Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఒరే బంగారులూ..
ఎవరి మీదరా మీ కోపమంతా. ఎవరి మీదరా మీ అసూ యంతా. ఇంకెవరి మీదరా మీ అక్కసంతా. కాస్త సభ్యత పాటించండి రా, ఇంకాస్త మరియాద చూపండిరా. కొద్దిగా మానవత్వంతో చూడండిరా. నోరున్నది తిట్టడానికే కాదురా. దానితో ఇంకెన్నో మంచి పనులు చేయొచ్చురా. చెడును ప్రశ్నించొ చ్చురా, మంచిని ప్రశంసించ్చురా, ప్రగతికి నాంది పలకొచ్చురా. కాస్త మారండిరా.
ఒక్కటి చెబుతా వినుసోదరా. ఏ కమ్యూనిస్టూ, ఏ అభ్యుదయవాదీ, ఏ నాస్తికుడూ, ఏ మానవతావాదీ వారిని నువ్వు చెప్పేది తప్పు అన్నప్పుడు తిట్టలేదురా. కొట్టినంత పని అస్సలూ చేయలేదురా. అది కాదంటూ, ఇది చూడమంటూ, ఇలా ఆలోచించమంటూ, మధ్య మధ్యలో నువ్వు చెప్పినదాంట్లోనూ నిజం లేకపోలేదంటూ, చివరికి అసలైన నిజమేదో చెప్పే వరకూ ఎంత ఓపికగా ఉన్నారు సోదరా. విన్నారు సోదరా. కాస్త మర్యాద వాళ్ళదగ్గర అరువు తెచ్చుకోకూడదూ, ఇస్తారు.
ఏమన్నావు సోదరా, దేశ భక్తా... అది వాళ్ళ దగ్గర లేదా. మీ అజాగ్రత్తవల్ల చనిపోయిన ప్రతి సైనికుడి ఫొటో ముందు ఏమి నాటకాలాడతారయ్యా. ఆస్కారు మీకు ఎన్నిసార్లు ఇచ్చినా తక్కువే. ఇక చైనా పై విసుర్లు. విసరండి వాళ్ళపైకి. అంతే కాని అవి మనమీదే పడేలా కాదు. అసలు అక్కడ పెట్టుబడులు ఎవరివి ఉన్నాయో కాస్త చూడు సోదరా. ఎందుకు చైనాను కట్టడి చేయలేకుండా ఉన్నారో కాస్త చూడు సోదరా. జై జవాన్ అంటావే, సైనికుల ఇండ్లపై, జీవితాలపై, చివరికి వారి శవ పేటికల పై వ్యాపారం చేసింది ఎవరు? వాటిలో అపఖ్యాతి పాలైంది ఎవరు? కడుపు కోసు కుంటే కాళ్ళమీద పడుతుంది కదా!! అవును.
అసలు పెట్రోలు, డీజిలు మండలేక మండు తున్నాయి వాహనాల్లో... ఎందుకంటే మర్కెట్లో లేవవి, ఆకాశంలో ఉన్నాయి... దాని గురించి ప్రశ్నించు సోదరా. డీమానిటైజేషన్ అని నోట్లురద్దు చేస్తే, ఏటీయమ్ముల్లో చనిపోయింది ఎవరు సోదరా? కూలీ దొరక్క బలైపోయింది ఎవరు సోదరా? వీళ్ళంతా మనవాళ్ళే కదా..! వీళ్ళ మీద లేని జాలి పైనున్నోళ్ళ పై ఎందుకు సోదరా. అంతెందుకు, కరోనానే తీసుకుందాం. మీరు చెప్పినట్టే చప్పట్లు కొట్టాం, గంటెలు కొట్టాం, కొవ్వొత్తులు, దీపాలు వెలిగించాం. కానీ ఏం జరుగుతోంది.. మనుషుల జీవితాలు ఆరిపోతున్నాయి. వాటిపై ప్రశ్నించండి సోదరా. అది చేయలేరు కాని మంచిని కోరే వాళ్ళను, చెడుని నిరసించేవారిని అసభ్య పదజాలం వాడుతూ, తిడుతూ ఆత్మ వంచన ఎందుకు చేసుకుంటారు..?
నెత్తిపై ఎండ పగబట్టినట్టు మండుతుంటే, కాళ్లు రహదారులపై రక్తమోడుతుంటే, ఆకలితో, పిల్లలతో, ఉన్న కొద్దిపాటి సామానుతో వేల కిలో మీటర్లు వలస కార్మికులను నడిపించారే... తల్లి చనిపోయిన పిల్లాడు, తండ్రి చనిపోయిన చిన్నారులు, వారి భార్యలూ, అమ్మలు ఎంత బాధ పడిందీ చెప్పి మీ పెద్దోళ్ళని అడగండి. అడిగిన వారి, అడుగుతున్న వారి ధైర్యాన్ని, నిక్కచ్చితనాన్ని చూడండి, అంతే కాని వాళ్ళు బత్తాయిలెలా అవుతారు.
మీ అరిగిపోయిన, ఆవిరైపోయిన సిద్ధాతాలను పట్టుకొని వేలాడండి హాయిగా. ఇంకా ఆదిమానవుడి దిశగా పయనించండి పెద్ద యూ టర్న్ తీసుకొని, మేము వద్దనం. అంతే కాని అటువైపు ఉన్నది బంధువా, మిత్రుడా, లేక నిజాయితీగా ఉండే మంచి మనుషులా అన్నది చూడకుండా.., బంధుత్వం, స్నేహం, మానవ సంబంధాలు ఏవీ అక్కరలేకుండా, వాటికై ఆలోచించ కుండా మూర్ఖంగా మనలను అన్యాయం చేసేవాడిని, మన మధ్య చిచ్చు పెట్టే వాడిని బలపరుస్తూ, జేజేలంటూ మనకు మనమే అన్యాయం చేసుకుంటూ, ఆత్మవంచన చేసుకుంటూ ఈ పయనం ఎక్కడికయ్యా? ఎందాకయ్యా? నీకు నువ్వు ప్రశ్నించుకోలేని స్థాయికి ఎదిగిపోయావే, ప్రశ్నిచేవాళ్ళంటే ఎందుకయ్యా కోపం, అసూయ, అనాదరణ. ఇది ఆత్మవంచన కాదా? ఆత్మస్తుతి ఎక్కడికి దారి తీస్తోందో చూసుకోవా?
అందుకే ఇప్పటికైనా సమయం మించిపోయింది లేదు. కొద్దిగా మారండి. ఎదుటివాడిలోని మంచిని చూడండి. మనిషిగా చూడండి. కాస్త ఆలోచించండి బంగారులూ.....
జె. రఘుబాబు
సెల్:9849753298