మనం తీసుకునే ఆహారంలో విటమిన్ బి లోపిస్తే ఎన్నో రకాల వ్యాధులు వస్తాయి. నీటిలో కరిగే ఈ విటమిన్ శరీరానికి ఎంతో అవసరం. ధాన్యం, పండ్లు, కూరగాయల్లో ఎక్కువగా ఉండే విటమిన్బి లోపించకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. విటమిన్ బి1, (థయామిన్) ఈ విటమిన్ ధాన్యం పై పొరల్లో ఉంటుంది. ముఖ్యంగా బియ్యం, జొన్నలు, గోధుమ మొదలైన ధాన్యం పై పొరల్లో పుష్కలంగా లభిస్తుంది. పాలిష్ చెయ్యని (దంపుడు) బియ్యంలో, పాలిష్ చెయ్యని గోధుమల ద్వారా వచ్చిన పిండిలో కూడా థయామిన్ లభిస్తుంది. ధాన్యాల్లోనే కాకుండా పాలు, పప్పు ధాన్యాలు, కాలేయం, ఈస్ట్లలో కూడా లభ్యమౌతుంది. శరీరంలో పిండి పదార్థాల జీవక్రియలో థయామిన్ ఉపయోగ పడుతుంది. ఈ విటమిన్ లోపం వల్ల 'బెరి బెరి' వ్యాధి వస్తుంది. విటమిన్ బి 2,(రైబో ఫ్లావిన్) దీనిని విటమిన్ -జి అని, ఎల్లో ఎంజైమ్ అని కూడా అంటారు. పాలు, గ్రుడ్లు, కాలేయంలలో ఈ విటమిన్ పుష్కలంగా లభిస్తుంది. ఈ విటమిన్ లోపం వల్ల నాలుక, నోటి మూలలు పగులుతాయి. దీనినే 'గ్లాసిటిస్' అంటారు. వృద్ధుల్లో ఈ విటమిన్ లోపం వల్ల కళ్ళలో నీళ్ళు కారుతుంటుంది. విటమిన్ బి 3,(నియాసిన్/నికోటిక్ ఆమ్లము) దీనిని పెల్లెగ్రా ప్రివెంటివ్ విటమిన్ అని కూడా పిలుస్తారు. ఇది ఆకు కూరలు, జంతువుల కాలేయం, మూత్ర పిండాలు, కోడి గ్రుడ్లు, పాలు, చేపలు, వేరుశనగ పప్పులో లభిస్తుంది. ఈ విటమిన్ లోపం ఏర్పడినప్పుడు 'పెల్లగ్రా' వ్యాధి వస్తుంది. ఈ వ్యాధిగ్రస్తుల్లో మెడ, చేతులపై చర్మం ఎండి పోయి పొలుసులుగా మారుతుంది. విటమిన్ బి 6,(పైరిడాక్సిన్) ఈ విటమిన్ అన్ని రకాల ఆహార పదార్థాలలో లభిస్తుంది. ఇది మన శరీరంలో విడుదలయ్యే అమైనొ ఆమ్లాల జీవక్రియల్లో ప్రధాన పాత్ర పోషిస్తుంది. అన్ని రకాలైన ఆహార పధార్థాల నుండి లభిస్తుంది. కాలేయం, గ్రుడ్లు, వేరుశనగ, బటాణీ, మొదలైన వాటిలో పుష్కలంగా లభిస్తుంది. విటమిన్ బి12 మన నాడీ వ్యవస్థ ఆరోగ్యంగా ఉండటానికి, ఎర్ర రక్తకణాల తయారీకి ఈ విటమిన్ తప్పనిసరి. దీని లోపం కొద్ది మోతాదులోనే ఉంటే కండరాల బలహీనత, నిస్సత్తువ, వణుకు, మతిమరుపు వంటి సమస్యలు వస్తాయి. లోపం ఎక్కువైతే రక్తహీనతకు దారితీస్తుంది.