- పర్యవేక్షణ కరువు
- చూసీచూడనట్టుగా వ్యవహరిస్తున్న అధికారులు
- కాంట్రాక్టర్ల ఇష్టారాజ్యం
- వృథా అవుతున్న ప్రజాధనం
అభివృద్ధి పనులకు కేటాయించిన నిధులు బూడిదలో పోసిన పన్నీరుగా మారుతున్నాయి. నాణ్యత లేకుండా నిర్మాణాలు చేపడుతుండటంతో వాటి మన్నికపై ప్రజలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఇంత జరుగుతున్నా అధికారులు, ప్రజాప్రతినిధులు పట్టించుకున్న పాపాన పోలేదు. పర్యవేక్షణ కరువవడంతో కాంట్రాక్టర్లు ఇష్టారాజ్యంగా పనులు చేపడుతున్నారనే ఆరోపణలున్నాయి.
నవతెలంగాణ-డిచ్పల్లి
ఇందల్వాయి మండలంలో చేపడుతున్న అభివృద్ధి పనుల్లో నాణ్యత లోపించందనే ఆరోపణలున్నాయి. కింది స్థాయి అధికారులు 'మామూళు'గా తీసుకుంటున్నారనే విమర్శలున్నాయి. గ్రామాలకు ప్రజాప్రతినిధులు వచ్చినప్పుడు స్థానికంగా అవసరమున్న పనులకు నిధులు మంజూరు చేస్తుంటారు. అక్కడే సమస్య ఎదురవుతుంది. నిధులు మంజూరు చేసి మమా అనిపించుకుంటున్నారే తప్పపనులను పర్యవేక్షించిన పాపాన పోలేదు. అధికారులు సైతం చూసి చూడనట్టుగా వ్యవహరిస్తున్నారు.
మండలంలోని సిర్నాపల్లి గ్రామంలో ఎరువుల గోదాం నిర్మాణానికి పనులు కాంట్రాక్టర్ చేపట్టారు. కానీ దీని నిర్మాణంలో సిమెంట్ లేకుండానే పనులు చేస్తుండటం గమనార్హం. గమనించిన స్థానికలు ఆదివారం పనులు అడ్డుకున్నారు.
అదే విధంగా చంద్రన్ పల్లి గ్రామ పంచాయతీ పరిధిలోని ఐదు అంగన్వాడీ భవనాలు నాణ్యత లేకుండా నిర్మాణాలు చేపట్టారని ప్రజలు ఆరోపిస్తున్నారు. ఇదే పంచాయతీ పరిధిలోని తిరంగపేట్ నుంచి ఇందల్వాయి కమాన్, 44వ జాతీయ రహదారి వరకు డబుల్ రోడ్డు పనులను రూ. 1.40 కోట్లతో చేపట్టారు. కానీ ఈ రహదారి ప్రస్తుతం గుంతల మయంగా మారింది. రోడ్డు వేసి యేడాది కాకుం డానే రోడ్డు మునా ళ్ల ముచ్చ టగానే మిగిలి పోయింది. ఇంత జరుగుతున్నా అధికా రులు, ప్రజా ప్రతినిధులు అటు వైపు కన్నెత్తి చూడటం లేదని ప్రజలు విమర్శి స్తున్నారు. అడిగే నాథుడే లేక కాంట్రాక్టర్లు ఇష్టారీతిగా వ్యవహరిస్తున్నారు.
ఇందల్వాయి మండల కేంద్రంలోని తిర్మన్పల్లి పంచాయతీ భవనం పక్కన దాదాపు రూ. 30 లక్షలతో రక్షిత మంచినీటి ట్యాంకు నిర్మించారు. అప్పటి నుంచి సిమెంట్ పనులకు క్యూరింగ్ చేయలేదు. దీంతో ట్యాంకు మన్నికపై అనుమానాలు తలెత్తుతున్నాయి. ఇకనైనా అధికారులు స్పందించి పనులపై ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని ప్రజలు కోరుతున్నారు. కాంట్రాక్టర్లు నాణ్యతపాటించే విధంగా చర్యలు తీసుకోవాలని సూచిస్తున్నారు.
Authorization