Authorization
Mon Jan 19, 2015 06:51 pm
కృష్ణా జలాలను రాయలసీమ ప్రాంతానికి అదనంగా తరలించటానికి ఏపీ ప్రభుత్వం పూనుకుంది. జీఓ 203 పేరుతో సంఘమేశ్వరం వద్ద నదిలో 805 అడుగుల నుంచి 80వేల క్యూసెక్కుల చొప్పున నీటిని తరలించటానికి పరిపాలన అనుమతియిచ్చింది. రోజుకు 3టీఎంసీల చొప్పున వరదనీటి పేరుతో రాయలసీమ ఎత్తిపోతల పథకానికి శ్రీకారం చుట్టారు. 6800కోట్లు కేటాయించారు. ఇది అమలు జరిగితే కృష్ణా బేసిన్లో ఉన్న వలసల మహబూబ్నగర్, ప్లోరైడ్ ప్రాంతమైన నల్లగొండ, అనావృష్టి రంగారెడ్డి పాతజిల్లాల ప్రజలకు సాగునీరు, తాగునీరుకు తీవ్రనష్టం వాటిల్లుతుంది. హైదరాబాద్ మంచినీటి సమస్యకూ తిప్పలు తప్పవు. ఎస్ఎల్బీసీ, కల్వకుర్తి, నెట్టెంపాడు, పాలమూరు- రంగారెడ్డి ప్రాజెక్టులు 90రోజులునీటి లభ్యత కలిగి ఉంటాయని వరదలను పరిగణలోకి తీసుకొని డిజైన్లు రూపొందించారు. ఈ ప్రాజెక్టులకు ఎంత నీరు అవసరమో అంతనీటిని ఇప్పుడు 30రోజుల్లోనే రాయలసీమకు తరలించటానికి పూనుకోవటం వలన ఈ ప్రాజెక్టులన్నీ వట్టిపోయే ప్రమాదము దాపురించింది. ఇంజనీర్లు సైతం ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
బచావత్ ట్రిబ్యునల్ ఉమ్మడి రాష్ట్రానికి 811టీఎంసీలు, కర్నాటకకు 734 టీఎంసీలు, మహరాష్ట్రకు 585 టీఎంసీలు కేటాయించింది. 2000 సంవత్సరం వరకు మిగులు జలాలు, వరద జలాలు దిగువ రాష్ట్రం వినియోగించుకోవాలని 1976 తీర్పులో ప్రకటించింది. ఉమ్మడి రాష్ట్రానికి కేటాయించిన నికర జలాల్లో ఏపీకి 512 టీఎంసీలు, తెలంగాణకు 299 టీఎంసీలు నిర్ణయించారు. 2019-20 సంవత్సరం కృష్ణా నీటిని 66:34 నిష్పత్తి ప్రకారం మే నెలాఖరు వరకు వినియోగించుకోవాలని కృష్ణ రివర్స్ బోర్డు తెలిపింది. ఏపీ ప్రభుత్వం మేనెల వరకు 647.55 టీఎంసీలు వాడుకుంది. మంచినీటి కొరత పేరుతో మరో 10టీఎంసీలు బోర్డు అనుమతించింది. తెలంగాణ 272.846టీఎంసీలు మాత్రమే వినియోగించుకుంది. మిగిలిన 52.11 టీఎంసీల నీటిని ఈ సంవత్సరం వినియోగించుకుంటూ, ఈ సంవత్సరం కేటాయింపులో ఇది మినహాయించాలంటే ఏపీ సర్కార్ సహకరించక ఆటంకాలు కల్పిస్తున్నది. కృష్ణానది పరివాహక ప్రాంతం తెలంగాణలో 69శాతం ఉండగా, ఏపీలో 31శాతం ఉంది. శ్రీశైలం ఎడమగట్టు (ఎస్ఎల్బీసీ), శ్రీశైలం కుడిగట్టు కాల్వ (ఎస్ఆర్బీసీ)లకు ఒకేసారి మంజూరీ యిచ్చారు. ఎస్ఆర్బీసీకి నికర జలాలు కేటాయించారు. ఎల్ఎల్బీసీకి కేటాయించలేదు. ఎస్ఎల్బీసీ కృష్ణా బేసిన్లో ఉన్నది. ఎస్ఆర్బీసీ, తెలుగుగంగ పెన్నా బేసిన్లో ఉన్నది.
కృష్ణానది మీద సిద్దేశ్వరం వద్ద ప్రాజెక్టు నిర్మించి పాలమూరు, రంగారెడ్డి, నల్లగొండ జిల్లాల్లో 25లక్షల ఎకరాలకు సాగు, తాగునీరందించాలని అప్పటి హైదరాబాద్ ప్రభుత్వం తలపెట్టింది. చివరికి సిద్దేశ్వరం నుంచి 330కి.మీ. దిగువన నల్లగొండ జిల్లాలోని నందికొండ వద్ద నది మీద ప్రాజెక్టు నిర్మించారు. నల్లగొండజిల్లాలో ప్రాజెక్టు ముంపు భూములు ఎక్కువగా ఉన్నాయి. సాగుకు తగినంత ఆయకట్టు రావటం లేదని ఎడమకాల్వ మీద లిప్టుల నిర్మాణం చేసి లక్ష ఎకరాలకు నీరందించాలని ప్రాజెక్టు రిపోర్టులో పేర్కొన్నారు. కుడి కాల్వ మీద ఉన్న 91లిప్టులను ఎన్ఎస్పీ వారే నిర్వహిస్తుండగా ఎడమకాల్వ మీద ఉన్న 41 లిప్టులను రైతులు నిర్వహించుకొన్నారు. ఎస్ఎల్బీసీ, కల్వకుర్తి, నెట్టెంపాడు, పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టులకు సాగునీరందించటానికి 130టీఎంసీలు కావలసి ఉన్నది. రాయలసీమ ప్రాంతంలోని హంద్రినీవా, గావేరినగరి, వెలిగొండ, ఎస్ఆర్బీసీ, తెలుగుగంగ ప్రాజెక్టులకు 140టీఎంసీలు అవసరం. పొతిరెడ్డిపాడు నుంచి కొత్తగా 44000 క్యూసెక్కులు, పాతవి 4 తూముల ద్వారా 11500 క్యూసెక్కులు, విద్యుత్ ఉత్పత్తికి 4500 క్యూసెక్కులు వెరసి 60,000 క్యూసెక్కుల ప్రవాహము కొనసాగుతోంది. ఇప్పుడు అదనంగా 80,000 క్యూసెక్కుల నిర్మాణం కొరకు ఏపీ ప్రభుత్వం పూనుకుంటున్నది. మిగులు జలాలు ఉన్నది 140 టీఎంసీలు మాత్రమే.
కర్నాటక రాష్ట్రం తనకు కేటాయించిన 734టీఎంసీలలో బచావత్ తీర్పుకు భిన్నంగా రాష్ట్రంలో పునర్ పంపిణీ చేసుకుంది. అధిక వర్షపాతం ఉన్న తుంగలో నీటిని పెంచుకొని బద్రలో తగ్గించుకుంది. అప్పటి ఏపీ ప్రభుత్వం అభ్యంతరం చెప్పకపోవటం వలన సీడబ్ల్యూసీ కర్నాటకకు అనుమతి యిచ్చింది. మధ్య కృష్ణాలో 160 టీఎంసీలు కర్నాటక ఉపయోగించు కోవాలి. ఇందుకు ఆల్మట్టి ఎత్తును + 524.25 మీటర్ల వరకు నిర్మాణం చేపట్టింది. అంత ఎత్తు ప్రాజెక్టులో 170టీఎంసీలు నిల్వ ఉంటాయి. దిగువకు నష్టం జరుగుతుందని ఏపీ కేంద్రానికి ఫిర్యాదు చేసింది. కేంద్రం 1996లో జ్యోతిబసు సారధ్యంలో ముఖ్యమంత్రుల కమిటీ వేసింది. ఆ కమిటీ నిపుణులను సంప్రదించి డ్యాం + 519.6 మీటర్ల ఎత్తువరకు పెంచుకోవచ్చని తెలిపింది. అప్పుడు డ్యాంలో 129.72 టీఎంసీలు, నారాయణపూర్లో 37.65 టీఎంసీలు వెరసి 167.37 టీఎంసీలు నిల్వ ఉంటాయని నిర్దారించారు. ఈ నిర్ణయాన్ని ఏపీ, కర్నాటక, మహారాష్ట్ర ప్రభుత్వాలు అంగీకరించి సుప్రీంకోర్టు నుంచి అనుమతి పొందాయి. అయినా కర్నాటక మద్య కృష్ణాలో ఎక్కువ నీటిని వాడుకుంటున్నది.
మిగులు జలాల ఆధారంగా ఉమ్మడి ఏపీలో నిర్మాణం జరుగుతుండగా కర్నాటక కేంద్రానికి అభ్యంతరం తెలిపింది. కేంద్రం 2004 జూన్లో జస్టిస్ బ్రిటిష్కుమార్ ట్రిబ్యునల్ ఏర్పాటు చేసింది. ఈ ట్రిబ్యునల్ 65శాతం విశ్వసనీయతతో బచావత్ కేటాయింపులు కలిపి అదనంగా మహారాష్ట్రకు 666టీఎంసీలు, కర్నాటకకు 911 టీఎంసీలు, ఏపీ 1001టీఎంసీలు మొత్తం 2578టీఎంసీ జలాలను పంపిణీ చేసింది. కర్నాటక, మహారాష్ట్రలు బేసిన్లో నిర్మాణం జరుగుతున్న ప్రాజెక్టులకు అనుమతి కోరాయి. ఏపీ కృష్ణా బేసిన్లోని ప్రాజెక్టులు, పెన్నా బేసిన్లోని రాయలసీమ ప్రాజెక్టుల లిస్టులు ఇచ్చి పెన్నా బేసిన్ ప్రాజెక్టుల అనుమతికి వాదించారు. ఏపీకి నిరాకరించి మిగతా రెండు రాష్ట్రాలకు అనుమతి యిచ్చింది. నిర్మాణమే జరగని ఆర్డీఎస్కు 4టీఎంసీలు రాయలసీమకు కేటాయింపు చేసుకుంది. ఎస్ఎల్బీసీకి నిర్దేశించిన ఆయకట్టుకు నీరందించటానికి 13మీటర్లతో సోరంగం నిర్మాణం జరగాలని ఇంజనీర్లు నిర్ణయించగా 9మీటర్లకే కుదించారు.
ఏపీ ప్రభుత్వం విడుదల చేసిన జిఓ 203 తక్షణమే రద్దు చేసుకోవాలి. మిగులు జలాల్లో బేసిన్లోని ప్రాజెక్టులకు ప్రాధాన్యత యివ్వాలి. వరదలు వచ్చినప్పుడు శ్రీశైలం డ్యాం నుంచి దిగువకు నీటిని విడుదల చేసినంత కాలమే వరదనీటిని వినియోగించుకోవాలి. వరదలు 30రోజులకు నిర్దారణ జరిగినప్పుడు కృష్ణామీద నిర్మించిన ప్రాజెక్టులకు 30రోజుల్లో నీటిని తీసుకొనుటకు కావలసిన ఏర్పాట్లు కేసీఆర్ ప్రభుత్వం చేయాలి. ఎస్ఎల్బిసీ సొరంగం 46కి.మీ.లకుగాను 35కి.మీ. మాత్రమే పనిజరిగింది. 11కి.మీ. ఇంకా పూర్తికాలేదు. మిషన్స్ ఖాళీగా ఉన్నా చార్జీలు చెల్లించాల్సి వస్తున్నది. సొరంగం పనులు త్వరితగతిన పూర్తిగావించటానికి తెలంగాణ ప్రభుత్వం పూనుకోవాలి.
బి. చంద్రారెడ్డి
సెల్: 9490098005