Authorization
Mon Jan 19, 2015 06:51 pm
తెలంగాణలో మరీ ముఖ్యంగా హైదరాబాదులో కరోనా తాకిడి ఉధృతంగా ఉన్నప్పుడు ఈ కూల్చివేత ఔచిత్యం ఏమిటన్న ప్రశ్న అన్నివైపుల నుంచీ వచ్చింది. ఆ భవనాలనే రోగుల చికిత్స కోసం వాడవచ్చునని సీపీఐ(ఎం) కార్యదర్శి తమ్మినేని వీరభద్రం అన్నారు. ఈ దశలో మళ్లీ హైకోర్టు సోమవారంవరకూ నిలిపివేయాలని చెప్పింది గాని వాస్తవంలో మిగిలిన భాగం తక్కువే.
రోమ్ నగరం తగలబడిపోతుంటే నీరో చక్రవర్తి ఫిడేల్ వాయించాడన్న మాట చరిత్రలో వింటూనే ఉన్నాం. తన మహాసామ్రాజ్యపు రాజధాని తగలబడుతుంటే చక్రవర్తి పట్టించుకోకపోవడం ఎలా సంభవం? ఆ ఉదంతంలో కనిపించని అర్థం ఉందా? ఆంధ్రప్రదేశ్, తెలంగాణలతో పాటు దేశ రాజధాని ఢిల్లీలో పరిణామాలు కూడా గమనిస్తే ఆ అర్థం తలకెక్కుతుంది. ఆప్పటి రాజులు చక్రవర్తులైనా, ఇప్పటి పాలకవర్గాలైనా స్వప్రయోజనాలూ స్వార్థ వ్యూహాలను బట్టి వ్యవహరిస్తారు. ప్రజల సంపద పట్ల, స్పందనల పట్ల విశాల ప్రజా రాశులపై పడే ప్రభావాల పట్ల వారికి ఎలాంటి విలువా ఉండదు. కట్టడం కూల్చడం మార్చడం ఏదైనా వారి ఇష్టాయిష్టాల ప్రకారమే.
మోఢిల్లీగా రాజధాని
దేశంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య ఏడు లక్షలు దాటింది. మరణాలు కూడా ఇరవై వేలు దాటాయి. పరీక్షా సామగ్రి, రక్షణ పరికరాలు చికిత్స కోసం బెడ్లు, వెంటిలేటర్లు అన్నీ కొరతగానే ఉన్నాయి. లాక్డౌన్లతో కరోనాను కట్టడి చేశామని గొప్పలు పోయిన పరిస్థితి తారుమారైంది. ఈ సమయంలో ప్రధాని మోడీ, కేంద్ర పెద్దలు చేయవలసింది కరోనాపై పోరాటానికి సమగ్రమైన శాస్త్రీయమైన విధానం రూపొందించడం. అదుపు చేయడం. నిధులులేని రాష్ట్రాలనూ ప్రజలనూ ఆదుకోవడం. ఆర్థిక వ్యవస్థ దెబ్బతిని తమ దగ్గరే నిధుల కొరత ఏర్పడిందంటున్న కేంద్రం ఇప్పుడు న్యూవిస్టాస్(నూతన యోజనలు)పేరిట దేశరాజధానిలో చారిత్రాత్మకమైన పార్లమెంటు, నార్త్బ్లాక్, పార్లమెంటు అనెక్సీ, ఉపరాష్ట్రపతి నివాసం, ప్రధాని నివాసం, అనేక మ్యూజియంలు కూలదోసే పని చేపడుతోంది. రాజ్పథ్లో ఆరుకి.మీ.ల పొడుగునా ఈ నిర్మాణాలు చేయాలని హడావుడి పడుతున్నది. ఇందుకు 20వేల కోట్ల రూపాయలపైనే ఖర్చవుతుందని అంచనా. కనీసం కరోనా తీవ్రత తగ్గేవరకైనా ఆగేందుకు కేంద్రం సిద్దంగాక పోవడం ఆశ్చర్యం కలిగిస్తుంది. అయితే లోపాయికారిగానే ఇదంతా నడిపిస్తున్న పరిస్థితి. లూట్యాన్ ఢిల్లీగా పేరొందిన పాలనా ప్రాంతం నిర్మాణాల శిల్ప రీత్యా ప్రపంచ ప్రసిద్ధి పొందింది. కొద్ది పాటి మరమ్మతులతో ఇవి మరిన్ని దశాబ్దాలు నిలిచి ఉంటాయని నిపుణులు ప్రకటించి ఉన్నారు. 1985 రాజధాని ప్రాంత చట్టం ప్రకారం ఢిల్లీలో ప్రసిద్ధ కట్టడాల నమూనాలు మార్చడానికి లేదు. అసలు వీటికి వారసత్వ ప్రతిపత్తి ఇవ్వాలంటూ 2013లో యునెస్కోలో దరఖాస్తు చేశారు కూడా. ఇలాంటి నేపథ్యంలో మోడీ మొత్తం పడగొట్టి మళ్లీ కట్టాలని ఎందుకు తొందర పడుతున్నట్టు? మొదటిది 2019 విజయం తర్వాత వచ్చే ఎన్నికలలోగా ఢిల్లీ పాలనా ప్రాంతం తనముద్రతో నిర్మాణం కావాలి. ఈ క్రమంలో వేల కోట్ల వనరులు కూడా చేతులు మారతాయి. చరిత్రలో ఢిల్లీకి ఉన్న గతవారసత్వంలోని కొన్ని అంశాలు సంఫ్ుపరివార్కు మింగుడు పడవు. ఇవన్నీ గాక మరో కారణం కూడా చెబుతున్నారు. ఆయన మాతృసంస్థ ఆరెస్సెస్ శతవార్సికోత్సవం 2020 గనక ఆలోగా దేశ రాజధాని కొత్తగా కట్టి చూపించాలని భావిస్తున్నారట. ఢిల్లీ నగర స్వరూపాన్ని పర్యవేక్షించే చట్టబద్ద సంస్థలు వద్దన్నా ఆయన ఖాతరు చేయకుండా మోఢిల్లీ కట్టాలని ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారు.
హైదరాబాదులో సచివాలయ కూల్చివేత
హైదరాబాదులో సచివాలయం 132ఏండ్ల చరిత్ర కలిగింది. నిజాం హయాంలో కట్టిన పేషీ లేదా జి బ్లాకు శిథిలమైన మాట నిజమే. గానీ ఆ తర్వాత ఉమ్మడి రాష్ట్ర పాలనలో మరో తొమ్మిది బ్లాకులు కట్టారు. అంజయ్య, ఎన్టీఆర్, చెన్నారెడ్డి, చంద్రబాబు నాయుడు ఇలా పలువురు ముఖ్యమంత్రుల హయాంలో కట్టిన బ్లాకులు విస్తరణలు ఉన్నాయి. ఇవపీకప ఆ కాలానికి తగిన ఆధునికత కూడా సంతరించుకున్నాయి. వీటన్నింటి సముదాయమైన సచివాలయం.. విభజన తర్వాత ఏపీ, తెలంగాణల మధ్య 52:48 నిష్పత్తిలో పంపిణీ అయింది. ముఖ్యమంత్రులుగా ఉభయ చంద్రులూ కొద్దిరోజులు కొలువు తీరారు. ఆ దశలోనూ మార్పులు చేర్పులు జరిగాయి. చంద్రబాబుకు లేక్వ్యూ గెస్ట్హౌస్ క్యాంప్ కార్యాలయంగా ఇస్తే అక్కడా సచివాలయంలో కూడా భారీ ఖర్చుతోనే మరమ్మతులు చేయించారు గాని ఉపయోగించింది లేదు. కేసీఆర్ లాంచనంగా మొదట్లో వచ్చింది తప్ప తర్వాత సచివాలయం దాదాపు బహిష్కరించినట్టే వ్యవహరించారు. ప్రగతి భవన్ పేరిట విశాల దుర్గం కట్టించుకుని తన కార్యకలాపాల కేంద్రంగా చేసుకున్నారు. 2024 వరకూ ఏపీకి హక్కువున్నా అమరావతి తొలి దశ తర్వాత ఏపీ భవనాలు నిరుపయోగంగా మారాయి. గనుక తమకు అప్పగించాలని కోరుతూవచ్చారు. చంద్రబాబు అంగీకరించలేదు గాని జగన్ వచ్చిన కొద్దికాలానికే స్వాధీనం చేశారు. కానీ కేసీఆర్ వాటిని ఉపయోగించే బదులు మొత్తాన్ని కూల్చివేసి కొత్తది కట్టాలనే ఉద్దేశం బయిటపెట్టారు. ఆ భవనం కాలం చెల్లినదనీ, భద్రతలేదనీ ఏవేవో అంటూనే వాస్తు సరిగ్గా లేదన్న తన నమ్మకాన్ని కూడా బయిటపెట్టుకున్నారు. అసలా కారణం వల్లనే ఆయన రాలేదని అంటారు. అక్కడ ముఖ్యమంత్రుల కుమారులు పదవిలోకి రాకుండా వాస్తు దోషం ఉందని కేసీఆర్ భావించారని కొందరు ప్రతిపక్ష నేతల మాటగా ఉంది. కానీ వైఎస్ కుమారుడు జగన్ ముఖ్యమంత్రి హోదాలోనే భవనాలు అప్పగించారు గనుక ఆ వాస్తు కథ నిలిచేది కాదు. ఉమ్మడి రాష్ట్ర అవశేషాలు ఉండకూడదనీ, తనదైన ముద్రతో భారీ సముదాయం కట్టించాలనీ కేసీఆర్ కోరుకున్నారనేది స్పష్టం. దానికి తోడు 400కోట్ల ఖర్చుతో కొత్త సచివాలయం కట్టించడంలో ప్రయోజనాలు ఉండనే వుంటాయి. దీంతోపాటే శాసనసభను కూడా ఎర్రమంజిల్లోని నీటిపారుదల శాఖ భవనాలు కూల్చి కట్టించడానికి శ్రీకారం చుట్టారు. ఎర్రం మంజిల్ వారసత్వ భవనం అనే అభ్యంతరం, మరో ముప్పై ఏండ్లు నిక్షేపంగా పనికివచ్చే సచివాలయం కూల్చడం ఎందుకన్న నిరసన కోర్టుదాకా వెళ్లాయి. ఎర్రం మంజిల్కు ఇప్పటికీ అనుమతి రాలేదు గాని సచివాలయం వరకూ ఈ నెలారంభంలో హైకోర్టు అనుమతినిచ్చింది. వెంటనే దారులన్నీ మూసివేసి కూల్చివేత 70శాతం వరకూ పూర్తి చేశారు. తెలంగాణలో మరీ ముఖ్యంగా హైదరాబాదులో కరోనా తాకిడి ఉధృతంగా ఉన్నప్పుడు ఈ కూల్చివేత ఔచిత్యం ఏమిటన్న ప్రశ్న అన్నివైపుల నుంచీ వచ్చింది. ఆ భవనాలనే రోగుల చికిత్స కోసం వాడవచ్చునని సీపీఐ(ఎం) కార్యదర్శి తమ్మినేని వీరభద్రం అన్నారు. ఈ దశలో మళ్లీ హైకోర్టు సోమవారంవరకూ నిలిపివేయాలని చెప్పింది గాని వాస్తవంలో మిగిలిన భాగం తక్కువే. ఈ క్రమంలో ప్రాంగణంలోని పోచమ్మ గుడి, మసీదు కూడా కూల్చివేయబడటం ఇప్పుడు కాంగ్రెస్, బీజేపీలకు రాజకీయ అస్త్రంగా మారింది. కేసీఆర్ విచారం వెలిబుచ్చుతూనే కొత్తవి మరింత పెద్దగా కట్టిస్తానని హామీ ఇచ్చారు. దీన్ని మజ్లిస్ నేత అసదుద్దీన్వొవైసీ స్వాగతించడం, రేవంత్ మురళీధరరావులు నిరసించడం విశేషం! మత రాజకీయాలు కూడా అవసరాన్ని బట్టి మారుతుంటా యనేందుకు ఇదో నిదర్శనం.
అమరావతిలోనూ అదే తంతు
ఇప్పుడు మనం ఏపీ రాజధాని అమరావతికి వెళదాం. కేసీఆర్ సచివాలయాన్ని భౌతికంగా కూల్చితే రాజధానినే జగన్ రాజకీయంగా కూల్చారు. అసలు కృష్ణాతీరంలో అమరావతి కట్టడం బాగుంటుందని స్వాగతించిన కేసీఆర్ ఆ తరహాలోనే హుసేన్సాగర్ ఒడ్డున రివర్ ప్రంట్లా పెంచాలనుకున్నారట. ఏపీలో కొత్త నిర్మాణాలు చేసినట్టే తెలంగాణకూ కొత్త భవన సముదాయాలు చూపించాలన్నది ఆయన వ్యూహం. నిజాంను కీర్తించి తెలంగాణ వారసత్వ వైభవాన్ని పదేపదే చెప్పిన కేసీఆర్ అధికారం చేపట్టాక ఉస్మానియా హాస్పిటల్, నిజాంపేషీ, చారిత్రక శాసనసభా సముదాయం, ఛాతీ వైద్యశాలలోని భవనం, ఎర్రం మంజిల్, రవీంద్రభారతి ఒకటేమిటి ప్రతిదీ పడగొట్టాలని బయలుదేరడంలోనూ ఉన్నది రాజకీయమే. సచివాలయంపై కేసీఆర్ భావనకు బీజం వేసిన అమరావతి కాస్త భ్రమరావతిగా మారి ఇప్పుడు జగన్ నిర్ణయంతో విశాఖకు తరలిపోతున్నది. మరి అప్పుడు విజయవాడ-గుంటూరు మధ్య రాజదానిని స్వాగతించిన జగన్ వికేంద్రీకరణ పేరిట ఇప్పుడెందుకు మారుస్తున్నారనేది పెద్ద రాజకీయమే. చంద్రబాబు అన్న ప్రకారం పూర్తి చేయకుండా నామకార్తంగా వదలివేయడం ఒక కారణమైతే, దాన్ని పూర్తి చేయడం వల్ల తనకు ఏ విధంగానూ ప్రయోజనం లేదని జగన్ భావించడం ప్రధాన కారణం. ఇప్పుడు విశాఖలోనూ తనకు పునాదిగా వున్న రాయలసీమలోనూ ఆయన కొత్త ప్రయోగాలు చేస్తారు. అమరావతిలో కట్టిన అయిదువేల ఫ్లాట్లు, భూములిచ్చిన రైతుల జీవితం, చిన్నాభిన్నమైన స్థానికుల పరిస్థితి ఆయన ప్రభుత్వానికి పట్టదు. విశాఖపైనా ఈ నిర్ణయం ఎలాంటి ప్రభావం చూపేది ఆచరణలో గాని అర్థం కాదు. ఏపీలోనూ కరోనా ఎక్కువగా వున్న సమయంలో ఈ రాజధాని రాజకీయాలు పై రెండు ఉదాహరణలకు నకలుగా ఉన్నాయి. అందుకే పాలకపార్టీలూ ముఖ్యమంత్రులూ ప్రధాన మంత్రులూ మారొచ్చు. వారి ఏకపక్ష పోకడలూ, ప్రయోజనాల క్రీడలూ ఒకేలా ఉంటాయని అర్థం చేసుకోవడం అవసరం. అది రాజ్యం లక్షణం.
తెలకపల్లి రవి