నవతెలంగాణ-లింగంపేట్ ప్రమాదవశాత్తు చెరువులోపడి ఒకరు మృతిచెందిన ఘటన లింగంపేట్ మండలంలో చోటుచేసుకుంది. ఎస్ఐ సంపత్కుమార్ వివరాల ప్రకారం.. మండలంలోని ఐలాపూర్ గ్రామానికి చెందిన వన్నెపల్లి సుభాష్(40) రోజులాగే శనివారం గ్రామంలోని కల్లుడిపోకు పనినిమిత్తం వెళ్లారు. పక్కన గల చెరువువద్ద కాలకృత్యాలకువెళ్లి తిరిగి రాలేదు. దీంతో కుటుంబసభ్యులు చుట్టుపక్కల, బంధుమిత్రులవద్ద ఆయనకోసం వెతికినా ఫలితం లేకుండా పోయింది. దీంతో మృతునిభార్య సరస్వతి పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేశారు. సోమవారం ఉదయం అటుగా వెళ్లినవారికి గ్రామచెరువులో మృతదేహం కనిపించింది. వెంటనే కుటుంబ సభ్యులకు, పోలీసులకు సమాచారం అందించారు. ఎస్ఐ అక్కడికి చేరుకోని ప్రమాదానికి గల కారణాలను అడిగి తెలుసుకున్నారు. పంచనామా నిర్వహించి పోస్టుమార్ఠం నిమిత్తం మృతదేహాన్ని ఎల్లారెడ్డి ఆసుపత్రికి తరలించారు. మృతునికి కూతురు, కుమారుడు ఉన్నారు. భార్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశామన్నారు.