మానవ జీవితానికి దోహదపడే వనరులు ఎన్ని ఉన్నా సామాన్య, మధ్య తరగతి కుటుంబాలకు ఇంకా అందుబాటులోకి రానివి చాలానే ఉన్నాయి. ప్రాణ రక్షగా పనిచేసే మందులు కూడా ఈ కోవకే వస్తాయి.
ఔషధాల ధరలు చుక్కలు చూపిస్తున్నాయి. మందు చీటిని చూసి రోగులు గుండెలు బాదుకునే పరిస్థితి. ఈ సమస్య ఇప్పటిది కాదు. దశాబ్దాలుగా తిష్టవేసి ఉన్నదే. జన జీవితాలతో ఇది చెలగాటమాడుతోంది. అప్పుల ఊబిలోకి నెట్టేస్తోంది.
అల్లోపతి మందు అనేది నిర్దిష్ట ఆరోగ్య సమస్యను పరిష్కరించేందుకు మాత్రమే ఉపయోపగడుతుందని అనుకోలేం. దాని దుష్ప్రభావం ఇతర అవయవాల మీద కూడా పడొచ్చు. అవసరమున్నా లేకున్నా కొందరు వైద్యులు సూచించే మందులు ఇతర రోగాలకు కారణం కావచ్చు. ఇందులో మందుల కంపెనీల పాత్ర తక్కువేమీ కాదు. కొన్ని కంపెనీలు డాక్టర్లను ప్రలోభాలకు గురిచేస్తూ తమ ఉత్పత్తులనే రాసేలా ప్రోత్సహిస్తున్నాయి. దీంతో డాక్టర్లు బ్రాండెడ్ మందులకే అత్యంత ప్రాధాన్యతనిస్తున్నారు. సామాన్యులకు అందుబాటులో ఉండే జనరిక్ ఔషధాలను విస్మరిస్తున్నారు. ఒక మందు ఒకే కాంపోజిషన్తో వేలాది బ్రాండ్స్ రూపంలో ఉంటుందన్న వాస్తవం చాలామంది రోగులకు దీనిపై అవగాహన ఉండటం లేదు.
అపోహ మాత్రమే...
బ్రాండెడ్ మందులు మాత్రమే పనిచేస్తాయి.. జనరిక్ మందులు పనిచేయవనేది అపోహ మాత్రమే. బ్రాండెడ్ మందులు ఎలా పనిచేస్తాయో జనరిక్ మందులూ అలాగే పనిచేస్తాయి. ఉదాహరణకు జ్వరం తగ్గేందుకు వాడే 'పారాసెటమోల్ 'ని ఒక్కొక్క కంపెనీ ఒక్కొక్క బ్రాండ్ పేరుతో ధరను నిర్ణయించి మార్కెట్లో ప్రవేశ పెడుతుంది. షుగరు వ్యాధి నియంత్రణకు వాడే ' మెటఫార్మిన్', ' గ్లిమీప్రైడ్', బీపీ నియంత్రణకు వాడే 'రామిప్రిల్', 'టెల్మిసాట్ట్రాన్', కొలెస్ట్రాల్ ని తగ్గించుకునేందుకు వాడే 'ఆటోర్వాస్టాటిన్', 'రోసువాస్టాటిన'్ మందుల కంపెనీలు వివిధ బ్రాండ్స్ రూపంలో విక్రయిస్తున్నాయి. వీటి ధరలు జనరిక్ మందులతో పోలిస్తే నాలుగైదు రెట్లు అధికంగా ఉంటాయి. వీటిని తయారు చేసేవి కూడా పెద్ద కంపెనీలే. నాణ్యతలో ఇవి బ్రాండెడ్ మెడిసిన్కి తీసిపోవు. జనరిక్ మందులు వాడితే ఆరోగ్య సమస్యకు పరిష్కారంతోపాటు రోగికి ఆర్థిక ఉపశమనం కూడా. కొన్ని జనరిక్ మందులు 80 శాతం తక్కువ ధరకు కూడా లభిస్తాయి. ఇలా దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడే వారికి వేలాది రూపాయలు మిగులుతాయి. బ్రాండెడ్ రూపంలో మందుల కొనుగోళ్ల వల్ల పేషెంట్ ఆర్థికంగా చితికిపోవాల్సిందే.
నియంత్రణ శూన్యం
ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే మనదేశంలోని కంపెనీలు తమ బ్రాండెడ్ మందులకు మన దేశంలోనే అధిక ప్రాధాన్యతనిస్తూ విదేశాలకు మాత్రం జనరిక్ ఔషధాలను ఎగుమతి చేస్తున్నాయి. వాటికి విదేశీయులపై ఉన్న మక్కువ స్వదేశీయులపై ఉండటం లేదు. గ్రామీణ ప్రజల అమాయకత్వాన్ని ఆసరా చేసుకుని కొన్ని కనీవిని ఎరుగని కంపెనీలు నాసిరకం మందులు మార్కెట్లో ప్రవేశ పెడుతున్నాయి. పెద్ద పెద్ద కంపెనీలతో పోటీ పడుతూ బ్రాండెండ్ ధరలకే మందులు సరఫరా చేస్తున్నాయి. ఎర్ర గోలీలు, తెల్ల గోలీలు, పచ్చ గోలీల రూపంలో అమాయకుల జీవితాలతో చెలగాటమాడుతున్నాయి. ఇంత దారుణం చోటుచేసుకున్నా నియంత్రణ శూన్యమే. ఇలాంటి కంపెనీలపై చర్యలు తీసుకున్న దాఖలాలు ఎక్కడా కనిపించడం లేదు. అనధికారికంగా ఇలాంటి మందులను విచ్చిలవిడిగా విక్రయిస్తున్నా పట్టించుకునే వారే లేరు.
మనమేం చేయాలి?
- జనరిక్ మందుల పట్ల ప్రతి ఒక్కరికీ అవగాహన అవసరం.
- బ్రాండెడ్లా జనరిక్ మందులు పనిచేయవనే దుష్ప్రచారాన్ని తిప్పికొట్టాలి.
- నాణ్యతా ప్రమాణాల్లో బ్రాండెడ్కు జనరిక్ మందులు ఏమాత్రం తీసిపోవనేది తెలుసుకోవాలి.
- జనరిక్ మందులు ఆరోగ్యపరంగానే కాకుండా ఆర్థికంగా కూడా ప్రయోజనకరమనే విషయంపై విస్తృత ప్రచారం జరగాలి.
- జనరిక్ మందులతోనే ప్రిస్క్రిప్షన్ ఉండాలని వైద్యులను కోరాలి.
- అమరనాథ్ జగర్లపూడి,
సీనియర్ మార్కెటింగ్ మేనేజర్ (ఫార్మస్యూటికల్స్)-
9849545257
Authorization