Authorization
Mon Jan 19, 2015 06:51 pm
రెండు తెలుగు రాష్ట్రాల్లోని పసుపు రైతులు తీవ్రమైన అసంతృప్తితో ఉన్నారని చెప్పవచ్చు. గత కొన్నేళ్ల నుంచి పసుపు ధరలు తగ్గుతూ రావడం వారిని అసహనానికి గురిచేస్తున్నది. మన దేశంలో పసుపుకు ఒక విశిష్టమైన స్థానం ఉంది. ప్రతి ఇంటి గడపకు, ప్రతి స్త్రీ కాళ్లకు పసుపును రాయడం తరతరాలుగా ఆనవాయితీగా వస్తుంది. అది తెచ్చే శుభం మాట ఎలా ఉన్నా, దానికున్న రోగనిరోధక శక్తి ప్రపంచమంతా గుర్తించింది. కానీ, దానిని పండించే రైతుకు మాత్రం ఈ ఏడాది చేదు అనుభవమే మిగిలింది. తమ ఉత్పత్తికి లభిస్తున్న ధర ఉత్పత్తి వ్యయానికి కూడా చాలడం లేదని రైతులు వాపోతున్నారు. గత ఐదారేండ్లుగా పసుపునకు ధరలు పెరగకపోవడం మూలాన రైతాంగం నిరాశ చెందుతున్నారు. ప్రస్తుతం బహిరంగ మార్కెట్లో క్వింటా పసుపు రూ.4వేల నుంచి రూ.5వేల వరకే పలుకుతుంది. ఈ ధర ఏ మాత్రం రైతుకు గిట్టుబాటు అవ్వని పరిస్థితి. ఈ తరుణంలో క్వింటా పసుపుకు కనీసం రూ.12వేల వరకు ఉంటే బాగుంటుందని రైతులు అభిప్రాయపడుతున్నారు. 2010లో క్వింటా పసుపు ధర రూ.16,300 పలికింది. అదే 2012 సంవత్సరానికి వచ్చే సరికి ధరలు అమాంతం పడిపోయి రూ.3350గా నమెదు అయింది. వచ్చే సంవత్సరం ధరలు పెరుగుతాయని రైతులు ఎదురుచూశారు. అయినా ఫలితం లేదు. కానీ, ఏటా నష్టాలే చవిచూడాల్సి వస్తుందని రైతులు తమ ఆవేదనను చెపుతున్నారు. సరే, కొన్ని నెలల తరువాత అయినా ధరలు పెరుగుతాయన్న ఆశతో పసుపును నిల్వ చేసుకున్న రైతులు, తీరా సమయానికి తక్కువ ధరలకే అమ్ముకుని తీవ్రంగా నష్టపోతున్న పరిస్థితి. పసుపు సాగులో గత కొన్నేండ్ల అనుభవంతో ఆ పంటను వదులుకోకుండా రైతన్నలు పండిస్తూ వస్తున్నారు. పసుపు విస్తీర్ణంలోనూ, ఉత్పత్తిలోనూ మన తెలంగాణదే అగ్రస్థానం. ఉత్పాదకతలో మాత్రం మన పక్కనే ఉన్న ఆంద్రప్రదేశ్ ముందు వరుసలో ఉంది. మహారాష్ట్ర, తమిళనాడు, కేరళ, సిక్కిం రాష్ట్రాలు కూడా ఉత్పత్తిలో గణనీయ స్థానాల్లో ఉన్నాయి. స్వామినాథన్ నేతత్వంలోని రైతు కమిషన్ మద్ధతు ధరలు రైతుల పూర్తి ఉత్పత్తి వ్యయం కన్నా 50శాతం అయినా ఎక్కువగా ఉండాలని సిఫారసు చేసింది. ఆ సిఫారసులను ప్రభుత్వాలు ఆమోదించాయి. కానీ, అమలుకు మాత్రం నోచుకోలేదు. ప్రస్తుతం పసుపు వంటి వాణిజ్య పంటలకు కనీస మద్ధతు ధరలు లేవు. సరఫరా, గిరాకీ మధ్య ఉండే సమతుల్యతను బట్టి మార్కెట్ ధరలు ఉంటాయి. పసుపుకు రోగనిరోధక శక్తి ఉందని, దాన్ని క్రమం తప్పకుండా మనం తీసుకునే ఆహారంలో వాడితే కరోనా మహమ్మారిని ఎదుర్కోగలమని కూడా ఆయుర్వేద వైద్యులు చెబుతున్నారు. ఈ తరుణంలో దేశీయంగా కూడా పసుపు వాడకం పెరిగే సూచనలు కనిపిస్తున్నాయి. ఏదేమైనప్పటికీ, దేశీయంగా, విదేశీ మార్కెట్ లోనూ వినియోగం పెరిగి, పసుపు ధరలు పెరిగి, రైతులకు కొంత ఉపశమనం కలిగేలా ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలి.
శ్రీనివాస్
సెల్: 9603471199
చిరిపోతుల