Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అనుమానం లేదు
అమ్మకడుపులో నేడు
అగ్ని పర్వతం రగులుతూ ఉంది
బద్దలైతే ప్రళయమే
వేయి కరోనాలకు మించిన విలయమే
పల్లె మన తల్లికదా బతికించుకుందాం
పల్లెబిడ్డ మన ప్రాణం, కాపాడుకుందాం!- ఒక్క మాటలో చెప్పాలంటే పల్లె వద్దనుకున్న, పల్లె వదిలేసిన బిడ్డలు వలస జీవులు. ఆ నేలపైనే ఊపిరిపోసుకుని, ఆ తల్లి మమతలు పంచుకుని, ఆ తల్లి చల్లని నీడలో తమకొక నీడను, జాడనూ సృష్టించుకుని, సవాలక్ష అననుకూలతల మధ్య తరతరాలుగా తనువు నిలుపుకున్న కష్ట జీవులు, కర్మ వీరులు. అలాంటి బిడ్డలను ఇక సాకలేక సెలవు చెప్పేసింది పల్లె తల్లి. ఊపిరి నిలుపుకునేందుకు వలసజీవులయ్యారు బిడ్డలు. జనారణ్యాలైన పట్టణాల బాటపట్టారు. ప్రభుత్వ లెక్కల ప్రకారమే నేడు మొత్తం జనాభాలో 29.9శాతం వలస జీవులు ఉన్నారు. ఇందులో ఇతర రాష్ట్రాలకు వలస వెళ్లినవారు 13.8శాతం. ఇతర జిల్లాకు వలస వెళ్లిన వారు 29.7శాతం. మొత్తం దేశంలో 50కోట్ల శ్రమ శక్తి ఉంటే అందులో 20శాతం అంటే, 10కోట్ల మంది వలస జీవులు. ఇదంతా సర్కారు లెక్క వాస్తవంలో వలస జీవులు ఇంకా అధికంగా ఉంటారు. దేశంలోని మొత్తం కార్మికుల్లో 82శాతం మంది అసంఘటిత రంగంలో పనిచేస్తుండగా, మొత్తానికి మొత్తం వలస జీవులకు అసంఘటిత రంగమే శరణ్యం. అసంఘటిత రంగంలో బాధ్యతలు తప్ప హక్కులు ఉండవు. వలసజీవులు బతుకులు యజమానులు, ప్రభుత్వ అధికారులు, స్థానిక నాయకులు, పోలీసులు గూండాల చేతుల్లో బందీలు. ఆటవిక నీతికి అలవాటై అత్తెసరు బతుకులు ఈడ్చు తున్నారు. రోజువారీ పనికి ఏమాత్రం హామీలేని స్థితిలో వీరి ఆదాయం నెలకు 7వేల నుంచి 12 వేల మధ్య మాత్రమే ఉంటుందని ప్రభుత్వ లెక్కలే చెబుతున్నాయి. కేవలం ప్రాణాలు నిలుపు కునేందుకు మాత్రమే సరిపోయే సంపాదతో కాలం వెల్లబుచ్చుతూ ఉన్న వీరిపై కరోనా మహమ్మారి విరుచుకుపడింది. కలలోనైనా ఊహించని కష్టాలను చవిచూపింది. పనికి భరోసా లేని బతుకులకు ప్రాణాలకే భరోసాలేదని చాటిచెప్పింది. దీంతో కోట్లాది మంది వలస జీవులు పుట్టిన ఊర్లకు పయనమయ్యారు. ఆ ప్రయాణం ఎంత నరకప్రాయమో అందరం కండ్లారా చూసాం. నిజానికి, పల్లెతో వారికి పని బంధం తెగిపోయినా, పేగుబంధం ఇంకా తెగలేదు కాబట్టి సరిపోయింది. లేకుంటే ఈ దేశం ఇప్పటికే కరోనా- ఆకలి కలిసి సృష్టించిన మహా విధ్వంసానికి శవాల గుట్టగా మారి ఉండేది. పొట్టకూటికోసం పట్నందారి పట్టిన వలస జీవి పల్లెతో తన పేగుబంధాన్ని ఇంకా తెంపుకోలేదు. వారికక్కడ పట్టెడు మెతుకులు లేకపోయినా నిలువ నీడ మాత్రం ఉంది. కూలేందుకు సిద్ధంగా ఉన్న ఆ గుడిశెల్లోనే ఇంకా తమ ముసలి తల్లి దండ్రులు, పిల్లలూ కాలమెల్లబుచ్చుతూ ఉన్నారు. పట్నంలో అంత గుడిసె సొంతం చేసుకునే అవకాశం లేకున్నా, పల్లెలో ఆ గుడిసెను కొనే నాధుడులేని కారణంగా అమ్ముకోవడం అసాధ్యమై అదైనా మిగిలింది. ఇప్పుడు ఆ గుడిసే వారికి ఆధారమయ్యింది. ప్రాణాలు నిలుపుకునేందుకు పనికి వచ్చింది. అందుకే ప్రాణాలకు నిలుపుకు నేందుకు ప్రాణాలకు తెగించి పల్లెదారి పట్టారు కోట్లాది జనం. పల్లె నిలువ నీడనిచ్చింది. చావు బతుకుల మధ్య బతుకుకు ఒక భరోసానిచ్చింది. అయితే, ఇకపై జీవికకకు ఇది చాలదు కదా? తమకు అక్కడ తిండి (పని) దొరకడం అసాధ్యమయ్యేకదా నాడు పల్లెను వదిలింది. మరి ఇప్పుడు ఆ పల్లెకు తమ ఆకలి తీర్చడం ఎలా సాధ్యం? ఇదీ ఇప్పుడు ప్రాణప్రదమైన ప్రశ్న.
దేశ స్వాతంత్య్రం నాటికి వ్యవసాయ రంగం 80శాతం ప్రజలకు జీవికను అందిస్తే నేడు ఆ శాతం గణనీయంగా కుదించుకుపోయింది. అయినా వ్యవసాయ రంగంలో ఉన్న చిన్న సన్నకారు రైతులకు సైతం నేడు వ్యవసాయం గిట్టుబాటు కాని దుస్థితి. సాంకేతికత కారణంగా దిగుబడులు పెరుగుతున్నప్పటికీ ఉత్పత్తి వ్యయం తీవ్రంగా పెరగడం, ఉత్పత్తుల ధరలు దారుణంగా పడిపోవడంతో కార్పొరేట్ కంపెనీలు, మధ్య దళారులు మాత్రమే వ్యవసాయం ప్రయోజన కరంగా తయారై వ్యవసాయాన్ని అమ్ముకునేవాడు తప్ప వ్యవసాయాన్ని నమ్ముకునేవాడు బతకలేని దుస్థితి దాపురించింది. కచ్చితంగా చెప్పాలంటే పల్లె ఇప్పుడు ఐసీయూలో ఉన్న అమ్మ. ఆ పల్లెను వదిలిన బిడ్డలే ఇప్పటి వరకూ అమ్మను బతికించుకుంటూ వస్తున్నారు. ఇప్పుడు అనివార్యంగా అమ్మపైనే ఆధారపడ్డారు. అదనపు భారమైన ఆ బిడ్డలను ఆ తల్లి బతికించుకోగలదా?
మరో వైపు దేశ ఆర్థిక వ్యవస్థకు పల్లెలనుంచి పట్టణాలకు వలస వచ్చిన వలసజీవులే వెన్నెముకగా ఉన్నారు. ఇప్పుడు ఆ వెన్నెముక విరిగింది. ఆర్థిక వ్యవస్థ కుదేలయ్యింది. పట్నాలలోని సమస్త రంగాలూ సంక్షోభంలో కూరుకుపోయాయి. వలస జీవి తిరిగి పట్నాలకు చేరుకోకుంటే ఆర్థిక వ్యవస్థ తిరిగి నిలబడడం అసాధ్యం. పట్టణాలకు తిరిగి రావాలంటే వారికి బతుకు భయం. పట్నంలో మరణం చివరి అంచును చూసిన వలస జీవులు, ఇంకా మహమ్మారి విలయతాండవం చేస్తున్న స్థితిలో అంత సులభంగా తిరిగి పట్టణాలకు వస్తారని భావించలేం. 'రారు' అన్న అభిప్రాయానికి రాబట్టే గ్రామాలలో చిక్కుబడిపోయిన వలస జీవులకు పనులు కల్పించేందుకు కేంద్రం ''ప్రధాన మంత్రి గరీబ్ కళ్యాణ్ రోజ్గార్ అభియాన్'' పథకాన్ని ఆగమేఘాల మీద ప్రకటించి అందుకు 50వేల కోట్లు కేటాయించినట్టు ప్రకటించింది. ఇన్నాళ్లకైనా ఈ పథకాన్ని ప్రారంభించేందుకు కారణం వారిపై ప్రేమ అనుకుంటే పొరపాటే సుమా! ఏనాటికైనా గ్రామాలలోని వలస జీవులు తిరిగి పట్టణాలకు రాకుంటే తమ ఆర్థిక ప్రయోజనాలు ఆవిరైపోతాయి. అందుకోసం వారిని ఎలాగైనా పట్టణాలకు రప్పించాలి. తమ మాటలపై వారికి విశ్వాసం పోయింది కనుక అందుకు కొంత సమయం పడుతుంది. ఆ సమయం వరకూ వారు బతికుండాలి కదా.. అందుకేన్న మాట ఈ పథకం.
2018 లెక్కల ప్రకారం మన దేశ సంపద 900లక్షల కోట్లు. అందులో 1శాతం వద్ద 51.5శాతం, 9శాతం వద్ద 17.1శాతం, 30శాతం వద్ద 17.8శాతం, 60శాతం వద్ద 4.7శాతం సంపద ఉంది. అంటే, 39శాతం ప్రజలది జీవన్మరణ పోరాటం కాదు. దేశంలోని 60శాతం ప్రజలది మాత్రం కచ్చితంగా జీవన్మరణ పోరాటం. వీరిని ఈ జీవన్మరణ పోరాటంలోకి నెట్టింది 51.5శాతం సంపదను చేజిక్కించుకున్న 1శాతం. ఇదే పెట్టుబడి దారీ వర్గానికి కుంభస్థానం. ఈ వర్గమే శ్రమ జీవుల ప్రధాన శత్రువు. ఈ వర్గాన్ని తీవ్రంగా ద్వేషించకుండా మనం శ్రామిక వర్గాన్ని ప్రేమించలేం. ప్రేమించినా వారి సమస్యకు శాశ్వత పరిష్కారం చూపించలేం. లాక్డౌన్ కాలంలో రోడ్డున పడ్డ కోట్లాది వలస జీవులకు పెట్టుబడిదారీ వర్గ ప్రతినిధులు ఎవ్వరూ పచ్చి మంచి నీళ్ళయినా పోయలేదు. పైపెచ్చు ఈ సంక్షోభాన్ని సొమ్ముచేసుకుంటూ లక్షల కోట్లు కూడ బెట్టుకున్నారు. ఒక్క అంబానీ ఆస్తే 2నెలల కాలంలో అమాంతం 1.68లక్షల కోట్లు పెరిగింది.
పెట్టుబడిదారుడు ఏమంటాడంటే, బతకడం మీ అవసరం. కాబట్టి మీ చావు చస్తూ మీ బతుకు మీరు బతకండి. సంపద సృష్టించడం మీ బాధ్యత. చస్తూ బతుకుతూ అయినా సంపద సృష్టించండి. మీరు సృష్టించిన సంపదను సొంతం చేసుకోవడం మా హక్కు. ఆ పవిత్ర కార్యాన్ని మాత్రం ప్రశ్నించ కండి. అందుకు అడ్డు పడకండి. ఇక పాలకుడు ఏమంటున్నాడంటే, అధికారం మా పూర్వజన్మ సుకృతం. అది మా పెట్టుబడిదారీ వర్గ ప్రయోజనా లకు మాత్రమే అంకితం. ఆ జ్ఞాపించడం మా హక్కు. ఆచరించడం మీ విధి. మీ విధిని మీరు నిర్వర్తించండి. లేదా మేం విధించే శిక్షను అనుభవించండి.
మొత్తానికి పెట్టుబడి దారుడూ పాలకుడు ఒక్కటైపోయారన్న మాట. అంటే ఒక్కశాతం ఒక్కటై పోయింది. మిగిలిన 99శాతమే ఒక్కటి కావాల్సి ఉంది. తల్లిని కాపాడుకోవాలన్నా, తల్లిలాంటి పల్లెను కాపాడుకోవాలన్నా, పల్లెను తల్లినీ తన కడుపున దాచుకున్న ఈ దేశాన్ని కాపాడుకోవాలన్నా అందరి మధ్యా అంతర సంబంధాన్ని అర్థం చేసుకుని 99శాతం ఒక తీరుకు రావడమే తిరుగులేని మార్గం.
కన్నీరు కరుగుతంది
నెత్తురు మరుగుతుంది
కరిగే కన్నీరు మరిగే నెత్తురూ కలిస్తే
కాషాయపు కుతంత్రం కాలి బూడిదవుతుంది!
కోప్ర