Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ముంబాయిలోని ధారవి మురికి వాడలో మ్నెదటి సారిగా ఏప్రిల్ 1, 2020 రోజున 19కరోనా కేసులు బయట పడ్డాయి. మే 2020 వరకు 1216 కేసులు నమోదుకాగా, 56 మంది మరణించారు. జూన్ మాసంలో రోజుకు సగటున 18 కేసులు బయట పడ్డాయి. 10 జూలై వరకు 2359కేసులు నమోదుకాగా, 215మంది చనిపోగా 1952 రికవరీలు జరిగాయి. కరోనా సోకిన వారి సమీప బంధువులు 58,154 మందిని గుర్తించిన వెంటనే ముందు జాగ్రత్త చర్యలు తీసుకున్నారు. ప్రపంచ, దేశ కరోనా గణాంకాలతో పోల్చితే ధారవిలో కరోనా కేసుల వ్యాప్తి రేటు తగ్గుట ఆశ్చర్యాన్నే కాక ఆనందాన్ని కలిగిస్తున్నది. ప్రపంచంలో అత్యధిక జనసాంద్రత (చదరపు కిమీకు 2.27లక్షల ప్రజలు) గల ప్రాంతాలలో ముంబాయిలోని ధారవి కూడా ముఖ్యమైనదిగా గుర్తింపు పొందింది. ఆసియా ఖండంలో గరిష్ట జనసాంద్రత గలిగిన అతి పెద్దదైన ధారవి మురికివాడలో 10 లక్షలకు పైగా జనాభా నివసిస్తున్నారు. 1884లో బ్రిటిష్ పాలనలో ఏర్పడిన ధారవి ప్రస్తుత వైశాల్యం 520 ఎకరాలు ఉంది. దేశంలోని ఇతర ప్రాంతాల నుంచి వలసలు పెరుగుతున్న ఫలితంగా ఇలాంటి మురికివాడలు వెలుస్తున్నాయి. ధారవి మురికివాడలో నివసించే పేదలు తోలు, వస్త్ర పరిశ్రమ, కుండల ఉత్పత్తుల తయారీ(పోటరీ) లాంటి పరిశ్రమలలో పని చేస్తూ సాలీనా ఒక బిలియన్ యుయస్ డాలర్ల వ్యాపారానికి కారణమౌతున్నారు. కరోనా లాంటి మహమ్మారులు, అంటువ్యాధులు ప్రబలినప్పుడు ధారవి లాంటి మురికివాడలలో అత్యధిక ప్రాణనష్టం జరుగుతూనే ఉంది. ఇలాంటి మురికివాడలను అభివృద్ధి చేయడానికి ప్రభుత్వాలు చేసిన కృషి ఫలితాలను ఇవ్వక పోవడం విచారకరం.
బ్రిహన్ ముంబాయి మునిసిపల్ కార్పొరేషన్ (బియంసి) అంచనాలకు వ్యతిరేకంగా విశ్వ మహమ్మారిని కట్టడి చేయడంలో ధారవి ప్రజలు కట్టుదిట్టమైన చర్యలతో కట్టడి చేయగలిగారని డబ్ల్యూహెచ్ఓ ప్రస్తుతించడం ముదావహం. ధారవి మురికివాడ ప్రజలు చూపిన క్రమశిక్షణ, పట్టుదల, పాటించిన నియమ నిబంధనలు ప్రశంసనీయమని ప్రపంచ ఆరోగ్య సంస్థ సెక్రటరీ జనరల్ డా: టెడ్రోస్ అధనోమ్ ప్రకటించడం హర్షదాయకం. ''పేదలు స్పష్టమైన కలలు కంటారు. బలహీనులు ఆశాభావంతో ముందుకు సాగుతారు. నిస్సహాయులు తీవ్ర కృషి చేస్తారు. శక్తిహీనులు కసితో ఎదుగుతారు'' అన్న మాటలు ధారవి మురికివాడ ధీరులకు చక్కగా వర్తిస్తుంది. అత్యధిక జనసాంద్రత ఉండడం వల్ల సామాజిక దూరం పాటించడం కష్టమని, హౌం క్వారంటైన్ సాధ్యం కాదని ప్రభుత్వం భావించి భయపడింది. ధారవిలో 80శాతం ప్రజలు 450 కమ్యూనిటీ టాయిలెట్లు వాడడం, ఎక్కువ మంది బయటి ఆహారాన్ని తీసుకోవడం, 10×10 గదిలో 8-10 మంది జీవించడం, అతి సన్నని గల్లీలు ఉండడం వంటి కారణాలతో కరోనా వ్యాప్తి వేగంగా జరుగుతుందని భావించారు.
బ్రిహన్ ముంబాయి మునిసిపల్ కార్పొరేషన్ వారు ధారవి ప్రాంతంపై ప్రత్యేక శ్రద్ధ తీసుకొని 47,500 గృహాలకు వైద్యసదుపాయాలు కల్పిస్తూ, మొబైల్వ్యాన్ల ద్వారా 14,970 మందికి పరీక్షలు చేశారు. 3.6లక్షల మందికి పరీక్షలు చేస్తూ, 8,246మంది వృద్ధులను ప్రత్యేకంగా పర్యవేక్షించారు. ధారవి మురికివాడలో 13,500 పరీక్షలు చేస్తూనే, ప్రజలందరికి ప్రతి రోజు భోజన వసతులు కల్పించారు. కోవిడ్-19 కేసుల తీవ్రత పెరిగితే ఆస్పత్రులలో చేర్పించి వైద్యం చేయగా, 90శాతం కరోనా కేసులకు ధారవిలోనే విజయవంతంగా చికిత్సలు అందించారు. 'వైరస్ను వేటాడుదాం' అన్న నినాదంతో కరోనాను కట్టడి చేయటంలో సఫలీకృతం అయినారు. వైద్యులకు పీపీఈ కిట్లు, ఇతర అత్యవసరాలు కల్పించడం, క్లినిక్లను సానిటైజ్ చేయడంలో ప్రభుత్వం శ్రద్ధలు తీసుకుంది. అత్యవసర ప్రాతిపదికన 200మంచాలు కలిగిన కరోనా ఆస్పత్రిని 14 రోజులలో నిర్మించారు. ఇరుకైన గదులలో జీవించే ప్రజలకు క్వారంటైన్ కేంద్రాలుగా పాఠశాలలు, ఫంక్షన్ హాల్స్, క్రీడా వనరులు ఎంపిక చేశారు. ప్రజలకు అల్పాహారం, రెండు పూటల భోజనాలను అందరికీ అందించారు. వ్యాధి నిరోధక శక్తి పెంచడానికి మందులు, 24గంటల వైద్య సదుపాయాలు కల్పించారు. కరోనాను కట్టడి చేయడంలో ధారవి మురికివాడ ప్రజలు చూపిన క్రమశిక్షణ దేశానికి మాత్రమే కాకుండా ప్రపంచానికే మార్గదర్శణం అయ్యింది. ధారవిలో కరోనా వైరస్ సోకింది మొదలు ప్రతి క్షణం టెస్ట్, ట్రేస్, ట్రీట్, టచ్ సూత్రాలకు లోబడి కోవిడ్-19 వ్యాప్తిని అరికట్టిన కార్యాచరణ దేశమంతటికీ ఆచరణాత్మకం కావాలని ఆశిద్దాం.
డాక్టర్ బుర్రమధుసూదన్రెడ్డి
సెల్: 9949700037