Authorization
Mon Jan 19, 2015 06:51 pm
దేశ ఆర్ధిక పరిస్థితి ఘోరంగా దెబ్బ తింది. వద్ధి రేటు మైనస్లోకి వెళ్ళింది. 4.5శాతానికి పడిపోతుందని అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ(ఐఎంఎఫ్) అంచనా వేసింది. ఇలాంటి పరిస్థితుల్లో ప్రజల స్థితిగతులు ఎలా ఉంటాయో అంచనావేయొచ్చు. లాక్డౌన్ ఎఫెక్ట్ ఎలా ఉందో అర్ధం అవుతున్నది. మెజార్టీ ప్రజల కొనుగోలు శక్తి పడిపోయింది. తలసరి ఆదాయం తగ్గింది. ఉపాధి అవకాశాలు సన్నగిల్లుతున్నాయి. ఉన్న ఉపాధిని కూడా కోల్పోతున్నారు. ఈ పరిస్థితులనుంచి దేశాన్ని ఎలా గట్టెకించాలి, ప్రజలకు ఉపశమనం ఎలా కలిగించాలని కేంద్రం ఆలోచించాలి. రాష్ట్ర ప్రభుత్వాలు కూడా తమ బాధ్యతగా ప్రజలను ఆదుకోవాలి. లేదంటే పేదరికం విలయతాండవం చేస్తుంది. ఆకలి చావులు సంభవిస్తాయి. అరాచకం ప్రభలుతుందని ఆర్థిక నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కేంద్రం ప్రభుత్వం మొక్కుబడి చర్యలు చేపట్టింది. 20లక్షల కోట్ల రూపాయల ఉద్దీపన ప్యాకేజీ కంటితుడుపుగానే ఉంది. ఉద్దీపన ప్యాకేజీ పేరుతో కీలక రంగాలలో ప్రయివేటు పెట్టుబడులకు అవకాశం కల్పిస్తూ నిర్ణయం తీసుకున్నదే తప్ప ఆర్థికంగా ఆదుకున్నది తక్కువగా ఉంది. ఇతర దేశాలు తమ ఆర్థిక పరిస్థితులను చక్కదిద్దుకోవడానికి ప్రజలలో తక్షణమే కొనుగోలు శక్తి పెంచే విధంగా నిర్ణయం తీసుకొని నగదు బదిలీ చేసాయి. మన కేంద్ర ప్రభుత్వం మాత్రం ఆ సోయిలో లేకపోవడంతో ప్రజలకు తక్షణ ఉపశమనమేదీ కలగలేదు.
ఆర్థిక పరిస్థితి ఇలా ఉంటే కేంద్రం మాత్రం ఇవేమి పట్టనట్టు గత 15రోజులుగా పెట్రోల్, డిజీల్ ధరలను పెంచుకుంటూపోతున్నది. ఇది అన్యాయం, దుర్మార్గం. ఎందుకంటే ఇవాళ ప్రతి సామాన్యుడు టూ వీలర్ వాడుతున్నాడు. అలాగే వ్యవసాయ రంగం యంత్రాలమీద ఆధారపడి ఉంది. చిన్న వర్తకులు, చిన్న మధ్య తరహా పరిశ్రమలు కొన్ని డిజీల్ యంత్రాలమీద ఆధారపడి పనిచేస్తాయి. పెట్రోల్, డిజీల్ ధరల పెరుగుదల అటు సరుకు రవాణావ్యవస్థ మీద, ఇటు పబ్లిక్ ట్రాన్స్ పోర్ట్ మీద కూడా తీవ్ర ప్రభావం చూపుతుంది. దీనితో నిత్యావసర వస్తువుల ధరతోపాటు ఇతర వస్తువుల ధరలు కూడా పెరుగుతాయి. అలాగే పబ్లిక్ ట్రాన్స్ పోర్ట్ రంగం కూడా చార్జీలను పెంచే అవకాశం ఉంది. దీనితో పేద మధ్య తరగతి వర్గాలకు మోయలేని భారం అవుతుంది. అసలే లాక్డౌన్తో ఉన్న ఉపాధి అవకాశాలు పోయి, ఒకవేళ ఉద్యోగం ఉన్నా సగం జీతాలతో బతుకు బండిని లాగుతున్న వారికి, లాక్డౌన్కు ముందునుండే ఉపాధి అవకాశం లేక పస్తులతో గడుపుతున్న వారికి పెరిగిన పెట్రోల్, డిజీల్ ధరలు, పరోక్ష ప్రభావంతో పెరిగే నిత్యావసర వస్తువుల ధరలు, చార్జీల మోత తడిసి మోపడై కుదేలవడం ఖాయం. అధికారంలో ఉన్నవారికి ఇది తెలియదా..? గత పదిహేనిరవై రోజులుగా పెట్రోల్ డిజీల్ ధరలు పెరుగుతూనే ఉన్నాయి. పెట్రోల్ మీద 8 రూపాయల 62 పైసలు పెరిగితే డిజీల్ మీద 9 రూపాయల 24 పైసలు పెరిగింది. దీనితో సుమారు 2లక్షల 60వేల కోట్ల రూపాయల అదనపు భారం ప్రజలమీద పడింది. నిజానికి ప్రపంచ మార్కెట్లో ముడి చమురు ధర భారీగా తగ్గింది. ఆ స్థాయిలో పెట్రోల్ డిజీల్ ధరలు తగ్గాలి. కానీ దానికి బిన్నంగా ధరలు పెరుగుతూపోతున్నాయి. ప్రపంచ మార్కెట్లో తగ్గిన ముడి చమురు ధరతో పోలిస్తే పెట్రోల్ లీటరు రూ.35లకు, డిజీల్ రూ.22లకు విక్రయించాలి. కానీ అలా జరగకపోగా పెరుగుతూపోతున్నది. వీటిపై ఎక్సయిజ్ సుంకం కూడా భారీగా పెంచారు. పెట్రోలు మీద రూ.10, డిజీల్ మీద రూ.13 పెంచారు. 2014 నుంచి ఇప్పటివరకు 12సార్లు ఎక్సైజ్ సుంకామాన్నిపెంచారు. నిత్యావసర ఇంధన వనరుల మీదకూడా రూ.9 పెంచారు. ఎన్డీఏ సర్కార్ దేశ ఆర్థిక పరిస్థితులను చక్కదిదేందుకు తీసుకోవాల్సిన చర్యల విషయంలో నిర్లక్ష్య వైఖరిని ప్రదర్శిస్తున్నది. లాక్డౌన్కు ముందే అనాలోచితంగా తీసుకున్న పెద్దనోట్ల రద్దు నిర్ణయం. చేయాల్సినంత కసరత్తు చేయకుండానే హడావిడిగా అశాస్త్రీయంగా తీసుకొచ్చిన జీఎస్టీ విధానం మన ఆర్థిక వ్యవస్థను దెబ్బతీసింది. దీని నుంచి బయటపడకముందే లాక్డౌన్ వచ్చిపడింది. దీనితో ఆర్థిక వ్యవస్థ పూర్తిగా కుదేలయ్యింది.
దేశ ప్రజల కష్టాలను వారి బాధలను పట్టించుకోకపోగా, వారి దష్టిమళ్లించే ప్రయత్నం చేయడం బాధాకరం. దేశాన్ని కాపాడుకోవాల్సిందే..! శత్రుమూకలను తరిమికొట్టాల్సిందే! దానికి దేశ ప్రజలందరిని సన్నద్ధం చేయాల్సిందే! ప్రతి ఒక్కరు దేశ రక్షణకు నడుంబిగించాల్సిందే! దీనికి చిత్త శుద్ధి కావలి! దేశం మీద, ప్రజల మీద ప్రేమ ఉండాలి. కేవలం రాజకీయ స్వార్థంతో ఓటు బ్యాంకు రాజకీయాలతో శత్రు దేశం పట్ల వ్యతిరేకతనను పెంచితే సరిపోదు. ఆ పూటకు ఆ రోజుకు ప్రజల్లో భావోద్రేకాలను రెచ్చగొడితే సరిపోదు. ఇది కేవలం రాజకీయ అవసరం కోసం చేసేది మాత్రమే అవుతుంది. అంతేగానీ దేశాన్ని కాపాడుకునేది మాత్రం కాదు. దేశ ప్రజల మీద ప్రేమ ఉంటే దేశం మీద ఉంటుంది. ప్రజల మీద ప్రేమ లేకుండా ఆదేశం మీద ప్రేమ ఎలా వస్తుంది. వచ్చినా అది కత్రిమంగా ఉంటుంది తప్ప నిజమైనదిగా ఉండదు. ఎందుకు ఈ మాట చెబుతున్నానంటే ఇప్పటిదాకా నేను చెప్పిన ఆర్థిక పరిస్థితులు. ప్రజల కష్టాలు, పెరిగిన పెట్రోల్ డిజీల్ ధరలు, కోల్పోతున్న ఉపాధి అవకాశాలు చాలీచాలని జీతాలతో పస్తులు గడుపుతూ బతుకు బండిని ఈడ్వలేకున్న పేద, మధ్యతరగతి వర్గాల పరిస్థితి గురించి పట్టించుకోని పాలకులకు ప్రజల మీద ప్రేమ ఉన్నట్లా! లేనట్లా! ''దేశమంటే మట్టికాదోరు దేశమంటే మనుషులోరు'' అన్నాడు గురజాడ. మన పాలకులకు మాత్రం అది అర్థం అయినట్టు లేదు. అందుకే పేరుకే జాతీయవాదం.. ఆచరణలో మాత్రం ప్రజలను విస్మరిస్తున్నారు. ఇది కాదు కావాల్సింది, ప్రజలను ప్రేమగా చూసుకునే వారే దేశాన్ని కూడా ప్రేమగా చూసుకుంటారు. దేశాన్ని రక్షించుకోవడంలో రాజకీయాలు అవసరం లేదు. అందరూ కలిసి కట్టుగా దేశాన్ని కాపాడుకోవాలి.
పి.వి. శ్రీనివాసరావు
సెల్: 9553955396