Authorization
Mon Jan 19, 2015 06:51 pm
కరోనా కబళిస్తుంటే... దాన్ని సొమ్ము చేసుకునేందుకు పలు ఫార్మా కంపెనీలు మందు కనిపెట్టినట్టు ప్రచారం చేసుకుంటున్నాయి. పతంజలి గ్రూపు కూడా గుంపులో గోవిందా అన్నట్టు 'కరోనిల్' మందు విడుదల చేసింది. ఆ తర్వాత భంగపాటుకు గురైంది. అది వేరే విషయం. అంతు చిక్కని కరోనాతో పెద్ద పెద్ద దేశాలు దిక్కులు చూస్తున్నాయి. కరోనా సోకుతోనే ఉంది. ప్రాణాలు పోతూనే ఉన్నాయి. ఇప్పటికీ తగిన జాగ్రత్తలు తీసుకోవాలనే డబ్య్లూహెచ్వో సూచనలు చేస్తున్నది. కొంత మంది ప్లాస్మా థెరఫీ చేస్తే కరోనా నయం అంటున్నారు. ఇదంతా బాగానే ఉన్నది. కానీ తెలంగాణ రాష్ట్రంలో ముగ్గురు డాక్టర్ల బృందం దీనికి ప్రత్యేక మందు కనిపెట్టితే అది సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నది. సదరు డాక్టర్లు ఆ మందు గురించి చెబుతుంటే విని కరోనా బాధితులు... ప్రజలు కూడా వారికి ఫిదా అవుతున్నారు. చాలా మంది ఆస్పత్రులకు పోతారు. కొంత మంది జాగ్రత్తలు పాటిస్తారు. అలాంటి వారంతా ఆ ముగ్గురు డాక్టర్ల బృందం (ఒక డాక్టర్ కేసీఆర్, మరో డాక్టర్ ఎర్రబెల్లి దయాకరరావు, ఇంకొక డాక్టర్ మల్లారెడ్డి) కనిపెట్టిన మందులనే వాడండి అంటూ యావత్ గులాబీ సేన ప్రచారం చేస్తున్నది. ఆ మందులకు (పారాసిటమాల్, ఉడుకునీళ్లు, హరితహారం) కూడా గులాబీ సేన బ్రాండ్ అంబాసిడర్గా మారింది. మందును మూడు పూటల వాడితే కరోనా పరుగు పెడుతుందని తేల్చి చెబుతున్నారు. కరోనాకు హైరానా పడాల్సిన అవసరం లేదు. జర్వమొస్తే వేసుకునే పారసిటమాల్ గోలి వేసుకుంటే సరి అని అంటున్నారు. డాక్టర్ ఎర్రబెల్లి మాత్రం ఉడుకు నీళ్లు తాగితే ఆ వేడికి కరోనా కడుపులోనే చచ్చిపోతుందంటున్నారు. మొక్కలు ఎక్కువగా నాటితే మంచి ఆక్సిజన్ విడుదలై కరోనా పోతుందంటున్నారు మల్లన్న . అందుకే హరితహారం కార్యక్రమం చేపట్టినట్టు డాక్టర్ మల్లారెడ్డి సెలవిచ్చారు.
- గుడిగ రఘు