Authorization
Mon Jan 19, 2015 06:51 pm
తెలంగాణ రాష్ట్రంలో సాగునీటి ప్రాజెక్టులకు రాష్ట్ర ప్రభుత్వం అత్యధిక ప్రాధాన్యత ఇస్తున్నట్టు చెప్పుకుంటున్నది. సాగునీటి ప్రాజెక్టులు నిర్మించడమే కాదు దీర్ఘకాలం రైతులకు ప్రజలకు ఉపయోగకరంగా ఉండాలి. ప్రభుత్వాలపై భారం పడకుండా తక్కువ ఖర్చు, నాణ్యతతో కూడిన నిర్మాణాలు జరగాలి. అప్పుడే ప్రజలు ప్రాజెక్టులు నిర్మించిన వారిని కొన్ని శతాబ్దాల పాటు గుర్తుంచుకుంటారు.
నిజాం పరిపాలన చివరి కాలంలో తెలంగాణ ప్రాంతంలో నిర్మించిన అనేక ప్రాజెక్టులు నేటికీ ముఖ్యమైన సాగునీటి వనరులుగా ఉన్నాయి. ఇటీవల నిర్మించిన అనేక సాగునీటి ప్రాజెక్టులు వరదలకు కొట్టుకు పోతుంటే వంద సంవత్సరాల చరిత్ర కలిగిన సాగునీటి ప్రాజెక్టులు సజీవంగా మనగలిగాయంటే వాటిని నిర్మించిన ఇంజనీర్ల యొక్క చిత్తశుద్ధి నిజాయితీ దర్శకనిత ఎంత గొప్పదో అర్థమవుతున్నది.
నైజాం నవాబ్ మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ కాలంలో రాష్ట్ర ప్రభుత్వం చీఫ్ ఇంజినీర్గా పనిచేసిన మీర్ ఆలీ నవాజ్ జంగ్ బహదూర్ నేతత్వంలో నిర్మించిన నిజాంసాగర్, హిమాయత్ సాగర్, అలీ సాగర్, వైరా, పాలేరు రిజర్వాయర్లను ఈ కాలంలో తెలంగాణ ప్రాంతంలో నిర్మించిన సాగునీటి ప్రాజెక్టులును సరిపోల్చి చూడాలి. మన రాష్ట్ర ముఖ్యమంత్రి బహుశా సాగునీటి ప్రాజెక్టులకు ప్రాధాన్యత ఇవ్వడమే కాక నైజాం ప్రభుత్వం యొక్క సాగునీటి నిపుణులు మీర్ అలీ నవాజ్ జంగ్ బహదూర్ పుట్టినరోజునే తెలంగాణ ఇంజనీర్ల దినోత్సవంగా ప్రకటించారు.
కాలేశ్వరం లక్ష పదిహేను వేల కోట్ల రూపాయల ఖర్చుతో నిర్మాణం జరుగుతోంది. ఇటీవల నీరు ఎత్తి పోసిన కొండపోచమ్మ, మల్లన్న సాగర్ కాల్వలకు గండి పడింది. కన్నెపిల్లి పంప్ హౌజ్ నుంచి అన్నారం బ్యారేజీకి నీళ్లు తీసుకెళ్లే కెనాల్ నాసిరకం పనులపై ఆరోపణలు వచ్చాయి. కాంగ్రెస్ పార్టీ నేతలు అవినీతి, కాల్వ నాణ్యత లేక ఇలా జరిగింది అంటే రాష్ట్ర మంత్రి హరిశ్రావు కాంగ్రెస్ ప్రభుత్వ జలయజ్ఞంలో ఖమ్మం జిల్లాలో పాలెంవాగు ప్రాజెక్టు కోట్టుకుపోయిన విషయం గుర్తు చేశారు. ఈ ఆరోపణలు, ప్రత్యారోపణలూ వారి వారి అవినీతిని, నాసిరకం నిర్మాణాలను తెలియజేస్తున్నాయి.
నైజాం ప్రభుత్వం 1920 నుంచి 1930 వరకు అతిముఖ్యమైన సాగునీటి ప్రాజెక్టులను నిర్మాణం చేయడంలో మీర్ ఆలీ నవాజ్ జంగ్ బహుదూర్ ప్రభుత్వా చీప్ ఇంజినీర్గా గొప్ప పాత్ర పోషించారు. 11 జూలై 1877న జన్మించిన మీర్ అలీ నవాజ్ జంగ్ బహుదూర్ సెయింట్ జార్జి గ్రామర్ స్కూల్, నిజాం కాలేజీలో చదివి ప్రభుత్వ స్కాలర్షిప్ మీద ఇంగ్లాండులోని క్యూపర్స్ హిల్ కాలేజీలో ఉన్నత విద్య పూర్తి చేసి 1899లో హైదరాబాద్ తిరిగి వచ్చి పబ్లిక్ వర్క్స్ డిపార్ట్మెంట్లో అసిస్టెంట్ ఇంజనీర్గా చేరి 1918 నాటికి తెలంగాణ ప్రభుత్వం చీఫ్ ఇంజినీర్గా బాధ్యత చేపట్టారు.
తెలంగాణ రాష్ట్రంలో నేటికీ ముఖ్యమైన తాగునీరు సాగునీటి ప్రాజెక్టులుగా ఉన్న ఉస్మాన్ సాగర్ (1920), నిజాం సాగర్ (1923), హిమాయత్ సాగర్ (1927) అలీ సాగర్ (1928) వైరా , పాలేరు రిజర్వాయర్లు (1930) పూర్తి చేశారు. మంజీరా బ్రిడ్జితో పాటు 1929లో బొంబాయి ప్రభుత్వం ఆహ్వానం మేరకు ఫైతే సాగర్, పాకిస్థాన్లోని సుకుర్ బ్యారేజి నిర్మాణం కు టెక్నికల్ ఫైనాన్స్ అసిస్టెంటెన్స్ అందించారు. మద్రాసు, తెలంగాణ ప్రభుత్వాల మధ్య తుంగభద్ర కష్ణా జలాల పంపిణీ విషయంలో ముఖ్యపాత్ర పోషించారు. ఈ ప్రాజెక్టులు అతి తక్కువ ఖర్చుతో, అత్యంత ప్రతిష్టాత్మకంగా, నాణ్యతతో, ప్రాధాన్యత క్రమంలో ఒక దాని తర్వాత ఒకటి నిర్మాణం చేయడం జరిగింది. నాడు ప్రపంచ వ్యాప్తంగా ఉన్న మహా ఆర్థిక మాంద్యం నుంచి ఈ ప్రాంతంలో ప్రజలను కాపాడేందుకు, కరువు కాటకాల నుంచి రక్షించేందుకు, ప్రజలకు ఉపాధి కల్పించి నీటి ప్రాజెక్టులను నిర్మాణం చేయడం జరిగింది.
నేడు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, గత కాంగ్రెస్ ప్రభుత్వం ఉదాహరణకు తెలంగాణ రాష్ట్రంలో అదనంగా ఎన్ని ఎకరాల సాగు భూములుకు నీరు ఇచ్చాయి? ఎన్ని లక్షల కోట్లు ఖర్చు చేసాయి? ఖర్చుకు తక్కువ లేదు గానీ ఫలితం మాత్రం నామమాత్రమే! మీర్ ఆలీ నవాజ్ జంగ్ బహుదూర్ కాలంలో వైరా రిజర్వాయర్ 36 లక్షల రూపాయల వ్యయంతో నిర్మాణం జరిగితే 17376 ఎకరాలకు సాగునీరు అందించారు. నేడు 25000 ఎకరాల సాగు భూములకు సాగునీరు అందుతుంది. 90 సంవత్సరాల కాలం. అయినా చెదరకుండా ఉండడం నాణ్యతా ప్రమాణాలకు ప్రతీక. పైన పేర్కొనబడిన దాదాపు అన్ని ప్రాజెక్టులూ ఇంకా మనుగడలో ఉన్నాయి అంటే వాటి నిర్మాణం ఎంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన అంశం నేటి పాలకులు తరుచూ మననం చేసుకొవాలి.
అదే సందర్భంలో ప్రాజెక్టు నిర్మాణం వల్ల భూములు, ఉపాధి కోల్పోయే నిర్వాసితులకు సరియైన పరిహారం అందచేయాలి. కానీ ప్రభుత్వం అరకోర చెల్లింపులు జరుపుతున్నది. సాగు నీటి ప్రాజెక్టుల నిర్మాణం వలన శాశ్వతంగా నష్టపోయిన రైతులకు సరైన నష్టపరిహారం అందించి ''తమ త్యాగం తో ఇక్కడ ప్రాజెక్టు నిర్మాణం జరిగింది'' అని వారు గర్వంగా చెప్పుకొనే వాతావరణం కల్పించడం ప్రభుత్వం యొక్క బాధ్యత. కానీ అది జరగడం లేదు. పైగా ప్రాజెక్టుల పనులు ఎంత నాసిరకంగా ఉన్నాయో ఇటీవల సంఘటనలు ఆదిలోనే నిరనూపించాయి. కానీ, వంద సంవత్సరాల క్రితం నిర్మాణం చేసిన ప్రాజెక్టులు మనకు తీపి గురుతులే కాదు నేటికి జీవనాధారాలు. వాటి నిర్మాణం వెనుక ఉన్న చిత్తశుద్ధి నిజాయితీ విలువల వలన వందేళ్లు పూర్తి అయినా వర్థీలుతూనే ఉన్నాయి. అందుకు కారకులైన మీర్ అలీ నవాజ్ జంగ్ బహుదూర్ జయంతి సందర్భంగా నివాళులు అర్పించటం తోపాటు వారి విలువలను ముందుకు తీసుకుపోయేందుకు ప్రభుత్వం కృషి చేయాలి.
బొంతు రాంబాబు
సెల్: 9490098205