కోట్ల రూపాయిలు) చేరవచ్చని అంచనా. రానున్న ఐదేండ్లలో 20 నుంచి 45శాతం వరకు పెరుగుతుంది. ఇప్పుడిది 4వేల కోట్లుపైన ఉంది. దీన్ని ప్రోత్సహించడానికి కార్పొరేట్ కంపెనీలు కూడా నిధులు కేటాయిస్తున్నాయి. విద్యా వ్యాపారంలో ఇది మరోదశకు దారితీస్తుంది. ఒక విద్యార్ధి ఆన్లైన్లో ఏ సంస్థ లేదా టీచరుతోనైనా పాఠాలు చెప్పించుకోవచ్చు. విదేశీయుల చేత కూడా చెప్పించుకోవచ్చు. అన్ని సబ్జెక్టులు ఒకేచోట నేర్చుకోవాలనీ లేదు. వివిధ సబ్జెక్టులను వివిధ టీచర్ల ద్వారా నేర్చుకోవచ్చు. సిలబస్ను బట్టి పరీక్షలకు హాజరుకావచ్చు. ఆటలు, పాటలను కూడా విడిగా నేర్చుకోవచ్చు. వాటికి విడిగా ఫీజులుంటాయి. తద్వారా ఫార్మల్ విద్య స్థానంలో డిజిటల్ విద్యను అంచెలంచెలుగా ప్రవేశపెట్టాలని ప్రభుత్వం భావిస్తోంది. ఈ లక్ష్యంతోనే డిజిటల్ క్లాస్ రూములను డిజైన్ చేసింది. ఇదే జరిగితే విద్యార్థుల మధ్య డిజిటల్ విభజన తప్పనిసరిగా వస్తుంది. డబ్బులున్న వారికి నాణ్యమైన విద్య దొరుకుతుంది. పూర్వకాలంలో గురుకులాల నమూనాలో ప్రతి విధ్యార్థి తన అవకాశాలను బట్టి ఎక్కడైనా, ఏ గురువు దగ్గరైనా నేర్చుకోవచ్చు. కాని నాడు కింది కులాలకు చదువుకునే అవకాశాన్నే నిషేధించారు. ఇప్పుడు అలా నిషేధించకుండా అవకాశాలను రద్దు చేస్తారు. సరికొత్త వివక్షతకు అది దారి తీస్తుంది. ఇప్పుడే ప్రభుత్వ, ప్రయివేటు విద్యా సంస్థల మధ్య అసమానతలు పెరుగుతున్నాయి. డిజిటల్ విద్య దాన్ని మరింతగా పెంచుతుంది. సంపన్నులకు అవకాశాలు పుష్కలంగా ఉంటాయి. కానీ పేదవారు దీనికి బలైపోతారు. నూతన పారిశ్రామిక విధానం వలసకార్మికుల్ని వీధుల్లోకి నెట్టినట్టుగానే పేదవారిని విద్యకు దూరంగా నెట్టేస్తారు.
ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యతను పెంచి వాటి రూపురేఖలే మారుస్తామని ప్రభుత్వాధినేతలు వాగ్దానాలయితే చేశారు. నిజంగా అలా మారిస్తే మంచిదే. పేదవాళ్లకు చాలా మేలు జరుగుతుంది. కానీ ఇంతలో కరోనా వచ్చింది. దీన్ని ఎలా ఎదుర్కొంటారన్నదే పెద్ద ప్రశ్న. వంతులవారీ విద్యార్ధులను విభజించి షిఫ్టు సిస్టం పెడతామంటున్నారు. కాని మన రాష్ట్రంలో ఎక్కువ మంది పిల్లలు హాస్టళ్లలో ఉండి చదువుకునే వారే. స్కూల్లో షిఫ్టు సిస్టం పెట్టొచ్చు. కాని హాస్టళ్లలో ఎలా? అందరూ ఒకే చోట తినాలి. స్నానాలు చేయాలి. పడుకోవాలి. కరోనా నుంచి వీళ్లను కాపాడే మార్గం ఏదీ? ఇప్పుడున్న వసతిలో భౌతిక దూరం పాటించే విధంగా సంఖ్యను సగానికి సగర తగ్గించాలి. ప్రస్తుతం ఉన్న హాస్టళ్లను రెట్టింపు చేస్తేనే పిల్లలందరికీ వసతి సమకూర్చడం సాధ్యమవుతుంది. అవసరమైతే తాత్కాలికంగా అద్దె భవనాలు తీసుకోవాలి. అప్పుడే హాస్లళ్లలో కూడా భౌతికదూరం పాటించడం సాధ్యమవుతుంది. మామూలుగానే పెద్దల్లాగా పిల్లలు భౌతికదూరాన్ని అంత సులభంగా పాటిస్తారని అనుకోలేం. వెంట వార్డెన్లు, టీచర్లు ఉంటూ కాపాలా కాస్తేనే చాలా వరకు భౌతికదూరం అమలు చేయొచ్చు. కానీ అది ఆచరణలో సాధ్యమా? ఇత్యాది ప్రశ్నలకు ప్రభుత్వం నుంచి ఇంతవరకు సమాధానం లేదు. అసలు దాని గురించి వారు ఆలోచిస్తున్న దాఖలా కూడా లేదు. ఉన్న వసతిలోనే పిల్లల్ని కుక్కేస్తామంటే అది కరోనాకు పిల్లల్ని బలి చేయడమే అవుతుంది.
ప్రభుత్వ స్కూళ్ల విద్యార్థులు వెనుకబడకుండా ఉంటాలంటే స్కూళ్లు తెరిచే లోగా ఆన్లైన్ సహా వివిధ మార్గాల్లో పాఠాలు చెప్పడానికి అవసరమైన ఏర్పాట్లు చేయాలి. ఇందులో అతి పెద్ద సమస్య కంప్యూటర్ లేదా ట్యాబు లేదా స్మార్టు ఫోను అత్యధిక మందికి అందుబాటులో లేకపోవడం. ఒక వేళ ఎవరికైనా స్మార్టుఫోను ఉన్నా ఇంట్లో ఒకరికే ఉంటుంది. అది పెద్దవారు వాడుకుంటారు. ఈ స్థితిలో ప్రతి విద్యార్థికి ప్రభుత్వమే ఒక ట్యాబ్, ఇంటర్నెట్ సౌకర్యం కల్పించాలి. అప్పుడే అది సక్సెస్ అవుతుంది. అదే సమయంలో 5తరగతి వరకు ఆన్లైను పాఠాలను నిషేధించాలి. వారికి ఏ ఊళ్లో ఆ ఊళ్లోనే ఉండి నేర్చుకునే విధంగా ఏర్పాట్లు చేయాలి. కేరళ తరహాలో మధ్యాహ్నభోజనం కూడా ఇంటికే సమకూర్చాలి. బియ్యం, గుడ్లుతో సహా డ్రైరేషను ప్రతి విద్యార్థి ఇంటికి సరఫరా చేయాలి. సచివాలయాలకు, వలంటీర్లకు ఈ బాధ్యత అప్పగించాలి. ఇంగ్లీషు మీడియంకు పరివర్తన చేయాలన్న ఆలోచనను వాయిదా వేసుకోవాలి. మారిన పరిస్థితులలో ప్రభుత్వ విద్యను బలపరచడంపై ప్రత్యేక కేంద్రీకరణ చేయాలి.
స్కూళ్లు తెరవడంతోనే అనేక ప్రాంతాల నుంచి విద్యార్థులు వస్తారు. వారి ఆరోగ్యాన్ని కాపాడటానికి తగిన సంస్థాగత ఏర్పాట్లు ఉండాలి. ప్రత్యేకంగా కరోనా నిధులు కేటాయించాలి. రాష్ట్ర ప్రభుత్వం ఈ విషయాలన్నింటినీ కూలంకుశంగా చర్చించి కొత్త విద్యా సంవత్సర ప్రణాళిక రూపొందించాలి. విధిగా అమలు చేయాల్సిన పనులకు ప్రోటోకాల్స్ నిర్ణయించాలి. అప్పుడే విద్యా సంవత్సరం నష్టపోకుండా విద్యార్ధుల భవిష్యత్తును కాపాడగలం. విద్యావేత్తలు, నిపుణులు, తల్లిదండ్రులు, విద్యార్ధి, ఉపాధ్యాయ సంఘాలతో సమగ్రంగా చర్చించిన తర్వాతే రాష్ట్ర ప్రభుత్వం తుది నిర్ణయం తీసుకోవాలి.
వి. శ్రీనివాసరావు