చిప్స్ వంటి చిరుతిండ్లు ఎక్కువగా తినేవారిలో కండరాలు పట్టేయడం, చర్మం పొడిబారటం వంటి సమస్యలు ఎక్కువగా వస్తుంటాయి. ఇందుకు కారణం పొటాషియం లోపించడం. ఈ ఖనిజం లోపిస్తే కండరాలు పట్టేయటం, గుండె కొట్టుకునే వేగం మారిపోవటం, చర్మం పొడిబారటం, మొటిమలు, అజీర్ణం వంటి సమస్యలెన్నో ముంచుకొస్తాయి. ఖనిజ లవణాల్లో ఒకటైన పొటాషియం మనకు ఎంతగానో తోడ్పడుతుంది. నాడులను, కండరాలను నియంత్రించటం దగ్గర్నుంచి.. ఆహారం జీర్ణం కావటం వరకూ ఎన్నో పనుల్లో పాలు పంచుకుంటుంది. పొట్టుతీయని ధాన్యాలు, మాంసం, చిక్కుళ్లు, పండ్లు, కూరగాయల్లో పొటాషియం ఎక్కువగా ఉంటుంది. ముఖ్యంగా అరటిపండు, చిలగడదుంపలతో పుష్కలంగా లభిస్తుంది. పండ్లు, కూరగాయలు తగినంతగా తీసుకోకుండా చిప్స్ వంటి చిరుతిండ్లు, ఫాస్ట్ఫుడ్ తీసుకునేవారిలో పొటాషియం లోపం ఎక్కువగా కనిపిస్తుంది. శరీరానికి కావల్సిన ఈ ఖనిజాన్ని పొందాలంటే రోజూ తప్పనిసరిగా అరటిపండు తినాలి. పొట్టుతీయని ధాన్యాలు, చిక్కుళ్లు, పండ్లు, కూరగాయలు తప్పక తీసుకోవాలి.