నిత్యజీవితంలో మనం తీసుకునే ఆహారధాన్యాలు ఎన్నో దశల్లో పాలిష్ చేసి వస్తాయి. ఈ కారణంగా మన శరీరానికి కావల్సిన ఫైబర్ తక్కువగా అందుతుంది. మనం తీసుకునే ఆహారంలో సూక్ష్మ, స్థూల పోషకాలు ఉన్నా.. తగినంత ఫైబర్ లేకపోవడంతో అనేక సమస్యలు వస్తాయి. మరి ఫైబర్ ఎక్కువగా ఉండే ఆహారం ఎంటో తెలుసుకుని.. మన రోజువారీ ఆహారంలో చేర్చుకుంటే అనేక అనారోగ్య సమస్యలకు చెక్ పెట్టవచ్చు.
ఫైబర్తో కలిసి వుండే ఆహారం వల్ల ఆరోగ్యపరంగా అనేక లాభాలున్నాయి. ఇది ఆహారం పేగులలో సులభంగా జరిగే వీలును కలిగిస్తుంది, అలాగే, పెద్ద ప్రేగులలో జీర్ణమైన తరువాత మిగిలిపోయిన వ్యర్ధ పదార్థాలను త్వరగా బయటకు పంపుతుంది. హైపో కోలెస్టర్ లిమిక్ ఏజెంట్ గా పనిచేస్తూ పిత్తరస లవణాన్ని (బైల్ సాల్ట్) బంధించి కొలెస్ట్రాల్ తగ్గుదలను మెరుగుపరుస్తుంది. అందుచేత, గుండె సంబంధిత వ్యాధులలోఆహార నియమాలను, నిర్వహణను పాటిస్తూ వుండడంలో సహాయపడుతుంది. ఇతర తృణ ధాన్యాలకంటే బియ్యంలో పీచు పదార్ధాలు చాలా తక్కువ శాతంలో ఉంటాయి. జొన్నలలో ఈ పీచుపదార్ధం 89.2 శాతం, సజ్జలలో 122.3 శాతం మరియు రాగులలో 113.5 శాతం ఉంటుంది.
మనదేశంలో గతంలో ఫైబర్ అధికంగా ఉంటే ముతక ధాన్యం వినియోగం అధికంగా ఉండేది. 1951-55లో ఉన్న 44.6 కి.గ్రా. నుండి 1970-74 కాలం నాటికి 38.5 కి.గ్రా. కు తగ్గిపోయింది. ఇటీవలే విడుదలైన నేషనల్ న్యూట్రిషన్ మానిటరింగ్ బ్యూరో నివేదిక సగటు తృణ ధాన్యాల, చిరు ధాన్యాల వినియోగం తగ్గిపోతున్నదని స్పష్టం చేస్తున్నది. ఇప్పుడిప్పుడే తిరిగి చిరుధాన్యాలను ఆహారంలో చేర్చుకునే ప్రయత్నాలు జరుగుతున్నాయి. ముఖ్యంగా మనకు మార్కెటులో కనిపించే రాగులు, సజ్జలు, జొన్నలు వాటిలోని పోషక విలువల గురించి తెలుసుకుందాం.
రాగులు : అత్యంత పోషకాలు ఉన్న చిరుధాన్యంగా రాగులను గుర్తిస్తారు. వంద గ్రాముల రాగులల్లో 344 మిల్లీ గ్రాముల కాల్షియమ్ ఉంటుంది. ఇంత స్ధాయిలో కాల్షియమ్ మరే తృణ ధాన్యంలోనూ లేదు. ఐరన్ 3.9 మి.గ్రా వుంటుంది. ఇది కేవలం ఒక బాజ్రా (సజ్జల)లో తప్ప ఇతర తృణ ధాన్యాలన్నింటి కన్నా అధికం గానే ఉంటుంది. మధుమేహ వ్యాధిగ్రస్తులకు ఇది పూర్తి ఆరోగ్యకరమైన ఆహారంగా సిఫార్సు చేయబడుతోంది. ఎండాకాలంలో రాగి అంబలి ఎంతో ఆరోగ్యకరంగా గుర్తించబడింది. ప్రస్తుతం రాగులతో రాగిమాల్ట్, రాగి వెర్మిసిల్లి అప్పటికప్పుడు తయారుచేసుకునే ఆహారంగా మార్కెట్లో లభిస్తున్నాయి.
సజ్జలు : రాగుల తర్వాత సజ్జలు అత్యధిక పోషకాలు గల చిరు ధాన్యాలు. 100 గ్రాముల సజ్జల్లో 11.6 గ్రా. ప్రోటీన్ (మాంసక త్తులు), 67.5 గ్రా. పిండి పదార్ధాలు, ఐరన్ 8 మి.గ్రా. వుంటాయి. కంటికి అత్యంత భద్రత, రక్షణ కలిగించే 132 మై.గ్రా కెరోటిన్ అనే పదార్ధం ఉంటుంది. వీటిని నానపెట్టి తీసుకోవడం ద్వారా శరీరానికి అవసరమైన అన్ని రకాల పోషకాలు లభిస్తాయి. వీటిలో పాటు ఫైబర్ అధికంగా ఉంటుంది.
జొన్న : ఇందులో 10.4 గ్రా. ప్రొటీన్, 66.2 గ్రా. పిండి పదార్ధం, 2.7 గ్రా. పీచు పదార్ధం మరియు ఇతర సూక్ష్మ మరియు స్థూల పోషక పదార్ధాలను కూడా కలిగి వుంటుంది. కొన్ని దేశాల్లో పసిపిల్లలకు పాలకు బదులుగా ఇచ్చే ఆహారాన్ని తయారుచేయడంలో జొన్నలు - అలసందలు, జొన్న - సోయాబీన్స్ ఎక్కువగా ఉపయోగిస్తారు. ఎంతో బలవర్ధకమైన ఆహారంగా దీన్ని నైజిరియన్స్ భావిస్తారు. మన తాతముతాత్తలు కూడా చిరుధాన్యాలనే ఎక్కువగా తీసుకునేవారు. రుచి కన్నా.. ఆరోగ్యానికి ప్రాధాన్యత ఇచ్చి తృణధాన్యాలను ఆహారంలో చేర్చితే ఫైబర్ ఎక్కువగా శరీరానికి అందుతుంది.
Authorization