Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఇటీవల సీబీయస్ఈ, తొమ్మిది నుంచి పన్నెండవ తరగతి చదువుతున్న విద్యార్థులకు సిలబస్ తగ్గిస్తూ మార్గదర్శకాలు విడుదల చేసింది. ఈ మార్గదర్శకాలను మానవ వనరుల మంత్రిత్వశాఖ ఆదేశాల అనుసారం సీబియస్ఈ విడుదల చేసింది. అయితే ఎన్సీఈఆర్టీ పదకొండవ తరగతి రాజనీతి శాస్త్రంలో చేసిన ఈ మార్పుల పట్ల పౌర సమాజం నుంచి తీవ్ర వ్యతిరేకత ఎదురవుతోంది. రాజ్యాంగంలోని ప్రధాన అంశాలైన లౌకికవాదం, జాతీయవాదం, పౌరసత్వం, సమాఖ్యవాదం, స్థానిక ప్రభుత్వాలు వంటి అతిముఖ్యమైన అంశాలను సమూలంగా తొలగించింది. లౌకికవాదం, సమాఖ్యవాదం రాజ్యాంగంలోని మౌలిక స్వరూపంలోని అంశాలుగా ఉన్నాయి. గతంలో కేశవానందభారతి కేసు మొదలుకొని సుప్రీంకోర్టు ఇచ్చిన వివిధ తీర్పుల్లో రాజ్యాంగ మౌలిక స్వరూపాన్ని మనం గమనించవచ్చు. మౌలిక స్వరూప సిద్ధాంతం ప్రకారం పార్లమెంటు రాజ్యంగంలోని ఏ అంశాన్ని అయినా మౌలిక స్వరూపానికి విఘాతం కలగకుండా సవరించవచ్చు. అయితే విద్యార్థులకు సిలబస్ ఎక్కువయ్యిందన్న వాదన సరైనదనప్పటికి రాజ్యాంగ స్ఫూర్తిని తెలియజేసే లౌకికవాదం, సమాఖ్యవాదాలను సమూలంగా పాఠ్యపుస్తకాల నుంచి తొలగించడం సరైనదికాదు. విద్యార్థులు రాజ్యాంగంలోని అధికరణాలు తెలుసుకోవడం కన్నా కూడా రాజ్యాంగ స్ఫూర్తిని, లక్ష్యాలను తెలుసుకోవడం చాలా అవసరం. అయితే కేంద్ర ప్రభుత్వం ఈ విధంగా ఎంపిక చేసిన అంశాలనే తొలగించడం వెనుక ఉన్న అసలు రాజకీయ లక్ష్యాలను అందరూ గమనించాలి. హిందూ జాతీయవాద రాజకీయాలు చేస్తోన్న బీజేపీకి మొదటి నుంచి లౌకికవాదమన్నా, సమాఖ్యవాదం అన్నా మింగుడుపడని అంశాలుగా ఉన్నాయి. ఎప్పటికప్పుడు బీజేపీ ప్రభుత్వం రెండింటికీ తూట్లు పొడుస్తూనే ఉన్నది. ఇటీవల తెచ్చిన పౌరసత్వ సవరణ చట్టం తాజా ఉదాహరణగా చెప్పుకోవచ్చు. ఇది 14వ అధికరణ అయిన సమానత్వాన్ని, రాజ్యాంగ మౌలిక స్వరూపమైన లౌకికవాదానికి పూర్తిగా విరుద్ధమైనది. మరోవైపు సమాఖ్య స్ఫూర్తిని దెబ్బ తీసే విధంగా రాష్ట్రాలలో ఫిరాయింపులను ప్రోత్సాహించి ప్రభుత్వాలను కూల్చడం, రాష్ట్రాలకు ఇవ్వాల్సిన నిధులు సరైన సమయంలో ఇవ్వకపోవడం వంటి చర్యలు బీజేపీ హయాంలో చాలా సాధారణ విషయాలు అయిపోయాయి. సర్వధర్మ సమభావన మన రాజ్యాంగ లౌకికవాద విధానంగా ఉంది. అయితే ఇప్పుడు లౌకికవాదం అనే ఒక అంశాన్నే పాఠ్యాంశాల నుంచి తొలగించడం రాజ్యాంగ స్ఫూర్తిని విద్యార్థులకు దూరంచేసే ఒక ప్రక్రియకు ప్రారంభంగా భావించాలి.
విద్యార్థులు రాజ్యాంగంలోని అంశాలను యథాతథంగా తెలుసుకోవడంకన్నా రాజ్యాంగస్ఫూర్తిని, లక్ష్యాలను తెలుసుకోవడం చాలా అవసరం. అయితే ఈ అంశాలను కనీసం కొంతవరకు కుదించి పొందుపరిచే అవకాశం ఉన్నా కూడా ప్రభుత్వం పూర్తిగా తొలగించడానికే మొగ్గు చూపడం ఒక రాజకీయ లక్ష్యాన్ని చేదించే ప్రక్రియలో భాగం అని అనుకోవాల్సి ఉంటుంది.
పౌరుల రాజకీయ ప్రవర్తన వారు పాఠశాల స్థాయిలో నేర్చుకున్న విద్యా విధానం ద్వారా ఏర్పడుతుంది. పాఠశాల స్థాయిలో ఈ అంశాలను తొలగించడం వలన ఇవి అంత ముఖ్య అంశాలు కావు అని కేంద్ర ప్రభుత్వం ప్రత్యక్షంగానే ఒక సందేశాన్ని అందరికి ఇచ్చింది. పాఠశాల స్థాయి నుంచే విద్యార్థుల మెదళ్ళను తన రాజకీయ లక్ష్యాలకు అనుగుణంగా మార్చే ఒక ప్రయత్నాన్ని బీజేపీ చేస్తోంది. భారత రాజ్యాంగంలోని ప్రధాన అంశాలను విద్యార్థులకు చేరనీయ కుండా అడ్డుకునే ఈ ప్రయత్నాన్ని అందరూ ఖండించాలి. ఇలానే ప్రభుత్వాన్ని వదిలేస్తే రాజ్యాంగం నుంచి కూడా ఈ అంశాలను తొలగించే ప్రమాదం ఉంది. ఈ విషయం మీద విద్యావేత్తలు, మేధావులు, విద్యార్థులు అందరూ ఐక్యంగా కలిసికట్టుగా పోరాడి రాజ్యాంగ స్ఫూర్తిని కాపాడాలి.
జి. మోహిత్