Authorization
Mon Jan 19, 2015 06:51 pm
కరోనాను కట్టడిచేసి పారదోలే పోరాటాన ఓ చిన్నదేశపు గెలుపు స్ఫూర్తిని యావత్ ప్రపంచం ఒంటబట్టించుకోవాలి. కరోనా మహమ్మారిపై పోరాడుతున్న దేశాలకు కివీస్ ఇప్పుడు ఓ రోల్ మోడల్. కట్టడి చర్యలకు ఆదేశం ఓ అనుసరణీయ మార్గం.
మహిళా ప్రధాని తన సత్తాను చాటడం మహిళాలోకానికి గర్వకారణం. దేశంలో చివరి కరోనా పాజిటివ్ను నెగిటివ్గా మార్చి ఇంటికి చేర్చింది న్యూజీలాండ్. దేశంలో ఆఖరు రోగినీ స్వస్థత పరిచి ఆక్లాండ్లోని సెయింట్ మార్గరేట్ ఆస్పత్రి వీడ్కోలిచ్చింది. ఎవరికీ లొంగకపోతున్న మహమ్మారి కరోనాపై పైచేయి సాధించింది మహిళా ప్రధాని కాగా మహమ్మారి దాడిలో కోలుకున్న చివరి రోగీ మహిళే కావటం గమనార్హం.
న్యూజీలాండ్లో 1504 కరోనా కేసులు నమోదు కాగా, వారిలో 1154మందికి పాజిటివ్, మరో 350మంది అనుమానితుల జాబితాలో ఉన్నారు. వైరస్ సంక్రమణకు గురైన వారిలో 22మంది మత్యువాత పడ్దారు. కేసులు ప్రబలకుండా లక్షల సంఖ్యలో విస్తరించకుండా కట్టడి చేయటంలోనే ఆదేశం తొలి విజయం సాధించినట్టైంది. ఒక పక్క ప్రపంచదేశాల్లో కేసుల సంఖ్య లక్షలకు చేరుతున్నా, తమ దేశంలో పరిస్థితి చేయిదాటకుండా చేసిన ముందస్తు చర్యలే కరోనాను పూర్తిగా అరికట్టేందుకు దోహదపడ్డాయి. లాక్డౌన్ నిబంధన ఉల్లంఘించిన ఆ దేశ మంత్రిపై చర్యలు తీసుకోవటంతోపాటు సెల్ఫోన్ సందేశాల ద్వారా పౌరులకు అవగాహన కల్పించారు. దేశ జనాభా 50లక్షలు మాత్రమే కావటం కూడా నియంత్రణ సులువైంది.
న్యూజీలాండ్లో తొలి కరోనా పాజిటివ్ కేసు ఫిబ్రవరి 28న నమోదయ్యింది. వ్యాప్తిని సమర్దవంతంగా అరికట్టడమే కాక జూన్ 8 కల్లా నియంత్రణలోకి తేవటం ఇప్పుడు ప్రపంచం దష్టి సారించింది. కరోనా ఆంక్షల అమలులో భాగంగా ఆదేశంలో మార్చి 21 నుంచి లెవెల్ 1,2,3,4 నిబంధనలు విధించారు. లెవెల్ 4 అమలులో భాగంగా దేశమంతటా లాక్డౌన్ విధించబడింది. పరిస్థితులు అదుపులోకొస్తున్నందున ఏప్రిల్ 27, మే 13 తేదీలలో లాక్డౌన్ను దశలవారీ సడలించింది.
ఇతర దేశాల తీరుగానే ఏప్రిల్ నెలలో రోజుకు దాదాపు 90పాజిటివ్ కేసులు నమోదు కాగా ప్రభుత్వ ముందుజాగ్రత్త చర్యలు సత్ఫలితాన్నివ్వటంతో క్రమేపీ తగ్గుముఖం పట్టాయి. మే 22 నుంచి కొత్త కేసులు ఏవీ నమోదుకాకపోవటం చివరి పాజిటివ్ నెగిటివ్కు చేరటంతో నియంత్రణ సాధించిన దేశంగా గుర్తింపు పొందింది. ఆదేశంలో కేసుల సంఖ్య తక్కువే కావొచ్చు, కానీ వ్యాధి ప్రపంచ వ్యాప్తం మాదిరిదే. కానీ పూర్తిస్థాయిలో కరోనాను పారదోలే లక్ష్యంతో చేపట్టిన చర్యలు ఆ దేశాన్ని భయరహితం చేయటమే కాదు, ఇతర దేశాల్లో మనో ధైర్యం నింపాయి. కరోనా కట్టడి అంతుబట్టని సమస్యగా కొరకరాని కొయ్యగా మారిన క్లిష్ట తరుణంలో ఒక దేశం సాధించిన విజయం తోటి దేశాలకు స్ఫూర్తిదాయకమే.
ఇతర దేశాల తీరున కరోనా విజృంభించక పోయినా యావత్ దేశాల సంక్లిష్టతకు న్యూజీలాండ్ కూడా గురయ్యింది. అయితే ఎన్ని నష్టాలెదురైనా కష్టాలపాలవుతున్నా ప్రజలను కరోనా కబందహస్తాల్లోంచి విడిపించటమే లక్ష్యంగా కృషి చేసింది. ఆర్థిక వ్యవస్థకు విఘాతమేర్పడినా లాక్డౌన్ను పటిష్టంగా అమలుచేసింది. గాడి తప్పిన ఆర్థిక వ్యవస్థను తిరిగి పట్టాలెక్కించి పరుగులు తీయించవచ్చన్న నమ్మకంతో లాక్డౌన్ను కఠినంగా అమలు చేసింది.
అత్యవసరాలు నిత్యావసరాలకే తప్ప ఎవరినీ రోడ్డెక్కనీయకుండా చేయటం, తప్పనిసరై బయటికొచ్చేవారు రక్షణ దుస్తులు ధరించటం వంటి చర్యలు పాటించటాన్ని కచ్చితం చేసింది. అవసరమైన పరీక్షలతో వ్యాధిసోకిన వారిని గుర్తించటం క్వారంటైన్లకు తరలించటం వైద్యం చేయటం వంటివి ఆచరించింది. ఇంత చేసినా కొద్దిపాటి మరణాలు ఆదేశానా చోటు చేసుకోవటం బాధాకరమే అయినా కొద్ది వ్యవధిలోనే తిరిగి కోలుకోగలిగింది.
కరోనా నియంత్రణకు ఆదేశ అధికార యంత్రాంగం చేపట్టిన చర్యలకు పౌరులు తమవంతు సహకరించడం అభినందనీయం. దేశం పూర్వపు రూపు సాధించాలన్న సంకల్పంతో ప్రభుత్వ చర్యలకు తమవంతుగా సహకరించారు. కరోనా ప్రబలకుండా, విస్తృతం కాకుండా స్వీయ జాగ్రత్తలు కోవిడ్ నిబంధనలు పాటించారు. ప్రపంచ పటాన మొదటి కరోనా కట్టడి సాధించిన ఘనతలో న్యూజీలాండ్ ప్రభుత్వాన్ని ఎంత అభినందించాలో అంతకు రెట్టింపుగా స్థానిక ప్రజలనూ అభినందించాలి.
ఇది ప్రపంచం చప్పట్లు కొట్టాల్సిన సమయం. న్యూజీలాండ్ను అభినందించాల్సిన తరుణం. కరోనా కట్టడి సాధ్యమేనని నిరూపించిన ఓ యువ మహిళా ప్రధాని జెసిండా అడెర్న్ చర్యలను అనుసరించాల్సిన తరుణం. యుద్ధంలో గెలుపు తధ్యమే అని తొలి సంకేతాన్నిచ్చిన విజేతను అభినందించాల్సిందే. ఎక్కుపెట్టాల్సిన అస్త్రాలేవో సమకూర్చు కోవాల్సిన ఆయుధాలేవోనన్న సందిగ్దాలకు ఇది దిశా నిర్దేశమే. కివీస్ సాధించిన కట్టడి దేశాలతో పాటు పౌరలకూ ఆచరణీయమే. ముఖ్యంగా మనదేశంలో..
- కె. శ్రీనివాస్,
సెల్: 9346611455