Authorization
Mon Jan 19, 2015 06:51 pm
''నేను ప్రతిదీ లెక్కగట్టగలను. కాంతి వెలాసిటీని కూడా లెక్కగట్టగలను. కానీ, మనిషి నవ్వు వెనక దాగిన ఈర్ష్య, ఆసూయ, కుట్ర - కుతంత్రాల్ని లెక్కగట్టలేను.''
- ఆల్బర్ట్ ఐన్స్టీన్.
విజ్ఞానశాస్త్రంలో పరమ సత్యాలు, పరమ గ్రంథాలు, పరమ వ్యక్తులూ ఉండరు. ఆలోచనలో బలముంటే, నిరూపణలుంటే ఎన్ని రకాల అణచివేతలు ఎదురైనా విజ్ఞాన శాస్త్రం నిలబడుతుంది. శాస్త్రవేత్తల్ని చీకటి గదుల్లో బంధించినా, చిత్రహింసలకు గురిచేసినా, చివరకు చంపేసినా వారి కృషి నిలబడుతుంది. నిలబడుతూ వస్తున్న విషయం మనం ప్రత్యక్షంగా చూస్తూనే ఉన్నాం. చూస్తూ కూడా నమ్మకపోతే ఎలా? చూడలేని దాన్ని నమ్ముకుంటూ ఉంటే ఎలా? మరణాంతర జీవితం ఉంటుందని నిరీశ్వరవాదులు అబద్ధం చెప్పరు. జీవించి ఉన్నప్పుడే జీవితాన్ని సంపూర్ణంగా అనుభవించాలని చెపుతారు. విజ్ఞానశాస్త్రం సందేహంతో ప్రశ్నిస్తుంది. సమాధానాల కోసం అన్వేషిస్తుంది. తప్పయినప్పుడు ఒప్పుకుని సరిద్దుకుంటుంది. సవాళ్ళు ఎదురైతే రుజువులు చూపి నిరూపిస్తుంది. కానీ, మతాల దగ్గర అసలు సందేహాలే ఉండవు. ప్రశ్నలుండవు. అన్వేషణలుండవు. తప్పులు ఒప్పుకోవడాలు ఉండవు. సవాళ్ళు ఎదుర్కోవడాలు ఉండవు. ఎదురుకోవాల్సిన పరిస్థితులు ఎదురైతే తోకముడిచి చక్కాపోతాయి. ఇది ఇలా ఉంటే, సైన్సు కాని వితండవాదనను అంటే, సూడో సైన్సును ప్రచారం చేస్తూ తమపబ్బం గడుపుకుంటున్న దిగజారిన రాజకీయ నాయకులు, మతపెద్దలు, స్వాములు, బాబాలు, ముల్లాలు, ప్రేయర్ వాళ్ళూ, ప్రవచనకారులూ ఎక్కువయ్యారు. అందుకే సామాన్య జనం అప్రమత్తతతో ఉండి, వారిని ఎదుర్కుంటూ ఉండాలి. ఊరికే వారి ప్రభావంలో పడి మోసపోకుండా ఉండగలగాలి. అందుకోసం ప్రతి పౌరుడూ సమాయత్తం కావాలి. తమలో సామాజిక స్పృహను, వైజ్ఞానిక స్పృహను పెంచుకోవాలి.
ఉదాహరణకు బ్రహ్మజ్ఞానులనబడే వారి సంగతి చూడండి. ''బ్రహ్మజ్ఞానులకు రేప్ పాపం కాదు'' అని అసారాం బాపూ ఉద్భోదించాడు. మహిళల మీద అత్యాచారాలకు పాలుపడుతున్న ఆధ్యాత్మిక స్వాములు, బాబాలు, పీఠాధిపతులు-అత్యాచారాలు చేసే మత ప్రచారకులకు, ఇతరులకూ ఇలా 'జ్ఞాన' బోధచేస్తున్నారు. వీరు నిలుపదలుచుకున్న భారతీయ సంస్కృతి ఇదేనా? ''అష్టవర్షాత్ భవే కన్యా'' అనే ఛాందసం నిండిన ఈ దేశంలో నెలల పసిపాపను కూడా పురుషాంకారం చిదిమేస్తూ ఉంది. ఎనిమిదేళ్ళ అమ్మాయిని కన్యగా చూడడమేమిటో మనువాద - సంస్కృత పరిరక్షకులే చెప్పాలి! పైత్యం తలకెక్కిన ప్రభువులు కొందరు, దేశంలోనే కాదు విదేశాలలో కూడా తమ అవివేకం కార్చుకుంటూ ఉంటారు. స్వామి ప్రభుపాద అనేవాడు పెర్త్ (ఆస్ట్రేలియా)లో 1975 మే 11న ఉపన్యసిస్తూ ఇలా చెప్పాడు.. ''మహిళలకు రేప్ చేయబడడం ఇష్టం ఉండదని కాదు, కానీ బయటికి చెప్పి ఒప్పుకోలేరు కదా? అందుకే ఒక్కోసారి అసహనం, ఆగ్రహం బయటికి వెళ్ళగక్కుతూ ఉంటారు.'' అని! పవిత్రత అనే ముసుగులో వారు మాట్లాడేది ఇదిగో ఇలా ఉంటోంది?
విజ్ఞాన శాస్త్రం అభివృద్ధి కాకముందు ఈ విశ్వాన్ని దేవుడు సృష్టించాడని విశ్వసించడం స్వాభావికమే. కానీ, తర్వాత కాలంలో సైన్సు అన్నింటికీ సరైన నిరనూపణలతో వివరణలిస్తోంది. అంటే ఏమిటీ? మనకు దేవుడి ఆలోచనలు ఏమిటో ఎలా ఉంటాయో అర్థమవుతున్నట్టే కదా? మరి మనం వాటిని ఎందుకు అనుభవించగూడదూ? ఇది లాజికల్గా చెప్పుకోవడానికే - నిజంగా దేవుడున్నాడని ఒప్పుకోవడానికి కాదు. ఒకే ఒక్క భూమిని బ్రహ్మ, అల్లా, యెహౌవా అనే దేవుళ్ళు ఏఏ కాలాల్లో ఎన్నిసార్లు సృష్టించారు? ఈ దేవుళ్ళందరూ కలసి ఒక ఒప్పందానికి వచ్చి, మనుషులకు సందేహ నివృత్తి చేయాలి. మనిషి ప్రకృతికి అతీతం కాదు. ప్రకృతిలో భాగమే. అనేక పరిణామాల తర్వాత రూపుదిద్దుకున్న ఈ మనిషి, ప్రకృతిలో కీలకమైపోయాడు. కానీ కొందరు మనిషి విలువ, ప్రకృతి విలువ గ్రహించరు. అన్నింటికీ దేవుడే సమాధానమనుకుంటారు. అమెరికన్ క్రైస్తవ రచయిత్రి, మినిస్ట్రీస్కు ప్రసిడెంట్ ఆయన మహిళ, జోయస్ మేయర్ ఇలా ప్రకటించారు. ''మానవ శరీర నిర్మాణంలో దేవుడు తప్పులు చేయడు. ఒక వేళ చేస్తే ప్లాస్టిక్ సర్జరీ చేయించిసరి చేస్తాడు. ఆయన ఆ పని తన ముఖం మీద అనేకసార్లు చేయించాడు'' అని! ప్లాస్టిక్ సర్జరీ చేసి తన ముఖ కవళికల్ని సవరించిన వైద్యుల్ని, సిబ్బందినీ గుర్తించకుండా అదంతా దేవుడి గొప్పతనమేననడం ఆమె మూఢత్వాన్ని తెలియజేస్తోంది. ఇలాంటప్పుడు మనకు ఒక ఆలోచన వస్తుంది- దేవుడే అన్నీ చేస్తే మరి శాస్త్రవేత్తలెందుకూ? వైద్యులెందుకూ? సాంకేతిక నిపుణులెందుకూ? వీరిని పక్కనపెట్టి వారి దైవ మహిమను ప్రదర్శిస్తే బావుంటుంది కదా? ఇలాంటి వెర్రిమొర్రి ప్రకటనలు చేస్తున్నందుకు, సైన్సును అపహాస్యం చేస్తున్నందుకు ఫలితాలు తిరగబడుతున్నాయి. ప్రపంచ వ్యాప్తంగా దైవభావన తగ్గిపోతూ మతరహిత మానవుల సంఖ్య గణనీయంగా పెరుగుతూ వస్తోంది!
మంచినిద్రలో ఉన్నవాణ్ణి మేల్కొలిపితే ఎంత చిరాకు పడతాడూ? విస్కీ తాగిన మత్తులో జోగుతున్న వాణ్ణి స్పృహలోకి రమ్మంటే వాడికెంత బాధ? ఎంత కోపం? చర్చ్లో ఫాదర్ ఆదేశాల మేరకు గొర్రెల్లా పొర్లుతుండేవారికి ఎవరో చూసి నవ్వుతున్నారన్న స్పృహ ఉంటుందా? జనం భ్రమల్ని బద్దలు కొట్టేవారిని, తాత్కాలికంగా జనం ద్వేషిస్తారు. భ్రమలు తొలగిపోతే, మత్తు దిగిపోతే గాని వారు వాస్తవాల్ని అర్థం చేసుకోలేరు. కొందరు మాత్రం వారి వారి భ్రమల్లోనే ఉంటూ, సైన్సును ఉపయోగించుకుంటూ తప్పుడు వివరణలు ఇస్తుంటారు. ఒక మౌలానా ఏం చేప్పాడో చూడండి.. ''మా హృదయంలో ఆ అల్లా నాలుగు గదులు ఎందుకు ఏర్పాటు చేశాడో తెలుసా? మా నలుగురు భార్యలు విడివిడిగా ఒక్కొక్క హృదయపు గదిలో ప్రశాంతంగా ఉండొచ్చునని - మా ముస్లిం మతం స్త్రీలకు ఎంతో గౌరవాన్నిచ్చింది'' అని అన్నాడు మౌలానా హుజూర్ ముఖముద్దీన్ ఖాన్. ఈ మతపెద్దే మరోసారి మరో చోట మరో సైన్సు సూత్రం వెల్లడించాడు. ''తాగే నీటిలో మూడు జిన్లు ఉన్నాయి. జిన్లు అంటే భూతాలు.. అందులో రెండు హైడ్రోజిన్లు ఒక ఆక్సిజిన్ - అందుకే నీళ్ళు తాగేముందు బిస్మిల్లా అని అల్లాను తప్పక తలుచుకోవాలి'' అని! ''యూదులు (జేఈడబ్ల్యూఎస్) నోబెల్ బహుమతులు పొందితే పొందారు గాక, ప్రతి ముస్లిం డెబ్బయి రెండు హూర్ (కన్య)లు గెలుచుకుంటాడు'' అని కూడా అన్నాడు.
నాసా ఎక్విప్మెంట్ అంతరిక్షంలో ఉంది. అది కాస్మిక్ సౌండ్ను పసిగడుతుంది. ఆ కాస్మిక్ సౌండ్ ఏమిటంటే ''ఓం'' అనే శబ్దం! ఆ ఓం - అనే శబ్దం భూమి మీదనే కాదు, ఇతర గ్రహాల నుంచి కూడా వస్తోంది. పరిశోధనలో ఇంకా బయటపడని గ్రహాల నుంచి కూడా ఓం - అనే శబ్దమే వస్తోంది. అంటే అక్కడ కూడా హిందూవులే తప్ప, వేరేమతం వారు లేరు అనేది అర్థమవుతూనే ఉంది. హిందూ అనేది అర్థం చేసుకోవాలి!'' అని అన్నాడు ఒక హిందూమత విశ్వాసకుడు. భూమి మీద తప్ప, ఇతర గ్రహాల మీద మానవ జాతి వర్థిల్లుతున్నట్టు ఇంకా సమాచరమేలేదు. అయినా శాస్త్రవేత్తలకు తెలియని విషయాలు కూడా మత విశ్వాసకులు ఇలా ప్రకటిస్తుంటారు. రుజువులు చూపకుండా సొళ్ళు కార్చడం ఎవరికైనా సుళువే కదా? అందువల్ల సామాన్య పౌరులు ఇలాంటి బూటకపు ప్రకటనలు నమ్మకుండా ఉండాలి. వాస్తవాలు తెలుసుకుంటూ ఉండాలి. చంద్రయాన్ విజయవంతమైనా, కాకపోయినా దాని వెనక ఉన్న కారణం సైన్స్. సుళ్ళూరుపేట చెంగాళమ్మా కాదు, తిరుపతి వెంకన్నా కాదు. బొమ్మలు, విగ్రహాలు గుండుసూదిని కూడా కదల్చలేవు. కదిలే దాన్ని ఆపనూ లేవు. ముందు ఆ విషయం గ్రహించుకోవాలి. ప్రయోగం విఫలమైతే అది మానవ తప్పిదమనీ, విజయవంతమైతే అది దేవుడి కటాక్షమనీ... తప్పుడు అభిప్రాయాన్ని వాడుకలోకి తెచ్చారు. ముందు దానిలోంచి బయటపడి ఆలోచించగలగాలి. ఆ మధ్య ఒక రాకెట్ ప్రయోగం విఫలమైనప్పుడు ఒకతను ఇలా ఒక వ్యంగ్య ప్రకటన చేశాడు.. ''రాకెట్ ఇంధనంలో కాస్త తీర్థంగానీ, ప్రేయర్ ఆయిల్గానీ కలపండహే - అదే ఎల్తాది!'' అని.
కేంద్ర మానవ వనరుల శాఖా మంత్రి రమేశ్ పోఖ్రియాల్.. ''ఆటమ్స్ను ఆయుర్వేదానికి మూలపురుషుడైన చరకుడు కనిపెట్టాడనీ, ఆ విషయాన్ని నాసా విశ్వసించిందనీ'' చెప్పాడు. ఈ రోజు మాట్లాడే కంప్యూటర్ వాస్తవంగా రూపుదిద్దుకుంది - అది ఎలా రూపుదిద్దుకుందంటే.. సంస్కృతభాష వల్లేనే సాధ్యమయ్యిందట! 'సంస్కృతం వైజ్ఞానిక భాష' అని నాసా గుర్తించిందట! సంస్కృతానికి ఆధునిక విజ్ఞాన శాస్త్రానికి ఉన్న సంబంధాన్ని బయటపెట్టకుండా తలాతోకా లేని ఇలాంటి ప్రకటనలు చేయడం వల్ల లాభమేమిటీ? భూ గ్రహాన్ని సెటిలైట్లు ఎన్నో ఫొటోలు తీస్తున్నాయి. ఎందులోనూ ఆ దేవుడి రూపం కనబడలేదు. అంటే దేవుడున్నది బాహ్య ప్రపంచంలో కాదు, మత విశ్వాసకుల మెదళ్ళలో మాత్రమే - అని రూఢగాీ తెలుస్తోంది. అలాగని బ్రెయిన్ సర్జరీలో గాని, మెదడు అధ్యయనాలలో గాని, దేవుడి రూపం దొరకలేదు. ఆ రూపం కేవలం బలహీన మనస్కుల భ్రమల్లో మాత్రమే ఉంది. ఇలా భ్రమలతో ఒక తరం నిర్వీర్యమైతే మళ్ళీ కోలుకోవడానికి ఎన్నెన్నో తరాలు గడిచిపోవాలి. అణుబాంబు పడిన దేశం సత్వరం కోలుకోలేదు కదా? ఇదీ అలాంటిదే.
డ్రగ్స్తో పట్టుబడితే ఎలాంటి అనుమానాలు లేకుండా బిషప్లను కాల్చేయాలని ఫిలిప్పీన్స్ అధ్యక్షుడు రోడ్రిగో డ్యూటెశ్టి ఆజ్ఞాపించాడు. చర్చ్లన్నీ కపట సంస్థలనీ, పాస్టర్లంతా పనికిమాలిన వాళ్ళనీ అన్నాడు. వారివల్ల మానవాళికి ఏం మంచి జరుగుతుందో నిరూపించు కోమన్నాడు. అనైతిక చర్యలకు పాల్పడేది ఫాదర్ లైనా సరే, వదలగూడదన్నాడు. మనదేశంలో కూడా అలాంటి పరిస్థితి వస్తే.. స్వాములు, బాబాలు, పీఠాధిపతుల గోల తగ్గుతుంది. సున్నితమైన అంశాలు గానీ, సంక్లిష్టమైన అంశాలు గానీ అర్థం చేసుకోలేనివాడు తప్పకుండా దేవుణ్ణి నమ్ముతాడు. దేవుణ్ణి నమ్మేవాడు, ఇక దేన్నీ అర్థం చేసుకోనక్కర లేదని - అనుకుంటాడు. ప్రమాదంలో కాలు విరిగిన క్రీడాకారుడు సైన్సు అందించిన కృత్రిమ కాలుతో మళ్ళీ పోటీలో నిలబడతాడు. శరీరాలు అతుక్కుపోయి పుట్టిన బిడ్డలకు ఏ ప్రార్థనా పని చేయదు. ఏ పూజా ఫలించదు. కేవలం సైన్సు అందించిన సర్జరీ వల్ల, బిడ్డలిద్దరూ విడిపోయి, ఎవరికి వారు స్వతంత్రంగా పెరగగలుగుతారు. అమెరికా అంతరిక్ష నావికుడు, హేతువాద రచయిత ఫిలిఫ్ కారీ ఫ్లైట్ అందుకే అంటాడు ''సూడో సైన్స్ ఒక రుగ్మత లాంటిది'' అని.
వ్యాసకర్త: సుప్రసిద్ధ సాహితీవేత్త, జీవశాస్త్రవేత్త.
డాక్టర్ దేవరాజు మహారాజు