- క్రీడాకారులను, కోచ్ను అభినందించిన అడిషనల్ డీసీపీ నవతెలంగాణ-కంఠేశ్వర్ ఒకినవా మార్షల్ ఆర్ట్స్ ఆధ్వర్యంలో కరీంనగర్లో ఈనెల 16న నిర్వహించిన రాష్ట్రస్థాయి కరాటే పోటీల్లో పతకాలు సాధించిన విద్యార్థులను అడిషనల్ డిప్యూటీ పోలీస్ కమిషనర్ ఉషావిశ్వనాథ్ అభినందించారు. మంగళవారం జిల్లా పోలీస్ కమిషనరేట్లో ఏర్పాటుచేసిన కార్యక్రమంలో ఉషా విశ్వనాథ్ మాట్లాడారు. నిజామాబాద్ జిల్లా కేంద్రానికి చెందిన తెలంగాణ లీ మార్షల్ ఆర్ట్స్ అకాడమీ విద్యార్థులు కటాస్, స్పారింగ్ విభాగాల్లో ఏకంగా 23 పతకాలను సాధించారన్నారు. వారికి చక్కటి శిక్షణను ఇచ్చి ప్రోత్సహిస్తున్న అకాడమీ ఫౌండర్ ప్రెసిడెంట్ ఎడ్ల వెంకటేష్ను అభినందించారు. ఆత్మరక్షణలో భాగంగా కఠోర సాధన చేసే కరాటే క్రీడలో పతకాలు సాధించడం చాలా గొప్ప విషయమని అన్నారు. భవిష్యత్తులో జాతీయ, అంతర్జాతీయ స్థాయి పోటీల్లోనూ పథకాలను సాధించాలని సూచించారు. అనంతరం అడిషనల్ డీసీపీని ఎడ్ల సిరి చందన, వైష్ణవి మైత్రి పుష్ప గుచ్ఛంతో సత్కరించారు.