Authorization
Mon Jan 19, 2015 06:51 pm
తెలంగాణ రాష్ట్రంలో కోవిడ్ 19, కరోనా లక్షణాలు ఉన్నవారిని ఏ ప్రభుత్వ, ప్రయివేటు ఆస్పత్రులు చికిత్స అందించక అనేక ఇబ్బందులకు గురి చేస్తున్నాయి. జ్వరం, దగ్గు, తలనొప్పి, కీళ్ల నొప్పులు, జలుబు మొదలైన లక్షణాలు ఉండి ప్రయివేటు ఆస్పత్రులకు వెళ్తే ప్రతిరోజు రెండు లక్షల రూపాయలు కట్టాలని చెప్తున్నారు. కోవిడ్ 19 కరోనా లక్షణాలు ఉన్నవారిని ప్రభుత్వ ఆస్పత్రులకు వెళ్లాలని ప్రయివేటు ఆస్పత్రులు ఉచిత సలహాలను ఇస్తున్నాయి. ప్రభుత్వ ఆస్పత్రులకు వెళ్తే బెడ్స్, వెంటిలేటర్స్, ఆక్సిజన్ లేదని వారు నిరాకరిస్తున్నారు. అటు ప్రయివేటు, ఇటు ప్రభుత్వ ఆస్పత్రులు నిరాకరించడంతో ఎక్కడికెళ్లాలో తెలియని అయోమయ పరిస్థితుల్లో ప్రజలు అనేక ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కోవిడ్ 19, కరోనాపై యుద్ధం చేయడం అంటే మనం పోరాడాల్సింది వ్యాధితో కానీ రోగితో కాదని అన్ని భాషలలో టెలిఫోన్ రింగ్టోన్ పెడుతున్నప్పటికీ, కరోనా లక్షణాలు ఉంటే ఆస్పత్రులలో డాక్టర్లు, నర్సులు ఆమడ దూరం పరిగెడుతున్నారు.పరీక్షలు చేపించుకొన్న తర్వాత పాజిటివ్ అంటే కరోనా లక్షణాలు ఉన్నట్లు నిర్ధారణ అయితే క్వారంటైన్, శానిటైజేషన్, బారికేడ్లు ఏర్పాటు చేస్తూ, కోవిడ్ 19 అని రాసి పెట్టి నానా హంగామా సృష్టిస్తున్నారు. గ్రామాలలో, మురికి వాడలలో కరోనా బాధితులను ప్రజలు చూడగానే భయపడి పోయేలా ప్రవర్తిస్తున్నారు. కరోనా వచ్చిన గర్భవతులకు చికిత్స అందించడానికి ఏ ప్రభుత్వ, ప్రయివేటు ఆస్పత్రులు ముందుకు రావడం లేదు. దీనితో గర్భవతులైన మహిళలు ఏమి చేయాలో తెలియక భయభ్రాంతులకు గురవుతున్నారు. గతంలో కరోనా చికిత్స ప్రభుత్వ ఆదినంలోనే ఉండేది. గత కొన్ని రోజుల నుంచి ప్రయివేటు ఆస్పత్రులకు నిర్ణీత ఫీజును నిర్ణయించి, కోవిడ్ 19, కరోనా టెస్టులకు అనుమతించింది. ప్రయివేటు ఆస్పత్రులు దీనిని ఆసరాగా చేసుకుని ప్రజల నుంచి లక్షల రూపాయలను వసూలు చేసుకుంటున్నారు. సామాన్య, మధ్యతరగతి, దిగువ తరగతి, పేద, బడుగు, బలహీన వర్గాలవారు ప్రయివేటు ఆస్పత్రుల ఫీజులను చెల్లించుకోలేక పోతున్నారు. గత కొన్ని రోజుల నుంచి మాజీ శాసనసభ్యులకు, ప్రస్తుత శాసనసభ్యులకు, ఐఏఎస్, ఐపీఎస్లకు కరోనా వస్తే వారు మాత్రం లక్షల రూపాయలను ఖర్చుపెట్టి ప్రయివేటు ఆస్పత్రులలోనే చికిత్స తీసుకుంటున్నారు. తర్వాత హౌంక్వారంటైన్లో ఉంటున్నారు. పోలీసులుగాని, మున్సిపల్ సిబ్బంది గాని, డాక్టర్లుగాని, పారిశుద్ధ కార్మికులు గాని శానిటై జేషన్ పేరిట, క్వారంటైన్ పేరిట, బారికేడ్లు ఏర్పాటు చేయడం లాంటి హంగామా ఏమీ చేయడం లేదు. అదే పోలీసులకు గాని, డాక్టర్లకు గాని, నర్సులకు గాని, సామాన్య ప్రజలకు గాని కరోనా లక్షణాలు కనిపిస్తే చాలు వారి ఇంటి ముందు పెద్ద హంగామా సృష్టిస్తున్నారు. గత కొంత కాలం నుంచి డాక్టర్లకు, నర్సులకు, పోలీసులకు కూడా కరోనా వస్తుండడంతో ప్రయివేటు, ప్రభుత్వ ఆస్పత్రులలో ప్రతి ఒక్కరూ ఏ వ్యాధితో ఆస్పత్రికి వెళ్లినా కరోనా ఉందేమోనని భయపడిపోతున్నారు.
పోలీసులు కరోనా వచ్చిన వారి పేర్లను వాట్సాప్ గ్రూప్లో పోస్ట్ చేస్తే వారిపై చట్ట రీత్యా చర్యలు తీసుకుంటామని హెచ్చరిస్తున్నారు. ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియాలో సైతం కరోనా బాధితుల పేర్లను వెల్లడించకుండా కేవలం సంఖ్యను మాత్రమే చెబుతున్నారు. కానీ మున్సిపల్ సిబ్బంది, డాక్టర్లు, పారిశుద్ధ కార్మికులు శానిటైజేషన్, క్వారంటైన్ పేరిట, బారికేడ్లు కట్టడం లాంటివి చేస్తూ హంగామా సృష్టించడం విచారించదగ్గ విషయం. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం కరోనా బాధితులను మానవతా దృక్పథంతో చూడాలని, క్వారంటైన్ చేసిన వారికి పాలను, కూరగాయలను సక్రమంగా అందేటట్లు చూడాలని, ప్రజలు కోరుకుంటున్నారు. ప్రయివేటు ఆస్పత్రుల అధిక ఫీజులు నియంత్రించాలని ఆశిస్తున్నారు. కరోనాపై ప్రజలకు సరైన అవగాహన కల్పించి రోజు రోజుకు పెరుగుతున్న కరోనా కేసుల సంఖ్యను తగ్గించాలని కోరుతున్నారు. ప్రజలకు సరైన రీతిలో అవగాహన కల్పించాలి.
డాక్టర్ ఎస్.విజయభాస్కర్
సెల్: 9290826988