Authorization
Mon Jan 19, 2015 06:51 pm
మానవాళి ముగింట్లో విశ్వ సమాచారాన్ని ప్రతిరోజు, ప్రతి క్షణం అందించే గురుతర బాధ్యతలను తమ భుజస్కంధాలపై వేసుకునే కర్తవ్య నిష్టాపరులుగా జర్నలిస్టులకు అపార గౌరవం ఉన్నది. సమస్యలను తెరపైకి తీసురావడమే కాకుండా వాటికి పరిష్కార మార్గాలను చూపడం, ప్రభుత్వాలను మేల్కొలపడం, అవినీతిని బహిర్గత పరచడం, స్కామ్లను తవ్వి వెలికి తీయడం, పలు అంశాలలో లోతైనవిశ్లేషణలు చేయడం, ప్రపంచవ్యాప్త క్షణక్షణ సమాచారాన్ని పాఠకులకు సత్వరమే చేరవేయడం లాంటి ఉత్తమ బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహించే ప్రత్యేక వృత్తిగా జర్నలిజానికి పేరుంది. మనిషి జీవితంలో క్రీడలకు ప్రత్యక్ష స్థానం ఉంటుంది. ఆటలు ఆడనివారు, తెలియని వారు ఉండరు. క్రీడలు మన జీవితంతో విడదీయరాని బంధాన్ని కలిగి ఉన్నాయి. ప్రతి పత్రికలో క్రీడలకు ఒక ప్రత్యేక స్థానం ఉంటుంది. స్థానిక-జాతీయ-అంతర్జాతీయ క్రీడా సమాచారం, క్రీడావార్తల పరిశోధనాత్మక వ్యాసాలు, క్రీడల పట్ల లోతైన విశ్లేషణలు, క్రీడాకారుల విశేషాలు, క్రీడా పోటీల వివరాలు లాంటి అనేక క్రీడాంశాలను పత్రికల ద్వారా అందించే నిపుణులనే క్రీడా జర్నలిస్టులు అనవచ్చు. క్రీడా జర్నలిస్టులకు జర్నలిజం డిగ్రీతో పాటు క్రీడల పట్ల లోతైన అవగాహన ఉంటాయి. కొంత మంది క్రీడా జర్నలిస్టులు క్రీడలలో శిక్షణ తీసుకుంటూ మంచి క్రీడాకారులుగా పేరు కూడా తెచ్చుకుంటారు. జూలై 2, 1924 రోజున ప్యారిస్ సమ్మర్ ఓలంపిక్స్ సందర్భంగా ఇంటర్నేషనల్ స్పోర్ట్స్ ప్రెస్ అసోసియేషన్(ఐయస్పిఏ) ఆవిర్భవించింది. 1994లో జరిగిన ఐయస్పిఏ 70వ వ్యవస్థాపక వార్షికోత్సవం సందర్భంగా జూలై 2న ప్రథమ ''ప్రపంచ క్రీడా జర్నలిస్టుల దినం'' నిర్వహించుట జరిగింది. క్రీడాభివృద్ధిలో క్రీడా జర్నలిస్టుల పాత్రను గుర్తు చేసుకుంటూ, వారికి కృతజ్ఞత లను తెలియజేస్తూ, అభినందించే వేదికగా ప్రతియేటా జూలై 2న ఈ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహిస్తారు. నేటి ఆధునికయుగంలో క్రీడలకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వబడింది. క్రీడలతో లక్షల కోట్ల వ్యాపారం జరుగుతోంది. స్థానిక స్థాయి నుంచి అంతర్జాతీయ స్థాయి క్రీడల వరకు ప్రతిదినం క్రీడలు జరుగుతూనే ఉంటాయి. క్రీడా విశేషాలను పత్రికల ద్వారా అందించే క్రీడా జర్నలిస్టులకు ఆటల పట్ల సంపూర్ణ అవగాహన, సాధికారత ఉంటుంది. ప్రపంచ శాంతి, అంతర్జాతీయ సంబంధాలు బలపడటానికి కూడా క్రీడలు దోహదపడతాయి.
ప్రపంచ దేశాలలో వారి వారి జాతీయ క్రీడా జర్నలిస్టుల సంఘాలు ఉన్నాయి. 1976 ఫిబ్రవరి 27న భారత క్రీడా జర్నలిస్టుల ఫెడరేషన్ ఏర్పడింది. ఇండియాలోని వివిధ రాష్ట్రాల క్రీడా జర్నలిస్టుల సంఘాలు జులై 2న ప్రపంచ క్రీడా జర్నలిస్టుల దినాన్ని ఘనంగా నిర్వహిస్తున్నాయి. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న లక్షల క్రీడామైదానాలలో జరిగే క్రీడావిశేషాలను నిష్పక్షపాతంగా, విశ్లేషణాత్మకంగా ప్రపంచ క్రీడాభిమానులకు అందించే కర్తవ్యాన్ని క్రీడా జర్నలిస్టులు నిర్వహిస్తున్నారు. క్రీడల ద్వారా మానవ సంబంధాలు, స్నేహభావం, క్రీడాశక్తి, నైపుణ్యాలు పెరుగుతాయి. ఉత్తమ స్థాయి క్రీడాకారులను ఆరాధించే అభిమానులు కోకొల్లలుగా ఉంటారు. క్రీడా వార్తలను అందించే జర్నలిస్టులకు కొన్ని ప్రత్యేక అర్హతలు ఉంటాయి. క్రీడా పరిజ్ఞానం వీరిలో ఎక్కువగా ఉంటుంది. ఓలంపిక్స్, ప్రపంచ క్రికెట్కప్, ఫూట్బాల్ వరల్డ్కప్, ప్రపంచ స్థాయి టెన్నీస్ లాంటి విశ్వక్రీడలు జరిగినప్పుడు ప్రపంచ క్రీడాభిమానుల దృష్టి క్రీడా ఫలితాలు, విజేతల మీద ఉంటుంది. ఈ క్రీడా వేడుకల నుంచి సమగ్ర క్రీడా సమాచారాన్ని ప్రపంచ నలుమూలలకు చేరవేసే బాధ్యతలను క్రీడా జర్నలిస్టులు తీసుకుంటారు. జూలై 2, 2020 రోజున క్రీడా జర్నలిస్టుల సేవలను గుర్తు చేసుకుంటూ, వారికి హృదయపూర్వక కతజ్ఞతలను తెలియజేద్దాం.
డా|| బుర్ర
మధుసూదన్రెడ్డి
సెల్: 9949700037