Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఈ రోజు మన న్యాయస్థానాల్లో విచారిస్తున్న క్రిమినల్ కేసుల్లో ప్రధానంగా భారత శిక్షాస్మతి 1860లో ప్రస్ఫుట పరిచిన నేరాలను విచారించడానికి క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ 1898ను అమలు పరుస్తున్నాము. ఈ క్రిమినల్ లేదా సివిల్ కేసుల విచారణలో తీసుకునే సాక్ష్యాధారాలను భారత సాక్షి (Indian Evidence) చట్టం 1872 ద్వారా పరిశీలించడం జరుగుతున్నది. ఈ చట్టాలు సుమారు 120 లేదా అంతకంటే ఎక్కువ సంవత్సరాల నుంచి అమలు పర్చబడుతున్నాయి. కాలానుగుణంగా కొన్ని మార్పులు చేర్పులు చేసినప్పటికీ ఈ చట్టాల ప్రామాణికం మారలేదు. భారత ఆర్థిక వ్యవస్థకు ఇరుసుగా భావించబడే రిజర్వ్ బ్యాంక్ నిర్వహణ కొరకు ఒక చట్టం, ఎల్ఐసీ నిర్వహణ కోసం ఒక చట్టం, జనరల్ ఇన్స్యూరెన్స్ వ్యవస్థ కోసం ఒక చట్టం, పెన్షన్ల నిర్వహణ కోసం ఒక చట్టం, నాబార్డు పేరిట వ్యవసాయ రుణాల నిర్వహణకు ఒక చట్టం, చిట్ ఫండ్స్ యాక్ట్, డిపాజిటర్స్ సెక్యూరిటీ యాక్ట్, అలాగే నెగోషి యబుల్ ఇన్స్రుమెంట్ యాక్ట్ లాంటి ప్రత్యేక చట్టాలు అమలులో ఉన్నాయి. ఈ చట్టాలలోని ప్రత్యేకత ఏమిటంటే ఆయా సంస్థలను ఏ విధంగా నడుపుకోవాలి, ఏ విధమైన లైసెన్స్లు ఉండాలి, నిర్వహణ ఏ విధంగా ఉండాలి అనే విషయాలతో పాటు ఆ నిర్వహణలో జరిగే నేరాలకు శిక్షలు కూడా క్రోడీకరించబడ్డాయి .
ఈ చట్టాల అమలు విషయంలో జరిగే నేరాలను కూడా క్రిమినల్ ప్రొసీజర్ కోడ్, సాక్షి చట్టం ప్రకారం విచారించి తీర్పులు చెపుతారు. కొన్ని ప్రత్యేక చట్టాల అమలులో జరిగే నేరాలను విచారించేందుకు ప్రత్యేక న్యాయస్థానాలను ఏర్పాటు చేశారు. ఈ ప్రత్యేక చట్టాల ఆవశ్యకతను ''భారత లా కమిషన్'' గుర్తించడం, తద్వారా 'లా' కమిషన్ సూచనలను పరిగణనలోకి తీసుకొని పార్లమెంట్లో ప్రత్యేక చట్టాలు చేయడం జరిగింది.
నేర రహిత సమాజం కోరుకోవడం అవసరం. కానీ ఈ ప్రత్యేక చట్టాల్లో నేరాలుగా గుర్తించిన అంశాల్లో నేర స్వభావ చర్యలు లేవని భావిస్తూ, ఆ నేరాలకు క్రోడీకరించిన శిక్షలను పూర్తిగా ఆయా చట్టాల నుండి తీసివేయడం, ''దొంగలకు తాళం చెవి'' ఇవ్వడమే. క్షణికావేశంలో నేరం చేయడం, తనను తాను రక్షించుకోవడానికి నేరం చేయడం, రాజకీయ, కుటుంబ కలహాల్లో నేరం చేయడం, మద్యపానం వల్ల కలిగే మత్తులో చేసే నేరాలను అర్థం చేసుకోవచ్చు. అటువంటి నేరాలకు శిక్షలు విధిస్తారు. ఇటువంటి నేరాలు చేస్తే శిక్షలు వేస్తారన్న భయం కూడా వ్యక్తుల్లో ఉంటుంది. ఈ నేరాల్లో కూడా ఉద్దేశ పూర్వకంగాను, అపరాధ చింతనతోను, నేరం చేయాలనే సంసిద్ధతతోను చేసేవి ఉంటాయి. ఆయా కారణాలను, సహేతుకతను, సందర్భా ధారితను అనుసరించి తీర్పులు ఉంటాయి. అందుకు చట్టాల్లో అన్ని కోణాల్లో జాగ్రత్తలు తీసుకుంటారు. ఒక నిర్దోషికి శిక్ష పడకూడదు అనేది మనమెరిగిన సూక్తి. ఇందుకు భిన్నంగా కేంద్ర ప్రభుత్వం జూన్ 8న ఆర్థిక మంత్రిత్వ శాఖ, ఫైనాన్షియల్ సర్వీసెస్ శాఖ ద్వారా ఇప్పుడు అమలులో ఉన్న 19 ప్రత్యేక చట్టాల్లో నేరాలుగా పరిగణించవలసిన చర్యలను ''నేరారోపణ చేయదగిన చర్యలు కాదు'' అని పరిగణించేందుకు ఆయా చట్టాల్లో, సెక్షన్ ఆఫ్ లా ను మార్పు చేయడానికి ప్రతిపాదించింది. ఈ ప్రతిపాదన కరోనా నేపథ్యంలో వ్యాపార వర్గాలకు అనుకూలంగా ఆత్మ నిర్భర్ పేరిట ఆర్థిక సహకారం అందిస్తామన్న కేంద్ర ప్రభుత్వం, అదే దిశలో స్వదేశీ, విదేశీ పెట్టుబడిదారులకు మన దేశంలో వ్యాపారం చేసుకునేందుకు భరోసా కల్పించాలనే పేరిట, అలాగే కోర్టుల్లో కేసుల పరిష్కారంలో జాప్యం జరుగు తోందనే సాకుతో ఈ విధమైన ప్రతిపాదన చేసింది. ఈ ప్రతిపాదన ద్వారా చిన్న చిన్న చట్ట ఉల్లంఘనలను క్రిమినల్ చర్యల పరిధి నుంచి తప్పించడం ద్వారా సామాన్యులకు తీరని అన్యాయం జరుగుతుంది. ఉదా:-ఇన్ష్యూరెన్స్ చట్టం సెక్షన్ 103 ద్వారా ఏ వ్యక్తైనా లైసెన్స్ పొందకుండా ఇన్స్యూరెన్స్ వ్యాపారం చేస్తే, వారు 25 లక్షల జరిమానాతో పాటు 10ఏండ్లకాలం పాటు శిక్షార్హుడు. ఈ సెక్షన్ ఆఫ్ లాను రద్దు చేస్తే, ఎవరైనా ఈ వ్యాపారం చేసుకునేందుకు అవకాశం ఇవ్వడమే, ఫలితంగా మదుపరులకు ఎంత నష్టం జరిగినా ప్రశ్నించలేం.
సర్ఫెసి యాక్ట్ ద్వారా బ్యాంక్ రుణాలు ఎగ్గొట్టే ప్రయత్నం చేస్తే ఒక ఏడాది పాటు శిక్ష వేయదగిన నేరంగా పరిగణిస్తాం. ఈ నేరాన్ని రద్దు చేస్తే ప్రజల సొమ్ముతో నడిచే బ్యాంక్లు తాము అప్పుగా ఇచ్చిన మొత్తాన్ని వసూలు చేయలేవు. అంటే వేల, లక్షల కోట్ల రుణ ఎగవేతకు మార్గం సుగమం అవుతుంది. ఇప్పటికే కోట్ల రుణాలు తీసుకున్న బడాబాబులు వాటిని తిరిగి చెల్లించకుండా దేశాన్ని వదిలి ఉడాయి స్తున్నారు. పెన్షన్ ఫండ్ నిర్వహణ కోసం ఉన్న ూఖీ=ణA యాక్ట్లోని సెక్షన్ 16(7)ను సవరిస్తే ఉద్యోగులు దాచుకున్న పెన్షన్లకు రక్షణ లేకుండా పోతుంది. ఆర్బీఐయాక్ట్ 1934లో, చేపట్టబోయే సవరణల వలన ఆర్థికసంస్థలపైన, వాటి నియంత్రణపైన చట్టపరమైన చర్యలు తీసుకొనే వీలుండదు.
ప్రైజ్ చిట్స్, మనీ సర్క్యులేషన్ స్కీమ్ చట్ట(నిషేధ) ప్రకారం, ఇప్పటి వరకు ఎవరైనా ఆ వ్యాపారాల పేరుతో ప్రచారం చేసి, డిపాజిట్లు సేకరించి ఆ సభ్యులకు నష్టం కలిగిస్తే, దానిని నేరంగా పరిగణిస్తూ ఒక ఏడాది నుంచి 3 మూడేండ్ల వరకు శిక్ష వేయదగిన నేరంగా పరిగణిస్తున్నారు. కానీ ఈ చట్ట సవరణ జరిగితే పేద, మధ్య తరగతి ప్రజలు మోసపోతారు. ఆ వ్యాపారులు ప్రజలకు డబ్బు చెల్లించకుండా తప్పించుకుంటారు. అదే విధంగా చిట్ ఫండ్స్ యాక్ట్లో ప్రతిపాదించిన సవరణలు అమలైతే చిట్ సభ్యులకు ప్రస్తుతం ఉన్న రక్షణ కూడా ఉండదు.
చెక్ డిస్ఆనర్ కేసులను నేర స్వభావరహిత చర్యగా భావిస్తూ, సివిల్ కేసు తరహాలోనే చర్యలు తీసుకునేందుకు ప్రతిపాదిస్తున్నారు. చట్టపరంగా అప్పుగా తీసుకున్న సొమ్మును తిరిగి చెల్లించేందుకు ఇచ్చే చెక్కులు చెల్లించ బడకుండా తిరస్కరణకు గురైతే, అటువంటి చెక్కును ఇచ్చిన వ్యక్తిపై చట్టరీత్యా శిక్షార్హమైన కేసుగా నమోదు చేస్తే, రెండేండ్ల వరకు శిక్ష వేయదగిన నేరంగా పరిగణిస్తారు. కార్పొరేట్ కంపెనీలు లోన్ ఇచ్చేటప్పుడు సెక్యూరిటీ పేరిట రుణ గ్రహీతల నుంచి ఖాళీ చెక్కులను సంతకాలతో తీసుకుంటున్నారు. ఇటువంటి సందర్భాలలో వేల మంది రుణ గ్రహీతలు కార్పొరేట్ సంస్థల హస్తాల్లో చిక్కుకొని ఇబ్బందులు పడుతున్నారు. వ్యక్తిగత రుణాల చెల్లింపు కోసం ఇచ్చే చెక్కులు తప్ప, కంపెనీలకు సంబంధించిన చెక్కుల విషయంలో పునరాలోచిస్తే మంచిది. అంతే తప్ప సెక్షన్ 138ఎన్ఐ యాక్ట్ మొత్తాన్ని డీ క్రిమినలైజ్ చేయడం సరియైనది కాదు.
అదేవిధంగా దేశాభివృద్ధికి గానీ, మానవ వనరుల అభివృద్ధిలో గానీ, సగటు భారతీయుని జీవన స్థితిగతులు మెరుగు పరచడానికి ఏ మాత్రం ఉపయోగపడని క్రికెట్ ఆటకు సంబంధించిన మేనేజ్మెంట్ మధ్య వచ్చిన వివాదాల లోను, ప్రసార హక్కుల విషయాల్లో వచ్చే వివాదాల్లో, క్రీడాకారుల మధ్య వచ్చే వివాదాల్లో హైకోర్టులు, సుప్రీంకోర్టుల్లో అత్యంత ప్రాధాన్యత ఇచ్చి కేసులు నిర్వహిస్తారు. ఇటువంటి ఆటల్లో, ఆటగాళ్ళు మ్యాచ్ ఫిక్సింగ్కు పాల్పడితే, ఆ చర్యలను నేరంగా భావిస్తూ కఠిన చట్టాలను తేవాలని భారత్ లా కమిషన్ ప్రతిపాదించింది. ఆటల్లో జరిగే తప్పుడు పద్ధతులను నేరాలుగా భావిస్తున్నప్పుడు, ప్రజల సొమ్ముతో నడిచే బ్యాంకింగ్ వ్యవస్థ, ఇన్స్యూరెన్స్ సంస్థలు, చిట్ ఫండ్స్ సంస్థలు మోసాలకు పాల్పడి ప్రజలకు ఆర్థికంగా నష్టం కలిగించే చర్యలను నేరరహిత చర్యలుగా పరిగణించాలనే ప్రతిపాదన ఏ మాత్రం హర్షణీయం కాదు.
చట్టాలు ప్రజల హక్కులను కాపాడే విధంగా ఉండాలి గానీ, వారి హక్కులు, జీవన భద్రతకు భంగం కలిగేలా ఉండకూడదు. ఈ ప్రతిపాదనల వలన ఆర్థిక నేరాలు పెరగడమే కాకుండా, వాటికి పాల్పడిన నేరగాళ్లను రక్షించే విధంగా ఉన్నాయి. న్యాయవ్యవస్థకు తగిన విధంగా సహాయ సహకారాలు అందించకుండా, ఆ వ్యవస్థను బలోపేతం చేసేందుకు అవసరమైన నిధులు మంజూరు చేయకుండా, నియామకాలను నిర్లక్ష్యం చేస్తుండడమే కాక, ఈ ప్రతిపాదిత ''డీ క్రిమినలైజేషన్''కు న్యాయస్థానాలపై అభాండాలు వేయడం సరైనది కాదు. అందుకే ఈ ప్రతిపాదిత సవరణలను ''ఆల్ ఇండియా లాయర్స్ యూనియన్'' వ్యతిరేకిస్తున్నది.
కొల్లి సత్యనారాయణ
సెల్: 9399322422