- 19న ప్రపంచ సికిల్సెల్ డే
సాధారణంగా మనిషి రక్తంలోని ఎర్రరక్త కణాలు గుండ్రంగా పెప్పెర్మింట్ల ఆకారంలో ఉంటాయి. ఈ కణాలు రక్తనాళాల ద్వారా శరీరమంతా ప్రయాణిస్తూ వివిధ అవయవాలకు ఆక్సిజన్ను అందిస్తాయి. మరి గుండ్రని ఆకారంలో ఉండాల్సిన ఎర్ర రక్తకణాలు చిక్కిపోయి కొడవలి ఆకారంలోకి మారితే..! రక్తనాళాల్లో పయనించడం కష్టమవుతుంది. శరీరంలోని అన్ని కణాలకు ప్రాణవాయువు అందకపోవడంతో తీవ్రమైన అనారోగ్య సమస్యలు వస్తాయి. ఇందుకు కారణం.. జన్యుపరంగా వచ్చే సికిల్ సెల్ వ్యాధి. ప్రపంచ వ్యాప్తంగా ఎంతో మంది చిన్నారులను అనారోగ్యం పాలు చేస్తున్న ఈ వ్యాధిగురించిన అవగాహన ఎంతో అవసరం..
సికిల్ సెల్ వ్యాధి లేదా సికిల్ సెల్ అనీమియా గా పిలువబడే ఈ వ్యాధి వంశపారంపర్యంగా వస్తుంది. ఈ వ్యాధితో బాధపడేవారిలో రక్తకణాలు కొడవలి ఆకారంలో ఉంటాయి. సాధారణంగా మనిషి రక్తంలోని ఎర్రరక్త కణాలు గుడ్రంగా పెప్పెర్మింట్ల ఆకారంలో ఉంటాయి. ఈ కణాలు రక్తనాళాల ద్వారా శరీరమంతా ప్రయాణిస్తూ వివిధ అవయవాలకు ప్రాణవాయువును (ఆక్సిజన్) సరఫరా చేస్తుంటాయి. అయితే సికిల్ సెల్ వ్యాధిలో బాధపడేవారిలో జన్యుసంబంధ మార్పుల వల్ల ఎర్ర రక్త కణాలు కొడవలి (సికిల్) ఆకారంలోకి మార్పు చెందుతాయి. ఈ సికిల్ సెల్ ఉన్నవారి రక్తకణంలోని ఒక జన్యువు సికిల్ సెల్గానూ, ఒకటి మామాలు గానూ ఉన్నట్లయితే అటువంటి వారిని సికిల్ సెల్ క్యారియర్లు అంటారు. వీళ్లకి మామూలుగా ఎటువంటి ఆరోగ్య సమస్యలు ఉండవు. వారిలో సికిల్సెల్ వ్యాధి ఉన్నట్టుగా కూడా గుర్తించలేం. అయితే ఈ వ్యక్తులు పెండ్లి చేసుకున్న తర్వాత వారి జీవిత భాగస్వామికి కూడా జన్యుపరంగా సికిల్సెల్ ఉంటే వారిద్దరికీ పుట్టే పిల్లలకు రక్తకణంలోని రెండు జన్యువులూ వంపు తిరిగి ఉంటాయి. అటువంటి పిల్లలకు పుట్టుకతోనే ఆరోగ్య సమస్యలు మొదలవుతాయి.
సికిల్సెల్ వ్యాధి ఉన్నవారిలో..
సాధారణ రక్త కణాల జీవితకాలం 120 రోజులు. అయితే సికిల్ రక్త కణాల జీవిత కాలం 20 నుంచి 25 రోజులు మాత్రమే. సికిల్ రక్త కణాలు నశించి పోయేంత వేగంగా కొత్త ఎర్రరక్త కణాలు ఉత్పత్తి కాక పోవడంతో ఈ వ్యాధి ఉన్నవారు రక్తహీనతకు గురవుతారు. అంతేకాక సికిల్ రక్తకణాలు వంపుతిరిగి ఉండటం వల్ల సన్నటి రక్తనాళాల్లో సరిగ్గా ప్రవహించలేవు. ఈ కారణం గా శరీర భాగాలకు ఆక్సిజన్ అందటం తగ్గిపోతుంది. ఈ వ్యాధి ఉన్నవారు తగిన చికిత్స తీసుకోకపోతే అతి చిన్నవయసులోనే పది, పదిహేనేళ్ల లోపు చనిపోతారు. అంతేకాదు జన్యుపరమైన మార్పుల తో వచ్చే ఈ రక్తహీనత జబ్బుకు సరైన మందులు లేవు. వీరికి రక్తం ఎక్కించడం ఒక్కటే ఇప్పటివరకు అందుబాటులో ఉన్న చికిత్స విధానం.
మనదేశంలో..
మనదేశంలోని చాలా రాష్ట్రాలలో ఈ వ్యాధి ఉన్నట్టు నిర్ధారణ అయ్యింది. ముఖ్యంగా గిరిజన నివారణకు ప్రత్యేక నివారణ ప్రాజెక్టులను చేపట్టారు. ఎక్కువగా గిరిజన ప్రాంతాల్లో కనిపించే ఈ వ్యాధి ఉత్తరాంధ్ర మూడు జిల్లాల్లో ఉన్న దాదాపు 10 లక్షల గిరిజన జనాభాలో కనీసం పది శాతం మందికి ఈ జబ్బు లక్షణాలు కనిపించాయి. ఈ వ్యాధికి గురై మరణించే వారి సంఖ్య ప్రతి ఏటా పెరుగుతూనే ఉంది. విశ్వవిద్యాలయ స్థాయిలో ఆంధ్రా యూనివర్సిటీ ''హ్యూమన్ జెనెటిక్స్'' విభాగం వారు జరిపిన పలు శాంపిల్ సర్వేల లెక్కల ప్రకారం ఉత్తరాంధ్ర ఏజెన్సీ పరిసర గ్రామాల్లో నివసిస్తున్న గిరిజనేతర కులాల్లో కూడా ఈ వ్యాధి లక్షణాలు కనిపించాయి. ఛత్తీస్గఢ్లో సికిల్ సెల్ కోసం ప్రత్యేక పరిశోధనాల యం కూడా ఉంది. ఈ వ్యాధి నివారణకు దీనిపై పరిశోధనకు రారుపూర్లో ప్రత్యేకంగా సికిల్ సెల్ ఇన్స్టిట్యూట్ను నెలకొల్పి 12.43 లక్షల మందికి స్క్రీనింగ్ పరీక్షలు జరిపారు. కేరళలో ఈ వ్యాధి బారిన పడిన వారికి వైద్యఖర్చులు నిమిత్తం కొంత డబ్బు ఇస్తున్నారు. మనరాష్ట్రంలో ఉచితంగా బ్లడ్, వైద్యసేవలు అందిస్తున్నారు.
వ్యాధి లక్షణాలు...
సికిల్ సెల్ వ్యాధి జన్యుపరమైనది కావడంతో పుట్టుకతోనే వస్తుంది. శ్రద్ధగా గమనిస్తే చాలు ఈ వ్యాధి లక్షణాలను సులభంగా తెలుసుకోవచ్చు. అసాధారణమైన ఆకారంలో ఉన్న ఎర్ర రక్త కణాలు రక్తనాళాలలో చిక్కుకొవడంతో శరీర అవయవాలలో తీవ్రమైన నొప్పి వస్తుంది. తీవ్రమైన అంటువ్యాధులు, స్ట్రోక్, తలనొప్పి, కాలేయ సమస్యలు, గుండె సమస్యలు వస్తాయి.
- దీర్ఘకాలం కామెర్లు ఉండటం,
- రక్తహీనతతో శరీరం పాలిపోయి ఉండటం,
- కాళ్లు, చేతుల వేళ్లు వాపుతో వంపు తిరిగి ఉండటం,
- ప్లీహం వాచిపోయి ఉండటం ఈ సికిల్ సెల్ వ్యాధి ప్రధాన లక్షణాలు.
వ్యాధి నిర్ధారణ పరీక్ష
ఈ వ్యాధి నిర్ధారణకు జరిపే ప్రాథమిక రక్త పరీక్ష ఖరీదు చాలా తక్కువలోనే ఉంటుంది. రక్త నమూనాను సోడియం మెటా బై సల్ఫేట్లో కలిపి మైక్రోస్కోప్ కింద చూస్తే రక్తకణాలు గుండ్రంగా ఉన్నాయా? వంపు తిరిగి ఉన్నాయా? అని తెలుసుకోవడం ద్వారా వ్యాధి ఉందా, లేదా అని నిర్ధారించుకోవచ్చు. ఈ ప్రాథమిక పరీక్షను ప్రాథమిక ఆరోగ్య కేంద్ర (ూనజ) స్థాయిలోనే జరపవచ్చు.
నివారణ చర్యలు..
సికిల్ సెల్ వ్యాధి చికిత్సకు సరైన మందులు లేనందున, సికిల్ సెల్ క్యారియర్లను గుర్తించి వారి మధ్య పెండ్లిలను నిరోధించడం ద్వారా ఈ వ్యాధిని నియంత్రించవచ్చు. ఈ వ్యాధిని త్వరితంగా నివారిం చాలని, నివారించకపోతే భవిష్యత్లో దుష్పరిణామాలు తప్పవని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు.
యువత పెండ్లికి ముందు రక్త పరీక్ష చేయించుకోవడం ఎంతో ముఖ్యం. పుట్టబోయే పిల్లల ఆరోగ్యం కోసం పెండ్లికి ముందే జాగ్రత్తలు తీసు కోవడం ఎంతో అవసరం. రేపటి తరం ఆరోగ్యంగా ఉండాలంటే జన్యుపరమైన వ్యాధులను నివారించాలంటే పెండ్లికి ముందే వైద్యపరీక్షలు తప్పనిసరిగా చేయించుకోవాలి.
ఆఫ్రికాలో ప్రతిరోజూ వెయ్యి మంది చిన్నారులు..
ప్రపంచ సికిల్ సెల్ డే 2008 లో ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీలో నిర్ణయించారు. సికిల్ సెల్ వ్యాధి గురించి ప్రజల మధ్య అవగాహన పెంచుతూ..ఈ వ్యాధిని నివారించడానికి ప్రపంచవ్యాప్తంగా అనేక కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. 2009 లో జూన్ 19 న మొట్టమొదటిసారిగా సికిల్ సెడ్ డేను ప్రారంభించారు. వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ప్రపంచవ్యాప్త స్థాయిలో ప్రచార కార్యక్రమాలను నిర్వహిస్తుంది. ఇప్పటివరకు అందుబాటులో ఉన్న లెక్కల ప్రకారం ఆఫ్రికాలో ప్రతిరోజూ వెయ్యి మందికి పైగా పిల్లలు సికిల్ సెల్ డిసీజ్ కారణంగా..ఐదేండ్లలోపే చనిపోతున్నారు. సౌదీ అరేబియా, టర్కీ, అరబిక్ ద్వీపకల్పం, బ్రెజిల్, సురినామ్, గయానా, దక్షిణ ఇటలీ, గ్రీస్ మొదలైన ఇతర దేశాల్లోనూ ఈ వ్యాధి తీవ్రంగానే ఉంది. ఆసియా దేశాలలో ఇది సాధారణ ప్రజా ఆరోగ్య సమస్యగా మారింది.
Authorization