వృద్ధుల్లో ఎముక పటుత్వం తగ్గటం, క్షీణించటం సహజమే. దీనినే 'ఆస్టియోపోరోసిస్' అంటారు. అయితే.. ఈ సమస్య వృద్ధులందరికీ వస్తుందని భావించొద్దు. కొన్ని జాగ్రత్తలు పాటిస్తే దీని బారిన పడకుండా కాపాడుకోవచ్చు. మానవుల్లో 30 ఏండ్ల వయసు వరకు ఎముక సాంద్రత పెరుగుతూ ఉంటుంది. ఆ తర్వాత క్రమంగా క్షీణించటం మొదల వుతుంది. వీలైనంత వరకు ఎముక సాంద్రతను పెంచుకుంటే వృద్ధాప్యంలో ఆస్టియోపోరోసిస్ బారినపడకుండా చూసుకోవచ్చు. కానీ ఇప్పటికే మధ్యవయసు కూడా దాటేసింది కదా.. ఇప్పుడెలా అనుకుంటున్నారా? అయినా మించి పోయిందేమీ లేదు. రోజూ నడక వంటి వ్యాయామాలు చేయటంతోపాటు తగినంత కాల్షియం, విటమిన్-డీ తీసుకుంటే ఎముక పుష్టిని కాపాడుకోవచ్చు. ఎముక సాంద్రత క్షీణించకుండా క్యాల్షి యం కీలక పాత్ర పోషిస్తుంది. సాధా రణంగా పెద్దవారికి 50 ఏండ్ల వయసు వరకు రోజుకు వెయ్యి మిల్లీగ్రాములు.. 51 ఏండ్ల తర్వాత రోజుకు 1,200 మిల్లీ గ్రాముల కాల్షియం అవసరం. 50 ఏండ్ల తర్వాత ఎముక క్షీణించే వేగం పెరుగు తుంది. అలాగే వయసు మీద పడుతున్న కొద్దీ మనం తిన్న ఆహారం నుంచి పేగులు క్యాల్షియాన్ని గ్రహించుకోవటమూ తగ్గు తుంటుంది. కిడ్నీలు కూడా మునుపటిలా క్యాల్షియాన్ని అంతగా పట్టి ఉంచలేవు. ఫలితంగా శరీరం తన జీవక్రియలకు అవసరమైన కాల్షియాన్ని ఎముకల నుంచి తీసుకోవటం ఆరంభిస్తుంది. అయితే .. ఈ వయసులో కాల్షియం లేదా పాల ఉత్పత్తులు మితిమీరి తీసుకోవటం కూడా ఆరోగ్యానికి అంత మంచిది కాదని కొన్ని అధ్యయనాలు సూచిస్తున్నాయి. ముఖ్యంగా కాల్షియం అధికంగా తీసుకుంటే పురుషులకు ప్రోస్టేట్ క్యాన్సర్ ముప్పు పెరుగుతున్నట్టు చెబుతున్నాయి. మరి దీనికి పరిష్కారమేమిటి? కాల్షియంతో పాటు ఎముక పుష్టిని కాపాడే ఇతర పోషకాలు కూడా లభించేలా చూసుకోవటమే. ముఖ్యంగా విటమిన్-డీ ఎముకల నిర్మాణ ప్రక్రియలో ఎంతగానో తోడ్పడుతుంది. ఇది మన శరీరం కాల్షియాన్ని గ్రహించుకునేలానూ చేస్తుంది. విటమిన్-డీ పొందటానికి మనం పెద్దగా కష్టపడక్కర్లేదు కూడా. రోజూ కాసేపు ఎండలో గడిపితే చాలు. ఎండ తగిలినపుడు మన చర్మమే దీన్ని తనకుతానుగా తయారు చేసుకుంటుంది. ప్రస్తుతం విటమిన్-డీ కలిపి తయారు చేసిన అల్పాహారాలు కూడా అందుబాటులో ఉన్నాయి. మరీ అవసరమైతే డాక్టర్ల సలహా మేరకు విటమిన్-డీ మాత్రలూ తీసుకోవచ్చు.