నవతెలంగాణ-బిచ్కుంద
మండలంలోని పెద్దదేవాడ రోడ్డు తెగిపోవడంతో బాన్సువాడకు రాకపోకలు నిలిచిపోయాయి. బిచ్కుందకు రావాలంటే సుమారు 50నుంచి 60 కిలోమీటర్ల చుట్టూ తిరిగి ప్రయాణం చేసే పరిస్థితి ఏర్పడింది. జిల్లా అధికారులు, డివిజన్ అధికారులు జుక్కల్ నియోజకవర్గంలోని మండలాల్లో అధికారిక పర్యటనలు చేయాలన్నా ఈ బ్రిడ్జిపై నుంచి రావాల్సిందే. బ్రిడ్జి నిర్మాణ పనులు ప్రారంభించిన గుత్తెదారు పక్కనే మొరం వేసి తాత్కాలిక రోడ్డు నిర్మించారు. పగలు వర్షం పడి అనుకోకుండా వరదవరద రావడంతో రోడ్డు కొట్టుకుపోయింది.
ఆగిన బిల్లులు
బిచ్కుంద, బాన్సువాడ ప్రధాన రహదారి వంతెన నిర్మాణ పనులు బిల్లులు రాక ఆగిపో యాయి. జుక్కల్ నియోజకవర్గంలోని జుక్కల్, బిచ్కుంద, మద్నూర్, పెద్దకొడప్గల్ మండ లాల ప్రజలు కామారెడ్డి, నిజామాబాద్ జిల్లా కేంద్రాలకు వెళ్లాలంటే ప్రధాన రహదారి ఇదే. పెద్దదేవాడ వద్ద గల వాగుపై లో లేవల్ వంతెన పూర్తిగా చెడిపోవడంతో 2016లో రూ.5కోట్ల 32లక్షల నాబార్డు నిధులను ప్రభు త్వం మంజూరు చేసింది. దీంతో అప్పటి భారీ నీటి పారుదల శాఖ మంత్రి హరీష్రావు చేతులమీదుగా ఈ వంతెన నిర్మాణం కోసం శంకుస్థాపన చేశారు. నిర్మాణ పనులు చేపట్టిన కాంట్రాక్టర్ రెండు బ్రిడ్జిల పనులు గాను ఒకే బ్రిడ్జి పనులు పూర్తి చేసి చేతుల ఎత్తేశారు.
పనులు ప్రారంభమైనా సరైన సమయానికి కాంట్రాక్టర్లకు పనులు పూర్తి చేసిన బిల్లులు రాకపోవడంతో కాంట్రాక్టర్ పనులు ఆపివేశారు. ఇప్పటికైనా అధికారులు, ప్రజాప్ర తినిధులు స్పందించి నిధులు మంజూరు చేసి, పనులు పూర్తి చేసే విధంగా చర్యలు తీసుకో వాలని ప్రజలు కోరుతున్నారు.
ముందే హెచ్చరించిన నవతెలంగాణ..
వర్షాకాలం వచ్చిందంటే ఈ వాగు నుంచి కౌలాస్నాలా ప్రాజెక్టు దిగువ నీరు పారుతుంది. వర్షాలు పడి కౌలాస్ ప్రాజెక్టులోకి నీరు చేరి దిగువకు నీరు వదిలితే బాన్సువాడ, బిచ్కుంద రాకపోకలు పూర్తిగా స్తంభిస్తాయని నవతెలంగాణలో జులైలోనే కథనం ప్రచురితమైంది. అయినా అధికారుల అలసత్వంతో సామాన్య ప్రజలకు ఇబ్బందులు తప్పడం లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి.
మరమ్మతులు చేపడుతాం
వంతెన వద్ద కొట్టుకుపోయిన రోడ్డును పునరుద్ధరించడానికి ప్రయత్నిస్తున్నాం. తాత్కాలికంగా ఏర్పాటు చేసిన రోడ్డు పైపులు 30 నుంచి 50మీటర్ల వరకు నీటి ప్రవాహంలో కొట్టుకుపోయింది. వరద ఉధృతి తగ్గాక రోడ్డు మరమ్మతు పనులు చేపడుతాం.
- సతీష్ ఆర్డబ్యూఎస్ ఏఈ, బిచ్కుంద
Authorization