Authorization
Mon Jan 19, 2015 06:51 pm
పాలకులకు కరోనా సంక్షోభం వరంగా మారింది. లాక్డౌన్ కాలం కానుకగా వరించింది. కార్మికులకు కలికాలమైంది. కార్పొరేట్ సంస్థలకు బహుళ ప్రయోజనకారిగా మారింది. కారొరేట్ల సహాకారంతో అందలమెక్కిన పాలకులు వారిసేవకు దీన్ని అనువైన అవకాశంగా మలచుకున్నారు. ''సంపద సృష్టికర్తలు పెట్టుబడిదారులన్న'' తాత్విక అవగాహన కలిగిన కేంద్రపాలకులు ''కార్పొరేట్ కా సాత్-కార్పోరేట్ కా వికాస్'' అన్న విధాన వైఖరితో రూపొందిస్తున్న పాలసీలు పబ్లిక్ రంగానికి మరణశా సనాల య్యాయి. ఈ నేపథ్యం నుండే ప్రభుత్వరంగం లోని బొగ్గుపరిశ్రమతోపాటు 8కీలక పరిశ్రమలను ప్రయివేట్ సంస్థలకు ఇస్తున్నట్టు కేంద్ర ప్రభుత్వం నిస్సిగ్గుగా ప్రకటించింది. బడాకార్పొరేట్ సంస్థలకు ఉద్దేశించిన ''ఉద్దీపన పథకమిది''. బొగ్గు పరిశ్రమతో పాటు రక్షణ రంగం, విమాన యానం, అంతరిక్షం తదితర పరిశ్రమలు ఈ పథకంలో ఉన్నాయి. ఆర్ఎస్ఎస్ మార్గదర్శ కత్వంలో పాలన సాగిస్తున్న బీజేపీ తన సంస్థాగత పాలసీలో భాగంగానే ఈ ప్రక్రియకు తెరలేపింది.
ఈ పూర్వరంగంలో ప్రభుత్వరంగానికి చెందిన కీలక పరిశ్రమల్లో ఒకటైన బొగ్గుగనులను బడా ప్రయివేట్, కార్పొరేట్ సంస్థలకు అప్పగించడానికి రంగం సిద్ధం చేసింది. తొలుత సింగరేణితో సహా కోల్ ఇండియాలో 50బ్లాక్లను, రానున్న కాలంలో మరో ఐదు వందల బ్లాక్లను ప్రయివేటీకరించడం జరుగు తుందని, నూరుశాతం ఎఫ్డీఐలకు అవకాశం కల్పిస్తున్నట్టు కేంద్ర బీజేపీ ప్రభుత్వం ప్రకటించింది. ప్రస్తుతం ప్రయివేటీకరించనున్న 50బొగ్గు బ్లాకులను కొనుగోలు చేసిన వారికి వాటి నిర్వహణకుగాను ప్రభుత్వమే వేయి కోట్లు రుణసదుపాయం సమకూర్చి పెడుతుందని కూడా కేంద్ర ఆర్థిక మంత్రి ప్రకటించారు. 1947కు పూర్వం ఈస్టిండియా కంపెనీ ఆధ్వర్యంలో బొగ్గు బావులు నిర్వహణ జరిగింది. 1857 తర్వాత బ్రిటిష్ ప్రత్యక్ష వలస పాలనలో 1894లో శేఠ్ఖోరా రాంజీచావ్దా అనే భారతీయుడు తొలిసారిగా ప్రయివేట్ బొగ్గు కంపెనీ ఏర్పాటు చేశాడు. 1947 తర్వాత అంటే 1956లో బొగ్గుగనులను నిర్వాహణకు ''నేషనల్ కోల్ డెవలప్మెంట్ కార్పొరేషన్'' ఏర్పడింది. 1971-72లో కుకింగ్ కోల్ జాతీయీకరణ చేస్తూ చట్టం వచ్చింది. 1973 మే రెండోవారంలో బొగ్గుగనుల జాతీయీకరణ చట్టాన్ని తేవడంతో దేశంలోని బొగ్గుగనులన్నీ జాతీయం చేయబడ్డాయి. ఈ చట్టం రావడానికి ముందు బొగ్గుపరిశ్రమలో ప్రయివేట్ పెట్టుబడిదారులు గుత్తాధిపత్యం కలిగివున్నారు. కార్మికుల వేతనాలు, వారి రక్షణ, పని భద్రత, ఇతర మౌలిక వసతులు వంటి విషయాలను పట్టించుకోక పోవడంతో అత్యంత దుర్భర పరిస్థితుల్లో కార్మికులు విధులు నిర్వహించేవారు. 1973లో బొగ్గుగనుల జాతీయకరణ చట్టం రావడంతో కార్మికుల ఉద్యోగ భద్రతకు తగిన రక్షణ ఏర్పడింది. శ్రమకు తగిన జీతభత్యాలు లభించాయి. వెట్టిచాకిరీ నుంచి విముక్తి లభించింది. కోల్ఇండియా రూ.50 వేలకోట్ల పైచిలుకు టర్నోవర్తో నవరత్న కంపెనీగా రూపొంది, ప్రపంచంలోని 6పెద్ద మైనింగ్ కంపెనీలలో ఒకటిగా ప్రసిద్ధిచెందింది.
ప్రస్తుతం మోడీ ప్రభుత్వం ''ఆఫ్ ద కార్పొరేట్స్, ఫర్ ద కార్పొరేట్స్, బై ద కార్పొరేట్స్'' పరిపాలన సాగిస్తున్నది. కార్పొరేట్ సంస్థల ఆర్థిక ప్రయోజనాలను దష్టిలో పెట్టుకుని పాలసీలు రూపొందిస్తున్నది. వాటి అమలు కోసం ఎంతటి దారుణానికైనా పాల్పడుతున్నది. 90వ దశకం నుంచి బొగ్గు పరిశ్రమను ప్రయివేటీకరించే చర్యలు వేగవంతమయ్యాయి. వాస్తవానికి ఇప్పటికే 30శాతం భూగర్భగనుల, 80శాతం ఓపెన్ కాస్ట్ల ప్రయివేటీకరణ జరిగిపోయింది. వాటి అనుభవాలు మనముందన్నాయి. ఇప్పుడు 100శాతం విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు రావడానికి చట్టబద్ద అవకాశాలను కల్పించింది. వార్షిక బడ్జెట్లలో గత రెండు దశాబ్దాలుగా కోల్ ఇండియాకు కనీస కేటాయింపులు కూడా లేకుండా పోయాయి.
2014లో బొగ్గు గనుల జాతీయీకరణ చట్టానికి సవరణలు చేస్తూ తీసుకువచ్చిన ''కోల్మైన్స్ స్పెషల్ ప్రొవిజన్ బిల్-2015'' భారత పార్లమెంట్ ఆమోదంతో చట్టరూపం తీసుకుంది. ఈ చట్టం బొగ్గుగనులను ప్రయివేటీ కరించడానికి చట్టబద్ధ అవకాశాలను కల్పించింది. 2018 ఫిబ్రవరిలో కేంద్రం కుకింగ్ బొగ్గుగను లను ప్రయివేటీకరించడానికి నిర్ణయం తీసుకుంది. బొగ్గుపరిశ్రమలో ప్రపంచంలోనే 8వ స్థానాన్ని కలిగివుండి ప్రతి ఏటా 817మిలియన్ టన్నుల బొగ్గును ఉత్పత్తి చేస్తూ లాభాలబాటలో ఉన్న దేశీయ బొగ్గుపరిశ్రమను ప్రయివేటీకరించ డానికి కారణం కేంద్ర బీజేపీ పాలకులు బడా కార్పొరేట్ సంస్థలకు 2014లో చేసిన వాగ్దానమే. నాడు జరిగిన సాధారణ ఎన్నికల్లో అధికారాన్ని హస్తగతం చేసుకోవడానికి బడాపెట్టుబడి దారుల, కార్పొరేట్ సంస్థల సహకారం తీసుకుని గెలుపొంది అధికారాన్ని చేపట్టిన బీజేపీ నాడు వారికి ఇచ్చిన హామీనీ నెరవేర్చే ప్రక్రియలో భాగమే ఇది.
సహజవనరులైన బొగ్గు, ఇతర ఖనిజ సంపదపై కార్పొరేట్లకు పూర్తి ఆధిపత్యం వస్తే బొగ్గు ధరల నిర్ణయం వారి చేతుల్లోనే ఉంటుంది. కార్మికులకు పని భారం పెరుగుతుంది. ఉద్యోగ భద్రతకు, ప్రాణాలకు రక్షణ ఉండదు. ఎనిమిది గంటల పనిదినం ప్రశ్నార్థకంగా మారుతుంది. బొగ్గు పరిశ్రమ పూర్తిగా ప్రయివేటీకరణ జరిగితే వేతన ఒప్పందాలకు సంబంధించిన వేజ్ బోర్డు లాంఛనప్రాయంగా మారి క్రమంగా రద్దు అయిపోతుంది. బై, ట్రై పార్టీల సమావేశాలుండవు. ప్రభుత్వరంగ సంస్థ అయిన బొగ్గు పరిశ్రమలో 2013 నాటికే పాలకుల విధి విధానాలు ప్రమాద ఘంటికలు మోగించగా మోడీ ప్రభుత్వం 2015 కోల్మైన్స్ చట్టాన్ని తీసుకువచ్చింది. ఈ చట్టం ద్వారా బొగ్గు గనులపై కోల్ ఇండియాకు ఉన్న గుత్తాధిపత్యం తొలగిపోతుంది. బొగ్గుఉత్పత్తి పూర్తిగా విదేశీ, స్వదేశీ బడాకార్పొరేట్ల చేతుల్లోకిపోతుంది. విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు విచ్చలవిడిగా రావడానికి చట్టబద్ధ అవకాశం ఏర్పడుతుంది. ప్రయివేట్ సంస్థలు తన సొంత ఉక్కు, సిమెంటు, విద్యుత్ ప్లాంట్ల వినియోగం కోసం అవసరమైన బొగ్గు ఉత్పత్తికి సొంతంగా బొగ్గు తవ్వుకోడానికి కూడా ఈ చట్టం వీలు కల్పిస్తుంది. ఎఫ్డీఐల ప్రవేశానికి చట్టబద్ద అవకాశాలు ఏర్పడడంతో వాటికి విదేశీ పెట్టుబడుల ప్రోత్సాహకబోర్డ్(ఎఫ్ఐసీఓ) అనుమతించాలన్న నిబంధన రద్దైపోతుంది. ఈ చర్యలు సామాజిక న్యాయసూత్రాలకు, అంతర్జాతీయ కార్మికసంస్థ(ఐఎల్ఓ) మార్గదర్శ కాలకు వ్యతిరేకమైనవి. ఇప్పటికే పెద్దఎత్తున అమలవుతున్న ప్రయివేటీకరణ విధానాల వల్ల కోల్ ఇండియాలో ఉన్న 8లక్షల మంది కార్మికులను మూడు లక్షలకు కుదించారు. 1956లో ప్రభుత్వ రంగ సంస్థగా గుర్తించిన సింగరేణిలో ఉన్న లక్ష నలబైవేల మంది కార్మికులను 47వేలకు కుదించారు. నేడు ఆ సంస్థ 27 భూగర్భగనులు, 20 ఉపరితల గనులను కలిగి ఉంది. దేశంలో బొగ్గునిక్షేపాలు విస్తారంగా ఉన్నాయి. అపారమైన బొగ్గు నిల్వలను దేశ అవసరాలను దృష్టిలో పెట్టుకొని వెలికి తీయాలన్న బాధ్యతను ప్రభుత్వం విస్మరించింది. బొగ్గులను లూటీ చేయడానికి విదేశీ, స్వదేశీ బడా కార్పొరేట్ సంస్థలకు అవకాశం కల్పిస్తూ చట్టాలు చేసింది. వారి ఆర్థిక ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని కోల్ ఇండియాతో సహా దాని అనుబంధ సంస్థల పూర్తిస్థాయి ప్రయివేటీకరణకు రంగం సిద్దం చేసింది. ఈ నేపథ్యంలో బొగ్గుగని కార్మికులు చేపడుతున్న పోరాటానికి సంఘీభావంగా నిలవడం పౌరసమాజం బాధ్యత.
ఎం. శ్రీనివాస్
సెల్: 9177892582