Authorization
Mon Jan 19, 2015 06:51 pm
సమాజం అనాగరికతలోకి అజ్ఞానంలోకి వెళ్ళిపోతుంది. ఆ ప్రమాదం తప్పాలంటే వైజ్ఞానిక స్పృహతో విషయాల్ని ఎత్తి చూపే వైజ్ఞానికుల్ని, వైజ్ఞానిక రచయితల్ని, ప్రచారకుల్ని, కార్యకర్తల్ని పోత్సహించాలి. ఆరోగ్యకరమైన సమాజ నిర్మాణంలో వారందరి నిస్వార్థ సేవల్ని గుర్తుపెట్టుకోవాలి. గుర్తించి వారికేదో గౌరవం అంటగట్టాలని వారేమీ కలలుగనడం లేదు. సమాజం సుభిక్షంగా, చైతన్యవంతంగా, అర్థవంతంగా, హేతుబద్ధంగా మారితే చాలని కోరుకునే అల్పసంతోషులు వాళ్ళు! రాజ్యాంగ స్ఫూర్తిని నిలుపుతున్న వాళ్ళు!!
పూర్వకాలంలోని విజ్ఞానికన్నా, నేటి శాస్త్రవేత్తకు చాలా విషయాలు తెలుసు. కాలం మారుతూ ఉన్నా వారిరువురి ధ్యేయం ఒకటే. నిజాయితీగా మానవాళి శ్రేయస్సు కోసం కృషి చేసేవారు. కానీ, ఒకప్పటి రుషులు, నేటి మత గురువులు ఒకటి కాదు. నాటి రుషుల జీవన విధానం, ధ్యేయం ఒక రకంగా ఉంటే, నేటి గురువు, స్వామి, బాబా, పీఠాధిపతి, ముల్లా, ఫాదర్ల జీవన విధానం మరొకటిగా ఉంది. వీరివి నిజాయితీ లేని అబద్ధపు బతుకులు. రాజకీయ ప్రాబల్యంతో ఆస్తులు కూడబెట్టడం, రేప్లు, మర్డర్లు చేయడం వీరికి మామూలు. ఇక ఒకప్పటి రుషులు సర్వసంగ పరిత్యాగులైనా వారు సమాజానికి, సామాన్యుడికి చేసిన మేలు ఏమీలేదు. తమకు తపశ్శక్తులున్నాయని భ్రమింపజేసి రాజుల మీద అజమాయిషీ చేశారు. అంటే పరోక్షంగా రాజ్యపాలన చేస్తూ పబ్బం గడుపుకున్నారు. ఇప్పటి మత గురువులు కూడా పాలకులను ఆకర్షించి, వారిని తమ కాళ్ళదగ్గరికి రప్పించుకుని బలవంతులవుతున్నారు. నిజమే- కానీ వారు చేసిన, చేస్తున్న సంఘ విద్రోహ కార్యకలాపాల వల్ల జనం దృష్టిలో హీనులుగా మిగిలిపోతున్నారు.
విజ్ఞాని (శాస్త్రవేత్త) నిచ్చెనలోని ప్రతి మెట్టూ ఎక్కి పైకి చేరతాడు. రుషి (మతగురువు)కి నిచ్చెనలు, మెట్లూ ఉండవు. ఆత్మశక్తితో తన అంతర్లోకంలో ఒక బాహ్యలోకాన్ని ఊహించుకుంటాడు. అది అతని మెదడు భ్రమించిన వాస్తవం. దాన్నే అతను సత్యాన్వేషణ పూర్తయినట్టుగా భావిస్తాడు. తన అనుభవాల్ని ఈలోకానికి చెప్పే ప్రయత్నంలో సందేశమిస్తాడు. అతని మీదున్న గౌరవభావంతో జనం స్వీకరిస్తారే తప్ప, ఆ సందేశంతో గాని, అతని భ్రమపూరిత అనుభవంతోగానీ సమాజానికి జరిగే మేలు ఏమాత్రం ఉండదు. జనానికి అతని మీద గౌరవభావం ఎందుకు కలుగుతుందీ? అనంటే.. అతను ఐహిక సుఖాలు వదిలేసి, భవబంధాలు వదిలేసి, ఎక్కడో కీకారణ్యానికి తపస్సు కోసం వెళ్ళాడు కాబట్టి, అతను మహనీయుడై ఉంటాడని.. జనం భావించేవారు. జనం భావిస్తున్నారు కాబట్టి, వారి నమ్మకాన్ని వమ్ముచేయడం ఇష్టంలేక, రుషిపుంగవులు కూడా తమకేవో సర్వోన్నతమైన శక్తుల్ని ఆ సర్వేశ్వరుడు ప్రసాదించాడని అనుకునేవారు. అటు స్వాముల్లోనూ ఇటు భక్తుల్లోనూ నిజాయితీ అనేది ఉండేది కాబట్టి, ఒకరిపట్ల ఒకరికి శ్రద్ధా సక్తులు పెరిగేవి. ప్రేమ వాత్సల్యాలు పుట్టుకొచ్చేవి. నాటి గురువులు గొప్ప విషయాలు చెప్పి ఉండొచ్చు. నాటి శిష్యులు వాటిని భక్తి శ్రద్ధలతో విని ఉండొచ్చు. వాటి పట్ల మనకు ఇప్పుడు అభ్యంతరాలు ఉండాల్సిన పనిలేదు. బారతదేశంలో గొప్ప మునులు, యోగులు, సన్యాసులు, సర్వసంగ పరిత్యాగులు చాలా మంది ఉన్నారు. వారి బోధనల వల్ల కొందరికి కొంత స్వాంతన లభించిందేమోగానీ, వాటివల్ల ఏ ప్రగతీ జరగలేదు. సమాజం ఈ 21వ శతాబ్దంలోకి రాలేదు. ఆనాటి ప్రజల ఆరోగ్య రక్షణ కోసం గానీ, దేశ రక్షణ కోసం గానీ వారు నేరుగా చేసిందేమీ లేదు. తమను నమ్మి గురువుగా స్వీకరించిన రాజులకు, చక్రవర్తులకు సలహాలు సూచనలు ఇచ్చి ఉండొచ్చు గానీ - కార్యక్షేత్రంలో నిలబడే వారు ఎప్పుడూ వేరే ఉండేవారు.
ఆ రోజుల్లో కూడా పంట పండించేవారు, పశువులు మేపేవారు, నాగళ్ళు చేసేవారు, మట్టి పాత్రలు, లోహపాత్రలు చేసేవారు, గుడ్డ నేసేవారు, యుద్ధం చేసేవారు - అందిరికందరూ వేరే ఉండే వాళ్ళు. అప్పుడైనా, ఇప్పుడైనా సమాజం ముందుకు నడిచింది - శ్రమ శక్తిని ఉపయోగించే వారితోనే! తమ వివేకాన్ని ఉపయోగించి కొత్త పరికరాలు తయారు చేసిన వారితోనే! నూతన ఆవిష్కరణలు చేయగలవారితోనే.. ప్రపంచం ఆధునికతను సంతరించు కుంటూ వచ్చింది. పోనీ ఈ రుషుల వల్ల సమాజంలో ధర్మం, నైతికత కాపాడబడ్డాయా? అంటే అదీ లేదు. మన పురాణాల నిండా అవకతవకలు, అక్రమ సంబంధాలు, విచ్చలవిడితనం ఎందుకుందీ? అంటే - ఆ విషయంలో కూడా ఈ గురుస్వాములు విజయులు కాలేకపోయ్యారని మనకు అర్థమవుతూ ఉంది. విజ్ఞాని తన అంతర్చేతనతో బాహ్యలోకం లోని విషయాల్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తాడు. అది ఎప్పటికీ అయిపోయేది కాదు. నిరంతరం కొనసాగుతూ ఉండేదే! కొత్త ఆలోచనలు, కొత్త ఆవిష్కరణలతో జగతి ముందుకు అడుగేస్తూ వచ్చింది. నాగరికత, ఆధునికతలని సంతరించుకోగలిగింది. అది ఇంకా కొనసాగుతూ ఉంది. కొనసాగుతూనే ఉంటుంది. మానవ శ్రేయస్సుకు మానవుల కృషి ఒకనాటికి అయిపోయేది కాదు. వైజ్ఞానికుడు ఎప్పుడూ బోధనలు చేయడు. ఎవరైనా అడిగితే తన అనుభవాల్ని మాత్రమే పంచుతాడు. ప్రకృతిని, జీవితాన్ని తనదైన కోణంలో విశ్లేషిస్తాడు. జ్ఞాన పిపాసులు ఎవరైనా వాటిని ఉపయోగించు కుంటే బాగుపడతారు. వారే ఆ విషయాల్ని వచ్చే తరాలకు పంచుతారు. తనకు శిష్యులు, ప్రశిష్యులు ఉండాలని గాని, తన అనుభవాలు గొప్ప సుభాషితాలుగా జనం ఆమోదించాలని గాని వైజ్ఞానికుడు ఆశపడడు. ఆ గుణం రుషి పుంగవులకు, స్వాములకు, అర్చకులకు, ప్రవచకులకు, సంప్రదాయ పండితులకు, ఇతర మత గురువులకూ ఉంటుంది. 'ఖాళీ గిన్నెలు మాత్రమే ఎక్కువ శబ్దాలు చేస్తాయి' అనే మాట మనం వీరికి అన్వయించుకుని చూడొచ్చు.
పూర్వకాలంలోని విజ్ఞానిగానీ, రుషిగానీ ప్రేరణ పొందేవారు. సత్యాన్వేషణే తమ ధ్యేయం అని చెప్పుకునేవారు. అంతవరకు బాగానే ఉంది. కానీ వారి ఇద్దరి ప్రేరణలో, ఆలోచనా విధానంలో చాలా చాలా తేడా ఉండేది. రుషులు చెప్పిన సత్యం మార్మికమైంది. నిగూఢమైంది. అది వారి అంతర్వాణి మీద ఆధారపడి ఉండేది. అంతర్వాణి, అంతర్భుద్ది, అంతస్సాక్షి లాంటి మాటలు ఎన్నెన్నోవాడేవారు. ఎన్నివాడినా స్థూలంగా మనం గ్రహించవల్సిన విషయమేమంటే.. అది వారి మనసులోని మాట, భావన, ఆలోచన మాత్రమే. అది వారి విచక్షణా జ్ఞానాన్ని అనుసరించి ఉండేది. దాన్నే వారు 'దివ్య దృష్టి' అని కూడా చెప్పుకునేవారు. వీరు చెప్పే ఆ మార్మిక సత్యం ఎవరికీ అర్థమయ్యేది కాదు. అది అర్థం కావాలనుకునే వారు రుషిగా మారి తపస్సు చేసి, రుషి చేరుకున్న మానసిక స్థితికి చేరుకున్న వారికే 'సత్యం' గోచరించేది. అలాంటి సత్యాన్ని దర్శించగోరే వారంతా మళ్ళీ అలాంటి స్థితిలోకి పోవాల్సిందే. స్థూలంగా చెప్పుకోవాలంటే అందరి కందరు ఒక భ్రమల లోకంలో విహరిస్తే గాని ఆత్మసాక్షాత్కారం కాదు. సత్యం బోధపడదు. దీన్ని ఎవ్వరూ ప్రశ్నించడానికి ఉండదు. విశ్లేషించడానికి ఉండదు. జన సామాన్యానికి ఈ 'సత్యం' అందుబాటులోకి రాదు. ఇది విశ్వజనుల ఉమ్మడి ఆస్థికాదు. భ్రమల్లో బతికేవారికే పరిమితమైంది. అయితే ఇది ఎవరికీ ఉపయోగపడనిది!
విజ్ఞానుల - శాస్త్రవేత్తల విషయం వేరు. వారు వాస్తవంలోంచే సత్యాన్వేషణకు పూనుకునేవారు. వారికీ ఊహలు, ఆలోచనలు ఉంటాయి కానీ, వాటిని వాస్తవంలోకి మార్చడానికి వారు అహరహం తపిస్తారు. వారి కృషి కళ్ళూ, ముక్కూ మూసుకుని, సమాధి స్థితిలోకి పోయి చేసే తపస్సు కాదు. జ్ఞానేంద్రియాలన్నింటినీ మెలకువలో ఉంచి, చుట్టూ ఉన్న జగత్తును, విశ్వాన్ని, పర్యావరణాన్ని, సమాజాన్ని వేయికండ్లతో పరిశీలిస్తూనే పరిశోధిస్తుంటారు. వారి పరిశీలనల్లోంచి ప్రతిపాదనలు రూపుదిద్దుకుంటాయి. ప్రతిపాదనల్ని నిరూపించే దిశలో కృషి చేయగా చేయగా సఫలీకృతులై ఏదో ఒక సత్యాన్ని ఆవిష్కరించగలుగుతారు. ఆ రకంగా పరిశీలనల్ని, ప్రతిపాదనల్ని, నిరూపణల్ని వాస్తవంగా దాటుకుని వచ్చిన తర్వాతే అది బాహ్య ప్రపంచానికి తెలుస్తుంది. ఇలాంటి సత్యాన్ని తెలుసుకోవాలంటే విజ్ఞాని - శాస్త్రవేత్తలు నిరూపించి చెప్పిన సత్యాల్ని అధ్యయనం చేస్తే చాలు. ఇందులో మార్మికత ఉండదు. సత్యం అందరికీ అందుబాటులోకి వస్తుంది. అందరూ ఆ సత్యాన్ని ప్రశ్నించొచ్చు. విశ్లేషించొచ్చు. ఇది విశ్వజనుల ఉమ్మడి ఆస్థి అవుతుంది. జాతి, మత, ప్రాంతీయ బేధాలకు అతీతంగా వైజ్ఞానిక సత్యాలు అందరికీ అందుబాటులోకి వస్తాయి. అందరికీ ఉపయోగపడతాయి. ఇన్ని రోగాలకు ఇన్ని మందులు, వాక్సిన్లు వేరు వేరు దేశాల వైజ్ఞానికులు తమ పరిశోధనల ఫలితంగా ప్రపంచ మానవాళికి అందుబాటులోకి తెచ్చారు. ప్రాచీన విజ్ఞానమైనా, ఆధునిక విజ్ఞానమైనా ప్రపంచ మానవులంతా ఒక్కటే అని సైన్సు నిరూపించింది. అందులో జాతి, మత, వర్గ, వర్ణ, ప్రాంతీయ బేధాలకు తావేలేదు. దాన్ని విజ్ఞతతో మనమందరం గ్రహించాలి. తప్పదు! గ్రహించలేనివారు మూఢుల కింద, మూర్ఖుల కింద జమకట్ట బడతారు. అది వేరే విషయం!
విశ్వాసాల మీద తమ సత్యాన్ని, సత్య సూత్రాల్ని నిలబెట్టుకోవాలనుకునే మత బోధకులకు స్వేచ్ఛ, సమానత్వం, సహకారం, సహనం ఉండవు. వాటిని వాళ్ళు ఎప్పుడూ ఏ విధంగానూ ప్రబోధించరు. వివేచన, మానవత్వం, ఆత్మగౌరవం, నిజాయితీ, నిబద్ధత వారి నిఘంటువులో దొరకని పదాలు. ఏ మాత్రం బేధం లేకుండా, ఏమాత్రం తేడా లేకుండా ప్రపంచ పౌరులందరి క్షేమం గురించి ఆలోచించే మానవీయ విలువలు ఒకనాటి రుషులక్కూడా ఉండేవి కావు. ఉన్నా ఆశ్రయించిన కొద్దిమంది పట్ల ఉండేవేమో! పరలోక ప్రాప్తికోసం పాకులాడే వీరు, జనులందరినీ పావులుగా పరిగణించేవారు. స్పృహలోకి వచ్చేవారు కాదు. ఇతరులను రానిచ్చేవారు కాదు. అదే పద్ధతిని నేటి ఈ అత్యాధునిక యుగంలో కూడా మత బోధకులు కొనసాగిస్తున్నారు. ''కరోనా నుంచి ప్రపంచ జనావళిని రక్షించమని వేడుకోవడానికి, ప్రార్థించుకోవడానికి, ఆశీస్సులు తీసుకోవడానికి ప్రార్థనా స్థలాలు తెరిచామని'' పుచ్చిపోయిన మెదుడున్న ఓ పెద్దాయన సెలవిచ్చాడు. దాన్ని నమ్ముదామా? లేదా దేశంలో కోవిడ్ వ్యాధి తీవ్రతను గ్రహించుకుందామా? ప్రార్థించుకోవడానికి ప్రార్థనా స్థలాలకు వెళ్ళాల్సిన పనేలేదు కదా? అది వారి విశ్వాసానికి సంబంధించిన అంశం కాబట్టి, తమ తమ ఇండ్లలోనే - మనసులోనే ప్రార్థించుకునే అవకాశం ఉంది. ఓ వైపు దర్శనాలకు వెళ్ళిన భక్తులకు, అర్చకులకు కరోనా సోకి మరణిస్తూ ఉంటే కాస్తంత బుద్ధి ఉపయోగించొచ్చు కదా?
ఒక వేళ మనిషి పిచ్చివాడైపోతే వదిలేయడం లేదుకదా? పిచ్చాస్పత్రిలో చేరుస్తాం. మనుషులుగా మానవీయ విలువలతోనే తోటివాణ్ణి ఎలాగైనా దక్కించుకోవాలని తాపత్రయ పడతాం. మనిషికి వైరస్ సోకితే చికిత్సనందిస్తాం. మనిషే వైరస్గా మారిపోతే వదిలేస్తామా? మరింత పకడ్బందీగా చికిత్స చేస్తాం. మనిషికి వైరస్ సోకినా, మనిషి మానసిక రోగిగా మారినా ముఖ్యమంత్రులు, గవర్నర్లూ, ప్రధానులు ఎవరూ రోగనిర్ధారణ చేయలేరు. పోలీసు, రక్షణ, న్యాయ వ్యవస్థలు కూడా ఇందుకు పనికిరావు. వైద్యులు, విజ్ఞానశాస్త్రం తెలిసినవారు మాత్రమే పనికొస్తారు. వారు మాత్రమే రోగ నిర్థారణ చేయగలరు. ఇదీ అలాంటిదే - హేతువాద రచయితలు, వైజ్ఞానిక స్పృహగల సైన్సు కార్యకర్తలు మాత్రమే మనుషుల, సమూహాల, సమాజాల రుగ్మతల్ని పసిగట్టి బహిర్గగతం చేయగలరు. హెచ్చరించగలరు. ఈ పనికోసం ప్రభుత్వం వీరిని నియమించకపోవచ్చు గాక, ఈ పనికోసం వారికి ఏవిధమైన ఆదాయం లభించకపోవచ్చు గాక - అయినా బాధ్యతగల ఈ దేశ పౌరులుగా వాళ్ళు - వాళ్ళకై వాళ్ళు నిర్దేశించుకున్న పని చేస్తూనే ఉంటారు. వారి ఆవేదనలో, వారి ఆక్రోశంలో, వారి నిజాయితీలో వారి నిబద్దతలో ఎంత బలం ఉందని చూడాలే గానీ, ప్రశ్నిస్తున్నారనో, హెచ్చరిస్తున్నారనో అణగదొక్కాలని చూస్తే ఫలితాలు దారుణంగా ఉంటాయి. సమాజం అనాగరికతలోకి అజ్ఞానంలోకి వెళ్ళిపోతుంది. ఆ ప్రమాదం తప్పాలంటే వైజ్ఞానిక స్పృహతో విషయాల్ని ఎత్తి చూపే వైజ్ఞానికుల్ని, వైజ్ఞానిక రచయితల్ని, ప్రచారకుల్ని, కార్యకర్తల్ని పోత్సహించాలి. ఆరోగ్యకరమైన సమాజ నిర్మాణంలో వారందరి నిస్వార్థ సేవల్ని గుర్తుపెట్టుకోవాలి. గుర్తించి వారికేదో గౌరవం అంటగట్టాలని వారేమీ కలలుగనడం లేదు. సమాజం సుభిక్షంగా, చైతన్యవంతంగా, అర్థవంతంగా, హేతుబద్ధంగా మారితే చాలని కోరుకునే అల్పసంతోషులు వాళ్ళు! రాజ్యాంగ స్ఫూర్తిని నిలుపుతున్న వాళ్ళు!!
డాక్టర్ దేవరాజు మహారాజు
వ్యాసకర్త: సుస్రిద్ధ సాహితీవేత్త, బయాలజీ ప్రొఫెసర్.