Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్లో ఆస్పత్రులు లేవు.. అవును ఇది నిజం. కార్పొరేట్ ఆస్పత్రులతో సహా ఎక్కడ కూడా బెడ్లు ఖాళీలేవు, ఇది రోగులు ప్రస్తుతం ఎదుర్కొంటున్న జీవన్మరణ సమస్య. ఇప్పటికే అనేకమంది వైద్యం నిరాకరించబడి చనిపోయారు. ప్రయివేటు ఆస్పత్రుల చుట్టూ తిరిగి తిరిగి, ఎన్నో రికమండేషన్లతో పైరవీలు చేసి, ఎంత ప్రయత్నించినా వైద్యం దొరకక చివరికి ప్రభుత్వ ఆస్పత్రిలో పడి, పడిగాపులు గాచి చనిపోతున్న సంఘటనలు దిగ్భ్రాంతికి గురి చేస్తున్నవి. హైదరాబాద్ చెస్ట్ ఆస్పత్రి ముందు సెల్ఫీ వీడియో తీసుకొని ''బారు నాన్న... నాకు ఆక్సిజన్ తీసేశారు, నా గుండె ఆగిపోతున్నది..'' అంటూ చెప్పి ప్రాణాలు విడిచిన రవికుమార్ ఘటన మన దగ్గర ఉన్న ఆస్పత్రుల వ్యవస్త దుస్థితికి అద్దం పడుతున్నది. దీనిపై తక్షణ చర్యలకు ఏమి సూచనలు ఇచ్చారో తెలియదు కానీ, కేంద్రం నుంచి వచ్చిన కమిటీ తెలంగాణ ప్రభుత్వానికి క్లీన్ చిట్ ఇచ్చి వెళ్ళిపోయింది. ఎల్ఐసీలో పనిచేస్తున్న సుదర్శన్ అనే వ్యక్తి నాలుగు రోజులు ప్రయివేట్ ఆస్పత్రుల చుట్టూ తిరిగినా ఎక్కడా వైద్యానికి ఒప్పుకోలేదు. చివరికి ఎర్రగడ్డ చెస్ట్ ఆస్పత్రికి వెళ్లి ప్రాణాలు విడిచాడు. కావలసినంత నగదు రహిత మెడిక్లెయిం సదుపాయం ఉన్నప్పటికీ లక్ష రూపాయలు అడ్వాన్స్ కడితే గాని మేము ఆస్పత్రిలోకి రానివ్వం అంటూ ప్రయివేటు ఆస్పత్రులు అడగటం హదయవిదారకంగా ఉన్నది. గర్భిణీ స్త్రీలను కాన్పుల కోసం కూడా ఆస్పత్రుల్లో చేర్చుకోవడానికి ప్రయివేటు, ప్రభుత్వ ఆస్పత్రుల వాళ్ళు నిరాకరించడంతో రోడ్డుపైనే ప్రసవించి ప్రాణాలు వదిలిన తల్లుల గాధలు మాయనే లేదు. ఉత్తర్ప్రదేశ్, బీహార్, తెలంగాణ రాష్ట్రాల్లో ఈ సంఘటనలు నమోదయ్యాయి. రోగుల సంఖ్య విపరీతంగా పెరిగిపోవడం, వైద్యం చేసే వాళ్ళూ అనుమానంతో భయపడటం మనం చూస్తున్నాం. మరణించిన వారి శవాలను ధీనంగా ఖననం చేస్తున్న దశ్యాలూ, బంధువులెవ్వరూ ముట్టుకోలేని దురవస్థలూ అటు సైన్సునూ ఇటు మానవతా వాదాన్నీ సవాలు చేస్తున్నాయి.
కేంద్ర ప్రభుత్వమేమో కరోనాని కట్టిడి చేశామనీ ఆ ఘనత తమదేననీ ప్రకటిస్తున్నది. రాష్ట్ర ప్రభుత్వం గణాంకాలను విడుదల చేసే మాధ్యమంగా ఉంన్నది కానీ రోగులకు సరిపడా వైద్య సదుపాయాల కల్పనలో విఫలమౌతున్నది. ఉన్నఫళంగా ఆస్పత్రుల, వైద్యుల సంఖ్య పెంచ లేరు. మరి అలాంటప్పుడు ఏమి చేయగలం? ఎలాగూ కరోనాకు ప్రత్యేకమైన మందు లేదు, కాబట్టి, రోగి మానసిక శారీరక స్థితిని అదుపులో ఉంచడమే ప్రస్తుతం ఇస్తున్న వైద్యంలా కనిపిస్తున్నది. అందుచేత రోగులు ఆస్పత్రికి కాదు ఆస్పత్రియే వాడవాడలో రోగుల వద్దకు తరలి రావాలి. దీని కోసం- ప్రతి వీధిలో ఒక టెంట్ వేసి, వైద్య విద్యార్థులు రిజిస్టర్డ్ మెడికల్ ప్రాక్టీషనర్లు, హౌమియోపతి వైద్యులు మొదలగు, వైద్యంలో కాస్తోకూస్తో శిక్షణ కలిగి ఉన్న ప్రతి ఒక్క వ్యక్తిని వినియోగించుకుంటూ కావలసిన వైద్య సదుపాయాలను అందించాల్సిన ఎమర్జెన్సీ ఏర్పడింది. వీధి వీధికో వైద్యశాల వెలిస్తే మొదటగా ప్రజలకు మానసిక స్థైర్యం ఏర్పడుతుంది. ఆరోగ్యం కుదుటపడే అవకాశమూ ఉన్నది. పోలీసు పెట్రోలింగ్ వాహనాలలా హాస్పిటల్ పెట్రోలింగ్ వాహనాలు గల్లీ గల్లీల్లో తిరగవలసిన అవసరం ఉన్నది. అతిసార వ్యాధితో వాంతులు-విరేచనాలు జరిగినప్పుడు జాతర, పుష్కరాల సందర్భంగా ఎలాగైతే తాత్కాలిక టెంట్లు ఏర్పాటు చేసి వైద్యాన్ని అందిస్తారో ఆ రకంగా ఇప్పుడు ప్రతి వీధిలోనూ ఒక తాత్కాలిక ఆస్పత్రి ఏర్పాటు చేయవలసిందే. లేకపోతే ప్రజలకు విశ్వాసం రాదు. ఏ చిన్న అనుమానం వచ్చినా ఆస్పత్రికి పరిగెత్తడం, అక్కడ వైద్యం లభించడం లేదన్న సమాచారం తెలియగానే అది మరింత పెరగడం రోగికి అతని కుటుంబ సభ్యులకు మరింత కంగారు పుట్టి బెంబేలెత్తుతున్నారు. లక్ష టెస్టులు కూడా చేయని తెలంగాణలో ఇరవై వేల పాజిటీవ్ కేసులు బయట పడ్డాయంటే ఇక టెస్టుల సంఖ్య పెరిగితే ఎంత ప్రమాదం ఉందో అర్థం చేసుకోవచ్చు. వీధులే కాదు అవసరమైతే ప్రతి ఇంటినీ ఒక ఆస్పత్రిగా మార్చి, కావలసిన సదుపాయాలేవో వివరించి అక్కడే వైద్యం అందేలా ప్రయత్నం చేయాలి. జనసాంద్రత ఎక్కువగా ఉన్న కూడళ్ళను ఖాళీ చేయించి బహిరంగ ప్రదేశాల్లో తాత్కాలిక నివాసాలు ఏర్పరచి ఆరోగ్యకరమైన ఆహారాన్ని సామూహికంగా కొన్నాళ్ళు అందించడం ఇప్పుడు అత్యవసరం. ఏడు కోట్ల టన్నుల ఆహార నిల్వలు ఉన్నాయంటున్నారు కాబట్టి ఇది సాధ్యం అయ్యే పనే. దీనిపై సత్వర ఆలోచన చేయాలి.
మనిషికి ఎన్నో రకాల రోగాలు వస్తుంటాయి, కానీ ఇప్పుడు జబ్బుతో ఆస్పత్రికి వెళ్లిన ప్రతి వాళ్ళని కరోనా సోకిందేమో అన్న అనుమానంతో చూస్తున్నారు. మనిషికి మనిషి దగ్గరగా కూర్చోవాలంటే భయం, అతి సాధారణంగా వచ్చే దగ్గు తుమ్ములను ఎవరేమనుకుంటారోనన్న సంశయంతో బలవంతంగా అదుపు చేసుకునే న్యూనతా భావపు ఇన్ సెక్యూరిటీ ఏర్పడింది. కరోనా సోకుతుందేమో అన్న భయం, ఏమి తింటే ఏమవుతుందోనన్న భయంతో కొందరు బిక్కు బిక్కు మంటున్నారు, కరోనాని కట్టడి చేయడం కోసం వాట్సప్ సలహాలతో ఏదంటే అది తిని ఏదంటే అది తాగి ఇంకొందరు మరో రకమైన అనారోగ్యం పాలౌతున్నారు. డి విటమిన్, సి విటమిన్, జింకోవిట్ వగైరా మందులేసుకుంటూ సలహాల వైద్యంపై ప్రజలు సతమౌతున్నారు.
ప్రతి పది వేల మందికి అమెరికాలో 26 బ్రెజిల్లో 22 మంది డాక్టర్లు ఉన్నారు. భారత్లో అది ఐదు కన్నా తక్కువగా ఉన్నది. దీనిని బట్టి డాక్టర్ల అవసరాన్ని ఎన్నో దశాబ్దాలుగా నిర్లక్ష్యం చేశామన్నది బహిర్గతం. 130 కోట్ల జనాభా ఉన్న దేశంలో రీసెర్చ్ చేయడానికి రోగుల సంఖ్య కూడా తక్కువేమీ కాదు, అయినప్పటికీ డాక్టర్ల సంఖ్య ఇంత తక్కువ స్థాయిలో ఎందుకు వున్నదో ఇండియన్ కౌన్సిల్ ఫర్ మెడికల్ రీసెర్చ్ (ఐ.సి.ఎమ్.ఆర్) వివరించాలి. ఇప్పటికైనా దీనిపై శ్రద్ధ పెట్టాలి. పారా మెడికల్ స్టాఫ్ను అత్యవసర పరిస్థితుల్లో వినియోగించడం తప్ప సరైన శిక్షణతో వారి నైపుణ్యాన్ని పెంచి యదా సన్నద్దులను చేయలేదు. రిజిస్టర్డ్ మెడికల్ ప్రాక్టీషనర ్(ఆర్.ఎమ్.పి)లను పూర్తి కాలం హెల్త్ వర్కర్లుగా గుర్తించి వారి సేవలను అవసరమైన చోట విస్తృత పరచగలమన్న దానిపై దృష్టి పెట్టాలి. కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ క్రింద చాలా కార్పొరేట్ ఆస్పత్రులు ''టెన్ కె రన్లు'', ఉచిత కంటి శిబిరాలు వంటివి నిర్వహించి చేతులు దులుపుకుంటాయి. ఈ సి.ఎస్.ఆర్ క్రింద మురికి వాడల నిర్మూలన, హెల్త్ వర్కర్లను తయారు చేసే నిర్దేశిత బాధ్యతలను అప్పజెప్పడం అవసరం. ఇక వియత్నాం, న్యూజీలాండ్ క్యూబా వంటి దేశాలు ప్రజారోగ్యం ప్రభుత్వ బాధ్యత అంటూ తీసుకుంటున్న జాగ్రత్తలు ఆదర్శంగా తీసుకోవాలి. మన దేశంలోనూ కేరళ, కొన్ని ఈశాన్య రాష్ట్రాల మాదిరి పకడ్భందీగా కట్టడి చేయగలగాలి.
ఢిల్లో, ముంబరు, హైదరాబాద్ పట్టణాల్లో అత్యధికంగా కరోనా విస్తరిస్తున్నది. పట్టణ ప్రాంతాల్లో అంటువ్యాధులు విపరీతంగా ప్రబలడానికి ప్రధాన కారణం పారిశుద్ధ్య లోపం, అధిక జన సాంద్రత, సామూహిక, సురక్షితం కాని రవాణా వ్యవస్థ మొదలగునవి. లాక్డౌన్ ఎత్తి వేసిన తరువాత కొన్ని రాష్ట్ర ప్రభుత్వ ఆఫీసులు మినహా కేంద్ర సంస్థలతో సహా మిగతావన్నీ వంద శాతం ఉద్యోగుల హాజరుతో నడుస్తున్నవి. ప్రజా రవాణా లేకపోవడంతో షేర్ ఆటోల్లో ఇరుక్కుని ప్రయాణించడంతో భౌతిక దూరాన్ని పాటించడం గగనమౌతున్నది. అన్ని ఆఫీసుల్లో యాబైశాతం హాజరు ఈ సమస్యకు కొంత పరిష్కారం చూప గలదు. అత్యంత ప్రాధాన్యం గల ఈ అంశాలను నిరంతర ఎజెండాలో భాగం చేసుకోక పోతే భారీ మూల్యం చెల్లించాల్సిందే.
జి. తిరుపతయ్య
సెల్: 9951300016