Authorization
Mon Jan 19, 2015 06:51 pm
''నన్ను అనంతునిగా చేసి నువ్వు సంతృప్తినొందుతావు
దుర్భలమైన ఈ పాత్రను పదే పదే ఖాళీ చేసి
మళ్ళీ కొత్తగా ఊపిరిలూదుతుంటావు'' అని 'గీతాంజలి'లో గురుదేవులు రవీంద్రనాథ్ ఠాగూర్ దేవుడ్ని ఉద్దేశించి అంటారు. కానీ మొన్న మోడీ మహాశయుడు తన మంత్రులు, ముఖ్యమంత్రులు, రాష్ట్రాల అధ్యక్షులు, ఇతర నాయక గణానికి చేసిన ఆన్లైన్ 'హితబోధ' చూస్తే ''పదే పదే ఖాళీ'' చేయ కుండానే ''కొత్త ఊపిరిలూదుతూనే ఉన్నాడ''నిపించడం లేదా!
బహుశా మోడీ పాలన వెనక నుంచి ప్రారంభమైంది. ఎక్కడైనా, ఎప్పుడైనా నాయకులు పాలకులైన తర్వాత, అంటే అధికారం సంపూర్ణంగా తన హస్తగతమైన తర్వాత 'నాలుగవ పాదాన్ని' (మీడియాను) తమకనుకూలంగా మలుచుకుంటారు. సరళీకృత ఆర్థిక విధానం క్రమంగా మీడియాను కార్పొరేట్ల కబంధ హస్తాల్లోకి బందీగా నెట్టింది. తన గుజరాత్ ముఖ్యమంత్రిత్వ కాలం నుంచే కార్పొరేట్లను మోడీ మచ్చిక చేసుకున్నారు. వెరసి మోడీ పాలన పుట్టుకే మీడియా కనుసన్నల్లో జరిగింది. తప్పనిసరైతే, తప్పించుకోలేక పోతే కొన్ని వార్తలు రాసినా, చూపించినా అసలు విషయం అప్రధానం చేయడం 'గోడీ' మీడియా అలవాటు.
ఈ వాతావరణంలో ''సేవా భావం, సంయమనం, సమన్వయం, సకారాత్మక భావన, సద్భావన, సంవాదం'' అనే ఏడు గుణాల్ని మోడీ అండ్ కో తన శిష్య పరమాణువులకు, అణువులకు మనసుల్లో నాటగలిగారా? అన్నది ప్రశ్నే! లేదా ఆయన మాటలను ఆ పార్టీ క్యాడర్ రివర్స్లో అర్థం చేసుకోవాలని శిక్షణ ఇచ్చారేమో!
మార్చి 24న అనాలోచిత లాక్డౌన్ ప్రకటనతో పదకొండు కోట్ల మంది వలస కార్మికులు శ్రీనగర్ నుంచి తమిళనాడు వరకూ, సూరత్ నుంచి గువహతి వరకు దేశ ఆమూలాగ్రం వలసలు జరిపారు. ఈ వలసలకు, ఆ కార్మికుల కష్టాలకు కారణం ఈ ప్రభుత్వ నిర్ణయం. దాన్ని దాచిపెట్టి ఆ కార్మికులకు తిండిపెట్టడమే 'సేవాభావం' అన్నది మోడీ గారి ప్రవచనం. ఈ కోట్ల మంది కార్మికులు వివిధ పట్టణాల్లో ఎవరి పని వారు చేసుకుని కుటుంబ పోషణ చేసుకునే వారే! ఏలినవారి కరుణా కటాక్షాలపై ఆధారపడ్డ యాచకులు కాదే! కార్మికులను బిచ్చగాళ్ళను చేసే ప్రభుత్వ విధానాలను బహుశా ఎవరూ ప్రశ్నించకుండా బుగ్గ గిల్లి జోలపాడే విధానానికి మోడీ సాబ్ పెట్టిన పేరే 'సేవాభావం'!
ఇక ''సద్భావన'' గురించి.. పేద ప్రజల యెడల ఏహ్యభావం, మైనారిటీల ఎడల విరుద్ధభావం లేనిచోట కల్పించడం, ఉన్నదాన్ని పెంచడం వృత్తిగా స్వీకరించిన పార్టీ ''సద్భావన'' గురించి మాట్లాడటం ''అవునంటే కాదనిలే, కాదంటే అవుననిలే!'' అన్న పింగళి నాగేంద్రగారి పాటను తలపుకు తెస్తోంది! రాజస్థాన్ హైకోర్టులో మనువు విగ్రహ ప్రతిష్టాపకులు, దాన్ని తొలగించాలన్న డిమాండ్ను ప్రతిఘటించేవారు సద్భావన ఎలా కలిగిస్తారు? ఎవరికి కలిగిస్తారు? నిచ్చెనమెట్ల కుల వ్యవస్థ సమర్థకులు, ఆధునిక మనువులు కల్పించే ''సద్భావన'' ఏపాటిది? దేశ పడమటి మూల గుజరాత్లో ప్రారంభించి నేడు అతిపెద్ద రాష్ట్రానికే విస్తరించిన ప్రయోగశాలలో ఏ సద్భావన పాదుకొల్పబడ్డ యంత్రాంగం బరేలీ చేరుకున్న వలస కూలీలను మందేసి కెమికల్స్ స్ప్రే చేసింది. ప్రపంచం ఆ ఘటనతో నిశ్చేష్టమైనా స్పందించని బీజేపీ శ్రేణులకు ఏ సద్భావనుంది.
భారతదేశం రాష్ట్రాల సమాఖ్య. వీటిమధ్య సమన్వయం చేయాల్సిన 'కర్త' కేంద్రం. తాజాగా కోవిడ్! 130కోట్ల మంది భారతీయుల కోవిడ్ సమస్య పరిష్కారం చేయాల్సిన పనిలో తలమునకలయ్యాయి రాష్ట్రాలు. పీపీఈ కిట్లు, వెంటిలేటర్లు లేక నానా అవస్థలు పడుతున్నవి రాష్ట్రాలు. తాను చెట్టాపట్టాలు వేసుకుని తిరిగే ట్రంపే వెంటిలేటర్లు తయారు చేయమని జనరల్ మోటార్స్కి ఆర్డరేశాడు. దేశంలోని సుమారు 200 ప్రభుత్వరంగ సంస్థలలో దేనికైనా ఆర్డరేసి తయారు చేయించి రాష్ట్రాలకు సప్లయి చేయాలనే ఆలోచన ఈ సమన్వయ కర్తకుందా? జీఎస్టీ దెబ్బకి రాష్ట్రాల ఆదాయాలు కుదేలైనాయి. లక్షకోట్ల రూపాయలు కేంద్రం బకాయిపడ్డా, కేరళలాగా కేంద్రంతో పోరాడగల్గిన వాటికి శక్తిలేదు. దేబిరించడమే మార్గమనే దశకు దిగజారాయి. సమాఖ్య స్ఫూర్తి నేడు ధ్వంసమైనంతగా గతంలో ఎప్పుడూ లేదు.
ఇక డొంకతిరుగుడు వాదనలనే బహుశా మోడీసాబ్ 'సంవాదం' అని ''భక్తులకు'' నేర్పిస్తున్నారేమో తెలియదు. తాజాగా రూ.20లక్షల కోట్ల ప్యాకేజి. మూలవిరాట్ ప్రకటించి చప్పట్లు కొట్టించేసుకుని విరమించుకున్నారు. ఎవరికి? ఎంతెంత? వంటివన్నీ వివరించాల్సిన బాధ్యత తెలుగింటి తమిళ కోడలిపై పడింది. 'ఏనుగు ఏదో చేస్తుందని జనం చెవులు మూసుకుంటే ఎప్పుడో తుస్సుమందిగా అన్నాడట మావటాయన!' అలా ఉంది మోడీగారి ప్రకటన! చివరికి మోడీ ''భక్తులు'' సైతం పండగ చేసుకోలేదు. కానీ 'సంవాదం' కట్టలు తెగింది. వాస్తవాలను మసిపూసి మారేడు కాయ చేసే అర్నబ్ గోస్వాముల్ని ముందుకు నెట్టారు.
పక్కనే తన లెఫ్టినెంట్ను కూర్చోబెట్టుకుని ''అధికారం స్వలాభ సాధనం కాదు'' అని చెప్పడానికి 56 అంగుళాల ఛాతి, దాన్నిండా ధైర్యమున్న గుండె ఉన్న వ్యక్తికే ''సాధ్యం''. ఎందుకంటే నోట్లరద్దు సమయంలో అమిత్షా డైరెక్టర్గా ఉన్న కోఆపరేటీవ్ బ్యాంకులో వేలకోట్లు జమైన విషయం దేశమంతా చూసింది కదా! ఇవి మచ్చుకి కొన్ని ''స''లే! మిగతావాటి దౌర్భాగ్యమూ ఇంతే. నియంతలు రూపుదిద్దుకునే తీరు నేటి భారతదేశంలో కనపడ్డంత స్పష్టంగా బహుశా మిగతా ప్రపంచ దేశాల్లో కనపడదు.