Authorization
Mon Jan 19, 2015 06:51 pm
వానాకాలం వచ్చిందంటే చాలు అందరిలోనూ ఎంతో హుషారు. తొలకరి చినుకులు నేల మీద పడ్డప్పుడు మట్టి నుంచి వచ్చే పరిమళం.. మన మనసులను పరవశింపజేస్తుంది. బయట వర్షం పడుతున్న వేళ, వేడి వేడి అన్నంలో కాసింత కారప్పొడి చల్లుకుని, దాని మీద ఇంత నూనె వేసుకుని, పక్కన ఓ ఉల్లిగడ్డ పెట్టుకుని ముద్ద మీద ముద్ద మింగుతుంటే దమ్ బిర్యానీ కూడా ఆ రుచి మీదికి రాదు. సన్నని చిరు జల్లులు కురుస్తున్న వేళ.. అప్పుడే కాచి వడబోసిన కాఫీయో, టీయ్యో చుక్క చుక్కగా గొంతులోకి దిగుతుంటే.. ఆహా... ఆ మజానే వేరు. అప్పుడు అమృతం తాగిన ఫీలింగ్ కలుగు తుంటుంది. ఇగ పిల్లకాయలు.. నోటు బుక్కుల్లోంచి చించిన పేజీలను పడవలుగా చేసి.. చూరు నీళ్ల కింద వదిలి ఆటలాడుతుంటే.. వాళ్ల ఆనందానికి అవధులే ఉండవు. తెలుగు సినిమాల్లోని అనేక మధురమైన వాన పాటలు మనసులను తాకక మానవు. 'చిటపట చినుకులు పడుతూ ఉంటే...' అనే ఏఎన్నార్ పాట దగ్గర్నుంచి 'ఇన్నాళ్లకు గుర్తొచ్చానా వానా...' అనే త్రిష గీతం వరకూ మనకు గిలిగింతలు పెడతాయి. శనివారం సాయంత్రం చిరు జల్లులు మొదలైనప్పుడు హైదరాబాద్ నగర వాసులు కూడా ఇదే రకంగా ఊహాలోకాల్లో విహరించారు. కానీ అరగంట గడిచే సరికి సీను సితారైంది. సన్నగా కురిసిన వాన.. కొద్ది సేపటికే భారీగా, ఆ తర్వాత మరింత భారీగా మారి గంటపాటు ఏకధాటిగా దంచి కొట్టింది. గల్లీలు చెరువులను తలపించాయి. మ్యాన్హోళ్లు నోళ్లు తెరుచుకున్నాయి. ఎటు చూసినా నీళ్లే. రోడ్డు మీద బండి నడపాలన్నా, కాలు తీసి కాలు వేయాలన్నా భయమే. 'గాలి వానలో, వాన నీటిలో బండి ప్రయాణం... ఏ మ్యాన్ హోల్లో పడితే ఎక్కడ తేలతామోననే తెలియని భయం...' అని పేరడీగా పాడుకోవాల్సొచ్చింది. ఇంతకీ మన ధనిక రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ సాబ్.. కరీంనగర్ను డల్లాస్గానూ, వరంగల్ను ఇస్తాంబుల్గానూ, హైదరాబాద్ను విశ్వనగరంగానూ మారుస్తానంటూ గతంలో నొక్కి వక్కాణించారు. ఉమ్మడి రాష్ట్రంలో మాదిరిగా కాకుండా మన రాజధానిలో నీరు రోడ్ల మీదికి రాకుండా, పడ్డ చినుకు పడ్డట్టుగా నాలాల్లోకి పోయేట్టు చేస్తానంటూ బల్లగుద్ది మరీ చెప్పారు. అవన్నీ ఎప్పుడయ్యేనో.. ఏమో....
-బి.వి.యన్.పద్మరాజు