- ఎస్సారెస్పీ నీటి విడుదల కుదింపు
- లక్ష్మికాలువకు రెండు నెలలే సాగునీరు
- అరుతడి పంటలపై మొగ్గు చూపాలంటున్న అధికారులు
- ఇప్పటికే వరి తుకం అలికిన రైతన్నలు
నవతెలంగాణ-ముప్కాల్
శ్రీరాంసాగర్ ప్రాజెక్టు ద్వారా రబీలో సాగునీటి విడుదల ప్రణాళికపై అన్నదాతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రాజెక్టులో ప్రధాన కాలువల్లో ఒకటైన లక్ష్మి కాలువ ఆయకట్టుకు రెండు నెలలు మాత్రమే నీటిని సరఫరా చేస్తామనడంపై రైతులు మండిపడుతున్నారు. ఇప్పటికే ఆయకట్టు రైతులు కాల్వ వెంబడి పంటపొలాల్లో తుకం అలికారు. రబీ ప్రణాళిక ప్రకారం కేవలం తాగునీరుకు, గ్రామాల్లో చెరువులు నింపడానికి మాత్రమే నీరు ఇస్తామనడంపై రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ ఏడాది ప్రాజెక్టులోకి దాదాపు 77 టీఎంసీల నీరు వచ్చి చేరినప్పటికీ అధికారులు రబీ పంటకు నీటిని అందించకపోవడంపై రైతులు ఆవేదన చెందుతున్నారు. రెండు నెలల నీరు సరిపోవని, వారా బంధీ ప్రకారం నాలుగు నెలలు విడుదల చేయాలని రైతులు కోరుతున్నారు.
ఇటీవల కమిటీ సమావేశంలో లక్ష్మీ కాలువ ద్వారా వచ్చే నెల జనవరి 15 నుంచి మార్చి 15 వరకు రోజూ 300 క్యూసెక్కుల నీటిని దాదాపు 20 వేల ఎకరాలకు సాగునీరు అందించేందుకు నిర్ణయం తీసుకున్నారు. అదికూడా తాగునీరు, చెరువులను నింపడానికే నిర్ణయం తీసుకున్నట్టు విశ్వసనీయ సమాచారం. ఈ నీటితో ఆరుతడి పంటలను వేసుకోవాలని అధికారులు రైతులకు సూచించారు. ప్రాజెక్టులో ఉన్న నీటి నిల్వ ఆధారంగా ప్రాజెక్టు ఉన్నతాధికారులు ఈ నిర్ణయం తీసుకున్నట్టు ఎస్సారెస్పీ ఎస్ఈ శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. లక్ష్మీ కాలువ కింద ముప్కాల్, మెండోరా, బాల్కొండ, వేల్పూర్, మోర్తాడ్, కమ్మర్పల్లి మండలాల్లో దాదాపు 25,750 ఎకరాల ఆయకట్టు ఉంది. అయితే యాసంగిలో వరి పంట వేయడానికి ఆయకట్టు రైతులు ఇప్పటికే సిద్ధమైయ్యారు. కాగా ఈ నీరు పంటల సాగుకు సరిపోవని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రాజెక్టులో ప్రస్తుతం 33.125 టీఎంసీల నీరు ఉంది. ఇందులో నుంచి వచ్చే సంవత్సరం ఆగస్టు నాటికి మిషన్ భగీరథ పథకం కోసం దాదాపు 5 టీఎంసీల నీటిని కేటాయించాలని ప్రభుత్వం నుంచి ఆదేశాలు ఉన్నాయని ప్రాజెక్టు అధికారులు పేర్కొంటున్నారు. డెడ్ స్టోరేజీ, ఆవిరి రూపంలో పోను మిగితా 20 టీఎంసీల నీరు సాగుకు అందుబాటులో ఉంటుంది. ఈ నీటిని కేవలం ప్రాజెక్టు ప్రధాన కాలువలైన సరస్వతీ, కాకతీయ కాల్వల ద్వారా తాగునీటికి, చెరువులు నింపడానికి మాత్రమే సరఫరా చేస్తామని అధికారులు తెలిపారు. వరి పంట పూర్తి స్థాయిలో సాగు చేయాలంటే కనీసం ఏప్రిల్ చివరి నెల వరకు లక్ష్మీ కాలువ ద్వారా నీటిని అందించాలని ఆయకట్టు రైతులు అభిప్రాయవ్యక్తం చేస్తున్నారు. ప్రాజెక్టు అధికారులు, ప్రజాప్రతినిధులు ఇప్పటికైనా స్పందించి లక్ష్మీ కాలువ ఆయకట్టు రైతులను దృష్టిలో ఉంచుకొని న్యాయం చేయాలని కోరుతున్నారు.
లక్ష్మి కాలువను నమ్ముకొని తుకం అలికినం
గడ్డం నర్సింగ్ దాస్, ఆయకట్టు రైతు, ముప్కాల్
ఆయకట్టు రైతులమైన మేము ప్రాజెక్టు ప్రధాన కాలువల్లో ఒకటైన లక్ష్మీ కాలువ నీటిని నమ్ముకొని పొలాల్లో తుకాలను సైతం అలికినం. ఇప్పుడు కేవలం రెండు నెలలు మాత్రమే నీటిని ప్రాజెక్టు ద్వారా సరఫరా చేస్తామనడం సరైంది కాదు. అధికారులు రైతులు వేసిన పంటలను గుర్తించి మరో రెండు నెలలు అదనంగా పొడగిస్తే బాగుంటుంది. అప్పుడే ఆయకట్టు రైతాంగానికి న్యాయం చేసినట్టు అవుతుంది.
Authorization