Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నలభైఐదేండ్ల క్రితం, 1975 జూన్ 25/26 అర్థరాత్రి ప్రాంతంలో భారత రాష్ట్రపతి ఒక బహిరంగ ప్రకటన విడుదల చేశాడు అది.. ''భారత రాష్ట్రపతి అయిన ఫకృద్దీన్ అలీఅహ్మద్ అను నేను భారత రాజ్యాంగంలోని 352వ ఆర్టికల్లోని క్లాజ్ (1) ప్రకారం నాకు ఇవ్వబడిన అధికారాల అమలులో భాగంగా, దేశంలో ఆంతరంగిక అల్లర్ల కారణంగా దేశానికి ముప్పు ఏర్పడే పరిస్థితి ఏర్పడుతుంది కాబట్టి దేశంలో అత్యవసర పరిస్థితి (ఎమర్జెన్సీ) ఉనికిలో ఉంటుందని బహిరంగంగా ప్రకటిస్తున్నాను.'' అప్పుడు నేను చండీఘర్ కేంద్ర పాలిత ప్రాంతానికి జిల్లా మెజిస్ట్రేట్గా ఉన్నాను. జయప్రకాశ్ నారాయణ (జేపీ), ప్రభుత్వానికి ప్రథమ విరోధిగా, నా ఖైదీగా ఉన్నాడు. కాబట్టి ఢిల్లీలో ఉన్నత స్థాయిలో జరిగే వాస్తవాలన్నీ నా అవగాహనలో ఉన్నాయి.
'ఒక ప్రజాస్వామ్య ప్రభుత్వాన్ని నిరంకుశ పద్ధతి ద్వారా' పాలించడానికి ప్రధానమంత్రి ఇందిరాగాంధీకి ఈ 'జాతీయ అత్యవసర పరిస్థితి' (నేషనల్ ఎమర్జెన్సీ) ఒక సాధనం అని చెప్పవచ్చు. భారత రాష్ట్రపతి బహిరంగ ప్రకటనతో, మన రాజ్యాంగంలోని ఆర్టికల్ 14, 21, ఆర్టికల్ 22లోని వివిధ క్లాజ్లలోని అంశాలు అమలు జరుగకుండా నిలిపివేశారు. ఒక్క మాటలో చెప్పాలంటే భారతదేశంలో ప్రజాస్వామ్యం లేకుండా పోయింది. అంతర్గత భద్రతా చట్టం, నియమ నిబంధనల నిర్వహణ కఠినతరం చేయబడ్డాయి. వాటిని సమీక్షించకుండా కోర్టులను కూడా అడ్డుకొని, దాదాపు లక్షమందికిపైగా ముందస్తుగా నిర్బంధించిన రాజకీయ ఖైదీలకు ఏ విధమైన ఉపశమనం కలిగించలేదు.
పౌరహక్కుల సంఘం నేత, రజనీకొఠారీ, ఇందిరాగాంధీ ఎమర్జెన్సీ యుగాన్ని, ''అది చర్చించడానికి అనుమతించని ప్రభుత్వం. మొత్తం దేశ నిర్మాణం పైన అదుపు సాధించిన ప్రభుత్వం. అదే విధంగా పాలక పార్టీ, దాని నాయకురాలు ఈ దేశాన్ని వారి స్వంత సొత్తుగా పరిగణించారు'' అని అన్నాడు. అది ప్రధానంగా సమాఖ్య సమాజంపైన కేంద్రీకరించబడిన అధికార యంత్రాంగం. ఆ కేంద్రీకరించబడిన అధికార యంత్రాంగాన్ని వ్యక్తిగతమైన ఉనికి కోసం, కుటుంబ ప్రతిష్ట కోసం ఉపయోగపెట్టుకున్నారు. అది దేశ వ్యాప్తంగా ప్రజలను మానసిక రోగులుగా మార్చి, భయకంపితులను చేసి తరిమి కొట్టిన దాడిగా వర్ణించాడు.
ఇదంతా అప్పుడున్న పరిస్థితి. మరి ఇప్పటి పరిస్థితి ఎలా ఉంది? మార్చి 24, 2020, ప్రధాని నరేంద్రమోడీ అదే రోజు అర్థరాత్రి నుంచి అమలు జరుగబోయే ఒక బహిరంగ ప్రకటన చేశాడు. అది.. ''గడిచిన రెండు రోజుల్లో, దేశంలోని కొన్ని ప్రాంతాలు లాక్డౌన్లో ఉన్నాయి. రాష్ట్ర ప్రభుత్వాలు ఈ చర్యలను చాలా క్రమశిక్షణతో చేసిఉండి ఉంటాయి. ఈ రోజు మన జాతి చాలా ముఖ్యమైన ఒక నిర్ణయాన్ని తీసుకుంటుంది. ఈ రోజు అర్థరాత్రి నుంచి మన దేశం మొత్తం లాక్డౌన్లో ఉంటుంది. మన దేశాన్ని, దేశ పౌరులను రక్షించుకునేందుకు, నేటి అర్థరాత్రి నుంచి ప్రజలు తమ ఇండ్ల నుంచి బయటకి రాకుండా పూర్తిగా నిషేధం విధిస్తున్నాం. దేశంలోని అన్ని రాష్ట్రాలు, అన్ని కేంద్రపాలిత ప్రాంతాలు, ప్రతి జిల్లా, ప్రతి మున్సిపాలిటీ, ప్రతి గ్రామం, ప్రతి ప్రాంతం లాక్డౌన్లో ఉంటాయి. ఇది ఒక కర్ఫ్యూ లాంటిది....''
ఈ ప్రకటన భారత రాజ్యాంగ పరిధిలోది కాదు. ప్రధాన మంత్రి అంగీకరించినట్టు గానే, రాష్ట్రాలు ఎపిడెమిక్ డిసీజెస్ ఆక్ట్, 1897లో సెక్షన్ 2లోని అధికారాన్ని ఉపయోగిస్తూ లాక్డౌన్ను విధించాయి. 'పూర్తి లాక్డౌన్'ను విధించడానికి ఉపయోగించిన 'డిజాస్టర్ మేనేజ్మెంట్ ఆక్ట్-2005' కేంద్ర ప్రభుత్వానికి ఆ విధమైన నిర్దిష్ట అధికారాలను ఇవ్వదు. ''విపత్తులను నిరోధించేందుకు, ఉపశమనం కలిగించేందుకు, సంసిద్ధతకు అవసరమైన చర్యలు తీసుకొనేందుకు'' మాత్రమే సెక్షన్ 6(2)(ఱ) కేంద్ర ప్రభుత్వానికి అధికారాలను ఇస్తుంది. ఈ నిబంధన మహమ్మారి విపత్తుకు సంబంధించినది కాదు. రాష్ట్ర ప్రభుత్వాలు సంబంధిత చట్ట పరిధిలో అప్పటికే లాక్డౌన్ను విధించినపుడు, వాటిని కాదని వారు విధించిన లాక్డౌన్తో పాటు దేశ వ్యాప్తంగా ఒక క్రూరమైన లాక్డౌన్ను (నాలుగు గంటల కన్నా తక్కువ సమయం ముందు నోటీసు ఇచ్చి) కేంద్ర ప్రభుత్వం విధించాల్సిన అవసరం లేదు. ఈ పరిస్థితి ఇలా ఉంది కాబట్టి, ఇది భయోత్పాతాన్ని, హింసాయుత చర్యలను ఉసికొల్పే పరిస్థితులను వ్యాప్తి చేసే నయా ఎమర్జెన్సీ (అత్యవసర పరిస్థితి)గా మారింది.
ఈ నయా అత్యవసర పరిస్థితి ఏ ఫలితాలు ఇచ్చింది? ఏ పద్ధతి, చట్టపరమైన అధికారం లేకుండా, ఇది దేశంలోని ప్రతి పౌరుడిని గృహ నిర్బంధంలో ఉంచి, రాజ్యాంగం కల్పించిన పౌర స్వేచ్ఛా, స్వాతంత్య్రాలను నిరాకరించింది. అదే విధంగా ఇది రాజ్యాంగం ప్రజలకు కల్పించిన 'జీవనోపాధి' హక్కును ఉపయోగించుకోకుండా అడ్డుకుంది. ఫలితంగా ప్రజలు అనేక మంది పేదరికానికి, దారిద్య్రానికి గురై, దిక్కులేని వారయ్యారు. ఇది ప్రతీ పౌరుడ్ని 'నేరస్తునిగా' పరిగణిస్తూ వారిపై 'పోలీసురాజ్య' క్రూరత్వాన్ని ప్రదర్శించేందుకు అనుమతించింది. కరోనా మహమ్మారి వ్యాప్తిని అరికట్టడంలో ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలపై అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్న వారిపై దేశద్రోహ ఆరోపణలు చేస్తూ, పౌరులలో, జర్నలిస్ట్లలో భయాందోళనలు సష్టించింది. ప్రజలను జంతువులుగా పరిగణిస్తూ, వారిని కొడుతూ, వారిపై రసాయనాలు స్ప్రే చేస్తూ, మానవులకు ఎంతో విలువైన గౌరవ, మర్యాదలను ప్రభుత్వం తీసివేసింది. మిలియన్ల సంఖ్యలో ఉన్న వలస కార్మికుల అవస్థలు, దాని ఫలితంగా అత్యంత బాధతో పెద్ద సంఖ్యలో తమ స్వస్థలాలకు వెళ్లి పోయిన తీరు అంతర్జాతీయ స్థాయిలో భారతదేశం సిగ్గు పడేట్టు చేశాయి.
ఇది నయా ఎమర్జెన్సీ కాబట్టి, ఆశ్రిత పెట్టుబడి విధానం ఉండి తీరుతుంది. అనేక లోతైన గాయాలతో దేశం రక్తం చిందించే సమయంలో ఇంకా అనేక మార్పులు చోటు చేసుకుంటున్నాయి. ఎలక్ట్రిసిటీ ప్రయివేటీకరణ, ప్రభుత్వ రంగ సంస్థల విక్రయం, కార్పొరేట్ల ప్రయోజనాల కోసం కఠినమైన కార్మిక చట్టాల అమలు, రక్షిత అడవులను ప్రజలతో సంబంధంలేని ప్రాంతాల్లో ఎన్నికల్లో గెలుపు కోసం ప్రయత్నం చేసే (కార్పెట్ బ్యాగర్స్) వారికి అప్పజెప్పడం, అనుకూలమైన వారికి పెద్ద పెద్ద కాంట్రాక్టుల అప్పగింత లాంటివి. ఇంకా బలవంతంగా వసూలు చేసిన చందాల ద్వారా ఏర్పడిన పీ.యం కేర్స్ నిధులకు లెక్కలు లేవు. ఢిల్లీ సెంట్రల్ విస్టాలో వైభవోపేతమైన పార్లమెంటు భవనం, ప్రధాన మంత్రి భవనాల నిర్మాణం వంటి మార్పులు జరుగుతున్నాయి.
ఈ నయా ఎమర్జెన్సీని, దాని అమలు తీరును నిజాయితీ గల నిపుణులు ఖండిస్తున్నారు. దానిని 'మనో వైకల్యం'గా పేర్కొంటూ, హార్వర్డ్స్ స్కూల్ ఆఫ్ పబ్లిక్ హెల్త్కు చెందిన విక్రం పటేల్ ఈ విధంగా అన్నాడు... ''అంటువ్యాధి స్థాయి తక్కువగా ఉన్నప్పుడు 'లాక్డౌన్'ను అమలు చేశారు. అంటువ్యాధి బాగా పెరిగి తీవ్రమైనప్పుడు, అసమర్థతకు నిర్లక్ష్య వైఖరితోడై మిలియన్ల ప్రజలను అంటువ్యాధి సోకని నివాస ప్రాంతాలకు తరలించారు. దాని వల్ల ఆర్థిక విపత్తులు, మహమ్మారి క్రూరత్వం గరిష్ట స్థాయికి పెరిగాయి. ఆర్థిక విపత్తులు, హింసాయుత వినాశనాన్ని సష్టించే లాక్డౌన్, సమూహ రోగనిరోధక శక్తుల సంకరంతో కూడిన ఈ ప్రతిభావంతమైన విధానం ఎక్కడి నుంచి వచ్చింది?''
ప్రముఖ మేథావి, తత్త్వవేత్త అయిన నోమ్ చామ్ స్కీ, నయా ఎమర్జెన్సీ అమలును ''జాతి సంహారం''గా పేర్కొన్నాడు. ''భారత ప్రధాని నరేంద్ర మోడీ పూర్తి లాక్డౌన్కు నాలుగు గంటల ముందు మాత్రమే హెచ్చరించాడు. అది ఒక బిలియన్పైగా ప్రజలపై ప్రభావాన్ని చూపింది. వారిలో కొంత మందికి ఎక్కడికి వెళ్ళాలో తెలియక ఇబ్బంది పడ్డారు. పెద్దసంఖ్యలో ఉన్న అసంఘటిత రంగ కార్మికులను యాజమాన్యాలు బలవంతంగా వెళ్ళగొట్టాయి. వేల మైళ్ళ దూరంలో ఉన్న తమ స్వగ్రామాలకు నడిచి వెళ్ళమని చెప్పారు. రోడ్ల వెంట చావండి అని అన్నారు. ఇది ఒక పెద్ద విపత్తు. నరేంద్రమోడీ ప్రధాన ఆలోచన, నేపథ్యాలుగా ఉన్న తీవ్ర మితవాద హిందూత్వ సిద్ధాంతాన్ని విధించేందుకు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు'' అని అన్నాడు.
చోమ్స్ కీ ఏమి చెప్పాలో అదే చెప్పాడు. ఇందిరా గాంధీ విధించిన ఎమర్జెన్సీ కాలంలో ప్రజలు సద్దుమణిగిన నిశ్శబ్దంలో గడిపారు. వింతైన, ఆశ్చర్యకరమైన చర్యలతో ప్రజలు భయబ్రాంతులకు గురయ్యారు. ప్రభుత్వ శాఖలు, వాటి అధికారులు ఒత్తిడికి లొంగిపోయి తమ ప్రభుభక్తిని చాటుకున్నారు. ఉన్నత న్యాయస్థానం ఎమర్జెన్సీ పాలనకు తలవంచి చెప్పిన విధంగా చేయడానికి అంగీకరించి, విధానపరమైన నిర్ణయాలు కూడా చేసింది. అదే విధంగా ఆ పాలనలో పౌరులందరికీ జీవించే హక్కుకూడా లేకుండా పోయింది. అన్ని రాజకీయ పార్టీలను ఏమీ చేయనీయకుండా బలహీన పరచింది. ఒక నిరంకుశ, దురహంకార ప్రభుత్వం పౌరులను 'అధీనులుగా' మార్చింది. ఇప్పుడున్న ప్రస్తుత పరిస్థితులు అప్పటి పరిస్థితులకు భిన్నంగా ఏమీలేవు. నయా ఎమర్జెన్సీ కాలంలో ప్రజాస్వామ్యబద్ధంగా నిర్వహించబడుతున్న సంస్థలు, వ్యవస్థలను ధ్వంసం చేశారు. భయోత్పాతం, హింసాయుత చర్యల ద్వారా పాలించడం కొత్తవిధానం. నోమ్ చోమ్స్ కీ, భారతదేశాన్ని 'నివసించదగని దేశంగా' పేర్కొనడంలో ఆశ్చర్యం ఏమీ లేదు.
ఇందిరా గాంధీ విధించిన ఎమర్జెన్సీ కాలంలో వలెనే ఇప్పుడు కూడా కేంద్ర మంత్రి మండలి ఉనికిలో లేదు. రాష్ట్రాలు పోషించే పాత్ర లేకుండా పోయింది. పార్లమెంట్లో మందబలంతో నాజీ తరహా పౌరసత్వ సవరణ చట్టాన్ని తెచ్చారు. మొత్తం దేశం ఆ చట్టానికి నిరసన తెలిపినపుడు మహిళలు, పిల్లలపై కూడా అత్యంత క్రూరంగా 'పోలీసు రాజ్యాన్ని' ప్రయోగించారు. ఇప్పుడు లాక్డౌన్లో అంతటా ముఖ్యంగా ఢిల్లీ, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాల్లో పోలీసులు నిరసనకారులపై దేశ ద్రోహం కేసులు మోపుతూ, వారిని వెంబడించే పనిలో ఉన్నారు. చిన్న చిన్న కారణాలతో యువకులు, విద్యార్థులపై ఎఫ్ఐఆర్ నమోదు చేసి వారిని నిర్భందించే పనిలో నిమగమయ్యారు. క్రూరమైన నేరాలకు ఉసిగొల్పి, వాటికి పాల్పడిన హిందూత్వ శక్తులను రక్షించేందుకే ఈ చర్యలు చేస్తున్నారు.
సాత్విక స్వభావి, ప్రజా మేథావి అయిన హర్ష మందిర్ను కూడా వదలడం లేదు. పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేక నిరసనలలో యువకులను శాంతియుతంగా ఉండాలని, ''గాంధీ అహింసా'' మార్గాన్ని అనుసరించాలని యువకులను కోరినందుకు ఆయనను అరెస్ట్చేసి, కోర్టులో హాజరుపరుస్తారని అనుకుంటున్నారు. ఔను మరి! ద్వేషం, హింస, అసహనాలతో కలుషితమైన వాతావరణంలో శాంతి, అహింసలు వాస్తవంగా నేరాలే! హర్ష మందిర్ 2002లో జరిగిన గుజరాత్ 'జాతి సంహారం' తరువాత తన ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్ ఉద్యోగానికి రాజీనామా చేశాడు. ఆ జాతి సంహారాన్ని 'నాజీ-తరహా హింసగా', పేర్కొన్న మొదటి వ్యక్తి ఆయనే. కాబట్టి ఆయనకు వ్యతిరేకంగా కోపం ఎందుకు వచ్చిందో మనకు అర్థం అయింది. కానీ ఢిల్లీ పోలీసులు అంత నీచస్థాయికి దిగజారరని కోరుకుందాం.
ప్రస్తుత నయా ఎమర్జెన్సీ స్వభావం, అంతర్గత విషయాలు భిన్నమైనవి అయినప్పటికీ అప్పటి ఎమర్జెన్సీకీ, భయోత్పాతంతో, హింసాయుత చర్యలతో సాగుతున్న ప్రస్తుత పాలనకు మధ్య ఒక ఉమ్మడి లక్షణం ఉంది. ఈ రెండింటి మధ్య ఉన్న తేడా ఏమంటే, అప్పుడు అనుసరించిన పద్ధతి 'ఝట్కా' ( సిక్కు మతాచారం ప్రకారం ఒక్క వేటుతో జంతువు తల నరకడం) అయితే, ఇప్పుడు అనుసరిస్తున్న పద్ధతి (ముస్లిం మతాచారం ప్రకారం జంతువు తల తప్పించడం) 'హలాల్'. కానీ స్వేచ్ఛా, స్వాతంత్య్రాల పైన ఉండే ఈ రెండింటి ప్రభావం మాత్రం ఒకే విధంగా ఉంటుంది. బహుశా, ఇప్పుడు మరింత హింసాయుతంగా, భయానకంగా ఉండొచ్చు!
1975లో ఎమర్జెన్సీ కాలంలో ఇందిరాగాంధీ, జయప్రకాష్ నారాయణ మధ్య జరిగిన ప్రత్యక్ష పోరులో ఇందిరాగాంధీ ఓడిపోయింది. ఎమర్జెన్సీ కాలంలో భారతదేశాన్ని సందర్శించి, ఇందిరాగాంధీని కలిసిన తర్వాత, క్లైర్ స్టెర్లింగ్ అనే రచయిత్రి, న్యూయార్క్ టైమ్స్ పత్రికలో ''రూలర్ ఆఫ్ 600 మిలియన్ - అండ్ అలోన్'' అనే వ్యాసం రాసింది. ఆమె దానిలో చెప్పిన విషయాలు చాలా తీవ్రంగా ఉన్నాయి. ''ఈ దేశాన్ని ప్రజాస్వామ్యయుతంగా ఒప్పించడం ద్వారా పాలించడం కన్నా బలవంతంగా పాలించడానికి ప్రయత్నించడం అద్వాన్నమైన విషయం. అయినా ఇందిరాగాంధీ ఆ ప్రయత్నం ఎలా చేస్తుందో చూడండని, నేను భారతదేశంలో తిరిగే సమయంలో ఎవరో ఒక వ్యక్తి నాతో అన్నాడని చెప్పింది.''
అప్పుడు ''ఉక్కు మహిళ'' విఫలం అయ్యింది. ఇప్పుడు మాత్రం ఎందుకు భిన్నంగా ఉంటుంది? ''గతం నుంచి పాఠాలు నేర్వని వారికి భవిష్యత్తు ఉండదు'' అని ఒక వివేకవంతుడు అన్నాడు.
- యం. జి. దేవసహాయం
(రచయిత మాజీ ఆర్మీ అండ్ ఐఏఎస్ అధికారి)
''న్యూస్ క్లిక్'' సౌజన్యంతో
అనువాదం:బోడపట్ల రవీందర్,
సెల్: 9848412451