Authorization
Mon Jan 19, 2015 06:51 pm
వాస్తుకారణాల వల్ల తన అధికారిక భవనానికి రావడానికి ఇష్టపడని ముఖ్యమంత్రి అసలు ఆ భవనాలనే లేకుండా చేయడానికి ప్రయత్నించి సఫలం కావడం చరిత్రలో ఏ దేశంలోనైనా, ఏ కాలంలోనైనా జరిగిందో లేదో తెలియదు గాని ఘనమైన చరిత్ర కలిగిన తెలంగాణ ఆ చారిత్రక ఘనత కూడ సాధించింది. మంత్రివర్గమూ, ప్రజా ప్రతినిధులు అని చెప్పబడేవాళ్లూ, అధికారబృందమూ, ఉన్నత న్యాయస్థానమూ, ప్రచార సాధనాలూ కూడ ఆ మూఢత్వాన్ని వేరు వేరు కారణాల మీద సమర్థిస్తుండగా నాలుగు కోట్ల ప్రజలు మౌన సాక్షులుగా నిలబడడం మాత్రమే కాదు, ఆ మూఢ విశ్వాసపు ఖరీదుగా ఇప్పటికి లెక్కిస్తున్న ఐదు వందల కోట్ల రూపాయలను భరించడం కూడ జరిగిపోతున్నది.
తెలంగాణ రాష్ట్రపు చారిత్రక సంపద, ఆరు దశాబ్దాల పాటు నిజాం ప్రభుత్వానికి, ఆ తర్వాత ఆరు దశాబ్దాలు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి, ఆరు సంవత్సరాల పాటు తెలంగాణ ప్రభుత్వానికి అధికారస్థానంగా ఉన్న సెక్రటేరియట్ భవనం కూల్చివేత మొదలైందని ఇప్పుడే వార్తలు వస్తున్నాయి. మీరిది చదువుతున్న సమయానికి ఆ ఎనిమిది భవనాలలో గణనీయమైన భాగం నేలమట్టం అయిపోవచ్చు. హైదరాబాద్ నడిబొడ్డున, హుసేన్సాగర్ తీరాన ఇరవై ఐదున్నర ఎకరాల నేల ఖాళీ అయిపోవచ్చు. వాగ్దానం చేసినట్టుగా కొత్త సెక్రటేరియట్ భవనాలు అక్కడే నిర్మాణమవుతాయా, రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన నమూనాసాకారమవుతుందా, గతంలోని అనేక వాగ్దానాల లాగనే ఈ భారీ వాగ్దానం కూడ చిత్తు కాగితంగా మిగిలిపోతుందా, లేదా కొందరు పరిశీలకులు అనుమానిస్తున్నట్టు, కనీసం రెండు వేల కోట్ల రూపాయల ఖరీదైన ఆ ఖాళీ స్థలం రియల్ ఎస్టేట్గా మారి ఏ కార్పొరేట్ల చేతికో, బేనామీల చేతికో చేరుతుందా భవిష్యత్తు తేలుస్తుంది. కానీ ఈ ఉద్దేశపూర్వక విధ్వంసం గురించి తెలంగాణ సమాజం ఆలోచించవలసిన విషయాలు మాత్రం చాల ఉన్నాయి.
ఏ నిర్ణయం గురించైనా, ఏ చర్య గురించైనా మొట్టమొదటిప్రశ్న దాని అవసరం ఏమిటనేది. అది అనివార్య మైనదా అనేది. ఒక వ్యక్తి, తన జీవితానికి, తన కుటుంబానికి సంబంధించిన నిర్ణయం, చర్య తీసుకున్నప్పుడైనా ఎవరైనా ఈ ప్రశ్న వేస్తారు. అటువంటప్పుడు, అది ఒక సమాజానికంతటికీ సంబంధించిన నిర్ణయం, చర్య అయినప్పుడు, ఆర్థిక వ్యవస్థ మీద ప్రభావం వేసేదైనప్పుడు, ఆ నిర్ణయాన్ని ఒకానొక వ్యక్తి తన ఇష్టాయిష్టాల ప్రకారం, తన మూఢ నమ్మకాల ఆధారంగా తీసుకున్నప్పుడు, ఈ అవసరం ఏమిటనే ప్రశ్న ప్రధానమవుతుంది.
నిన్నటి దాకా ఉండిన సెక్రటేరియట్ అనేదాన్ని మొత్తంగా ఒకటిగా పరిగణించడానికి కూడ వీలులేదు. ఆ ప్రాంగణంలో 1888లో నిర్మించిన ఒక భవనం నుంచి 2012లో నిర్మించిన రెండు భవనాల వరకు వేరు వేరు కాలాల్లో, ఆయా కాలపు అవసరాల కోసం నిర్మించిన ఎనిమిది భవనాలున్నాయి. వాటిలో కనీసం ఆరు భవనాలకు ఇంకా ముప్పై నుంచి అరవై సంవత్సరాల పాటు ఉపయోగకరంగా ఉండే సామర్థ్యం ఉంది.
ఇవాళ రెండు రాష్ట్రాలుగా మారిన మొత్తం ప్రాంతానికీ అవసరమైన పాలనా సేవలను 2014 జూన్ 2 వరకూ ఈ భవనాలే అందించాయి. ఈ భవనాలలో దాదాపు సగభాగాన్ని ఆక్రమించి ఉండిన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తన భవనాలను ఖాళీ చేసిన తర్వాత తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి అవసరమైన దానికన్న ఎక్కువ స్థలమే అందుబాటులోకి వచ్చింది. ఆ భవనాలలో కొన్ని శిథిలం అయ్యే స్థితిలో ఉన్న మాట నిజమే. వాటిని మరమ్మత్తు చేయడమో, వాటిని కూల్చి ఆ స్థానంలో కొత్తవి కట్టడమో అవసరమే కావచ్చు. కానీ ఎనిమిది సంవత్సరాల కింద కట్టిన భవనాలతో సహా సమస్త భవనాలనూ కూలగొట్టవలసిన అవసరమేమిటి అనే ప్రశ్నకు ఇప్పటివరకూ సంతప్తికరమైన జవాబు లేదు. బుకాయింపులు, దబాయింపులు మాత్రమే ఉన్నాయి.
రెండో ప్రశ్న ఆ నిర్ణయం మంచిదైనా కాకపోయినా, పద్ధతి ప్రకారం జరిగిందా లేదా అనేది. కొత్త భవన నిర్మాణ అవసరం లేకపోయినా ఆ నిర్ణయం తీసుకున్నారని ఇతరులు అనుకోవచ్చు, అవసరం కొద్దీ మాత్రమే ఈ నిర్ణయం తీసుకున్నామని ఏలినవారు అనుకోవచ్చు. ఈ పరస్పర భిన్నాభిప్రాయాల మధ్య వాస్తవం తేలవలసింది ఆ నిర్ణయపు హేతుబద్ధత, అనివార్యత ఆధారంగా మాత్రమే. తనకు తాను ప్రజాస్వామిక పాలన అనీ, ప్రజా ప్రాతినిధ్య పాలన అనీ చెప్పుకునే ప్రభుత్వం, ఆ నిర్ణయం తీసుకోవడానికి కారణాలేమిటో ప్రజలతో పారదర్శకంగా పంచుకోవలసి ఉంటుంది. ఆ నిర్ణయం తీసుకోవడానికి పాటించవలసిన ఆమోదయోగ్యమైన, గతం నుంచి వారసత్వంగా వస్తున్న పద్ధతి ఉంటుంది. ఆ నిర్ణయానికి ప్రజామోదం పొందవలసి ఉంటుంది. కానీ మహా ఘనత వహించిన తెలంగాణ ప్రభుత్వం ఆ పద్ధతులలో ఏ ఒక్కదాన్నీ పాటించలేదు. 2014 జూన్ 2న అధికారానికి వచ్చిన ఈ ప్రభుత్వం ఏడు నెలల్లోనే 2015 జనవరి 31న సెక్రటేరియట్ను మార్చాలని, ఆ భవనాలను కూల్చాలని నిర్ణయం తీసుకుంది. కారణమేమిటో ప్రకటించలేదు గాని తెలంగాణాధీశుల వాస్తు నమ్మకాలే అందుకు కారణమని ఊహాగానాలు వెలువడ్డాయి. ఆ తర్వాత ఆయన సెక్రటేరియట్ ముఖం చూడకపోవడం ఆ ఊహాగానాలు చాల మంది నమ్మడానికి దారితీసింది. ఆ నిర్ణయాన్ని సవాల్ చేస్తూ హైకోర్టులో దాఖలైన ప్రజా ప్రయోజన వ్యాజ్యాల మీద విచారణ జరుగుతుండగానే, 2019 జూన్ 18న రాష్ట్ర మంత్రివర్గం అదే నిర్ణయం మరొకసారి తీసుకుంది. 2015 నిర్ణయం మీద దాఖలైన మూడు ప్రజా ప్రయోజన వ్యాజ్యాలకు తోడు, కొత్త నిర్ణయం మీద మరొక రెండు ప్రజా ప్రయోజన వ్యాజ్యాలు దాఖలయ్యాయి.
మొదటి మంత్రివర్గ నిర్ణయానికీ, రెండో మంత్రివర్గ నిర్ణయానికీ మధ్య నాలుగున్నర సంవత్సరాల ఎడం ఉన్నప్పటికీ, మొదటి నిర్ణయం మీద అప్పటికే కోర్టు విచారణ జరుగుతున్నప్పటికీ, ఈ రెండు నిర్ణయాలూ కూడ వ్యవస్థీకృత పద్ధతి ప్రకారం జరగలేదు. ఆ నిర్ణయం తీసుకోవడానికి ఏ కారణాలు దారి తీశాయో, ఏ సమాచారం ఆధారంగా, ఏ నివేదికల ఆధారంగా, ఏ సిఫారసుల ఆధారంగా ఆ నిర్ణయం తీసుకున్నారో చర్చ లేదు. మంత్రివర్గపు మినిట్స్లో నమోదు లేదు. అసలు చర్చ జరిగిందా లేదా తెలియదు. రెండో నిర్ణయం జరిగిన తర్వాత రెండు నెలలకు ఆ నిర్ణయాన్ని సమర్థించే ఒక సాంకేతిక నిపుణుల కమిటీ సిఫారసులను, ఒక మంత్రివర్గ ఉపసంఘం సిఫారసులను తయారు చేశారు. అంటే హేతుబద్ధమైన, పారదర్శకమైన కారణాల ఆధారంగా నిర్ణయం జరగవలసి ఉండగా, నిర్ణయం జరిగిపోయి, నిర్ణయానంతర కారణాల తయారీ కార్యక్రమం నడిచింది.
ఈలోగా ఉన్న సెక్రటేరియట్లో ఉన్న లోపాల గురించి ఉన్నవీ లేనివీ నివేదికలు తయారు చేయించారు. ఆశ్చర్యకరమైన విషయమేమంటే ఆ భవనాల నిర్మాణంలో భవన నిర్మాణ సెట్ ఆఫ్ (చుట్టూ చట్టబద్ధంగా ఉంచ వలసిన ఖాళీలు) నిబంధనలు పాటించలేదని ఆ నివేదికలు చెప్పాయని కోర్టు ముందర వాదించారు. అసలు ప్రభుత్వమే తాను నిర్మించిన భవనంలో తన నిబంధనలను పాటించలేదని, ఇప్పుడు ప్రభుత్వమే కోర్టు ముందర చెప్పడం బాగుంది. సెట్ ఆఫ్ నిబంధనలు పాటించలేదు గనుక ఆ భవనాలను కూలగొట్టడం సమర్థనీయమే అని వాదించడం మరీ బాగుంది. మరి రాష్ట్రంలో సెట్ ఆఫ్ నిబంధనలు పాటించని భవనాలు లక్షల సంఖ్యలో ఉంటాయి. ఆ లక్షలాది భవనాలను కూడ నేలమట్టం చేయడానికి ప్రభుత్వం దగ్గర ప్రణాళిక ఏదైనా ఉందా?
ఈ నిర్ణయం పాలనకు సంబంధించినదైనప్పుడు, దాని ఆర్థిక పర్యవసానాలు ఏమిటనేది మరొక ప్రశ్న. ఉపయోగకరంగా ఉన్న భవనాలను అవసరం లేకుండానే కూల్చడం, కొత్త భవనాలు నిర్మించడం ప్రజా సంపదకు, రాష్ట్ర ఖజానాకు ఎంత భారంగా మారనున్నదో, ఆ వ్యయం హేతుబద్ధత ఏమిటో కూడ ప్రభుత్వం ప్రజలకు వివరంగా చెప్పవలసి ఉంటుంది. కొత్త భవనాలకు నాలుగు వందల నుంచి ఐదు వందల కోట్ల రూపాయలు ఖర్చు అవుతుందని ఒక అంచనా వినబడుతున్నది. ప్రస్తుతం ఉన్న భవన నిర్మాణ గణాంకాలను బట్టి ఒక లక్ష చదరపు అడుగుల కార్యాలయ స్థలం నిర్మించడానికి అంత వ్యయం అవసరం లేదు. కాని ఈ ఐదు వందల కోట్ల రూపాయల అంకె ఎలా వచ్చిందో, పోనీ ఆ నిర్మాణ వ్యయానికైనా కట్టుబడి ఉంటారో లేదో ఎవరికీ తెలియదు. ముపై ఎనిమిది వేల కోట్ల వ్యయాన్ని రాత్రికి రాత్రి ఎనబై వేల కోట్లకు, అక్కడి నుంచి ఒక లక్షా ముప్పై వేల కోట్లకు పెంచిన ఘనచరిత్ర ఉన్న ప్రభుత్వమిది. వ్యయానికి ఇంజనీరింగ్ నిర్మాణ లెక్కలూ, సాధారణంగా అనుసరించే లెక్కలూ ఏమీ పాటించకపోవడమే తెలంగాణ సాధించిన విజయం. కాంట్రాక్టర్ల కోసం నిర్మాణాలూ, వారి కోసమే ఇబ్బడి ముబ్బడిగా నిర్మాణ వ్యయ అంచనాల పెంపులూ, అందులో రాజకీయ నాయకత్వ ముడుపులూ మాత్రమే ప్రస్తుతం రాష్ట్రంలో ప్రజాధన గణాంకాలను నిర్ణయిస్తున్నాయి. కనుక అనవసరమైన ఈ కొత్త సెక్రటేరియట్ నిర్మాణం ఎప్పటికి పూర్తవుతుందో, ఆ ఐరావతం పూర్తయ్యే నాటికి తెలంగాణ ప్రజల మీద ఎంత భారంగా మారుతుందో భవిష్యత్తే చెప్పాలి.
ఈ వ్యవహారంలో ప్రజా ప్రయోజన వ్యాజ్యాలలో న్యాయస్థానం తీసుకున్న వైఖరి మరింత అన్యాయంగా ఉన్నది. ఐదు ప్రజా ప్రయోజన వ్యాజ్యాలు ఏడు కీలక అంశాలను లేవనెత్తాయి. ప్రభుత్వ నిర్ణయం చట్ట రీత్యానైనా, పాలనా పద్ధతుల రీత్యానైనా, ప్రభుత్వానికి ఉండవలసిన పారదర్శక విధానాల రీత్యానైనా, పాలకుల నిర్ణయానికి ప్రజలు చెల్లించవలసి వస్తున్న మూల్యం రీత్యానైనా అన్యాయమైనదని, అనవసరమైనదని, అనుచితమైనదని, అక్రమమైనదని న్యాయవాదులు వాదించారు. విచారణ జరుగుతున్న కాలంలో ఈ అనౌచిత్యాన్ని సరిగానే గుర్తించిన, కొన్నిసార్లు తీవ్రమైన ప్రభుత్వ వ్యతిరేక వ్యాఖ్యలు కూడ చేసిన న్యాయస్థానం ఆశ్చర్యకరంగా చివరికి వచ్చేసరికి ఆమోదించడానికి వీలులేని తీర్పు ప్రకటించింది.
రాజనీతి శాస్త్ర చరిత్రలో, ఆధునిక రాజ్య పరిణామంలో అధికారాల విభజన అనేది కీలక సూత్రం. రాజ్యంలో మూడు భాగాలైన చట్టసభ, అధికార వ్యవస్థ, న్యాయవ్యవస్థల మధ్య అధికారాల విభజన ఎలా జరిగిందో, ఏ వ్యవస్థ అధికారాలకు ఎన్ని పరిమితులు, ఎన్ని అవకాశాలు ఉంటాయో రాజనీతి శాస్త్రంలో చాల చర్చ జరిగింది. ఆ చర్చలో నికరంగా తేలిన అంశం చట్టసభల, అధికార్యవ్యవస్థల నిర్ణయాలను సమీక్షించే అధికారం న్యాయవ్యవస్థకు ఉండాలనేది. అది కూడ నిరంకుశ అధికారమేమీ కాదు. దానికి కూడ పరిమితులు, ఆంక్షలు ఉన్నాయి. కాని ఇటీవల న్యాయవ్యవస్థ తన అధికారాన్ని తానే కత్తిరించుకుంటున్నది. రాజకీయ, అధికార యంత్రాంగాలకు అనుకూలమైన తీర్పులు ఇస్తూ తన సమీక్షాధికారాన్ని తానే వదులుకుంటున్నది. ఆ క్రమంలో కొన్ని ఆమోదించడానికి వీలులేని తీర్పులు వచ్చాయి. చట్టసభలు, అధికార వ్యవస్థలు, ప్రభుత్వాలు తీసుకునే విధాన నిర్ణయాలలో తాము జోక్యం చేసుకోలేమని, చేసుకోబోమని అంటూ ప్రభుత్వాల నిరంకుశ, నిర్హేతుక, ప్రజావ్యతిరేక విధానాలకు న్యాయస్థానాలు పచ్చజెండా ఊపుతున్నాయి. ఇప్పుడు ఈ ఉదంతంలో కూడ న్యాయస్థానం అటువంటి అన్యాయమైన, అచారిత్రకమైన, చట్టవ్యతిరేకమైన వైఖరి తీసుకుని ప్రభుత్వ అనుచిత నిర్ణయాన్ని సమర్థించింది.
'మంత్రివర్గ నిర్ణయం అంతిమం కాదు, మధ్యంతరమే, మూడు అంచెల నిర్ణయ ప్రక్రియలోఅది మొదటి దశ మాత్రమే' అని ప్రభుత్వ న్యాయవాది వాదనను కోర్టు అంగీకరించింది గాని, ఆ తీర్పు వెలువడిన కొద్ది రోజుల్లోనే ఆ నిర్ణయ ప్రక్రియలో మూడో దశ అయిన నిర్ణయం అమలు - కూల్చివేత హడావిడిగా ప్రారంభమయిందంటే కనీసం తీర్పులోచెప్పిన సమర్థనకైనా ప్రభుత్వం కట్టుబడలేదన్నమాట.
ఏలిక వాస్తు నమ్మకమే సెక్రటేరియట్ మార్పుకు కారణమనేది అందరికీ తెలిసిన బహిరంగ రహస్యం అయినప్పుడు, 'రాజ్యం మూఢనమ్మకాలకు వ్యతిరేకంగా పనిచేయాలి' అనే రాజ్యాంగ ఆదేశిక సూత్రానికి అది ఉల్లంఘన అవుతుంది.
వాస్తుకారణాల వల్ల తన అధికారిక భవనానికి రావడానికి ఇష్టపడని ముఖ్యమంత్రి అసలు ఆ భవనాలనే లేకుండా చేయడానికి ప్రయత్నించి సఫలం కావడం చరిత్రలో ఏ దేశంలోనైనా, ఏ కాలంలోనైనా జరిగిందో లేదో తెలియదు గాని ఘనమైన చరిత్ర కలిగిన తెలంగాణ ఆ చారిత్రక ఘనత కూడ సాధించింది. మంత్రివర్గమూ, ప్రజా ప్రతినిధులు అని చెప్పబడేవాళ్లూ, అధికారబృందమూ, ఉన్నత న్యాయస్థానమూ, ప్రచార సాధనాలూ కూడ ఆ మూఢత్వాన్ని వేరు వేరు కారణాల మీద సమర్థిస్తుండగా నాలుగు కోట్ల ప్రజలు మౌన సాక్షులుగా నిలబడడం మాత్రమే కాదు, ఆ మూఢ విశ్వాసపు ఖరీదుగా ఇప్పటికి లెక్కిస్తున్న ఐదు వందల కోట్ల రూపాయలను భరించడం కూడ జరిగిపోతున్నది.
ఎన్. వేణుగోపాల్
సెల్: 9848577028