గ్యాస్ ట్రబుల్కి ఆధునిక జీవన విధానం, ఆహారపు అలవాట్లు, నీరు ఎక్కువ గా తీసుకోకపోవడం ప్రధాన కార ణాలు. మసాలాలు ఉన్న ఆహారం తీసుకోవడం, క్రమబద్ధం గా తిండి తినకపోవడం కూడా దోహదం చేస్తుంది. తీసుకున్న ఆహారం అరగపోవడం వల్లే కాదు.. అసలు ఏం తీసుకో పోయినా గ్యాస్ పెరుగుతుంది. దాన్ని తగ్గించుకోక పోతే అనేక రుగ్మతలకు దారి తీస్తుంది. కొన్ని చిట్కాలు పాటిస్తే దీని నుంచి ఉపశమనం పొందొచ్చు. - ఒక గ్లాసు చల్లని పాలను చక్కెర లేకుండా తాగాలి. దీని వల్ల కడుపులో మంట, అసిడిటీ తగ్గుతాయి. పాలు చల్లగా ఉండడం వల్ల పొట్టలో చలువను పెంచుతాయి. పాలలో ఉండే కాల్షియం కడుపులో అధికంగా ఉన్న ఆమ్లాలను పీల్చుకుని గ్యాస్ సమస్య నుంచి ఉపశమనం కలిగిస్తుంది. అవసరమైతే పాలకు ఒక టీస్పూన్ మోతాదులో నెయ్యిని కలిపి తీసుకోవచ్చు. - గ్యాస్ట్రబుల్ తగ్గడానికి యాలకులు (ఇలాచీ) బాగా పని చేస్తాయి. రెండు, మూడు యాలకులను తీసుకుని నలిపి పొడి చేయాలి. దాన్ని ఒక గ్లాసు నీటిలో మరిగించాలి. ఆ తర్వాత వచ్చే మిశ్రమాన్ని చల్లబరిచి తాగాలి. దీని వల్ల కడుపు లోపలి భాగంలో ఉండే చర్మం అధికంగా విడుదలయ్యే యాసిడ్ల బారిన పడకుండా ఉంటుంది. దీనికి తోడు గ్యాస్ సమస్యలు తొలిగిపోతాయి. - ఒక టీస్పూన్ తేనె తాగితే ఐదు నిమిషాల్లోనే అసిడిటీ నుంచి ఉపశమనం కలుగుతుంది. కడుపులోని మ్యూకస్ పొరను రక్షించే ఔషధంగా తేనె పనిచేస్తుంది. - అసిడిటీ నుంచి తక్షణమే ఉపశమనం లభించాలంటే ఒక గ్లాసు కొబ్బరి నీటిని తాగితే సరిపోతుంది. ఇది కడుపులో తయారయ్యే యాసిడ్ల ప్రభావాన్ని తగ్గిస్తుంది. దీని వల్ల గ్యాస్ సమస్య త్వరగా తగ్గిపోతుంది. అంతేకాకుండా తరచూ కొబ్బరి నీటిని తాగితే కడుపులో మ్యూకస్ పొర కొత్తగా ఏర్పడి యాసిడ్లు అధికంగా ఉత్పత్తి కాకుండా చేస్తుంది. మంచి ఫలితం ఇస్తుంది.