- ప్రాణహిత- చేవెళ్ల ప్రాజెక్టు నమూనా ప్రకారం నిర్మించాలి
- మంచిప్ప, కాళేశ్వరం ప్రాజెక్టు ముంపు బాధితుల కమిటీ డిమాండ్
నవతెలంగాణ-కంఠేశ్వర్
నూతనంగా మంచిప్ప వద్ద ప్రతిపాదించిన ప్రాజెక్టును రద్దుచేసి, గతంతో ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టు నమూనా ప్రకారం నిర్మించాలని డిమాండ్ చేస్తూ మంచిప్ప, కాళేశ్వరం ప్రాజెక్టు ముంపు బాధితుల కమిటీ కలెక్టరేట్ ఎదుట సోమవారం ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా కమిటీ చైర్మన్ ఈశ్వర్సింగ్ మాట్లాడుతూ.. మంచిప్ప ప్రాంతంలో జీవిస్తున్న ప్రజలు వ్యవసాయం చేస్తూ జీవనం సాగిస్తున్నారని, రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలతో రైతులు రోడ్డున పడాల్సి వస్తుందన్నారు. ప్యాకేజీ 21, 22తో రైతులకు ఏం న్యాయం చేస్తున్నారని ప్రశ్నించారు. ఈ ప్యాకేజీతో కొండం, మంచిప్ప, భూపల్లి చెరువులకు నీటిని లిప్టు చేసి వాటి ద్వారా ఇతర చెరువులకు లిప్టు చేయాలని కోరారు. అలాగే న్యాల్కల్, కులాస్పూర్, మోపాల్ చెరువుల సామర్థ్యాన్ని పెంచి వాటిలో నీటిని నిల్వ చేసుకోవచ్చని తెలిపారు. ప్రాణాహిత, చేవెళ్ల ప్రాజెక్టుతో ఎన్ని ఎకరాలకు నీటి పారుదల ఉందో ప్రస్తుతం ప్రతిపాదించిన కాళేశ్వరం ప్రాజెక్టుకు కూడా అంతే ఉంటుందని చెప్పారు. ఈ ప్రాజెక్టుతో రైతులకు, వ్యవసాయ రంగానికి నష్టం కలుగుతుందన్నారు. రైతులంతా రోడ్డున పడే ప్రమాదముందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రాణాహిత చేవెల్ల నామూనా ప్రాకారమే మంచిప్ప వద్ద ప్రాజెక్టు నిర్మాణం చేపట్టాలని కోరారు. అనంతరం ఇన్చార్జి కలెక్టర్ రవీందర్రెడ్డికి వినతిపత్రం అందజేశారు. వినతిపత్రం అందజేసిన వారిలో వైస్ చైర్మన్ అజీమ్, భూపతిరెడ్డి, శంకర్, మోహన్సింగ్, రతన్సింగ్, సాయాగౌడ్, రవీందర్, గోవింద్, తదితరులున్నారు.
Authorization