Authorization
Mon Jan 19, 2015 06:51 pm
యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ ఈనెల 6న ఒక సర్క్యులర్ తీసుకొచ్చింది. ఈ సర్కులర్లో ఈ దేశంలోని యూనివర్సిటీల్లో దాని అనుబంధంగా ఉన్న కళాశాలల్లో చదువుతున్న విద్యార్థులందరికీ తప్పనిసరిగా పరీక్షలు ఉండాలని పేర్కొంది. ప్రస్తుత దేశంలో కోవిడ్-19 వ్యాప్తి నేపథ్యంలో చివరి సంవత్సరం విద్యార్థులకు సెప్టెంబర్ నాటికి పరీక్షలు నిర్వహించడానికి అనుమతి ఇవ్వాలని హౌమ్ మినిస్టర్కి లెటర్ పెట్టి మరీ ఈ ఆదేశాలను యూజీసీ తీసుకు వచ్చింది. ఈ పరీక్షలను ఆన్లైన్ లేదా ఆఫ్లైన్లో నిర్వహించాలని కూడా యూజీసీ ఇచ్చిన ఆదేశాల్లో పేర్కొన్నారు. ఈ యూజీసీ ఆదేశాలు విద్యార్థులందరికీ తీవ్ర ఇబ్బందులు కలిగిస్తాయి. ఎందుకంటే ఈ రోజు దేశంలో లక్షల సంఖ్యలో కరోనా కేసులు పెరగటం, ప్రధాన నగరాలు, ప్రధాన విశ్వవిద్యాలయాలు ఉన్న ప్రాంతాల్లో కోవిడ్-19 వ్యాప్తి తీవ్రం అవుతున్న కారణంగా ఈ నిర్ణయం కచ్చితంగా విద్యార్థుల ప్రాణాలను లెక్క చేయక పోవడమే. దీనికంటే ముందు పరీక్షలు విద్యార్థులు రాయడానికి మార్చి 23 నుంచి దేశవ్యాప్త లాక్డౌన్ మూలంగా ఎలాంటి తరగతులు లేకుండా వారు చదువుకున్న వాటిని కూడా మరొకసారి గుర్తు చేసుకునే అవకాశం లేకుండా ఈ పరీక్షలు రాయటం అనేది సాధ్యం కానేకాదు. ఇది ఒక కారణం అయితే మరొక కారణం ప్రభుత్వాలు చెబుతున్నట్లుగా భౌతిక దూరం పాటిస్తూ ఈ పరీక్షలు నిర్వహించవచ్చని చెప్పింది. ఇది అసలు ప్రస్తుత పరిస్థితుల్లో సాధ్యం కాదు. యూనివర్సిటీలకు రావాలంటే దేశవ్యాప్తంగా నలుమూలల నుండి చదువుకుంటున్న వారు అనేక ప్రాంతాల గుండా ప్రయాణం చేసి రావాలి. వచ్చాక హాస్టల్లలో ఈ భౌతిక దూరం పాటించడానికి అనుకూలమైన మౌలిక సదుపాయాలు లేనేలేవు. మరి ఇలాంటి పరిస్థితుల్లో ఈ పరీక్షలు ఎలా సాధ్యం? ఇక యూజీసీ పేర్కొన్నట్లుగా ఆన్లైన్లో పరీక్షలు నిర్వహించినా దేశవ్యాప్తంగా విశ్వవిద్యాలయాలు మరియు వాటి అనుబంధ కళాశాలల్లో చదువుకున్నవారందరూ పరీక్షలు రాయడం అనేది కేవలం భ్రమగానే ఉంటుంది. ఆన్లైన్లో ఈ పరీక్షల నిర్వహణ సాధ్య పడుతుందా, లేదా అనే అంశాలను మనం పరిశీలిస్తే... ముందు అందరికీ ఇంటర్నెట్ కనెక్టివిటీ ఉందా, విద్యుత్ సౌకర్యం ఉన్నదా లేదా అనే సమాచారం ప్రభుత్వాల దగ్గర ఉండాలి. కానీ అలాంటి సమాచారం యూజీసీ దగ్గర కానీ, ప్రభుత్వం దగ్గర కానీ ఉందా? ఒకవేళ ఉంటే దాన్ని వెంటనే బహిర్గతం చేయాలి. హైస్పీడ్ ఇంటర్నెట్ అపరిమితంగా వాడగలిగే అవకాశం ఉన్న వారు మాత్రమే ఈ పరీక్షలు రాసే అవకాశం ఉంటుంది. అలా లేనివారు ఈ పరీక్షలకు హాజరయ్యే అవకాశం లేదు. ఆన్లైన్ తరగతులకు హాజరు కావాలంటే వీడియోలు డౌన్లోడ్ చేసుకోవాలి. లేదా క్లాస్లోకి ఎంటర్ అయ్యి పాఠాన్ని వినాలి. అంటే అలాంటి సాఫ్ట్వేర్ సౌకర్యం, అపరిమిత ఇంటర్నెట్ సౌకర్యం దేశంలో, రాష్ట్రాల్లో ఎంతమందికి ఉంది? ఉదాహరణకు బీజేపీ ప్రభుత్వం 370 ఆర్టికల్ రద్దు తర్వాత కాశ్మీర్లో ఇంటర్నెట్ షట్డౌన్ చేసి కేవలం 24స్పీడ్ ఉన్న ఇంటర్నెట్ మాత్రమే అనుమతించింది. కాశ్మీర్ విద్యార్థులు భారతదేశంలో విద్యార్థులు కాదా? మరి వారు పరీక్షలు ఎలా రాయాలి? ఇది ఇప్పటికే 370రద్దు లాంటి గాయాలు ఉన్న విద్యార్థులను మరింత గాయపరచడమే. ఇలాంటి పరిస్థితులను యూజీసీ, ప్రభుత్వం పరిగణనలోకి తీసుకోవాలి. ఇప్పటికే ఈ మహమ్మారి సమయంలో విద్యార్థులు తీవ్రమైన సమస్యలు ఎదుర్కొంటున్నారు. కొద్దిమంది విద్యార్థులు వారు చదువుకుంటున్న పట్టణ, నగర ప్రాంతాల నుంచి వచ్చి హౌమ్ క్వారంటైన్లో ఉన్నారు. ఇలాంటి సమయం పరీక్షలకు ఎలా అనువైన సమయం అవుతుందో ప్రభుత్వం ఆలోచించాలి. ఇప్పటికీ విద్యార్థులకు ఫెలోషిప్ అందించడానికి యూజీసీ గానీ, ఎంహెచ్ఆర్డిగానీ ఎలాంటి ప్రయత్నం చేయడంలేదు. లాక్డౌన్ ప్రారంభంలో విశ్వవిద్యాలయాల్లో ఆన్లైన్ తరగతులు ప్రారంభించాలనుకున్నప్పుడు కూడా యూజీసీ తన ఆధీనంలోని కళాశాలకు ఆదేశాలిచ్చింది. ఉత్తరాఖండ్లోని కునుమాల్ యూనివర్సిటీ యూజీసీ ఆదేశాలకు యూనివర్సిటీ పరిధిలోని తమ కళాశాలల్లో ఆన్లైన్ తరగతుల నిర్వహణకు ఎలాంటి యంత్రాంగం, సౌకర్యాలు లేవంటూ కౌంటర్ ఇచ్చిన పరిస్థితిని కూడా చూశాం. అందుకే పరీక్షలు రద్దు చేయాలనే డిమాండ్ సామాజిక మాధ్యమాల్లో వెల్లువెత్తిన పరిస్థితి ఇప్పటికే మనం చూశాం. చూస్తున్నాం. దేశ రాజధాని విద్యార్థులు అధ్యాపకుల విజ్ఞప్తులను పట్టించుకోకుండా ఢిల్లీ యూనివర్సిటీ ఓపెన్ బుక్ ఎగ్జామినేషన్ ఆన్లైన్లో ఏర్పాటు చేసింది. ఈ ఓపెన్ బుక్ ఎగ్జామినేషన్ కార్పొరేట్ సంస్థ పర్యవేక్షిస్తుంది. అంటే ఇలాంటి భయంకర పరిస్థితుల్లో విద్యను వ్యాపారంగా మార్చి కార్పొరేట్లను, వ్యాపారస్తులను ఢిల్లీ యూనివర్సిటీ తీసుకొస్తుంది. విద్యారంగంలోకి ఇలాంటి నిర్ణయాల వల్ల ఈ పేరుతో అన్ని పెట్టుబడిదారీ సంస్థలు ఈ విద్యారంగంలో వచ్చి ఆక్రమించి మరింతగా పేద వర్గాలకు చదువు దూరం చేసే అవకాశం లేకపోలేదు. భవిష్యత్తులో అన్ని విశ్వవిద్యాలయాల్లో పరీక్షల నిర్వహణ అనేది ఈ కార్పొరేట్ శక్తులకు లొంగిపోవడం ఖాయం. ఇప్పటికి ఢిల్లీ యూనివర్శిటీ నిర్వహించిన సర్వేలో 80శాతం కంటే ఎక్కువ మంది విద్యార్థులు ఆన్లైన్లో పాల్గొనలేక పోతున్నారని చెప్పారు. నెట్ కనెక్టివిటీ సరిగా పొందలేకపోతున్నామని వారు పేర్కొన్నారు. ఇప్పటికీ మధ్యప్రదేశ్లో ఫైనల్ ఇయర్ విద్యార్థులతో సహా విద్యార్థులందరికీ గ్రేడ్లు ఇచ్చి ప్రమోట్ చేశారు. ఆన్లైన్ మోడ్ అసమర్థత కారణంగా ఛత్తీస్ఘడ్, రాజస్థాన్, పశ్చిమ బెంగాల్లలో పరీక్షలు రద్దు చేశారు. ఈ తరుణంలో దేశంలో ఉన్న విద్యార్థులను ప్రమోట్ చేయడం ద్వారా వచ్చే నష్టం ఏమీ లేదు. కావున యూజీసీ తీసుకువచ్చిన ఈ సర్కులర్ను ఉపసంహరించుకొని దేశవ్యాప్తంగా దేశవ్యాప్తంగా ఉన్న డిగ్రీ, పీజీ, వృత్తి విద్యా కోర్సులు చదువుతున్న వారందరినీ ప్రమోట్ చేయడమే ఏకైక మార్గం. ఇప్పటికే చాలా యూనివర్సిటీలు ఆన్లైన్లో పరీక్షల నిర్వహణకు తగిన సౌకర్యాలు లేవనీ ఏం చేయలేమని చెప్పాయి. దీనికి యూజీసీ ఎలాంటి ప్రత్యామ్నాయం చెబుతుంది? కొత్త సెమిస్టర్ కోసం చాలా యూనివర్సిటీలు జూన్, జూలైల్లో ఆన్లైన్లో తరగతులు ప్రారంభిస్తూ పాత పరీక్షలు వ్రాయాల్సి ఉంటుంది. విద్యార్థుల నాణ్యతను ఎలా కొలుస్తారు? ఈ అంశాలపై యూజీసీ స్పష్టమైన ప్రకటన చేయాలి.
టి. నాగరాజు
సెల్:9490098292