Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నిసార్ పాటలకు బలం అతని తెలంగాణ పల్లె భాషే. ఊళ్లల్లో జనం మాట్లాడుకునే మాటల్నే పాటలోకి పదిలంగా పట్టుకొచ్చి పాటలు అల్లడం నిసార్ శైలి. తనకంటే ముందు ప్రజారచయితలు చేసినా పనే అయినా, ప్రజల పలుకుబడుల్ని అత్యంత ఎక్కువగా ఉపయోగించిన ప్రజాకవి నిసార్. చాలా సులభమైన జానపద బాణీలో సాగే నిసార్ పాట, ఎంతటి సంక్లిష్టమైన విషయాల్ని అయినా అలవోకగా అర్థం చేయించి, వింటున్నవారి చేత చప్పట్లు కొట్టించేది. ఇట్లా సుద్దాల హనుమంతు వారసుల్లో ఒకడయ్యాడు నిసార్.
''తల్లి నుంచి బిడ్డలను దూరం చెయ్యొద్దు
మూలవాసులం మమ్ముల ఆగంచెయ్యొద్దు''
అంటూ జనం గుండెగొంతుకైన ప్రజా కళాకారుడు నిసార్. గడిచిన నాలుగు దశాబ్దాల సాంస్కృతిక ఉద్యమాల చరిత్రలో చెరగని పేరు నిసార్. ప్రజల కోసం నిత్యం పాటై ప్రవహించిన కలం, గళం ఆయన. కడదాక ప్రజల కోసమే బతికిన ఈ ప్రజాకవి అకాల మృత్యువాత పడడం తెలుగు సమాజానికి తీరని లోటు. ఎర్రజెండా ఎక్కెక్కిపడి ఏడుస్తున్నది. పాటమ్మ మూగబోయి కుములు తున్నది. అతడు భుజానేసుకుంటే అంతెత్తున ఎగిరిన గొంగడి అటుకు మీద మూగగా రోదిస్తున్నది. అతడి కాళ్లకు కట్టుకుంటే ఊరూరు అలుపెరుగకుండా తిరిగిన గజ్జెలు గళ్లుమనకుండా గొల్లుమంటున్నాయి. పాటంటే ప్రజలకోసమేనని, పాటంటే ప్రజలను మేల్కొలిపేదేనని, పాటకోసమే జీవితాన్ని ధారపోసిన ఆ ప్రజా కళాకారుడు ఒంటరిగా చెప్పకుండా వెళ్లిపోవడం అందరినీ బాధిస్తోంది.
ప్రజాకళాకారుడు నిసార్ పాటపాడని వేదిక లేదు. నిసార్ కాలికి బలపం కట్టుకొని తిరగని పల్లె లేదు. నల్లగొండ జిల్లా సుద్దాల గ్రామం నిసార్ది. సుద్దాల అంటే ఎవరికైనా గుర్తుకొచ్చేది సుద్దాల హనుమంతే. ఆ ప్రజాకవిని చూసి పెరిగినవాడు నిసార్. తన ప్రపంచం విశాలం అవుతున్నకొద్దీ కళకే మరింత అంకితమయ్యాడు నిసార్. ప్రజలపాటకు నిలువెత్తు రూపమైన సుద్దాల హనుమంతును స్ఫూర్తిగా తీసుకొని 80వ దశకంలోనే కళారంగంలోకి ప్రవేశించాడు. ప్రజలు పడుతున్న బాధలే పల్లవులుగా, వారి విముక్తే చరణాలుగా పాటలు అల్లి పాడిన ప్రజల గొంతుక నిసార్.
పల్లెసుద్దుల ద్వారా ప్రజాకళను రక్తికట్టించే ప్రయోగం చేసింది తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటం. సామాన్యుని వేషాధారణ, మట్టిమనుషుల మాట-పాట, వింటున్నవాళ్లు చెవులొగ్గి లీనమయ్యే జానపద బాణీ, ఇద్దరు వంతలతో, ప్రధాన గాయకుడు అర్థం చేయించే విషయమూ, డప్పు, డోలక్ల దరువులకు కాలి గజ్జెలు ఆడిస్తూ సాగే కళా ప్రదర్శన-పల్లెసుద్దులు. ఆ పల్లెసుద్దులకు పెట్టింది పేరు ఆయన. పల్లె నుండి ఢిల్లీదాకా, అంటరాని వాడల నుంచి అమెరికా దాకా విషయం ఏదైనా నిసార్ పల్లెసుద్దుల కథలోకి వచ్చి ఒదిగిపోవాల్సిందే. అట్లా రాసేవాడు నిసార్. అట్లా ప్రదర్శించేవాడు. అది నిసార్ ప్రత్యేకత.
ఇక పాట చరిత్రలో చిరస్థాయిగా నిలిచే కలం నిసార్. వందలాది పాటలు రాసి ప్రజలపక్షం నిలిచాడు. ఈ నలభైయేళ్ల కాలంలో నిసార్ పాట రాయని ప్రజాసమస్య లేదంటే అతిశయోక్తి కాదు. కమ్యూనిస్టు పార్టీ వల్ల అబ్బిన పీడిత జనపక్షపాతదృష్టి నిసార్ అక్షరమక్షరంలో కనిపిస్తుంది. తన పాటకు శత్రువు. ఆధిపత్యం చెలాయించేవాడు. తన పాటకు దోస్తీ... పీడితుడు. అందుకే ఆ పాటలు దేశమంతా వ్యాపించాయి. నిరుపేద ముస్లిం కుటుంబంలో జన్మించాడు నిసార్. కుటుంబ ఆర్థిక పరిస్థితిని చూసి పై చదువులు చదవలేకపోయాడు. జీవనం కొనసాగడం కోసం లారీ డ్రైవర్గా మారాడు. అయినా సరే తన గ్రామం తనకు అందించిన వామపక్ష అభ్యుదయ భావజాలం వల్ల పుస్తక పఠనాన్ని కొనసాగిస్తూ, 90వ దశకం నుండే సభలు, సమావేశాలకు హాజరై హైదరాబాద్ గడ్డమీద తన గళాన్ని వినిపించాడు. తెలుగు సాంస్కృతిక పోరాటాల ధృవతార మఖ్ధూ మొహియుద్దీన్ వారసత్వాన్ని అందిపుచ్చుకున్నాడు. ఒక లారీ డ్రైవర్గా పని చేస్తున్న కాలంలోనే తన పేరు ప్రముఖ విప్లవ, అభ్యుదయ కవుల సరసన వాల్ పోస్టర్లకు ఎక్కిందంటే నిసార్ కలానికి ఉన్న శక్తి ఏంటో అర్థం చేసుకోవచ్చు.
నిసార్ ప్రజా కళా రంగంలో చేసిన కృషి విశేషమైనది. సుమారు మూడు దశాబ్దాలకు పైగా ప్రజానాట్యమండలులకు సేవచేశాడు. సంఘం ఏ కార్యక్రమం తీసుకున్న దాని మీద పాట రాసి ప్రజలను మేల్కొలపడంలో ముందు నిలిచాడు. అట్లా జగద్గిరిగుట్ట, కుత్బుల్లాపూర్ నుంచి హైదరాబాద్ సిటీ మొదలు రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుని వరకు ప్రజా నాట్యమండలిలో వివిధ బాధ్యతలను అవలీలగా అందుకోగలిగాడు. తన మీద పెట్టిన ప్రతీ బాధ్యతను శక్తికి మించి నిర్వహించాడు. పాటతో తన ప్రయాణం దేశవ్యాప్తంగా కొనసాగింది. సఫ్దర్ హష్మీ వంటి ప్రజాకళాకారులు స్థాపించిన ఇఫ్టా వంటి సంఘాల్లో జాతీయ కౌన్సిల్ సభ్యునిగానూ గుర్తించబడ్డాడు. అలా ఢిల్లీ, గుజరాత్, జార్ఖండ్ వంటి రాష్ట్రాలకు సైతం వెళ్లి తన పాటను వినిపించాడు. నిసార్ కళారంగంలో నిలదొక్కుకుంటున్న కాలంలోనే ప్రపంచీకరణ ఈ నేల మీద పడగ విప్పింది. దీంతో ప్రపంచీకరణకే వ్యతిరేకంగా మన సంస్కృతిని కాపాడుకోవాలనే ప్రత్యామ్నాయ పిలుపునిచ్చాడు నిసార్. లారీ డ్రైవర్ నుంచి ఆర్టీసీ కండెక్టర్గా ఉద్యోగం వచ్చినా సరే నిసార్ పాట మాత్రం ఏనాడు విశ్రమించింది లేదు.
ప్రజలను మరింత దగ్గరగా చూస్తూ, నిత్యం వాళ్ల జీవితాలు ఎట్లున్నవో తెలుసుకునే ప్రయత్నం చేశాడు. వారిపై పాలకులు మోపుతున్న భారాలకు విలవిలలాడు. ప్రతీ పోరాటానికి పాట రాశాడు. తెలంగాణ ఉద్యమంలో నిత్యం వినిపించిన ''పండు వెన్నల్లలోన వెన్నెల్లలోనా... పాడేటి పాటలేమాయే'' అనే పాట ఆయన రాసిందే. ఇటీవల జరిగిన ఆర్టీసీ సమ్మె కాలంలో తన బృందంతో నెలరోజుల పాటు కార్మికుల దీనస్థితిని ఎలుగెత్తి చాటాడు.
నిసార్ పాటలకు బలం అతని తెలంగాణ పల్లె భాషే. ఊళ్లల్లో జనం మాట్లాడుకునే మాటల్నే పాటలోకి పదిలంగా పట్టుకొచ్చి పాటలు అల్లడం నిసార్ శైలి. తనకంటే ముందు ప్రజారచయితలు చేసినా పనే అయినా, ప్రజల పలుకుబడుల్ని అత్యంత ఎక్కువగా ఉపయోగించిన ప్రజాకవి నిసార్. చాలా సులభమైన జానపద బాణీలో సాగే నిసార్ పాట, ఎంతటి సంక్లిష్టమైన విషయాల్ని అయినా అలవోకగా అర్థం చేయించి, వింటున్నవారి చేత చప్పట్లు కొట్టించేది. ఇట్లా సుద్దాల హనుమంతు వారసుల్లో ఒకడయ్యాడు నిసార్.
నిసార్కు కమ్యూనిజంపై అచంచల నమ్మకం, విశ్వాసం. అందుకే ఆయన ప్రజల మనిషయ్యాడు. అనేక పాటలు రాసి పాడాడు. సాహిత్యంలో కూడా తన గళాన్ని వినిపించాడు. వతన్ సంకలనంలో 'ముల్కీ' కథను రాశాడు, అలాగే పదునైన కవితలెన్నో రాశాడు. నిజానికి ప్రజా సాంస్కృతిక రంగంలో ముస్లిముల సంఖ్య చాలా పరిమితం. ముస్లిముల నుండి ప్రధాన వాగ్గేయకారునిగా ఎదిగివచ్చాడు నిసార్. ముస్లిముల జీవితాలు ఎట్లున్నాయో పాటగట్టి ముస్లిమేతర సమాజానికి అర్థం చేయించి చర్చకు పెట్టాడు. కుట్రపూరితంగా తెరమీదకు తెచ్చి, ప్రజాస్వామ్య హక్కులను కాలరాసే సీఏఏ, ఎన్నార్సీలను నిసార్ తీవ్రంగా వ్యతిరేకించాడు. హైదరాబాద్లో స్వతహాగా సభలు నిర్వహించాడు. ఎన్నార్సీని వ్యతిరేకిస్తూ బలమైన పాటలు రాసి ధైర్యంగా వేదికల మీద పాడాడు. అది నిసార్ నిబద్ధత. ఇక లాక్డౌన్ కాలంలో కూడా నిసార్ కలం మరింత విస్తృతమై పోటెత్తింది. సోషల్ మీడియా వేదికగా పలు పాటలు రాసి ప్రజల్లో అవగాహన పెంచడానికి నడుంకట్టాడు. కరోనా వెనుక దాగిన మానవ తప్పిదాలను హెచ్చిరించాడు. నిత్యం ఏదో ఒక ప్రజా సమస్యను తీసుకొని పాటలు రాసిన ప్రజాకలాన్ని కరోనానే కబళించడం ఏ ఒక్కరూ జీర్ణించుకోలేని విషయం. ప్రజల కోసమే కడదాక బతికిన ప్రజా కళాకారుణ్ణి, ఆ ప్రజలు కడసారి చూపుకు కూడా నోచుకోకపోవడం అత్యంత విషాదకరమైన విషయం. తెలంగాణను సాధించి తెచ్చుకున్న ప్రభుత్వంగానీ, ఎవరికోసమైతే జీవించాడో ఆ ప్రజా వ్యవస్థగానీ ఈ ప్రజాకవిని కాపాడుకోలేకపోయింది. ప్రజలు, ప్రజా కళాకారులు ఆ ప్రజాకళాకారుడు కలగన్న ఆకలి, కన్నీరులేని లోకాన్ని సాధించడమే ఆయనకు ఘననివాళి. ప్రజల పాటగా నిసార్ ఎప్పుడూ బతికే ఉంటాడు. ప్రజలను తట్టిలేపుతూనే ఉంటాడు. ఆ అవిశ్రాంత కళాయోధునికి కడసారి కన్నీటి నివాళి.
డాక్టర్ పసునూరి రవీందర్
సెల్: 7702648825