Authorization
Mon Jan 19, 2015 06:51 pm
''పవర్లేని పదవి వల్ల మా బతుకులు బజారున పడ్డాయి. ఉత్సవ విగ్రహాల్లాగా బతుకు తున్నాం. గెలిచి ఏడాదైంది.. ఎన్నికల ముందు ప్రజలకు ఇచ్చిన ఏ ఒక్క హామీ నెరవేర్చలేదు. సర్పంచుల మాదిరిగానే మేం కూడా ప్రజల ఓట్లతోనే ఎన్నికయ్యాం. కానీ, ప్రత్యేకంగా నిధులు లేవు.. విధులు లేవు. గ్రామ పంచాయతీలో కూర్చుందా మంటే కనీసం కుర్చీలేదు. గ్రామాల్లో చిన్న చిన్న పనులు కూడా చేయలేని దౌర్భాగ్య పరిస్థితిలో ఉన్నాం.'' ఇదీ దేశంలోని అధికార పార్టీ ఎంపీటీసీలతో పాటు ప్రతిపక్ష ఎంపీటీసీ సభ్యుల ఆవేదన. ప్రత్యక్షంగా ప్రజలతో ఎన్నుకోబడిన మండల పరిషత్ ప్రొదేశిక సభ్యులు(ఎంపీటీసీలు) నిధులూ, విధులూ రెండూలేక నీరసించి పోతున్నారు. మండలపరిషత్ సమావేశాల్లో ప్రజా సమస్యలను సభదృష్టికి తీసుకెళ్లే అవకాశమే గానీ ఎంపీటీసీ సభ్యులను ఎవరూ పట్టించుకోవడం లేదు. తాము ప్రాతినిధ్యం వహిస్తున్న ప్రాదేశిక నియోజకవర్గంలోని గ్రామాల ప్రజల అవసరాల నిమిత్తం అభివృద్ది పనులు చేపట్టలేకపోతున్నారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను నెరవేర్చలేక ప్రజల్లో తలెత్తుకోలేకపోతున్నారు. మండల పరిషత్లకు ఒకప్పుడు ప్రత్యేక నిధులు కేటాయించేవారు. ప్రస్తుతం చిల్లిగవ్వ లేకుండా పోయింది. నిధుల జాడలేక ప్రస్తుతం ఎంపీటీసీలు ఉత్సవ విగ్రహాలుగా మారి ప్రజల్లో ముఖం చాటేస్తున్నారు. జిల్లాలో గతేడాది జూన్ 4న ఎంపీటీసీల ఫలితాలు వెలువడ్డాయి. జూలై 3న ప్రమాణ స్వీకారం చేశారు. ఎంపీటీసీల పదవీ కాలం ఏడాది గడిచిపోయింది. ఎంపీటీసీలకు ప్రత్యేకంగా నిధులు కేటాయింపుతో పాటు గ్రామ పంచాయతీల్లో ప్రత్యేక గది, సర్పంచులకు కేటాయిస్తున్నట్టుగానే సాదారణ నిధులు కేటాయించాలని కోరుతూ అధికారపార్టీ ఎంపీటీసీ సభ్యులు ఇటీవలనే రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు బోయిన్పల్లి వినోద్కుమార్కు వినతిపత్రం సమర్పించారు. నిధుల కేటాయింపు విషయంలో అధికారపార్టీలో ఉండి వినతిపత్రాలు ఇచ్చే దుస్థితి రావడం బాధాకరమని ఆవేదన వ్యక్తం చేశారు. మండల పరిషత్లకు గతంలో బీఆర్జీఎఫ్ తలసరి గ్రాంట్ జనరల్ ఫండ్, స్టేట్ ఫైనాన్స్ కార్పొరేషన్, 14వ ఆర్థిక సంఘం గ్రాంట్లతో కలిపి నిధులు సమకూరేవి. దీంతో గ్రామాల్లో డ్రైనేజీలు, సీసీ రోడ్లు, అంతర్గత రోడ్ల నిర్మాణ పనులు చేపట్టేవారు. ప్రస్తుతం ఒక్కదానికి కూడా నిధులురాని పరిస్థితి. వీరికి ప్రత్యేక నిధులు కేటాయిస్తామని గతంలో ప్రభుత్వం ప్రకటన చేసినా.. నేటికీ నిధులు విడుదల చేయలేదు. సర్పంచులతో సమానంగా నిధులు కేటాయించాలని పలుమార్లు మండల సర్వసభ్య సమావేశాల్లో కోరినా పట్టించుకునేవారు కరువయ్యారని ఎంపీటీసీలు ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. గ్రామ పంచాయతీ కార్యాలయంలో సర్పంచ్, ఉపసర్పంచ్కు మాత్రమే గదులు ఉన్నాయి. ఎంపీటీసీలకు మాత్రం ప్రత్యేక గది అంటూ లేదు. కనీసం జీపీ కార్యాలయంలోకి వెళ్తే వార్డు మెంబర్ల కంటే తక్కువగా చూస్తున్నారని ఎంపీటీసీలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నెలనెలా గ్రామాల్లో నిర్వహించే గ్రామసభలకు కూడా తమకు ఆహ్వానం పంపడం లేదని కొంతమంది ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. ఇదే విషయమై వీణవంక మండలంలోని ఓ గ్రామంలో సర్పంచ్, ఎంపీటీసీ బహిరంగంగానే తిట్టుకున్నారు. మూడు నెలలకోసారి జరిగే మండల సర్వసభ్య సమావేశానికి మాత్రమే తమకు ఆహ్వానం ఉంటుందని చెబుతున్నారు. అక్కడ సమస్యలపై గళమెత్తినా పరిష్కారం కావడంలేదని పేర్కొంటున్నారు. అందుకు ఎంపీటీసీలు కొన్ని డిమాండ్లు చేయడం జరిగింది. అందులో ఏటా రూపాయలు 10లక్షల ప్రత్యేక నిధులు కేటాయించాలి. స్వాతంత్య్ర దినోత్సవం రోజున మండల పరిషత్ పాఠశాలలో జాతీయ జెండా ఎగురవేసే అవకాశం కల్పించాలి. గ్రామ పంచాయితీల్లో సర్పంచ్లతో పాటు ఎంపీటీసీలకు ప్రాధాన్యత ఇవ్వాలి. జిల్లా ప్రణాళిక సంఘాలలో ఎంపీటీసీలను సభ్యులుగా నియమించాలి. గ్రామ పంచాయతీ కార్యాలయంలో ఎంపీటీసీలకు ప్రత్యేక కార్యాలయం కేటాయించాలి. సర్పంచ్లకు ఉన్న గౌరవం ఎంపీటీసీలకు లేకపోవడం బాధాకరం. కనీసం గ్రామ పంచాయతీల్లో ఎంపీటీసీలకు ప్రత్యేక ఆసనం లేకపోవటం విచారకరం. పేరు గొప్ప ఊరు దిబ్బ అన్నట్టుగా ఉన్నది. ప్రభుత్వం ప్రకటించినట్టుగా ఎంపీటీసీ సభ్యులకు ఎలాంటి ప్రోత్సాహకాలు అందడంలేదు. తెలంగాణ రాష్ట్రంలోని 33జిల్లాల్లో ఉన్న ఎంపీటీసీలు తమ గ్రామాల్లోని చిన్న చిన్న సమస్యను కూడా పరిష్కరించుకోలేని దుస్థితిలో ఉన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం తగిన గుర్తింపు ఇవ్వాలని ఆవేదన చెందుతున్నారు.
ఆర్. రాజేశం
సెల్: 9848811424