Authorization
Mon Jan 19, 2015 06:51 pm
-నేడు అఖిల భారత నిరసన దినం
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కోవిడ్-19 లాక్ డౌన్ గేట్లను ఎత్తేశాయి. ఇక కరోనా మహమ్మారి తన విశ్వరూపాన్ని ప్రదర్శిస్తున్నది. దేశంలో జూన్ 30నాటికి 5,68,315 మందికి కరోనా సోకితే, 16,917 మంది మరణించారు. మన తెలంగాణలో 15,394 మందికి కరోనా వస్తే 253 మంది మరణించారు. దేశ రాజధాని సహా మహానగరాలన్నీ కరోనా కల్లోలంలో చిక్కుకుని విలవిలలాడు తున్నాయి. ఏప్రిల్, మే నెలల్లో లాక్డౌన్ అమలు కాలంలో కరోనా పరీక్షలు చేయటంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఘోరంగా విఫలం కావడంవల్లనే ముందు వరుసలో నిలబడి పోరాడిన సిబ్బంది, పోలీసులు, జర్నలిస్టులు తదితర ముఖ్యమైన వారిని కరోనా కాటువేస్తూనేవుంది. వివిధ తరగతుల ప్రజలు ఈ మహమ్మారికి బలవుతూనే ఉన్నారు.
లాక్డౌన్ విధించిన మార్చి 24 నుంచి ఆర్థిక, వాణిజ్య, ఉత్పత్తి, ట్రాన్స్పోర్ట్ తదితర కార్యకలా పాలన్నీ నిలిచిపోయాయి. దీనితో ప్రజలంతా ఎక్కడి వారక్కడే బంధింపబడ్డారు. ఎమెర్జెన్సీ సర్వీసుల్లో పని చేసేవారు తప్ప మిగిలిన అన్ని రంగాల కార్మికుల పనులు ఆగిపోయాయి. ఈ లాక్డౌన్ కాలంలో ప్రభుత్వ - ప్రయివేట్ రంగాల్లో పని చేసే కార్మికులను తొలగించొద్దని, ఈ కాలానికి పూర్తి వేతనాలు చెల్లించాలని కేంద్ర ప్రభుత్వం ఆదేశాలిచ్చింది. వలస కార్మికులకు షెల్టర్లు ఏర్పాటు చేసి, భోజన, ఆరోగ్య వసతి ఏర్పాటు చేయాలన్నది. వేతనాల చెల్లింపుపై రాష్ట్ర ప్రభుత్వం, కార్మిక శాఖ జీఓలు 45, 161 జారీ చేశాయి. కానీ ఆచరణ దీనికి పూర్తి భిన్నంగా ఉన్నది. అనేక పరిశ్రమల్లో ఉద్యోగులను తగ్గించి, వేతనాలకు కోత పెట్టారు. కాంట్రాక్టు, క్యాజువల్ కార్మికులను డ్యూటీల్లోకి తీసికోలేదు. రాష్ట్రంలో పవర్లూం, చేనేత రంగాల్లో వేలాదిమందికి ఉపాధి పోయింది. సినిమా హాళ్ళూ, హోటళ్ళు, ప్రయివేట్ కాలేజీలు, హాస్పటల్స్ సిబ్బందికి వేతనాలే ఇవ్వలేదు. కేంద్ర ప్రభుత్వ రైల్వే శాఖల్లోని కాంట్రాక్ట్, ఔట్సోర్సింగ్ మొదలుకొని రాష్ట్ర ప్రభుత్వ ఆర్టీసీ సంస్థల్లోని అద్దె బస్ల సిబ్బంది, గ్యారేజీల్లోని కాంట్రాక్టు కార్మికులకు వేతనాలు ఇవ్వలేదు. మన రాష్ట్రంలో లక్షల సంఖ్యలో వున్న భవన నిర్మాణం, బీడీ, ప్రయివేట్ ట్రాన్స్పోర్ట్, ఆటో, ఇంటిపని వారలు, తోపుడుబండ్లు, మెకానిక్లు, షాపింగ్ మాల్స్ తదితర రంగాల్లోని లక్షలాది కార్మికుల బతుకులు చిన్నాభిన్నం అయ్యాయి. ప్రభుత్వ స్కూల్స్ బంద్ కావడంతో వేలాది మంది మధ్యాహ్నా భోజన, స్వచ్ఛ కార్మికులకు ఉపాధి పోయింది. కరోనా వైరస్పై ముందు వరుసలో ఉండి యుద్ధం చేస్తున్నారని విమానాల మీద నుంచి పూలు కురిపించిన పాలకులు, వీరికి కనీస భద్రత పరికరాలు మాస్క్లు, గ్లౌజులు, పీపీఈ కిట్స్ కూడా అందించలేని దుస్థితి ఏర్పడింది. ఫ్రంట్లైన్ వర్కర్స్కు రూ.50లక్షల ఇన్సూరెన్స్ గూర్చి గొప్పలు చెప్పిన మోడీ ప్రభుత్వం.. ఆచరణ ఎలాంటి నిర్దిష్ట చర్యలూ చేపట్టలేదు. ధనిక రాష్ట్రమని జబ్బలు చరుచుకుంటున్న ముఖ్యమంత్రి ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్ల వేతానలకు కోతపెట్టారు.
కేంద్ర ప్రభుత్వం అంతః రాష్ట్ర వలస కార్మికుల చట్టం 1979ని అమలు చేయకుండా వలస కార్మికులను బిచ్చగాళ్ళ స్థాయికి దిగజార్చింది. కనీసం వారిని స్వంత ఊళ్ళకు పంపాలనే సోయికూడా లేకుండా అమానుషంగా ప్రవర్తించారు. ప్రజా స్వామ్యంలో ప్రభుత్వాలు, చట్టాలు, కోర్టులు సహితం లాక్డౌన్ బాధితులైన శ్రామిక జనాన్ని ఆదుకోవటంలో ఘోరంగా వైఫల్యం చెందాయి.
ఉపాధి పోయి, ఆదాయాలులేక ఆకలితో అలమటిస్తున్న కార్మికులు, పేదలందరికీ ప్రతినెలా రూ.7500 నగదు, ప్రతి మనిషికి 10కిలోల చొప్పున బియ్యం లేదా గోధుమలు ఇవ్వాలని కేంద్ర కార్మిక సంఘాలు అనేకసార్లు ప్రధాన మంత్రి నరేంద్ర మోడీకి విజ్ఞప్తి చేశాయి. దేశంలో వివిధ రాష్ట్రాల్లో చిక్కుకుపోయిన సుమారు 14కోట్లమంది వలస కార్మికులకు ఉచిత రవాణా కల్పించి, సురక్షితంగా వారి ఊళ్ళకు చేర్చాలని చేసిన విజ్ఞప్తినీ ఖాతరు చేయలేదు. పట్టణాల్లో పనులు కోల్పోయి. గ్రామాలకు చేరిన శ్రామికులకు ఉపాధి హామీ పథకం క్రింద 200రోజులు, రోజుకు కనీస వేతనం రూ.600 ఇవ్వాలని ట్రేడ్ యూనియన్లు, వ్యవసాయ కార్మిక సంఘాలు మొరపెట్టుకున్నా ఈ ప్రజావ్యతిరేక ప్రభుత్వం వినలేదు. ఈ నేపథ్యంలో ఏప్రిల్ 21న దేశవ్యాపితంగా లక్షలాది మంది కార్మికులు ప్లకార్డులతో రోడ్డెక్కి నిరసనలు తెలిపారు. వలస కార్మికులు లాక్డౌన్ నిబంధనలను పట్టించుకో కుండా, తమను స్వంత ఊళ్ళకు పంపాలని రైల్వే స్టేషన్లపై దండెత్తారు.. పోలీసు లాఠీచార్జీలు, బాష్ప వాయువులను సైతం లెక్కచేయ కుండా సమరశీలంగా ప్రతి ఘటించారు. కరోనా సాకుతో కార్మిక చట్టాలను రద్దు చేసి, పని దినాన్ని 12గంట లకు పెంచిన బీజేపీ, ఇతర రాష్ట్ర ప్రభుత్వాల చర్యలను కేంద్ర, కార్మిక, ఉద్యోగ సంఘాలు మే 22న ఐక్యంగా నిరసించాయి. తమ ఉపాధిని కాపాడాలని, వేతనాలివ్వాలని, కార్మిక హక్కులను కాలరాయొద్దని, రుణ మాఫీ చేయాలని, ఉపాధి హామీకి నిధులు పెంచాలని, పెట్రోల్, డీజిల్ రేట్లు తగ్గించాలని, బొగ్గుగనులను, ఆర్డినెన్స్ ఫ్యాక్టరీలను ప్రయివేటీకరించొద్దని, విద్యుత్ చట్టం, నిత్యావసర సరుకుల చట్టం, వ్యవసాయ ఉత్పత్తుల సేకరణ, మార్కెటింగ్ చట్టాలను సవరించొద్దనే నినాదాలు దేశవ్యాపితంగా ప్రతి ధ్వనించాయి. లాక్డౌన్ నిబంధనలను పాటిస్తూనే తమ న్యాయమైన హక్కుల కోసం, జీవన భద్రత కోసం ఉద్యమ బాటలో నడిచింది శ్రామికవర్గం.
కరోనా మహమ్మారిని అడ్డం పెట్టుకొని కేంద్ర బీజేపీ ప్రభుత్వం కార్మిక, ప్రజావ్యతిరేక విధానాలను దూకుడుగా అమలు చేస్తున్నది. లాక్డౌన్ వల్ల తీవ్ర కష్టాలెదుర్కొన్న అసంఘటిత, కాంట్రాక్టు, వలస కార్మికులను ఆదుకునేందుకు నిరాకరించింది. సీఎంఐఈ నివేదిక ప్రకారమే సుమారు 24కోట్లమంది ఉపాధి కోల్పోతే వారికి రక్షణనివ్వలేదు. దేశంలో సుమారు 15కోట్ల సూకë, చిన్న, మధ్య తరహా పరిశ్రమలు ఆర్థిక సంక్షోభంలో చిక్కుకుంటే, వాటికి ఆర్థిక సహకారం ఇచ్చి, కోట్లాది మంది కొలువులను కాపాడేందుకు ఎలాంటి చర్యలూ గైకొనలేదు. మరోవైపు డీజిల్, పెట్రోల్ రేట్లను కనీవినీ ఎరుగని రీతిలో పెంచుతూ, సామాన్య, మధ్యతరగతి ప్రజల నడ్డివిరుస్తున్నది. లాక్డౌన్ కాలమంతా, రాష్ట్ర ప్రభుత్వాలకు ఆదేశాలివ్వడం, ప్రధానమంత్రి టీవీలో సూక్తులు, నీతులు చెప్పటం తప్ప, కరోనా కట్టడికి సరిపడా నిధులే కేటాయించలేదు. ఈ స్థితిలో బీజేపీ ప్రభుత్వం పట్ల ప్రజల్లో పెరుగుతున్న అసంతృప్తిని పసిగట్టిన ప్రధానమంత్రి మోడీ రూ.20 లక్షల కోట్ల ప్యాకేజీ ప్రకటించి, ప్రజలను మభ్య పెట్టేందుకు మరో కుట్రకు తెరలేపారు. ఈ ఆర్థిక ప్యాకేజీలో అధిక భాగం బడా పెట్టుబడిదారులకు, సంపన్నులకు రుణాలు, గ్రాంటులే తప్ప ఉపాధిలేక, ఆదాయాలు కోల్పోయి ఆకలితో అలమటించే సామాన్యులకు ఒరగబెట్టిందేమీ లేదు. ఈ కాలంలో కేంద్ర ప్రభుత్వ నయా ఉదారవాద, దోపిడీ విశ్వరూపం మరింత నగంగా బయటపడింది. లాక్డౌన్లోనూ బడాపెట్టుబడి దారుల లాభాలను కాపాడేందుకే ప్రభుత్వం బరితెగించింది. సంఘం పెట్టుకునే హక్కును, సమిష్టి బేరసారాల హక్కులను కాలరాస్తున్నది. కార్మిక చట్టాలను సస్పెండ్ చేయటం, పని దినాన్ని 12గంటలకు పెంచుతూ కేరళ మినహా చాలా రాష్ట్రాల్లో ఆర్డినెన్స్లు తెచ్చారు. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల డిఎను ఫ్రీజ్ చేశారు. కీలకమైన బొగ్గు, రక్షణ, రైల్వే, ఇన్సూరెన్స్, బ్యాంకింగ్, ఫార్మా, విమానయానం, అంతరిక్షం, అటామిక్ ఎనర్జీతో సహా అన్ని రంగాల్లోకి ఎఫ్డీఐలు, ప్రయివేటు పెట్టుబడులకు తలుపులు బార్లా తెరిచింది. ప్రభుత్వ రంగ సంస్థల లూఠీ, సహజ వనరులను తెగనమ్మటం నిరాటంకంగా కొనసాగిస్తున్నది. బీజేపీ ప్రభుత్వ దేశభక్తి ముసుగు తొలగి, దాని వర్గ స్వభావం బట్టబయలౌతున్నది.
కార్మికుల, పేదల ఆకలి కేకలను, ఆత్మహత్యలను గుర్తించ కుండా, అమానుషంగా వ్యవహరిస్తున్న పాలకులకు బుద్ధి చెప్పేందుకే జులై 3న దేశవ్యాపిత ప్రతిఘటనకు కార్మిక-ఉద్యోగ సంఘాలు సన్నద్ధమైనాయి. 10 కార్మిక సంఘాలతో పాటు ఇన్సూరెన్స్, బ్యాంకింగ్, రక్షణ, ఫార్మా, కమ్యూనికేషన్ రంగాలతో పాటు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల సమాఖ్యలు ఐక్యంగా అఖిల భారత నిరసన దినంలో పాల్గొంటున్నాయి. 50 బొగ్గు బ్లాకులను ఈ-వేలం ద్వారా ప్రయివేటు వ్యక్తులకు కారుచౌకగా కట్టబెట్టడాన్ని నిరసిస్తూ బొగ్గు రంగంలోని ఐదు కేంద్ర కార్మిక ఫెడరేషన్లు జులై 2, 3, 4 తేదీల్లో 78 గంటల సమ్మె భేరి మ్రోగించాయి. రక్షణ రంగానికి వెన్నుముకగా నిలిచిన 41 ఆర్డినెన్స్ ఫ్యాక్టరీలను కార్పొరేటీకరణ పేరుతో నిర్వీర్యం చేసే కుట్రలు, రక్షణ ఉత్పత్తుల్లోకి ప్రయివేటు, బహుళ జాతి సంస్థలకు పెద్దపీట వేస్తున్న బీజేపీ ప్రభుత్వ విధ్వంసక చర్యలను ప్రతిఘటించేందుకు ఎఐడీఇఎఫ్తో పాటు మరో రెండు కేంద్ర ఫెడరేషన్లు నిరవధిక సమ్మెబాటలో ముందుకు సాగుతున్నాయి.
జులై 3న జరుగుతున్న అఖిల భారత నిరసనోద్యమంలో తెలంగాణలోని ప్రధాన కార్మిక - ఉద్యోగ సంఘాలు ఐక్యతా స్ఫూర్తితో నడుస్తున్నాయి. స్వదేశీ - విదేశీ కార్పొరేట్లకు దాసోహం చేస్తున్న కేంద్ర పాలకుల విధానాలను సహించబోమనే హెచ్చరిక చేస్తున్నాయి. మన రాష్ట్రంలోనూ ఏకపక్ష, నిరంకుశ విధానాలను విడనాడకపోతే ప్రతిఘటన తప్పదని టిఆర్ఎస్ ప్రభుత్వాన్ని ట్రేడ్ యూనియన్లు హెచ్చరిస్తున్నాయి. కేంద్ర, రాష్ట్ర పాలకులు తమ విధానాలను మార్చుకోకపోతే భవిష్యత్లో మరిన్ని మిలిటెంట్ పోరాటాలకు, సార్వత్రిక సమ్మెలకు కార్మిక - ఉద్యోగ సంఘాలు సన్నద్ధమౌతాయని తెలిపేందుకే ఈ పోరాట శంఖారావం.
ఎం. సాయిబాబు
సెల్:9490098030