ఫాస్ట్ఫుడ్ కల్చర్ వేగం పుంజుకుంది. కూల్డ్రింక్స్,స్నాక్స్, పిజ్జాలు, బర్గర్ల ట్రెండ్ స్పీడ్ అందుకుంది. ఎవరిని చూసినా వీటితోనే ఆకలి తీర్చుకుంటున్నారు. డస్ట్బిన్లా చెత్తాచెదారంతో
పొట్టను నింపుకుంటున్నారు. జంక్ఫుడ్ లేనిదే మనుగడ లేదంటోంది నేటితరం. ఇది ఏమాత్రం
సరికాదని హెచ్చరిస్తున్నారు నిపుణులు. ఇలాంటి తిండి తిని ఆరోగ్యాన్ని చెడగొట్టుకోవద్దని
అంటున్నారు. రోగాలు చుట్టుముడతాయనే జంకు లేకుండా ఎంచక్కా సమతులాహారం
తీసుకోవాలని సూచిస్తున్నారు.
అన్ని రకాల పోషకాలున్న సమతులాహారంతోనే మానవ ఆరోగ్యానికి మనుగడ. రోగ నిరోధకశక్తి పెంచేందుకు ఇదెంతో దోహదపడుతుంది. పిండి పదార్థాలు, మాంసకృత్తులు, కొవ్వు పదార్థాలు, ఏ, బీ, సీ, డీ విటమిన్లు, కాల్షియం, ఇనుము ధాతు, పీచుపదార్థాలు(ఫైబర్) నిర్దిష్ట పరిమాణంలో తీసుకుంటే శరీరానికి సమతులాహారం అందినట్టు లెక్క. వీటిలో ఏది లోపించినా అనారోగ్యం ఖాయం.
పదార్థాలు.. ప్రాధాన్యత
ధాన్యం, చిరుధాన్యాలు, చక్కెర, బెల్లం, దుంప కూరల ద్వారా పిండి పదార్థాలు అందుతాయి. ఇవి లోపిస్తే బరువు తగ్గుతారు. నీరసం ఆవరిస్తుంది.
పప్పులు, నూనె గింజలు, మాంసం, గుడ్లు, చేపలు, పాలు, పెరుగు ద్వారా మాంసకృత్తులు లభిస్తాయి. ఇవి లోపిస్తే రోగ నిరోధక శక్తి తగ్గుతుంది. శారీరక ఎదుగుదల లోపిస్తుంది. బరువు తగ్గుతారు. శరీరంలో నీరు చేరుతుంది.
నూనెలు, నెయ్యి, వెన్న, వనస్పతి ద్వారా కొవ్వు పదార్థాలు లభిస్తాయి. ఇవి లోపిస్తే బరువు తగ్గుతారు. నీరసం ఆవరిస్తుంది. చర్మం గరుకుగా మారుతుంది.
నెయ్యి, పాలు, పెరుగు, గుడ్డులోని పచ్చ సొన, ఆకు కూరలు, బొప్పాయి, మామిడి, బత్తాయి, క్యారెట్ ద్వారా విటమిన్-ఏ అందుతుంది. ఇది లోపిస్తే రేచీకటి, దృష్టిలోపం ఏర్పడుతుంది. రోగ నిరోధకశక్తి తగ్గుతుంది. చర్మం గరుకుగా మారుతుంది. నరాల బలహీనత కలుగుతుంది.
ధాన్యాలు, చిరుధాన్యాలు, పాలు, పాల పదార్థాలు, పప్పులు, ఆకుకూరలు, చిక్కుళ్లు, మాంసం, గింజ ధాన్యాల ద్వారా బీకాంప్లెక్స్ విటమిన్లు లభిస్తాయి. ఇవి లోపిస్తే పెదవుల చివర పగుళ్లు, నోటిపూత ఏర్పడతాయి. ఆకలి తగ్గుతుంది. రక్తహీనత ఏర్పడుతుంది.
జామ, నిమ్మ, నారింజ, బత్తాయి, ఉసిరి, మొలకెత్తిన పప్పు ధినుసుల ద్వారా విటమిన్-సీ లభిస్తుంది. ఇది లోపిస్తే పళ్ల చిగుళ్లు ఉబ్బి రక్తం కారడం, చర్యంలో కాంతి లోపిం చడం, పుండ్లు, ఆకలి తగ్గడం లాంటివి సంభవిస్తాయి.
పాలు, కాలేయం, సూర్య రశ్మి ద్వారా విటమిన్-డీ సమకూరు తుంది. దీని లోపం వల్ల రికెట్స్ వ్యాధి సంక్రమిస్తుంది. ఎముకల బలహీనత ఏర్పడుతుంది. శారీరక ఎదుగుదల నెమ్మది స్తుంది.
పాలు, చేపలు, ముడిపప్పులు, ఆకు కూరలు, రాగుల ద్వారా క్యాల్షియం సమకూరు తుంది. దీని లోపం వల్ల పెరుగుదల తగ్గడం, ఎముకలు బలహీనం కావడం, ఎముకలు గుల్లబారి, స్వల్ప ఒత్తిడికే విరగడం లాంటి సమస్యలు ఏర్పడతాయి.
మాంసం, కాలేయం, గుడ్లు, సజ్జలు, రాగులు, ఆకుకూరలు, దంపుడు అటుకులు, ఖర్జూరాలు, బెల్లం ఎండుద్రాక్ష, సపోటాల నుంచి ఇనుము ధాతు సమకూరుతుంది. ఇది లోపిస్తే రక్తహీనత, నిస్సత్తువ, అబార్షన్లు లాంటి సమస్యలు ఏర్పడతాయి.
రక్తంలోని కొలెస్ట్రాల్, చక్కెరలను నియంత్రిస్తూ జీర్ణకోశం సమర్థంగా పనిచేయడం, క్యాన్సర్లను నివారించడంలో పీచుపదార్థాల పాత్ర కీలకం. ఇవి లోపిస్తే మలబద్ధకం, క్యాన్సర్లు లాంటి సమస్యలు ఏర్పడతాయి.
మరేం తింటున్నాం..?
సమతులాహారం తీసుకుంటే ఆరోగ్యంగా ఉంటామని వైద్య నిపుణులు చెబుతున్నా చాలా మంది దీన్ని పట్టించుకోవడం లేదు. నవ నాగరికత పేరుతో జంక్ఫుడ్కి అలవాటు పడుతున్నారు. పిజ్జాలు, బర్గర్లు, చిప్స్, కూల్డ్రింక్స్ లాంటి పదార్థాలు తీసుకుని ఆరోగ్యాన్ని చేజేతులా చెడగొట్టుకుంటున్నారు. ఇంట్లో వండిన ఆహారంతో పోలిస్తే జంక్ఫుడ్లో కొవ్వు అధిక శాతం ఉంటుంది. ఉప్పు, చక్కెర మోతాదు ఎక్కువే. పీచుపదార్థం తక్కువగా ఉంటుంది. కాల్షియం, ఐరన్ తదితర పోషకాలు స్వల్పమే. ఇలాంటి పదార్థాలు అనర్థదాయకమని తెలిసినా ఆధునిక పోకడలతో వీటిని మానేయలేకపోతున్నారు. ముఖ్యంగా యువజనులు, పిల్లలు జంక్ ఫుడ్కి దాసోహమవుతున్నారు. పెద్దలు వారించకపోవడమే కాకుండా కొందరు ప్రోత్సహించడం ఆందోళనకర విషయం.
ఆరోగ్యానికి హాని
జంక్ఫుడ్లో అతిగా ఉండే కొవ్వుల వల్ల బరువు విపరీతంగా పెరుగుతుంది. స్థూలకాయం ఏర్పడి అనేక రోగాలకు దారితీస్తుంది. జంక్ఫుడ్లో ఉప్పుతో పాటు సోడియం రసాయనాలు ఎక్కువగా వాడతారు. వీటి వల్ల రక్తపోటు పెరుగుతుంది. ఈ ఆహారంలో అతిగా వాడే చక్కెర, పిండి పదార్థాల వల్ల టైప్2 డయాబెటిస్ ముప్పు తలెత్తుతుంది. జంక్ఫుడ్లో రుచి కోసం అతిగా వాడే కొవ్వులు రక్తనాళాల్లో పేరుకుపోయి గుండెజబ్బులకు దారి తీస్తాయి. ఈ ఆహారాన్ని నిల్వ ఉంచేందుకు ఉప్పును మితిమీరి ఉపయోగిస్తారు. ఇది ఆరోగ్యానికి ఏమాత్రం మంచిది కాదు. కూల్డ్రింకులు, ఐస్క్రీముల్లో చక్కెర పదార్థాలను మోతాదుకు మించి వాడతారు. దీంతో అనేక రోగాలు దరి చేరుతాయి. జంక్ఫుడ్ పదార్థాలను ఎక్కువగా నూనెలో వేపు తారు. అవి తింటే ఒంట్లోకి అనవసరపు కొవ్వు చేరుతుంది.
జంక్ఫుడ్లో ముఖ్యమైన ముడిసరుకు పిండి పదార్థాలే. రంగు, రుచి కోసం అనవసర రసాయనాలనూ వాడతారు. ఇవి ఆరోగ్యానికి హానికరం. ఈ ఆహారంలో ఎక్కువ కేటరీలు ఉండటం వల్ల ఇది త్వరగా జీర్ణం కాదు. చాలామంది వ్యాయామం చేయడానికి ఆసక్తి చూపరు. దీంతో పొట్ట చుట్టూ అధికంగా కొవ్వు చేరుతుంది. ఆ తర్వాత రక్తపోటు, మధుమేహం తదితర వ్యాధులకు గురవుతారు. వారంలో రెండుమూడుసార్లు జంక్ఫుడ్ తీసుకునే వారిలో ఎక్కువ మొత్తంలో కొవ్వు తయారవుతుంది. ముఖ్యంగా పొట్ట దగ్గర కొవ్వు పెరగడం వల్ల గుండెపై ప్రభావం చూపుతుంది. అంతేకాదు.. జంక్ఫుడ్ తీసుకోవడం వల్ల కిడ్నీ వ్యాధులు సంక్రమిస్తాయని సర్వేలు చెబుతున్నాయి. ఈ పదార్థాల కారణంగా మతిమరుపు కూడా వస్తుందని యూనివర్శిటీ ఆఫ్ కాలిఫోర్నియా చేపట్టిన అధ్యయనంలో తేలింది.
ప్రత్యామ్నాయం ఏమిటి?
బ్రేక్ఫాస్ట్లో జంక్ఫుడ్ కాకుండా విటమిన్లు, మినరల్స్, ఫైబర్తో కూడిన ఆహార పదార్థాలు తీసుకోవాలి. చిప్స్ వంటి స్నాక్స్ తినడం కన్నా ఇంట్లో రకరకాల పండ్లను నిల్వ పెట్టుకుని తినడం అలవాటు చేసుకోవాలి. కూల్డ్రింక్స్కు బదులు మంచినీరు ఎక్కువ తీసుకోవాలి. చక్కెర శాతం ఉన్న పానీయాల కంటే నిమ్మకాయ నీళ్లు, మజ్జిగ, కొబ్బరినీళ్లు తీసుకోవడం మంచిది. పోషక విలువలున్న సంప్రదాయ వంటలు ఇంట్లో వండుకుని తినడం అత్యుత్తమం.
మేలైన ఆహారం
ఆహారాన్ని స్థూలంగా మూడు రకాలుగా విభిజించొచ్చు. 1. శరీరానికి శక్తినిచ్చేవి, 2. శరీర నిర్మాణానికి తోడ్పడేవి, 3. శరీరానికి రక్షణ కలిగించేవి. పిండి పదార్థాలు, కొవ్వు పదార్థాలు సమృద్ధిగా కలిగి ఉన్న వాటిని శరీరానికి శక్తినిచ్చే ఆహారాలు అంటారు. కాయధాన్యాలు, దుంపలు, గడ్డలు, ఎండ బెట్టిన పండ్లు, చక్కెర, కొవ్వు పదార్థాలు ఆహార సముదాయానికి చెందినవి. శక్తినిచ్చే కాలరీలను శీఘ్రంగా, చౌకగా లభింపజేసే ఆహారాలు ఇవి. అలాగే మాంసకృత్తులు విరివిగా కలిగి ఉన్న వాటిని శరీర నిర్మాణానికి తోడ్పడే ఆహారాలు అంటారు. పాలు, మాంసం, చేపలు, గుడ్డు, పప్పులు, నూనె గింజలు, వేరుశనగ తదితర పదార్థాలు ఈ ఆహార సముదాయానికి చెందినవి. నిజానికి ధాతువుల నిర్మాణానికి ఉపయోగపడేది మాంసకృత్తులే. మన శరీరానికి అవసరమైన వాటిలో దాదాపు మూడింట రెండు భాగాలను శాకాహారాల ద్వారా లభించే మాంసకృత్తుల నుంచి పొందొచ్చు. మిగిలిన మూడో భాగాన్ని జంతువుల నుంచి లభించే మాంసకృత్తుల (పాలు జున్ను) ద్వారా సమకూర్చుకోవడం అవసరం.
- జీనత్ ఫాతిమా, డైటీషియన్
Authorization