- ఎల్లారెడ్డి ప్రధాన రహదారిని మరిచిన పాలకులు ?
- టీడీపీ కామారెడ్డి జిల్లా అధ్యక్షులు ఒడ్డెపల్లి సుభాష్రెడ్డి
నవతెలంగాణ-ఎల్లారెడ్డి
ఆంధ్రప్రదేశ్లో జరిగిన ఉపఎన్నికలో టీడీపీ ఘనవిజయం సాధించిందని, 2019 ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్రంలో కూడా టీడీపీయే గెలుస్తుందని కామారెడ్డి జిల్లా టీడీపీ అధ్యక్షులు ఒడ్డెపల్లి సుభాష్ రెడ్డి తెలిపారు. సోమవారం ఎల్లారెడ్డి పార్టీ కార్యాలయంలో విలేకర్లతో ఆయన మాట్లాడుతూ ఎల్లారెడ్డి డివిజన్ అయినప్పటికీ ఎల్లారెడ్డి పట్టణ ప్రధాన రహదారి మారలేదని, ఇక ముందు కూడా మారదని ఆయన ఆరోపించారు. మూడు సంవత్సరాల నుంచి కూడా ఎల్లారెడ్డి ప్రధాన రహదారి పనులు జరుగుతూనే ఉన్నాయన్నారు. ఆరుమాసాల క్రితం ఎల్లారెడ్డి ప్రధాన రహదారి పనులను వెంటనే పూర్తి చేయాలని టీడీపీ ఆధ్వర్యంలో ఆందోళనలు నిర్వహించిన విషయాలను ఆయన గుర్తుచేశారు. ఎల్లారెడ్డి నడిఒడ్డున ప్రధాన రహదారిపై మండల ప్రజలతో రాస్తారోకో చేసి, జిల్లా కలెక్టర్కు వినతిపత్రం ఇచ్చినా ప్రభుత్వం స్పందించకపోవడం దారుణమన్నారు. అధికారుల నిర్లక్ష్యమా, పాలకుల అలసత్వమా అని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రధాన రహదారి పనులను వెంటనే పూర్తి చేయాలని, లేదంటే మళ్లీ ఆందోళన కార్యక్రమాలు చేస్తామని ఒడ్డెపల్లి సుభాష్ రెడ్డి హెచ్చరించారు. కార్యక్రమంలో టీడీపీ మండల నాయకులు శ్రీనివాస్ రెడ్డి, జలందర్ రెడ్డి, పరంధాములు, కిసన్, జనార్దన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
Authorization