నవతెలంగాణ-డిచ్పల్లి
'మమ్మల్ని త్వరగా ఇంటికి రప్పించండి. కంపెనీ వీసాలున్నాయని ఏజెంట్ మాటలు నమ్మి మలేషియా వచ్చి మోసపోయాం. ఇక్కడ పనిలేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నాం. కంపెనీవారికి జీతమడిగితే కత్తులు చూపిస్తున్నారు. మమ్మల్ని ఎలాగైనా ఇంటికి రప్పించండి' అంటూ ఇందల్వాయి మండల కేంద్రానికి చెందిన ముగ్గురు యువకులు తమ కుటుంబ సభ్యులతో కన్నీరుమున్నీరయ్యారు. వారిని ఎలాగైనా రప్పించాలని కుటుంబ సభ్యులు ప్రజాప్రతినిధులను కోరుతున్నారు.
ఇందల్వాయి మండల కేంద్రానికి చెందిన కుమ్మరిదాస్, కరముల రఘుపతి, శ్రీనివాస్ ముగ్గురు యువకులు మూడు నెలల క్రితం మలేషియాకు వీసాలుండటంతో గల్ఫ్ ఏజెంట్ మాటలు నమ్మి ఒక్కొక్కరు రూ.లక్ష చెల్లించి మలేషియా వెళ్లారు.
'వెళ్లాక కంపెనీ పని చూపించలేదు. కనీసం భోజనం సదుపాయం, ఉండటానికి వసతి కల్పించలేదు. కంపెనీ వారికి జీతం అడిగితే కత్తులు చూపించారు.' అని ఆ యువకులు తమ కుటుంబ సభ్యులకు ఫోన్ ద్వారా వెల్లడించారు. తక్షణమే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం స్పందించి మమ్ములను మలేషియా నుంచి ఇండియాకు రప్పించాలని వారు కోరుతున్నారు. రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కేటీఆర్, నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ను విలపిస్తూ వారు వేడుకుంటున్నారు. ఎలాగైనా వారిని ఇండియాకు రప్పించి ఆదుకోవాలని కుటుంబ సభ్యులు రోదిస్తున్నారు.
Authorization