Authorization
Mon Jan 19, 2015 06:51 pm
రాజకీయ ఉపన్యాసాలు, ఎన్నికల ప్రసంగాలు ఎలా అయినావుండొచ్చు.. కానీ భారతదేశం, ప్రపంచం కూడా ఒక అసాధారణ ఆరోగ్య సవాలును, తత్ఫలితంగా మానవీయ సంఘర్షణనూ, ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంటున్న ప్పుడైనా పాలకులు ఆ తీవ్రతను ప్రతిబింబించేలా, ప్రజలను ఆదుకునేలా వ్యవహరించాలని కోరుకుంటాం. ప్రచార ప్రహసనాల్లో, నాటకీయ ప్రక్రియల్లో ఆరితేరిన ప్రధాని నరేంద్ర మోడీ వంటివారు అందులో సిద్ధహస్తులు కూడా. కానీ కరోనా విశ్వవ్యాధిగా విజృంభిస్తూ సవాలు పెంచుతున్న ప్రస్తుత తరుణంలో మాత్రం మోడీ సందేశాలు మొక్కుబడి తతంగాలుగా తయారవు తున్నాయి. మంగళవారంనాడు ఆయన ప్రసంగం ఆరిగిపోయిన రికార్డులా ఆగిపోయిన ప్రభుత్వ విధానానికి ఆక్షరాలా అద్దం పట్టింది.
సుదీర్ఘ కఠోర లాక్డౌన్ తర్వాతా కరోనా వైరస్ వ్యాప్తి పాజిటివ్ కేసులు మరణాలూ అన్ని పెరిగాయనే వాస్తవాన్ని దాటవేసి విజయం సాధించేశామనే పాతపల్లవి పునరాలాపన రాజకీయ దుస్సాహసమే. లాక్డౌన్ వైఫల్యంలో అమెరికా బ్రెజిల్ తర్వాత మన దేశమే అగ్రస్థానంలో ఉంది. మరణాలలో మొదటి నాలుగుదేశాలలోనూ పాజిటివ్ వ్యాప్తిలో తొలి రెండు మూడు దేశాలలోనూ స్థానం సంపాదించుకున్నాం. ఆచరణా లేదు. జూన్లో కరోనా ఎలా మాయమైపోతుందో లెక్కలు చెప్పిన నిటిఆయోగ్ సభ్యులు ఇప్పుడు గప్చిప్. ఆరోగ్యశాఖ మీడియాతో మాటలే మానేసింది. దేశంలో ఎనిమిది రాష్ట్రాలలోనే 85శాతం పాజిటివ్లు వున్నాయని లెక్క చెబుతున్న కేంద్రం కనీసం వాటికైనా అదనపు సహాయం, ప్రత్యేక వ్యూహం ప్రకటించిందా అంటే లేదు. ఆయా రాష్ట్ర ప్రభుత్వాలకే వదిలేసింది. అందుకు అవసరమైన నిధుల ఊసు మాత్రం మోడీ మర్చిపోయారు! 20లక్షల కోట్ల ప్యాకేజి బాకాలో వాస్తవానికి లక్షకోట్టు మాత్రమే నిజంగా నగదు రూపంలో ఉందని నిపుణులు తేల్చారు. కానీ మోడీ అదే జపం చేస్తుంటారు. ఎన్నికల ముందునాటి కిసాన్ యోజన, జన్ధన్ ఖాతాలలో డబ్బు ఇదే కరోనాకు సర్వరోగ నివారణిగా చూపించారు. మనిషికి ఇరవై కిలోల ధాన్యం అడిగిన వామపక్షాలు, ఇతరులు తర్వాత దాన్ని పదికిలోలకు తగ్గించు కున్నారు. కానీ కేంద్రం మాత్రం తలకు అయిదు కిలోలకు మించి ఇవ్వడానికి సిద్ధంగా లేదు. కాకుంటే కరోనా తగ్గిందంటూ గతంలో కోత కోసిన ఈ ఉచిత రేషన్ను మరికొంతకాలం పునరుద్ధ రించింది. మనిషికి పదికిలోలైతే అయిదుగురున్న ఇంటికి ఒక చిన్న బస్తా అయినా వస్తుంది. ఇప్పుడు అందరికీ కలసి అరబస్తా కూడా రాదు! కరోనాపై ఇదే మోడీ బ్రహ్మాస్త్రమన్న మాట. దీనికి తోడు అవాస్తవమైన ఒకే దేశం ఒకే రేషన్ నినాదం ఇస్తున్నారు ఒకే ఒక మోడీ!
లాక్డౌన్ ఆర్థిక మాంద్యం తర్వాత కనీసం 14కోట్లమంది పనులు కోల్పోయినట్టు అంచనా. మరో ఎనిమిది కోట్ల మంది వలస కార్మికులు రోడ్లపై పడ్డారు. వీరికి ఎలాంటి ఆదాయాలు లేవు. తిండి, మందులు కూడా కొనలేని స్థితి. మరోవైపున కొట్టు తెరచిన తర్వాత కూడా వ్యాపారాలు అంతంతగానే ఉన్నాయి. ఈ పరిస్థితులలో నగదు బదలి అన్నది ఉభయత్రా కొంతైనా ప్రయోజనమే గాక అత్యవసరం కూడా. అమెరికా వంటి సంపన్న దేశాలలో పై తరగతి వారికి కూడా బ్యాంకు ఖాతాలలో ప్రభుత్వం డిపాజిట్లు చేస్తుంటే ఈ పేద దేశంలో పరమ దీనస్థితిలో వున్న తరగతులకు కూడా ప్రత్యక్ష సాయం చేయడానికి మోడీ సిద్ధం కారు. ''అదియును నీ పతిప్రాణంబు దక్క'' అన్నట్టు మళ్లీ నగదు బదిలీ దాటేశారు. రూ.7500 నగదు అంటే ఇంటికి రోజుకు 250 మాత్రమే బదలాయించమని వెంటబడుతున్నా ఒప్పకోవడం లేదు. సహస్ర కోటీశ్వరులకు 12 లక్షల కోట్ల మేరకు రాయితీలు రుణాలు దోచిపెట్టడానికి వారికి ఎలాటి సమస్య లేదు. మైనస్ రేటుకు పడిపోయిన పెట్రోలు డీజిల్ ఉత్పత్తుల రేట్లు పదిసార్లు పెంచి మరీ రూ.80కి పైగా అమ్మడం వల్ల వచ్చే 2లక్షల కోట్లు ఇందుకు కేటాయించినా సరిపోతుంది కదా! అంటే కిమ్మన్నాస్తి. కరోనా పేరుతో ఎక్కువ పని చేయించుకుని తక్కువ జీతాలు ఇస్తున్న యజమానులనూ అసలే ఎగవేస్తున్న వారినీ దారికి తేవడానికి ఒక్క అడుగు వేయకపోగా వారికే అనుకూలంగా కార్మిక శాసనాలు కరిగిస్తున్నారు. 8లక్షల కోట్ల మంది వలస కార్మికులకు వందరోజుల పని కల్పిస్తానంటున్న కేంద్రం కేటాయించిన మొత్తం లక్షన్నర కోట్లు, కోటి మందికి వంద రోజులు పని కల్పించడానికే 2.4లక్షల కోట్లు కావాలి. కాబట్టి ఆ మొత్తంతో పల్లెల్లో పనులు ఇచ్చామనడంబూటకమే. వాస్తవానికి వ్యవసాయ కార్మికులకు కూడా పనులు లేవు! వచ్చే ఆశలు లేవు. గతంలో చేసిన ఉపాధి హామీ పథకం పనుల జీతాల బకాయిలే చాలా వున్నాయి.
ఈ నేపథ్యమంతటికీ కారణమైన వైరస్ వ్యాప్తిని ఎందుకు అరికట్టలేకపోయామన్న కనీస ఆత్మవిమర్శ లేకపోగా ఇంతటి వ్యాప్తి, ప్రాణనష్టం తర్వాత కూడా ఆత్మస్తుతిలోనే మునిగితేలడం మోడీ సర్కారుకే చెల్లింది. వైఫల్యం గుర్తిస్తే చర్యలు తీసుకోవాల్సి వస్తుందన్న సంకోచమే ఇందుకు కారణం. వాక్సిన్ వస్తే ముందు వైద్య సహాయ సిబ్బందికి ఎక్కించాలని మోడీ అనడంలో అర్థం వారికి అసలు రక్షణ లేకుండా పోయిందనే. వారికే లేకుంటే ఇక వారిదగ్గర చికిత్స చేయించుకునేవారి గురించి చెప్పేదేమిటి? పరీక్షలు ప్రాణప్రదమని రెండు మాసాల కిందటే చెప్పుకున్నా ఈనాటికి తగినయంత్రాంగం, నిర్దిష్ట నియమాలు లేవు. కార్పొరేట్లను దించింది లేదు. ఒకోచోట ఒక పద్ధతిగా మార్చి చెలగాటమాడు తున్నారు. ఐరాస కూడా అభినందించిన కేరళ నమూనా కనిపిస్తున్నా ఎందుకు స్వీకరించరంటే అందుకు అవసరమైన నిబద్దత, నిజాయితీ నిధుల కేటాయింపు చేయడం ఇష్టం లేకనే! పరీక్షలు ఎక్కడ ఎంతకు చేస్తారు, వ్యాధి వస్తే ప్రాథమికంగా ఎక్కడ చూపించుకోవచ్చు, నిపుణమైన చికిత్స ఎక్కడ ఎంతకు లభిస్తుంది? అయోమయ ప్రశ్నలై ప్రజలను వెన్నాడుతున్నాయి. ఏపీ, తెలంగాణలతో సహా రాష్ట్రాలు అనేక విధానాలు అనుసరించి క్లిష్టత పెంచాయి. వాటికే సాయమూ చేయని కేంద్రం పెద్దగా నిర్దేశాలు పంపగల స్థితిలో లేదు. వైరస్ను అడ్డుకునే జాగ్రత్తల విషయంలో ప్రజలలో కొంచెం ఉపేక్షాభావం వచ్చిందని మోడీ ఆరోపించారు. కానీ ప్రభుత్వాలలో అలసత్వాన్ని ఆలోచనారాహిత్యాన్ని ఏమంటారు? పతంజలి సంస్థ కరోనిల్ తయారు చేసి మార్కెట్లో వదలినదాకా కండ్లు మూసుకున్న పక్షపాతాన్ని ఏమనాలి? ఇన్ని ప్రసంగాల తర్వాత ప్రజారోగ్య రంగానికి నిధులివ్వకపోవాన్ని ఏమనాలి? ఓనం నుంచి చట్పట్ వరకూ దేశంలో వచ్చే ఎన్నో పండుగలను మోడీ ప్రస్తావించారు గానీ ఈ సంక్లిష్ట కర్తవ్యాన్ని, దాని పట్ల నిర్లక్ష్య పూరతమైన దాటవేతనూ విస్మరించారు. ఆర్థిక ఆహార భద్రతతో కూడిన ఆరోగ్య రక్షణ ఉద్యొగ భద్రత కల్పించ నంతవరకూ ఉపన్యాసాలు ఊకదంపుడే.
- తెలకపల్లి రవి