Authorization
Mon Jan 19, 2015 06:51 pm
భారతదేశంలో సరళీకృత ఆర్థిక విధానా లను అన్ని రంగాల్లో ప్రవేశపెట్టి, నేటి మాంద్యం పెరుగుదలకు కారణమైన పాలకులు, ఏ పార్టీలో ఉన్నా పరస్పరం ఒకరికొకరు అభినందనలు తెలుపుకోవటం ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. 1947 ఆగస్టు 15న స్వాతంత్య్రం పొందిన భారతదేశం 32కోట్ల జనాభాకు 5కోట్ల టన్నుల ఆహార ధాన్యాల ఉత్పత్తితో నిరంతరం ఇతర దేశాల నుంచి ఆహారధాన్యాల దిగుమతులపై ఆధారపడి ఉంది. పీఎల్480 షరతుల ప్రకారం దిగుమతులు చేస్తామన్న అమెరికాతో నాటి భారత ప్రభుత్వం విభేదించింది. ఆ తరువాత డాక్టర్ ఎంఎస్ స్వామినాథన్ ఆధ్వర్యాన 1965 నుంచి 1985వరకు 20ఏండ్లలో ''హరిత విప్లవాన్ని'' కొనసాగించి ఆహార ఉత్పత్తుల్లో స్వయం సమృద్ధి వ్యయం 100కోట్ల జనాభాకు 25కోట్ల టన్నుల ఆహారధాన్యాల ఉత్పత్తికి పెంచుకున్నాం. 196లో బ్యాంకులు జాతీయీకరణ చేశారు. అధికోత్పత్తి విత్తనాలను, హైబ్రిడ్ విత్తనాలను ప్రవేశపెట్టారు. రసాయనిక ఎరువుల వినియోగం, క్రిమిసంహారక మందుల వాడకం పెంచారు. అంతకుముందు లేని వ్యవసాయ శాఖను విస్తృత పరిచి ప్రతి గ్రామానికి విలేజ్ లెవల్ వర్కర్, విలేజ్ డెవలప్మెంట్ ఆఫీసర్లను నియమించి రైతులకు వెంట వెంట సలహాలు ఇచ్చారు. బ్యాంకుల జాతీయీకరణతో రుణాలు సకాలంలో రైతులకు లభించాయి. 1972లో ఆర్బీఐ మాజీ చైర్మన్ యం. నరసింహ్మాం ''గ్రామీణ బ్యాంకు లను'' ఏర్పాటు చేయాలని సూచించి అమలు చేశారు. సహకార సంఘాలు, వాణిజ్య బ్యాంకులు, గ్రామీణ బ్యాంకులు, తగినన్ని రుణాలు సమకూర్చాయి. పండిన పంటలకు గిట్టు బాటు ధరలు లభించాయి. ఆ విధంగా వ్యవసాయోత్పత్తులు 1990 నాటికి ఎగుమతులు చేసే దశకు చేరుకున్నాం.
భూ సంస్కరణల ఫలితాలు
భూసంస్కరణల చట్టాలు చేయడం రాజ్యంగం రీత్యా రాష్ట్ర జాబితాలో ఉంది. పి.వి. నరసింహ్మారావు 1971 సెప్టెంబర్ 30న ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కు ముఖ్యమంత్రిగా ఎంపికై 1973 జనవరి 10వరకు పనిచేశారు. ఆ కాలంలో ప్రధాని ఇంధీరగాంధీ భూసంస్క రణలు అమలు జరిపి ప్రజలను కాంగ్రెస్కు అనుకూలంగా మార్చాలని రాష్ట్ర ప్రభుత్వాలకు ఆదేశాలు పంపింది. ఆ సందర్భంగా పి.వి. ఆంధప్రదేశ్లో 1.1.1973న భూ సంస్కరణల చట్టం ఆమోదింప చేశారు. 10 నుంచి 53 ఎకరాలు కుటుంబానికి సీలింగ్ పెట్టడం వల్ల పేదలకు భూములు రాలేదు. కానీ తరువాత వచ్చిన ముఖ్యమంత్రి జలగం వెంగళరావు ఆ చట్టాన్ని 1.1.1975 నుంచి అమలు చేశారు. ఫలితంగా ఈ రెండు సంవత్సరాలలో భూస్వాములు తమ భూములను బినామి పేర్లతో మార్చుకున్నారు. ఆంధ్రప్రదేశ్లో 25ఎకరాలకు పైబడిన వారు 4,44,901 మంది భూస్వాములు మిగులు భూములు ఉన్నట్టు అర్జి పెట్టుకోగా 4,44,856 మంది దరఖాస్తులను పరిశీలించారు. ఈ పరిశీలనలో రాష్ట్రంలో మిగులు భూములు 7,91,701 ఎకరాలు ఉన్నట్టు తెల్చారు. కానీ, స్వాధీనం చేసుకున్నది 6,40,524 ఎకరాలు మాత్రమే. అందులో పంచింది 5,19,455 ఎకరాలు మాత్రమే. నాడు కోర్టు కేసులలో 2,745మంది లిటిగేషన్లు పెట్టారు. నేటికి ప్రత్యేక తెలంగాణలో 87,000 ఎకరాల మిగులు భూమి ఉన్నట్టు రికార్డులు చూపుతున్నాయి. తరువాత వచ్చిన ప్రభుత్వాలు కూడా భూసంస్కరణాలను ఫార్సుగా మార్చాయి. నాటి నుంచి నేటికి సీలింగ్కు మించి భూములు కలిగిన కమతాలు కొనసాగుతూనే ఉన్నాయి. సంస్కరణల పేరుతో ఎన్ని ప్రలోభపెట్టే ప్రచారాలు జరిగినప్పటికీ ఆర్థికం, ఆస్తుల విషయంలో మాత్రం భూస్వాములకు, పెట్టుబడి దారులకు ఈ సంస్కరణలు విపరీతమైన లాభాలను చేకూర్చి పెడుతున్నాయి. ప్రజలు చైతన్య వంతులై ఆందోళనకు పాల్పడినప్పుడు వారి దృక్పధాన్ని మళ్లించడానికి ఏదో ఒక సమస్యను తీసుకు రావడం జరుగుతున్నది. పి.వి. హయాంలోనే బీజేపీ ప్రభుత్వం రామజన్మభూమి, రామ మందిర నిర్మాణం పేరుతో శిలవ్యాస్ మొదలు పెట్టింది. కరసేవకులను సమీకరించి 1992 డిసెంబర్ 6న బాబ్రి మసీదును కూల్చి వేశారు. ఆ రోజు పార్లమెంట్ సమావేశంలో ప్రధాని పి.వి. పార్లమెంట్కు హామీ ఇస్తూ కూల్చివేత జరగనివ్వనని తగిన బలగాలను ఏర్పాటు చేశానని ఉదయం 11గంటలకు ప్రకటించారు. తిరిగి పివినే సాయంత్రం 5గంటలకే బాబ్రి మసీదు కూల్చబడిందని చావు కబురు చల్లాగా పార్లమెంటులో ప్రకటించారు. ఈ ఘటనతో పెద్ద ఎత్తున్న హింసాకాండ జరిగి వేల మంది ప్రాణాలు కోల్పోయారు.
1991 జూన్ 21న అధికారానికి వచ్చిన ప్రధాని పి.వి. నరసింహ్మారావు ఆర్థిక మంత్రి మన్మోహాన్సింగ్ కలిసి దేశంలో సంస్కరణలకు ప్రతిపాదనలు చేశారు. 1. నూతన ఆర్థిక విధానం, 2. నూతన వ్యవసాయ విధానం, 3. నూతన పారిశ్రామిక విధానం, 4. నూతన జౌళి విధానం, 5. నూతన విద్యా విధానం పేర్లతో సంస్కరణలకు ప్రతిపాదనలు చేశారు. ఈ సంస్కరణలు అభివృద్ధికి తిరోగమన దిశలో ఉన్నాయని పెద్ద ఎత్తున్న వ్యతిరేకత వచ్చింది. కానీ నాడు ధనిక దేశాలకు లొంగి దేశంలో మాంద్యం కొనసాగుతున్నదని, ఎగుమతి, దిగుమతుల లోటు భారీగా ఉన్నదని, ద్రవ్యలోటు 7.5శాతం ఉన్నదని బలవంతంగా సంస్కరణ లను ప్రతిపాదించి అమలు చేశారు. ఇందులో బాగంగా రూపాయి విలువను 18 నుంచి 19శాతం వరకు తగ్గించారు. ఈ తగ్గింపు ద్వారా ఎగుమతులు పెరుగుతాయని ప్రచారం చేశారు. కానీ రూపాయి తగ్గింపుతో తెచ్చిన అప్పులు ఆటోమెటిక్గా పెరిగాయి. అదే నేటికీ కొనసాగుతూ జూన్ 2020 నాటికి డాలరుకు రూ.76కు చేరుకుంది. తాత్కాలికంగా ఎగుమతులు పెరిగినా ఎగుమతి దిగుమతి వాణిజ్యంలో 12.87లక్షల కోట్ల లోటు (2018-19) కొనసాగుతూనే ఉంది. ప్రధాని పి.వి. నరసింహ్మారావు 1994 డిసెంబర్ 31 ఆర్థరాత్రి డంకెల్ ఒప్పందంపై భారతదేశం తరపున సంతకాలకు అంగీకరించారు. 1.1.1995 నుంచి గాట్ సంస్థ ''ప్రపంచ వాణిజ్య సంస్థగా'' మారింది. ఎగుమతి- దిగుమతి సుంకాల ఒప్పందానికే పరిమితమైన ఈ సంస్థ డబ్లూటీఓగా మారి వ్యవసాయ ఉత్పత్తులపైన, ఆయా దేశాలలో ఇస్తున్న సబ్సిడీలపై నియంత్రణను ప్రకటించింది. ఆ విధంగా 1995 మే 16 వరకు ప్రధానిగా పనిచేసిన పి.వి. నరసింహ్మారావు నేటి ఆర్థిక దుస్థితికి కారణమైన సంస్కరణలను ప్రవేశపెట్టాడు. ఆ ఆర్థిక సంస్కరణలు పేదల ఆస్తులను కొల్లగొట్టి గుత్త సంస్థలను ఆర్థికంగా అభివృద్ధిలోకి తెచ్చాయి. 1964కు పూర్వ ఆర్థిక వేత్తల జాబితాలోలేని రిలయన్స్ సంస్థ నేడు ప్రపంచ ధనికులలో 9వ స్థానానికి ఎగబాకి 64.6 బిల్లియన్ డాలర్ల ఆస్తులతో తుల తూగుతున్నది. ఈ సంస్కరణల ఫలితంగా భారతదేశంలో 56మంది అత్యంత ధనికులు బిల్లియనీర్లుగా ఉండగా, నేడు ఆ సంఖ్య 110కి చేరింది. పి.వి. ప్రవేశ ఈ పెట్టిన సంస్కరణల ఫలితంగా 1995 నుంచి నేటికి లక్షల సంఖ్యలో రైతులు, చేనేత కార్మికులు, విద్యార్థులు, చిన్న పరిశ్రమల వారు, చేతివృత్తులవారు, వ్యవసాయ కార్మికులు, నిరుద్యోగులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. ఏటా 12,600మంది ఆత్మహత్యలు దేశవ్యాప్తంగా కొనసాగుతూనే ఉన్నాయి. సంస్కరణలు ఈ ఆత్మహత్యలను పెంచుతూన్నాయే తప్ప కనీసం తగ్గించడం కూడా లేదు. స్వయం పోషకత్వం సాధించిన భారతదేశం ఆహార దిగుమతులపై ఆధారపడి ఏటా 2.5లక్షల కోట్ల నూనె, పప్పులు, పత్తి, పంచదార, మాంసం దిగుమతులు చేసుకుం టున్నారు. 1990-91లో 10,645 కోట్ల లోటు 2018-19 నాటికి 12.87లక్షల కోట్లకు చేరింది. సంస్కరణలలో సరళీకృత విధానాలతో పాటు ప్రయివేటీకరణ, ప్రపంచీకరణ కూడా అమలు జరుపుతున్నారు. లైసెన్స్సింగ్ విధానం రద్దు, నిల్వలపై పరిమితుల ఆంక్షలు రద్దు, సప్లయి డిమాండ్లకు ధరలు వదలడం, కార్మిక సంక్షేమ చట్టాలు రద్దు, ప్రభుత్వ ఆస్తులను, ప్రభుత్వ సంస్థలను, ప్రభుత్వ స్థలాలను అమ్మి ప్రయివేటీకరించడం, ఎగుమతి-దిగుమతి విధానంపై ఆంక్షలు తొలగించి దేశీయ మార్కెట్కు నష్టం కలిగే విధంగా విధానాలు అమలు జరపడం జరుగుతున్నది. ప్రపంచ మార్కెట్ పోటీకి తగినట్టు ధరలను తగ్గించి అమ్ముకోవాల్సిన స్థితి ఏర్పడింది. ధనిక దేశాల బెదిరింపులకు లొంగి నేటి బీజేపీ ప్రభుత్వం కూడా ఆ సంస్కరణలనే అత్యంత వేగవంతంగా అమలు చేస్తున్నది. 1991 నుంచి 2014 వరకు కాంగ్రెస్ ప్రభుత్వం 1,83,779కోట్ల విలువగల ఆస్తులను ప్రయివేట్ పరం చేయగా, 2014 నుంచి 2020 వరకు బీజేపీ ప్రభుత్వం 4,10,000కోట్ల విలువగల ఆస్తులను ప్రయివేటీ కరించింది. 18 బడా సంస్థలను పూర్తిగా అమ్మివేశారు. ఈ సంస్కరణలో భాగంగానే జాతీయం చేయబడిన 27బ్యాంకు లను 12బ్యాంకులుగా కుదించారు. జాతీయత నుంచి పక్కదారీ పట్టించారు. చివరికి బ్యాంకులలో మోసాలు కూడా లక్షల కోట్లలో పెరిగాయి.
నిన్నటి కోవిడ్లో వలస కార్మికులు 19కోట్ల మంది దిక్కు-దివాణం లేక అవస్థలు పడింది మన కండ్ల ముందున్నది. ఇదీ సంస్కరణలలో భాగమే. ఇలాంటి సంస్కరణలు మనం కోరుకుంటున్నామా? నేటి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఈ సంస్కరణలను వల్లిస్తూ కొంత మందిని ధనికులను చేయటానికి పథకాలు అమలు చేస్తున్నారు. ప్రజలను బిచ్చగాళ్ళుగా మారుస్తున్నారు. ఐదేండ్లు ప్రధాని లేదా ముఖ్యమంత్రిగా పనిచేసిన వారికి కలిగించా లంటున్న గౌరవాన్ని 25సంవత్సరాలకు పైన ముఖ్య మంత్రిగా పని చేసిన జ్యోతిబసుకు ఏ విధంగా విస్మరిస్తున్నారు. ప్రజల కొరకే పనిచేసిన నాయకులు ప్రస్తుత పాలకుల దృష్టికి రావడానికి ఇంతకన్నా నిదర్శనం ఏం కావాలి?
సారంపల్లి మల్లారెడ్డి
సెల్: 9490098666