ఒకే చోట కూర్చొని పనిచేసేవారు, కదలకుండా గంటల కొద్దీ వినోదాన్ని ఆస్వాదించే వారు జర జాగ్రత్త! మీరు రక్తం గడ్డ కట్టే రుగ్మత బారిన పడే ప్రమాదం ఉంది. కాళ్లూచేతులు, పొత్తికడుపు, ఊపిరితిత్తుల్లోని రక్తనాళాల్లో ఈ సమస్య ఏర్పడుతుందని అమెరికాలోని యూనివర్సిటీ ఆఫ్ వెర్మాంట్ చేసిన అధ్యయనంలో వెల్లడైంది. అదేపనిగా కదలకుండా కూర్చుంటే వీనస్ థ్రోంబో ఎంబోలిజం (వీటీఈ) వ్యాధి బారిన పడతారని, శరీరంలో రక్తం గడ్డ కట్టే లక్షణం దీనికి ఉంటుందని పరిశోధకులు అంటున్నారు. కదలకుండా కూర్చొని పనిచేసేవారికి గుండె నాళాల్లో రక్తం గడ్డ కడుతుందని పలు అధ్యయనాల్లో ఇది వరకే తేలింది. ఇతర అవయవాలకూ ఈ ముప్పు ఉందనే విషయం కొత్తగా కనుగొన్నారు. అధ్యయనంలో భాగంగా 45 నుంచి 65 ఏండ్ల మధ్య వయసు ఉన్న 15,168 మందిని పరిశీలించారు. కదలకుండా ఒకేచోట కూర్చొని ఉండేవారికి వీటీఈ సమస్య 1.7 రెట్లు ఎక్కువ ఉన్నట్టు గుర్తించారు.