- నిర్వాహణ తీరు పట్ల అధికారుల అసంతృప్తి
- విద్యార్థులు ఆరుబయటే భోజనాలు చేస్తుండటం పట్ల విస్మయం
- ఉన్నతాధికారులకు నివేదిన
నవతెలంగాణ-బిచ్కుంద
మండల కేంద్రంలోని మైనారిటీ గురుకుల పాఠశాలను మండల విద్యాధికారి బాబూరావు, తహసీల్దార్ గోవర్దన్, ఎమ్డీవో సాయిబాబా సోమవారం తనిఖీలు చేసి నిర్వాహణ తీరు పట్ల అసంతృప్తి వ్యక్తం చేశారు. మధ్యాన్న భోజన సమయంలో విద్యార్థులు ఆరుబయటే కూర్చుని భోజనం చేస్తుండటం గమనించి వైస్ ప్రిన్సిపాల్పై ఆగ్రహం వ్యక్తం చేశారు. విద్యార్థులకు భోజన శాలలో కూర్చోబెట్టి భోజనం వడ్డించాలనీ సూచించారు. మెనూ ప్రకారం భోజనం వండక పోవడంతో పది మంది విద్యార్థులకు అన్నం తక్కువ పడటంతో మళ్లీ వండి వడ్డించారు. మెనూ ప్రకారం భోజనంలో మజ్జిగ ఇవ్వాల్సి ఉండగా అక్కడ లేకపోవడం, భోజన శాలలో వర్షం నీరు నిలిచి ఉండటం, చెత్త తిసివేయకుండా అక్కడే ఉంచడంతో ఆగ్రహం వ్యక్తం చేశారు. తరగతి గదులు పరిశీలించి, విద్యా బోధన, భోజనం, తదితర విషయాలపై విద్యార్థు లనడిగి తెలుసుకున్నారు. అటెండెన్సూ, రిజిస్టర్, స్టాక్ రిజిస్టర్ నిర్వహణ సరిగా లేకపోవడం పట్ల సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. పూర్తి నివేదికలు తయారు చేసి జిల్లా అధికారులకు పంపించనున్నట్టు తెలిపారు. వారి వెంట అధికారులు రాచప్పా, వీఆర్ఏ మల్లిఖార్జున్, వార్డెన్ రజాక్, పాఠశాల సిబ్బంది ఉన్నారు.
Authorization